Wednesday, August 26, 2020

ఆంజనేయునికి ఎంత ప్రీతి పాత్రమో ఈ “సింధూరం”

ఆంజనేయునికి ఎంత ప్రీతి పాత్రమో ఈ “సింధూరం”.....!!

పూర్వం శ్రీరామ పట్టాభిషేకానంతరం ఒకనాడు సీతమ్మ తలంటే స్నానం చేసి నుదుటన తిలకం దిద్ది, పాపిటన ‘సింధూరం’ పెట్టుకొని, శ్రీరామునితో కలిసి విశ్రాంతి మందిరానికి పోవుచున్న సమయాన అప్పటి వరకు శ్రీరాముని సేవకై నిరీక్షించిన ఆంజనేయుడు వారి వెనుకనే వెళ్ళసాగాడు.ఇది గమనించిన సీతారాములు వెనుకకు తిరిగి చూడగా, సీతాదేవి హనుమంతునితో” మేము విశ్రాంతి మందిరానికి పోతున్నాము, నీవు రాకూడదు, పొమ్ము హనుమా …. తరువాత రావచ్చును” అనెను. రాములవారు కూడా “సీతమ్మవారు చెప్పినట్లు చేయుము హనుమా … ఇప్పుడు రావద్దు …” అనెను. అంతట ఆంజనేయుడు “రామా! మిమ్ములను సేవించనిదే నాకు కునుకు పట్టదు కదా… మీరును సీతమ్మ చెప్పినట్లే పలికెదరేమి? మీరు స్త్రీ దాసులైపోతిరేమి రామా ” అనగా, రాములవారు హనుమంతునితో “నేను వివాహ సమయమున ఆమె పాపిట చిటికెడు సింధూరము పెట్టితిని. అందుకు కారణంగా ఆమెకు దాసుడనైతిని” అని తెలిపాడు.హనుమంతుడు ఆశ్చర్యముతో “అమ్మా! మీ నుదుట తిలకముంది కదా! పాపిటన సింధూరం దేనికి” అని అడిగాడు. అప్పుడు సీతాదేవి ‘నాయనా హనుమా! స్వామి వారికి ఇంకా సౌభాగ్యం కలగాలని పాపిటన సింధూరం ధరించానని ” చెబుతుంది.వెంటనే హనుమంతుడు అయోధ్యా నగరంలోని అంగడి నందు సింధూరంను తీసుకొని దాని నంతటిని నువ్వుల నూనెతో పలుచగా చేసుకొని తన తలాతోకా అనుకోకుండా పాదాది శిర: పర్యంతము ఎక్కడను సందు లేకుండా పూసుకుని వెంటనే సీతారాముల దర్బారుకు పట్టరాని ఆనందంతో వెళ్ళాడు.హనుమంతుని రూపం చూసి అక్కడి వారంతా పక పక విరగబడి నవ్వుచుండగా, శ్రీరామచంద్రుడు చిరునవ్వుతో హనుమను చేరదీసి ” హనుమా ! ఇదేమిటి” అని అడగగా, హనుమంతుడు “మీరు చిటికెడు సింధూరమును సీతమ్మవారికి అలంకరించుట చేతనే ఆమెకు వశపడితిరి కదా, చిటికేడుకే మీకు సౌభాగ్యం కలిగితే, మరి నేను శరీరము మొత్తము సింధూరం అలంకరించుకున్నాను . మరి మీరు నాకు వశపడేదరా లేదా ప్రభూ ! మీకు ఇంకెంత సౌభాగ్యం కలుగుతుందో కదా” అని ఆనందంతో, సంతోషంతో కేరింతలు కొట్టసాగాడు.హనుమ పలుకులు విన్న శ్రీరాముడు, తన సభలోని వారందరూ వినేలా “ఆంజనేయా ! నీవంటి భక్తుడు ఈ పద్నాలుగు భువనాల్లోనే కాక మరెక్కడా ఉండడు. నీవు ధరించిన ఈ సింధురాన్నితిలకంగా ధరించిన వారికి, మన అనుగ్రహంతో పాటు అపారమైన సిరిసంపదలు, సుఖ సంతోషాలు కలుగుతాయి. అంతేకాక నీవు సీతాన్వేషణ సమయంలో సీత జాడ తెలుసుకొని ఆమెకు గుర్తుగా శిరోమణిని నాకు తెచ్చి ఇచ్చిన మంగళవారం నాడు, నీ జన్మదినమైన శనివారం నాడు ఎవరైతే భక్తీ శ్రద్ధలతో నుదుట ఈ సింధూరం ధరిస్తారో, వారికి ఆయురారోగ్యములు, సుఖ సంపత్తులు సంపూర్ణంగా లభిస్తాయి” అని వరదానం చేసాడు.ఆంజనేయునికి ఎంత ప్రీతి పాత్రమో ఈ “సింధూరం” చూశారా.! అందుకే హనుమకి సింధూరం పూయించి తరించండి.

No comments:

Post a Comment

RECENT POST

మార్వాడ దేశం లో ఒకప్పుడు ఉన్న కర్మాబాయి అనే మహిళ పూరీ జగన్నాథ స్వామి కి మహాభక్తురాలు.

చాలా బాగుంది - పూర్తిగా చదవండి మార్వాడ దేశం లో ఒకప్పుడు ఉన్న కర్మాబాయి అనే మహిళ పూరీ జగన్నాథ స్వామి కి మహాభక్తురాలు.  ఆమె తన ఐహికమైన బరువుబా...

POPULAR POSTS