Thursday, May 5, 2022

ఆదిశంకరాచార్య జయంతి* *జగద్గురు ఆదిశంకరాచార్యులు*

*ఆదిశంకరాచార్య జయంతి*         

*జగద్గురు ఆదిశంకరాచార్యులు*

👉హిందూ  మత  పరిరక్షణ  కొరకు  అవతరించిన  సరళ సిద్ధాంతవేత్త ఆదిశంకరాచార్యులు. ఆదిశంకరులు , శంకర భగవత్పాదులు అని కూడా పిలువబడి హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథములు. గురువు , మహాకవి. శంకరులు ప్రతిపాదించి సిద్ధాంతాన్ని అద్వైతం. శంకరులు సాక్షాత్తు శివుని అవతారమని నమ్మకం.

👉 *శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్ !*
*నమామి భగవత్పాదం శంకరం లోకశంకరమ్ !!*

 *ఆది శంకర జయంతి*

👉ఈ భారత ఖండంలో అనేకానేక కొత్త కొత్త సిద్ధాంతాలు , మతాలూ పుట్టుకొచ్చి , ప్రజలకి సనాతన ధర్మం పట్ల , భగవంతుని పట్ల విశ్వాసం సన్నగిల్లుతున్న సమయంలో మన సనాతన ధర్మ పరిరక్షణకై అవతరించిన అపర శంకరావతారమే ఆది శంకరాచార్య. శ్రౌత , స్మార్త  క్రియలను సుప్రతిష్టితం చేసి , వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి నీలలోహితుడు (శివుడు) స్వయంగా శంకరుల రూపంలో అవతరించారని  భక్తుల  ప్రగాఢ విశ్వాసం

👉 *దుష్టాచార వినాశాయ ప్రాతుర్భూతో మహీతలే !*
*స ఏవ శంకరాచార్యః సాక్షాత్ కైవల్య నాయకః !!*

👉దుష్టాచారములను నశింపచేయటానికి కైవల్య నాయకుడైన శంకరుడే ఆది శంకరుని రూపంలో అవతరించాడు. (శివరహస్యము నుండి)

 *కరిష్యత్స్యవతారం స్వం శంకరో నీలలోహితః !*
*శ్రౌత స్మార్త ప్రతిష్ఠార్థం భక్తానాం హిత కామ్యాయా !!*

👉శ్రౌత , స్మార్త క్రియలను సుప్రతిష్ఠితం చేసి , వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి నీలలోహితుడు (శివుడు) స్వయంగా శంకరుల రూపంలో అవతరించారు. (కూర్మపురాణం నుండి)

👉జగద్గురు ఆది శంకరాచార్య క్రీ.పూ.509 (విభవ నామ సంవత్సరం) శంకరులు వైశాఖ శుద్ధ పంచమి తిథి రోజున కర్కాటక లగ్నమందు శివుడి జన్మనక్షత్రమైన ఆరుద్రలో సూర్యుడు , శని , గురుడు , కుజుడు ఉచ్చస్థితిలో ఉండగా కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన నంబూద్రి బ్రాహ్మణ దంపతులైన ఆర్యమాంబ , శివగురులకు కేరళ లోని పూర్ణా నది ఒడ్డున ఉన్న కాలడిలో శంకరులు జన్మించారు. కాలడి ఇప్పటి త్రిచూర్ కు కొద్ది మైళ్ళ దూరంలో ఉంది. ఆర్యమాంబ , శివగురులు త్రిచూర్ లోని వృషాచల పర్వతం పైన ఉన్న శివుడిని ప్రార్థించి , ఆయన అనుగ్రహంతో పుత్రుడ్ని పొందినారు. పార్వతీ దేవి , సుబ్రహ్మణ్య స్వామికి ఏవిధంగా జన్మనిచ్చిందో , ఆర్యమాంబ శంకరులకి అదే విధంగా జన్మనిచ్చింది అని శంకర విజయం చెబుతోంది. ఆయన జనన కాలం గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నప్పటికీ , కంచి మున్నగు పీఠాలు అంగీకరించినవి మరియు మన హిందూ గ్రంథాల ప్రకారం , ఆయన జీవన కాలం క్రీ.పూ.509 – క్రీ.పూ. 477 అని తెలియవస్తోంది.

👉ఆయన తన రెండవ ఏటనే రాయడం , చదవడం  గ్రంథాలు చదివేవారు. ఆయన తండ్రి శంకరుల మూడవ ఏటనే చనిపోయారు. ఆయనకు ఐదవ ఏటనే కామ్యోపనయనం చేసారు. ఏడవ సంవత్సరం వచ్చేసరికి వేదాలను అధ్యయనం చేసేసారు. కారణజన్ములైన శంకరాచార్యులవారు , సన్యాసాశ్రమాన్ని స్వీకరించి గోవింద భగవత్పాదా చార్యులవారి చెంత శాస్త్రాధ్యాయనం చేశారు.

👉 ఒకసారి శంకరులు అమ్మవారికి పాలను నైవేద్యంగా పెట్టి వాటిని స్వీకరించడానికి అమ్మవారు రాలేదని తీవ్రంగా విలపిస్తుండగా ఆ తల్లి ఆయన ముందు ప్రత్యక్షమై ఆయనను తన ఒడిలోనికి తీసుకుని ఆ పాలను త్రావించి తన కరుణాకటాక్షాలను ఆ చిన్ని శంకరుల మీద ప్రసరింపచేసింది. 

👉  ఇంకొకసారి ఆయన వేదాభ్యసన సమయంలో భిక్షకై ఒక పేద వృద్ధురాలి ఇంటికి వెళ్లి యాచించగా , ఆమె తన ఇంటిలో ఉన్న ఒకే ఒక ఉసిరి కాయను ఆయనకు ఇచ్చివేసింది. ఆమె పరిస్థితికి జాలిపడిన శంకరులు సంపదలకు అధినేత అయిన లక్ష్మీదేవిని స్తుతిస్తూ. *“ కనకధారా స్తవం ”* ఆశువుగా పలికారు. దానికి ఆ తల్లి సంతోషించి బంగారు ఉసిరికాయల వర్షం కురిపించింది.

👉 శంకరుల తల్లి ఆర్యాంబ వృద్ధాప్యం కారణంగా పూర్ణానదికి రోజూ స్నానానికై వెళ్ళలేకపోవడం గమనించి
అప్పుడు శంకరులు పూర్ణానదిని ప్రార్థించి , నదిని ఇంటివద్దకు తెప్పించారు. ఆవిధంగా నదీ ప్రవాహం మార్గం మారేసరికి గ్రామ ప్రజలు శంకరులు జరిపిన కార్యానికి ఆశ్చర్యచకితులయ్యారు. తన తపశ్శక్తి తో ఆ నదినే తన ఇంటి సమీపంగా ప్రవహించగలిగేటట్లు చేసారు. 

👉   ఆయన సన్యాసాశ్రమ స్వీకరణ కూడా విచిత్రంగా జరిగింది. సన్యాసం తీసుకొనే సమయం ఆసన్నమవడంతో శంకరులు తల్లి అనుమతి కోరారు. శంకరులు సన్యాసం తీసుకొంటే తాను ఒంటరినౌతానన్న కారణంతో తల్లి అందుకు అంగీకరించలేదు. ఒకరోజు శంకరులు పూర్ణానదిలో స్నానం చేస్తూండగా ఒక మొసలి వచ్చి ఆయనను పట్టుకుంది.  ఆయన తల్లిని తనను సన్యసించడానికి అనుమతిస్తేనే మొసలి తనను వదిలివేస్తుందని , అనుమతినివ్వమనీ ప్రార్థించారు. తల్లి అనుమతించగానే ఆ మొసలి ఆయనను వదిలివేసింది. ఈ సంసారబంధాలు తనను మొసలిలాగా పట్టుకున్నయనీ , ఆ బంధాలనుండి తనను తప్పించమనీ ఆయన తల్లిని వేడుకున్నారు. దీనిని ఆతురన్యాసం అని అంటారు. సన్యాసిగా మారే మంత్రాలు జపిస్తూండగానే ఆశ్చర్యకరంగా మొసలి శంకరులను మెసలి వదిలివేసింది.

👉  గురువు కోసం అన్వేషిస్తూ ఉత్తర భారత యాత్ర చేసే తలంపుతో తల్లి అనుమతి కోరుతూ , *"ప్రాత:కాలం , రాత్రి , సంధ్యాసమయాల్లో ఏసమయంలోనైనా , స్పృహలో ఉన్నపుడూ , స్పృహ లేనపుడూ నన్ను తలచుకోగానే , నీవద్దకు వస్తాను"* అని శంకరులు తల్లికి మాట ఇచ్చారు. తల్లి అంతిమ సమయంలో వచ్చి , అంతిమ సంస్కారాలు చేస్తాననీ చెప్పారు.

👉  ఆయన గురువు గురించి అన్వేషిస్తూ నర్మదా నదీ తీరంలో ఉన్న శ్రీ శ్రీ గోవింద భగవత్పాదులు ని దర్శించి ఆయనే తన గురువు అని తెలిసికొని తనను శిష్యుడిగా స్వీకరించమని ప్రార్థించారు. గోవింద భగవత్పాదులు ఆయనను అనేక పరీక్షలకు గురిచేసి , శంకరుల అద్వైత సిద్ధాంతంతో సంతృప్తి చెంది ఆయనను శిష్యునిగా చేర్చుకున్నారు. ఆ తరువాత కొంతకాలానికి గురువుగారి అనుమతితో విశ్వనాథుని దర్శనానికి మరియు వ్యాసమహర్షి దర్శనానికి కాశీ(వారణాసి) బయలుదేరారు.

👉   ఆయనలో అంతర్గతంగా ఉన్న అహాన్ని తొలగించుటకై పరమశివుడు చండాలుని వేషంలో వెంట నాలుగు కుక్కలతో వచ్చి ఆయన దారికి అడ్డుగా నిలబడతాడు. అప్పుడు శంకరులు చండాలుని ప్రక్కకి తొలగమని చెప్తారు. అప్పుడు శివుడు ఎవరిని తొలగమంటున్నావు , ఈ శరీరాన్నా లేక ఈ శరీరంలో ఉండే ఆత్మనా అని ప్రశ్నిస్తాడు. దానితో శంకరులకి ఆ వచ్చినవాడు పరమశివుడే తప్ప వేరుకాదని గ్రహించి ఆయనను స్తుతిస్తూ మనీషా పంచకం చదివారు.

👉  ఆయన బ్రహ్మసూత్రాలకి భాష్యాలే కాక అనేక దేవీదేవతల స్తుతులూ , అనేక , ఆధ్యాత్మ సిద్ధాంత గ్రంథాలూ రచించారు. వాటిలో బాగా ప్రాముఖ్యమైనవి సౌందర్యలహరి , శివానందలహరి , భజగోవిందం మొదలైనవి.

👉  ఆయన సన్యాసాశ్రమ నియమాలని పక్కన పెట్టి మరీ తల్లికి ఆమె కోరిక మేరకు ఆమెకు అంత్యేష్టి కార్యక్రమాలను నిర్వర్తించారు. ఆ విధంగా తల్లి అత్యంత పూజనీయురాలనీ , ఆమెకు సేవ చేయడం బిడ్డల కర్తవ్యమనీ దానికి ఎలాంటి నియమాలు అడ్డురావనీ లోకానికి చాటిచెప్పారు. తల్లికిచ్చిన మాట  కోసం తల్లి అవసాన దశలో *" శ్రీకృష్ణభగవానుని "* లీలలను చూపించి సంతోష పరచాడు !!
ఆనాటి కట్టుబాటులను ఎదిరించి తాను సన్యాసి అయినా కన్నతల్లి అంత్యేష్ఠిని స్వయంగా నిర్వహించాడు !!

👉 ఆయన కాలినడకన దేశమంతా తిరిగి *అద్వైత సిద్ధాంతాన్ని* ప్రచారం చేస్తూ తన సిద్ధాంత వాదనలతో అనేక మంది పండితులని ఓడించారు. ఆ తరువాత వాళ్ళు ఆయనకి శిష్యులైనారు. వారిలో *కుమారిలభట్టు , మండవమిశ్రుడు* మొదలైన వారు కూడా ఉన్నారు. ఆయన ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతానికి ఆకర్షితులై ఆయన శిష్యులుగా మారిన వారిలో ముఖ్యులు *త్రోటకుడు , పద్మపాదుడు , సురేశ్వరుడు , పృధ్వీవరుడు* మొదలైన వారు.

👉 *వెయ్యి సంవత్సరాల పాటు బౌద్ధమతం ప్రచారంలోకి వచ్చాక , సనాతన ధర్మానికి ముప్పు ఏర్పడింది*. ఈ సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికి ఆదిశంకరులు జన్మించారు. *బౌద్ధ మతం ధర్మం గురించీ , సంఘం గురించీ చెప్పింది కాని దేవుడిని గుర్తించలేదు*. బౌద్ధమత ధర్మాల వ్యాప్తి ఉద్ధృతిలో వైదిక కర్మలు సంకటంలో పడ్డాయి. *ఆ సమయంలో శంకరాచార్యులు ఆధ్యాత్మిక ధర్మాన్ని తిరిగి బలీయమైన శక్తిగా మలచ గలిగినారు*.

👉  హిందూ ధర్మపరిరక్షణ బలహీనపడుతుండటాన్ని గమనించిన ఆయన , ఆ పరిస్థితిని చక్కదిద్దవలసిన అవసరాన్ని గుర్తించారు. అందుకోసం తన శిష్యగణంతో కలిసి అనేక ప్రాంతాలలో పర్యటిస్తూ , అక్కడి పండితులను శాస్త్ర సంబంధమైన చర్చలో ఓడిస్తూ అద్వైత సిద్ధాంతాన్ని విశిష్టమైన రీతిలో వ్యాప్తిలోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో శతాధిక గ్రంధాలను రచించిన శంకరులవారు , ఉపనిషత్తులు .. బ్రహ్మసూత్రాలు .. భగవద్గీత .. విష్ణు సహస్రనాలకు భాష్యాలు రాసి భక్తి సమాజాన్ని తనదైన రీతిలో ప్రభావితం చేశారు. 

👉  గణేశ పంచరత్న స్తోత్రం , భజ గోవిందం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం , కనకథారా స్తోత్రం , శివానందలహరి , సౌందర్యలహరి వంటి అనేక రచనలు హిందువులకు నిత్య ప్రార్థనా స్తోత్రాలుగా ఈనాటికీ ఉపయుక్తమవుతున్నాయి.ఈయన 108 గ్రంథాలు రచించారు.

👉  శృంగేరి .. బదరి .. పూరీ .. ద్వారక అనే అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో పీఠాలను స్థాపించారు. ఆదిశంకరులవారి శిష్యులే అద్భుతమైన రీతిలో మహిమలను ప్రదర్శించారంటే , ఇక శంకరులవారి శక్తులు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు. శంకరుల చిన్నతనంలో ఆయన అనన్యసామాన్యమైన భక్తిని చాటే అనేక సంఘటనలు జరిగాయి. 

👉  ధర్మ సంస్థాపన చేయడానికై ఆయన దేశం నలువైపులా నాలుగు పీఠాలను స్థాపించారు. తూర్పు వైపున ఒడిశా లోని పూరీ లో గోవర్ధన మఠం , దక్షిణం వైపున కర్ణాటక లోని శృంగేరి లో శారదా మఠం , పశ్చిమ దిక్కున గుజరాత్ లోని ద్వారకలో ద్వారకా మఠం , ఉత్తర దిక్కున ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ లో జ్యోతిర్మఠం స్థాపించారు. అవి ఈనాటికీ , ధర్మరక్షణకై పాటుపడుతున్నాయి.

*మఠము-పీఠము*

సన్యాసులు , బ్రహ్మచారులు నివసించేది మఠం. అక్కడ దేవతను ప్రతిష్ఠించిన తరువాత అది పీఠంగా మారుతుంది. శంకరులు దేశం నాలుగు మూలలా నాలుగు మఠాలను స్ఠాపించారనేది జగద్విదితం. వీటినే చతుర్మఠాలని , మఠామ్నాయాలని పిలుస్తారు. చతుర్మఠాల స్థాపన శంకరుల వ్యవస్థా నైపుణ్యానికి , కార్యనిర్వహణా దక్షతకూ తార్కాణం. హిందూధర్మాన్ని పునరుజ్జీవింపచేయడానికి , సుస్థిరంచేయడానికి , వ్యాప్తి చేయడానికి కేంద్రాలుగా పనిచేసే ఈ నాలుగు మఠాల నిర్వహణ క్రమం , అప్పటి (వందల సంవత్సరాల) నుంచి నేటివరకూ అవిచ్ఛిన్నంగా సాగుతూ వస్తున్నది.

*" అధ్వైతసిద్ధాంతాన్ని " ప్రచారం  చేశారు* 

దేశంలో  నాలుగు  వైపుల  నాలుగు ప్రధానమైన  పీఠాల్ని  నెలకొల్పి దేశ సమగ్రత ను  ఆధ్యాత్మికతను కాపాడారు !!

*1 .తూర్పున  పూరీ  క్షేత్రంలో  గోవర్ధన  పీఠం రుగ్వేదం !!*

*2- దక్షిణాన శృంగేరీ క్షేత్రంలో  శారదా  పీఠం - యజుర్వేదం!!*

*3 - పశ్చిమాన ద్వారకలో  ద్వారక పీఠం - సామ వేదం !!*

*4 - ఉత్తరాన బదరిర క్షేత్రంలో జ్యోతిష్ పీఠం-యజుర్వేదం!!*

నలుగురు శిష్యులను  నాలుగు పీఠాలకు అధిపతులను చేసారు.
*'’కంచికామకోటి '’* పీఠాన్ని స్థాపించి తానే స్వయంగా కొన్ని
రోజులు పీఠాన్ని అధిరోహించి  హిమాలయాలకు వెల్లి చిన్న వయసులోనే 32 సంవత్సరాలకే తనువు చాలించారు !!
                        *చతుర్మఠాలు*

  *ద్వారకా మఠము :-*
ఈ మఠము శంకరులచే , దేశానికి పశ్చిమంగా , మొదటగా స్థాపించబడింది. దీనిని కాళికామఠమనీ , సిద్ధేశ్వరమఠమనీ , పశ్చిమామ్నాయ మఠమనీ అంటారు. 

  *గోవర్ధన మఠము:-*
దీనినే పూర్వామ్నాయ మఠము అని అంటారు. ఇది దేశానికి తూర్పున గలపూరీ పట్టణంలో

  *శృంగేరీ మఠము :-*
ఇది దక్షిణామ్నాయమఠమని , శారదాపీఠమనీ పిలువబడుతుంది. కర్ణాటక రాష్ట్రములోని శృంగేర(శృంగ లేక ఋష్యశృంగ)లో ఈ మఠము స్థాపించబడింది

  *జ్యోతిర్మఠము :-*
దీనిని ఉత్తరామ్నాయమనీ , బదరికాశ్రమమనీ కూడా అంటారు. ఈ పీఠ క్షేత్రం బదరికాశ్రమం , పీఠ దేవత నారాయణుడు.

☘  *శంకర మఠము(కంచికామకోటి పీఠము) :-*
సాక్షాత్తూ శంకరాచార్యుడు అద్వైత మత పరిరక్షణ కోసం దేశం నాలుగు దిక్కులా ఏర్పరచిన నాలుగు మఠాలు పైవి. ఇవి కాకుండా , శంకరుడు విదేహ ముక్తి పొందిన కంచి మఠం అయిదవది.

🌳 *ఉన్నది ఒక్కటే  పరబ్రహ్మస్వరూపం అనే అధ్వైతం    నుప్రభోధించారు  !!*  

🌳  *ఇది జ్ఞానమార్గంలో ఉత్కృష్ఠ స్థాయిలో  వున్న వారికే ఈ  సత్యం  అవగతమౌతుంది కనుక సామాన్య జనం కోసం అనేక  దేవీ  దేవతల పై అష్టకాలు స్తోత్రాలను రచించాడు ! ముందు విగ్రహారాధన  చేయమన్నారు !!*

🌳  *ప్రస్థాన త్రయం అంటే  భగవద్గీత - బ్రహ్మసూత్రాలు -*
*ఉపనిషత్తలు ! వీటికి  భాష్యం (వేదాంత- వ్యాఖ్యానం)రాశారు !*

🌳  *శివుడు - అంబిక - గణపతి - విష్ణువు - సూర్యులను ఆరాధించి తరించాలని వేదోక్త " పంచాయతన "పూజ పద్ధతిని ప్రవేశ పెట్టి విగ్రహారాధనకు ఆలంభనగా నిలిచారు !!*

☘  ఒకరోజు శంకరులు గంగానది ఒడ్డున శిష్యులకు తాను చేసే ప్రవచనం ముగించి వెళుతుండగా వేదవ్యాసుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో అక్కడకు వచ్చాడు. శంకరులు వ్రాసిన  భాష్యాల మీద చర్చకు దిగాడు. ఎనిమిది రోజులపాటు చర్చ జరిగిన తరువాత వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో వచ్చింది సాక్షాత్తు వ్యాసుడే అని పద్మపాదుడు గ్రహించి ఆ విషయం శంకరులకు తెలిపగా , శంకరులు వ్యాసునికి సాష్టాంగ ప్రణామం చేసి , తన భాష్యాలపై ఆయన అభిప్రాయం కోరగా , వ్యాసుడు సంతోషించి బ్రహ్మ సూత్రాలు అసలు అర్థాన్ని గ్రహించింది శంకరులు మాత్రమే అని ప్రశంసించాడు. వేదవ్యాసుడు వెళ్ళిపోతుండడం చూసి శంకరులు *'నేను చెయ్యవలసిన పని అయిపొయింది. నాకు ఈ శరీరం నుండి విముక్తిని ప్రసాదించ'మని* వేడుకున్నాడు. అప్పుడు వ్యాసుడు *'లేదు , అప్పుడే నీవు జీవితాన్ని చాలించరాదు. ధర్మ వ్యతిరేకులు అనేకమందిని ఎదుర్కోవలసిన అవసరం ఉంది. లేకపోతే నీ కారణంగా రూపుదిద్దుకుని , ఇంకా శైశవ దశలోనే ఉన్న ఆధ్యాత్మిక స్వేచ్చానురక్తి అర్థాంతరంగా అంతరించే ప్రమాదం ఉంది. నీ భాష్యాలను చదవగా కలిగిన ఆనందంలో నీకు వరాన్ని ఇవ్వాలని అనిపిస్తోంది. బ్రహ్మ నీకు ఇచ్చిన ఎనిమిది సంవత్సరాల ఆయుర్థాయానికి అగస్త్యాది మునుల అనుగ్రహంతో మరో ఎనిమిది ఏళ్ళు తోడయింది. పరమశివుని కృప చేత నీకు మరొక 16 ఏళ్ళు ఆయుష్షు లభించుగాక అని దీవించి అంతర్థానం అయ్యాడు. ఆయన జన్మించినప్పుడు ఆయన ఆయుష్షు ఎనిమిది సంవత్సరాలు , తపస్సు వలన సాధించినది ఇంకొక ఎనిమిది సంవత్సరాలు , వ్యాసమహర్షి అనుగ్రహంవల్ల మరొక పదహారు సంవత్సరాలు జీవించి తన 32 వ ఏట ఉత్తరాఖండ్ కాశీలో దేహాన్ని త్యజించారు.
 
 *శంకరులు :-*

👉అలాంటి శంకరులవారిని ఆయన జయంతి సందర్భంగ స్మరించుకోవడంకన్నా పుణ్యమేముంటుంది ?

👉అత్యంత భక్తి శ్రద్ధలతో శంకరులవారిని ఈ రోజున ఆరాధించాలి.

👉 పేద బ్రాహ్మణులకు శక్తి కొద్ది దానధర్మాలు చేయాలి.

👉 వారి పిల్లల ఉన్నత విద్యకు ... ఉపనయనాలకు ఆర్ధికపరమైన సహాయ సహకారాలను అందించాలి.

👉ఆధ్యాత్మిక పరమైన పవిత్రతను కాపాడుతూ , దేవాలయాల అభివృద్ధికి పాటుపడాలి. 

*👉ఆదిశంకరులు అవతరణకుముందు దేశంలో ఏ పరిస్థితులుఉన్నాయో ఇప్పుడు అవే పరిస్థితులు ఉన్నాయి*.

▪️ అప్పుడు శంకరుడు అవతరించారు. *ఇప్పుడుహిందువులందరూతమలో నిద్రాణమై ఉన్న ఆదిశంకరులను జాగృతం చేయాలి*.

▪️ *ప్రతి హిందువు శంకరుడు అవ్వాలి*. ఆయన మనకు స్ఫూర్తి. ఆయన మనలోనే , మనతోనే ఉన్నారు. అందుకే మనము ఈ ధర్మంలో జన్మజన్మలుగా పుడుతూనే ఉన్నాం. *సనాతన ధర్మం మన తల్లి. తల్లి రుణం తీర్చుకో వలసిన సమయం ఆసన్నమైంది. సనాతన ధర్మాన్ని తెలుసుకొని , ఆచరించి , శక్తిని సంపాదించి , స్ఫూర్తిని పొంది ధర్మం మీద జరుగుతున్న దాడిని తిప్పికొట్టాలి*.

▪️ధర్మాన్ని కాపాడు. *ధర్మాన్ని విస్మరిస్తే జాతి అధోగతి పాలు కాక తప్పదు*. కలియుగంలో గురువైన శ్రీ ఆదిశంకరాచార్యులు
రక్ష సదా మనపై ఉంటుంది.

▪️ *ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని అనుసరించు. ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది. భారతదేశాన్ని ఒక ఆధ్యాత్మికవనంగా మార్చి , అడుగడుగునాభక్తిభావసుమాలనువికసింపజేసినఅపరశంకరులు.శ్రీఆదిశంకరులుఅలాంటిశంకరులవారినిఆయనజయంతిసందర్భంగాస్మరించుకోవడం కన్నా పుణ్యమే ముంటుంది ?అత్యంత భక్తిశ్రద్ధలతో శంకరులవారిని ఈరోజునఆరాధించాలి*.

▪️ఆధ్యాత్మిక పరమైన పవిత్రతను కాపాడుతూ , దేవాలయాల
అభివృద్ధికి పాటుపడాలి.
▪️ఈ విధంగా చేయడం వలన పాపాలు నశించి విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయి.

*" జయ  జయ  శంకర  హర  హర  శంకర "*

*" జయ జయ శంకర హర హర శంకర "*

Monday, May 2, 2022

అక్షయతృతీయ రోజున**బంగారం తప్పక కొనాలా?*నిజమైన అక్షయము???అక్షయతృతీయ అంటే ఏమిటి?వివరణ?

*అక్షయతృతీయ రోజున*
*బంగారం తప్పక కొనాలా?*
నిజమైన అక్షయము???
అక్షయతృతీయ 
అంటే ఏమిటి?వివరణ?
👇

👉ఈ రోజునే 
సింహాచల 
వరాహ నరసింహ 
స్వామి వారి  చందనోత్సవం.

👉అదే రోజున
పరశురామ  జయంతి .

మరిన్ని  అక్షయ తృతీయ ప్రాముఖ్యతలు.

అక్షయ తృతీయ ప్రాముఖ్యత

1. పరశురాముని 
     జన్మదినం

2. పవిత్ర గంగా నది
     భూమిని తాకిన
      పర్వదినం

3. త్రేతాయుగం 
    మొదలైన దినం

4. శ్రీకృష్ణుడు 
    తన బాల్యమిత్రుడైన
     కుచేలుని కలుసుకొన్న
     దినం

5. వ్యాస మహర్షి 
     “మహా భారతము”ను,
      వినాయకుని
      సహాయముతో,
      వ్రాయడం
      మొదలుపెట్టిన దినం

6. సూర్య భగవానుడు
     అజ్ఞాతవాసములో
     వున్న పాండవులకు
      *అక్షయ పాత్ర*
      ఇచ్చిన దినం

7. శివుని ప్రార్థించి
     కుబేరుడు
     శ్రీమహాలక్ష్మితో 
     సమస్త సంపదలకు
     సంరక్షకునిగా
     నియమింపబడిన దినం

8. ఆదిశంకరులు
     “కనకధారాస్తవం” ను
     చెప్పిన దినం

9. అన్నపూర్ణా దేవి 
     తన అవతారాన్ని
      స్వీకరించిన దినం

10. ద్రౌపదిని శ్రీకృష్ణుడు
       దుశ్శాసనుని
       బారినుండి 
       కాపాడిన దినం.

*అక్షయ తృతీయ రోజున బంగారం తప్పక కొనాలా?*

అక్షయ తృతీయ అంటేనే
నేటికాలంలో 
బంగారం, వెండి లేదా
ఇతర ఏదేని విలువైన
వస్తువులు కొనడం 
అనేది ప్రచారంలో ఉంది.
ఈ రోజున కొన్నది 
అక్షయం అవుతుందని
చెప్పిన వ్యాపార ప్రచారాన్ని
వాస్తవంగా నమ్మి వాటిని
కొనుగోలు చేయడం
ఆనవాయితీగా మారింది.

అసలు అటువంటివి
కొనాలని అనుకుని 
డబ్బు లేకున్నా 
అప్పు చేసో, 
తప్పు చేసో కొంటే, 
కొన్న బంగారం అక్షయం
అవడం అటుంచి 
చేసిన అప్పులు, తప్పులు
తత్సంబంధ పాపాలు
అక్షయం అవుతాయని
శాస్త్రాలు వివరిస్తున్నాయి.

*అసలు ఈ రోజున బంగారం  కొనాలి అని శాస్త్రంలో ఎక్కడా చెప్పబడిలేదు*

👉ఇది కేవలం 
వ్యాపార జిమ్మిక్ మాత్రమే.

అక్షయ తృతీయ నాడు,
మనం  చేపట్టిన  
ఏ  కార్య  ఫలమైనా, 
[ అది  పుణ్యం కావచ్చు;
లేదా  పాపం  కావచ్చు.]
అక్షయంగా,  నిరంతరం, 
జన్మలతో  సంబంధం
లేకుండా,  మన  వెంట  వస్తూనే ఉంటుంది. 

పుణ్య  కర్మలన్నీ
 విహితమైనవే.  

అందునా,  ఆ రోజు  
ఓ  కొత్త  కుండలో గానీ,
కూజాలో గానీ,  మంచి నీరు  పోసి,దాహార్తులకు  శ్రధ్ధతో  సమర్పిస్తే,  ఎన్ని  జన్మలలోనూ,  మన జీవుడికి    
దాహంతో  గొంతు  ఎండి పోయే  పరిస్థితి  రాదు.

అతిధులకు,
అభ్యాగతులకు, 
పెరుగన్నంతో  కూడిన 
భోజనం  సమర్పిస్తే,  
ఏ  రోజూ  ఆకలితో  
మనం అలమటించవలసిన
రోజు  రాదు. 

👉వస్త్రదానం వల్ల 
తదనుగుణ 
ఫలితం లభిస్తుంది.

👉అర్హులకు  స్వయంపాకం,
దక్షిణ, తాంబూలాదులు   
సమర్పించుకుంటే,  
మన  ఉత్తర జన్మలలో, 
వాటికి  లోటు  రాదు.

👉గొడుగులు, 
👉చెప్పులు, 
👉విసన కర్రల లాటివి  
దానం  చేసుకోవచ్చు.

ముఖ్యంగా  ఆ  రోజు  నిషిధ్ధ  కర్మల జోలికి  వెళ్ళక పోవడం  ఎంతో  శ్రేయస్కరం. 

ఓ  సారి  పరిశీలిస్తే,
*భాగవతం* 
ప్రధమ స్కంధం ప్రకారం,  
పరీక్షిన్మహా రాజు  
కలి పురుషుడికి  
ఐదు  నివాస స్థానాలను 
కేటాయించాడు.  
అవి: 👇

1)జూదం,  
2)మద్య పానం, 
3)స్త్రీలు, 
4)ప్రాణి వధ,  
5)బంగారం.  

వీటితో పాటు 
కలి కి  లభించినవి 

👉 ఇంకో  ఐదు*👈

1)అసత్యం,
2)గర్వం, 
3)కామం, 
4)హింస, 
5)వైరం.  

జాగ్రత్తగా  పరిశీలిస్తే,  
ఆ పైన  ఉన్న  ఐదిటికీ  
ఇవి  అనుషంగికాలు.

ఆ  పై  ఐదిటినీ  
ఇవి  నీడలా  
వెన్నంటే  ఉంటాయి.

అక్షయ తృతీయ  రోజు 
ఎవరైనా,  
ఈ  ఐదిటిలో  
దేని  జోలికి  వెళ్ళినా,  
కలి పురుషుడి 
దుష్ప్రభావం
అక్షయంగా 
వెంటాడుతూనే  ఉంటుంది.

కర్తరి ప్రారంభ విశేషాలు

*కర్తరి  ప్రారంభ విశేషాలు*

      కర్తరి ప్రవేశం:  
మే 4 నుంచి 28వ తేదీ వరకు కర్తరి కొనసాగుతుంది. దీన్నే *వాస్తు కర్తరి* అంటారు. 

మే 4వ తేదీ రాత్రి 9గం.18 లకు రవి భరణి నక్షత్రం 3వ పాదంలోకి ప్రవేశించడంతో 
*చిన్న కర్తరి* ప్రారంభ మవుతుంది.

మే 11 రాత్రి  06గం.35 ని.లకు కృత్తికా నక్షత్రం లోకి రవి ప్రవేశించడంతో *పెద్ద కర్తరి* ప్రారంభ మగుతుంది.
 28. 05 న రాత్రి 8గం.05 ని త్యాగ మవుతుంది. 

చేయకూడనివి:

ఈ సమయంలో శంకుస్థాపనులు, చెక్కపనులు, తాపీ పనులు చేయరాదు. 
రాశులు.. నక్షత్రములు

 మనకు 27 నక్షత్రాలు, 12 రాశులు ఉన్న సంగతి తెలుసు! ఒక్కో నక్షత్రానికి నాలుగు పాదాల చొప్పున మొత్తం 27 X 4=108 పాదాలు. 12 రాసులతో భాగిస్తే ఒక్కోరాశికి 9 పాదాలొస్తాయి.
 మొదటి రాశి మేషం, సాధారణంగా ఒక రోజు తేడాలో ఏప్రిల్ 14న సూర్యుడు ఈ రాశిలో ప్రవేశిస్తాడు. 
దీనినే "సూర్య సంక్రమణం" అంటాం. *ఇది తమిళులకు  నూతన సంవత్స రారంభం*

డొళ్ళు కర్తరి.. అగ్ని కర్తరి

సూర్యుడు భరణి నక్షత్రంలో 3,4 పాదాలలో ఉన్నపుడు "డొల్లు కర్తరి" అంటారు.

 కృత్తిక నక్షత్రం లో ఉండగా "అగ్ని కర్తరి" అని అంటారు. 
కృత్తిక నాలుగు పాదాలులో అగ్నిలేక పెద్ద కత్తిరి నడచేటప్పటికి రోహిణీ కార్తె ప్రారంభమవుతుంది.

నిర్వచనం

         *కర్తరి అంటే.... కర్త + అరి = కర్తరి అంటే పని చేసేవానికి శత్రువు అని అర్ధం.*
            ఈ కర్తరి సమయంలో వాతావరణ మార్పులు  ఎక్కువగా ఉంతాయి. ఇక అగ్ని కర్తరి వచ్చేసరికి ఎండలు ముదిరిడంతో అగ్నిప్రమాదాల  నీటి ఎద్ధడి ఉంటుంది. సుడిగాలుల తాకిడికి నిర్మాణాలు పడిపోవచ్చు. 
అందుకే ఏ పనులూ చేయవద్దన్నారు. 
చెట్లు నరకడం, వ్యవసాయ పనుల ప్రారంభం,నూతులు,బావులు,చెరువులు తవ్వడం మొదలైన పనులపై నిషేధం పెట్టారు. 

రోహిణి కార్తె

ఈ సంవత్సరం మే 11 నాటికి రోహిణీ కార్తె వచ్చేస్తుంది, భరించలేని వేడి ఉంటుంది. అందుకు ఈ పదిహేను రోజులూ కూడా పై చెప్పిన పనులు వద్దన్నారు.

 మరో సంగతి పెళ్ళిళ్ళు, గర్భాదానాలు,గృహ ప్రవేశాలకు సంబంధించి నిషేధాలు ఏమీ లేవు.

*జయ జయ శంకర!*
     *హర హర శంకర!*                          🙏🚩🚩🕉🕉

అక్షయ తృతీయ , బంగారానికీ అక్షయ తృతీయకీ సంబంధం ఏమిటి ?

అక్షయ తృతీయ , బంగారానికీ అక్షయ తృతీయకీ సంబంధం ఏమిటి ?



మన సంస్కృతిలో ప్రతి పండుగ వెనుకా ఓ కారణం కనిపిస్తుంది. కాకపోతే ఒక్కోసారి ఆ కారణాన్ని మర్చిపోయి , ఆచరణకే ప్రాధాన్యతని ఇస్తూ ఉంటాము. అందుకు ఉదాహరణే అక్షయ తృతీయ. అక్షయ తృతీయ రోజున బంగారం కొనితీరాల్సిందే అన్న స్థాయిలో ఇప్పుడు ఆలోచిస్తున్నారు. నిజంగా అక్షయ తృతీయ రోజు బంగారం కొనాల్సిందేనా ! అసలు బంగారానికీ అక్షయ తృతీయకీ సంబంధం ఏమిటి ?
 
అక్షయ తృతీయ రోజున బంగారం కొనితీరాలని ఏ శాస్త్రంలోనూ లేదు. కాకపోతే ఈ రోజున ఏ కార్యాన్ని తలపెట్టినా నిర్విఘ్నంగా సాగుతుందని , ఏ పుణ్య కర్మని ఆచరించినా కూడా దాని ఫలితాలు అక్షయంగా లభిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకనే అక్షయ తృతీయ రోజున తప్పకుండా దానధర్మాలు చేయాలని చెబుతారు. ముఖ్యంగా ఎండలు విపరీతంగా ఉండే ఈ కాలంలో ఉదకుంభదానం పేరుతో నీటితో నింపిన కుండను దానం ఇవ్వమని పెద్దలు సూచిస్తూ ఉంటారు.
 
అక్షయ తృతీయనాడు విష్ణుమూర్తిని పూజించాలని మత్స్య పురాణం పేర్కొంటోంది. విష్ణుమూర్తి పాదాలను అక్షతలతో అర్చించి , ఆ అక్షతలను దానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుందని చెబుతోంది. జపం , హోమం , వ్రతం , పుణ్యం , దానం... ఇలా అక్షయ తృతీయ నాడు చేసే ప్రతి పనీ అనంతమైన ఫలితాన్నిస్తుందని మాత్రమే మతగ్రంథాలు పేర్కొంటున్నాయి. అక్షయ తృతీయనాడు వివాహం చేసుకుంటే ఆ బంధం చిరకాలం  నిలుస్తుందనీ , జాతకరీత్యా వివాహబంధంలో ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయని నమ్ముతారు.
 
అక్షయ తృతీయ రోజున ఏ పని చేసినా అక్షయమైన ఫలితం దక్కుతుంది కాబట్టి , ఈ రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తే... మన సంపదలు కూడా అక్షయం అవుతాయన్న నమ్మకం మొదలైంది. అయితే కష్టపడో , అప్పుచేసో , తప్పు చేసో సంపదను కొనుగోలు చేస్తే మన కష్టాలు , అప్పులు , పాపాలు కూడా అక్షయంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు పెద్దలు.

పరశురామ జయంతి

_*🚩పరశురామ జయంతి🚩*_



పరశురాముడు విష్ణుమూర్తి దశావతారములలో ఆరవది. ఈ అవతారాన్ని ఆవేశావతారం అంటారు... అంటే భగవంతుడికి ఆవేశం ఉన్నంతవరకే పరశురాముడు తన అవతార లక్ష్యాన్ని నేరవేర్చగాలుగుతాడు. పరశురాముడు చిరంజీవుల్లో ఒకడిగా కుడా ప్రసిద్ధుడు. *పరశురాముడు వైశాఖ శుద్ధ తదియ నాడు అవతరించెనని స్కంద పురాణము మరియు బ్రహ్మాండ పురాణము* తెలుపుచున్నవి. 

పరశురామ జయంతి నాడు ఉపవసించి , పరశురాముని షోడశోపచారములతో పూజించి, *"జమదగ్నిసుత ! వీర ! క్షత్రియాంతక ప్రభో ! గృహాణార్ఘ్యం మయా దత్తం కృపయా పరమేశ్వర !"* అని అర్ఘ్యప్రదానము 
చేయవలెనని వ్రత గ్రంధాలు తెలుపుచున్నవి.
శ్రీమహావిష్ణువు దశావతారములలో పరశురామావతారము ఆరవది. త్రేతాయుగము ఆరంభములో జరిగినది. అధికార బల మదాంధులైన క్షత్రియులను శిక్షించిన అవతారమిది. పరశురాముని భార్గవరాముడు , జామదగ్ని అని కూడా అంటారు.

*పరశురాముని జన్మవృత్తాంతం:*

కుశ వంశానికి చెందిన మహారాజు గాధి. ఒకసారి భృగు వంశానికి చెందిన ఋచీకుడు అనే మహర్షి గాధి దగ్గరికి వెళ్ళి ఆయన కూతురు సత్యవతిని తనకిచ్చి వివాహం చెయ్యమని కోరగా ఆ మహారాజు నున్నటి శరీరం నల్లటి చెవులు గల వెయ్యి గుర్రాలు ఇమ్మని కోరుతాడు. ఋచీకుడు వరుణుని ప్రార్థించి వెయ్యి గుర్రాలు తెచ్చి సత్యవతిని పెళ్ళి చేసుకొన్నాడు. ఇలా జరుగుతుండగా ఒక రోజు సత్యవతి ఋచీకుని దగ్గరకు వచ్చి తనకు , తన తల్లికి పుత్రసంతానం ప్రసాదించమని కోరగా ఋచీకుడు యాగం చెసి విప్రమంత్రపూతం అయిన ఒక హవిస్సు , రాజమంత్రపూతం అయిన ఒక హవిస్సు తయారుచేసి స్నానానికి వెళ్ళతాడు. సత్యవతి ఈ విషయం తెలియక రాజమంత్రపూతమైన హవిస్సు తను తీసుకొని విప్రమంత్రపూతమైన హవిస్సు తల్లికి ఇస్తుంది. ఋచీకునికి సత్యవతి విషయం తెలిపి ప్రాధేయపడగా తనకొడుకు సాత్వికుడిగ ఉండి , మనుమడు ఉగ్రుడు అవుతాడు అని పల్కుతాడు. ఋచీకుని కుమారుడు జమదగ్ని. జమదగ్ని కొడుకు పురుషోత్తమాంశతొ జన్మించినవాడు పరశురాముడు. గాధి కొడుకే విశ్వామిత్రుడు. భృగు వంశాను చరితంగా జమదగ్నికి కూడా కోపము మెండు. ఆయన పత్ని రేణుకాదేవి. జమదగ్ని , రేణుకల చిన్న కొడుకు పేరు పరశురాముడు. పరశురాముడు శివుని వద్ద అస్త్రవిద్యలను అభ్యసించి , అజేయ పరాక్రమవంతుడై , ఆయన నుండి అఖండ పరశువు (గండ్ర గొడ్డలి) పొంది , పరశురాముడైనాడు.

*కార్తవీర్యునితో వైరం:*

హైహయ వంశజుడైన కార్తవీర్యార్జునుడు శాపవశమున చేతులు లేకుండా జన్మించాడు. గొప్ప తపస్సుచేసి , దత్తాత్రేయుని ప్రసన్నము చేసుకొని , వేయి చేతులు పొంది , మహావీరుడైనాడు. ఒకమారు ఆ మహారాజు వేటకై వెళ్ళి , అలసి జమదగ్ని ఆశ్రమానికి చేరుతాడు. ఆ మహర్షి కార్తవీర్యార్జునునికి , ఆయన పరివారానికి పంచభక్ష్యాలతొ భోజనం పెడతాడు. ఆ మహర్షి ఆర్భాటం చూసిన కార్తవీర్యార్జునుడు ఆశ్చర్యపడి , దీనికి కారణం అడుగగా జమదగ్ని తన దగ్గర కామధేనువు సంతానానికి చెందిన గోవు వల్ల ఇది సాధ్యపడింది అని తెలిపాడు. ఆ గోవును తనకిమ్మని ఆ మహారాజు కోరతాడు. జమదగ్ని నిరాకరిస్తాడు. కార్తవీర్యార్జునుడు బలవంతంగా ఆ గోవుని తోలుకుపోతాడు. పరశురాముడు ఇంటికి వచ్చి విషయం గ్రహించి మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జునునితో యుద్దంచేసి అతని వెయ్యిచేతులు , తలను తన అఖండ పరశువుతో ఛేదిస్తాడు. ఈ విషయాన్ని తన తండ్రికి విన్నవించగా తండ్రి మందలించి పుణ్యతీర్దాలు సందర్శించి రమ్మంటాడు. ఒక సంవత్సరం పాటు వివిధ పుణ్యక్షేత్రాలు దర్శించి వస్తాడు.

కాలం ఇలా నడుచుచుండగా ఒకసారి రేణుక నీటి కొరకు చెరువుకు వెళ్తుంది. అక్కడ గంధర్వుల జలకేళి చూస్తూ ఉండటం వల్ల తిరిగి రావడం ఆలస్యమౌతుంది. కోపించిన జమదగ్ని ఆమెను సంహరించవలెనని కొడుకులను ఆదేశిస్తాడు. పెద్దకొడుకులు అందుకు సమ్మతించరు. తల్లిని , సోదరులను సంహరించమని జమదగ్ని పరశురాముని ఆదేశించగా , అతడు తండ్రి చెప్పినట్లే చేస్తాడు. జమదగ్ని సంతోషించి ఏమైనా వరము కోరుకొమ్మనగా పరశురాముడు తల్లిని , సోదరులను బ్రతికించమంటాడు. ఈ విధముగా పరశురాముడు తన తల్లిని సోదరులను తిరిగి బ్రతికించుకొంటాడు.
ఒకరోజు పరశురాముడు ఇంట్లోలేని సమయం చూసి , కార్తవీర్యార్జునుని కుమారులు జమదగ్ని తల నరికి మాహిష్మతికి పట్టుకు పొతారు. పరశురాముని తల్లి రేణుక తండ్రి శవంపై పడి రోదిస్తూ 21 మార్లు గుండెలు బాదుకుంటుంది. పరశురాముడు మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జునుని కుమారులులను చంపి జమదగ్ని తలను తెచ్చి మొండేనికి అతికించి బ్రతికిస్తాడు.
ఆ తరువాత పరశురాముడు యావత్ క్షత్రియ జాతిపై ఆగ్రహించి వారిపై 21 మార్లు దండెత్తి క్షత్రియవంశాలను నాశనం చేస్తాడు. శ్యమంతక పంచకమనే 5 సరస్సులను క్షత్రియుల రక్తంతో నింపి పరశురాముడు తల్లిదండ్రులకు తర్పణం అర్పిస్తాడు. దశరథునివంటి కొద్దిమంది రాజులు గోవుల మందలలో దాగుకొని తప్పుకొన్నారు. తరువాత పరశురాముడు భూమినంతటినీ కశ్యపునకు దానమిచ్చి తాను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. పరశురాముడు మహా పరాక్రమవంతుడు.

*రామాయణంలో పరశురాముడు:*

సీతా స్వయంవరంలో శ్రీ రాముడు శివ ధనుస్సును విరచిన తరువాత సీతారాముల కల్యాణం జరిగింది. తన గురువైన శివుని విల్లు విరచినందుకు పరుశురాముడు కోపించి , రామునిపై యుద్ధానికి సిద్ధపడ్డాడు. దశరధుని అభ్యర్ధనలను , రాముని శాంత వచనాలనూ పట్టించుకొనలేదు. చేతనైతే ఈ విష్ణుచాపాన్ని ఎక్కుపెట్టమని తన ధనస్సును రామునకిచ్చాడు. రాముడు దానిని అవలీలగా ఎక్కుపెట్టాడు. రామచంద్రమూర్తి ఎక్కుపెట్టిన బాణాన్ని ఎక్కడకు విడవాలి అని అడుగగా తన తపోశక్తిని కొట్టమని చెప్పి , తాను మహేంద్రగిరిపై తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఆ విధంగా ధనస్సును పరశురాముడు రామునకు అందించినపుడు పరశురామునికీ రామునికీ భేదం లేదని ఇద్దరికీ అవగతమైనది.

మహాభారతంలో పరశురాముడు
మహాభారతంలో పరశురాముడు ముగ్గురు వీరులకు గురువైనాడు. గంగాదేవి అభ్యర్ధనపై భీష్మునకు అస్త్రవిద్యలు బోధీంచాడు. తరువాత అంబికను వివాహంచేసుకొనమని చెప్పగా ఆజన్మబ్రహ్మచర్యవ్రతుడైనందున భీష్ముడు అందుకు తిరస్కరించాడు. ఇద్దరికీ జరిగిన మహాయుద్ధంలో ఎవరూ వెనుకకు తగ్గలేదు. దేవతల అభ్యర్ధనమేరకు యద్ధం నిలుపబడింది.
కర్ణుడు తాను బ్రాహ్మణుడనని చెప్పి పరశురాముని వద్ద శిష్యునిగా చేరాడు. తరువాత కర్ణుని అబద్ధాన్ని తెలిసికొన్న పరశురాముడు యుద్ధకాలంలో విద్యలు గుర్తుకు రావని శపించాడు.
ద్రోణాచార్యుడు కూడా పరశురాముని వద్ద దివ్యాస్త్రాలను గ్రహించాడు. అర్జునుడు కూడా మహేంద్ర పర్వతంపై పరశురాముని దర్శించుకొన్నాడు.

*మరికొన్ని విషయాలు:*

స్కాంద పురాణం ప్రకారం పరశురాముడు వైశాఖ శుద్ధ తదియ నాడు జన్మించినట్లుగా పేర్కొనబడినది. అందువలన ఆ రోజు పరశురామ జయంతి జరుపుకుంటారు.

పరశురాముడు దత్తాత్రేయుని వద్ద శిష్యునిగా చేరి అనేక విద్యలను నేర్చుకొన్నాడు. ఈ అంశాలు స్కాంద పురాణం లో వివరించబడింది.

ఒకమారు పరశురాముడు శివుని దర్శించబోగా ద్వారం వద్ద వినాయకుడు అడ్డగించాడు. కోపంతో పరశురాముడు తన పరశువును విసిరేశాడు. తన తండ్రియైన శివుని ప్రసాదమైన పరశువుపై గౌరవంతో వినాయకుడు ఆ పరశువుతో తన దంతం విరిగేలా సమర్పించుకొన్నాడు.

పరశురాముడు చిరంజీవి. కల్క్యవతారమునకు విద్యలుపదేశిస్తాడనీ , తరువాతి మన్వంతరములో సప్తర్షులలో ఒకడవుతాడనీ కధ.

పరశురాముడు పూర్ణావతారము కాదనీ , అవశేషావతారమనీ అంటారు. కనుక పరశురాముని స్తోత్రాలూ , మందిరాలూ చాలా తక్కువ.

భూమినంతటినీ కశ్యపునకు దానమిచ్చిన తరువాత పరశురామునికి తపస్సు చేసికోవడానికి చోటు లేదు. ఆయన తన పరశువును సముద్రంలోకి విసిరేయగా , ఆయనపై గౌరవంతో అంతవరకు సముద్రుడు వెనుకకు తగ్గాడు. అలా వెలువడిన భూభాగమే నేటి కేరళ అని నమ్మిక. ఇలా వెలువడ్డ భూమి లొ గల 7 ప్రదేశాలను పరశురామక్షేత్రాలు అని అంటారు.

కేరళలో తిరువనంతపురం దగ్గర , తిరువళ్ళంలో కరమణ నది ఒడ్డున ఒక పురాతనమైన పరశురామ మందిరం ఉన్నది. ఇది 2 వేల సంవత్సరాలనాటిదంటారు. ఇక్కడ పితృదేవతలను పూజించడం ఆచారం

*పరశురామక్షేత్రాలు:*

ఈ క్రింద కల 7 క్షేత్రాలను పరశురామ ముక్తి క్షేత్రాలు అంటారు. పరశురాముడు తన పరశువు(గొడ్డలి) ను సముద్రంలోకి విసరివేయగా , ఆయనపై గౌరవంతో అంతవరకు సముద్రుడు వెనుకకు తగ్గాడు. అలా వెలువడిన భూభాగమే నేటి కేరళ అని నమ్మిక. ఇలా వెలువడ్డ భూమి లో గల 7 ప్రదేశాలను పరశురామక్షేత్రాలు అని అంటారు. ఈ క్షేత్రాలు అన్నీ కర్ణాటక రాష్ట్రం పశ్చిమ కనుమల లో ఉన్నాయి.

ఉడిపి

కొల్లూరు

గోకర్ణ

కుక్కే సుబ్రమణ్య /సుబ్రమణ్య

శంకరనారాయణ

కుంభాసి , ఆనేగడ్డ కోటేశ్వర మరి కొన్ని ఆలయాలు

భోపాల్ లో ఒక ఆలయం కలదు.

*పరశురామ గాయత్రి మంత్రం*

*ఓం జామదగ్న్యాయ విద్మహే మహావీరాయ ధీమహి తన్నో పరశురామః ప్రచోదయాత్ ॥*

RECENT POST

కాణిపాకం శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు

కాణిపాకం శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు ప్రతీరోజు ఈ స్తోత్రం కనీసం 4 సార్లుపఠిస్తేచాలామంచిది ఇంకా ఎక్కువ సార్లు పఠించే సమయము, శక్తి...

POPULAR POSTS