Wednesday, December 13, 2023

పెళ్ళికాని వారు తప్పకుండా దర్శించ వలసిన కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రం

పెళ్ళికాని వారు తప్పకుండా దర్శించ వలసిన కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రం


పెళ్ళి జరగడం ఆలస్యం అవుతున్న వారి మనోవేదనను తొలగించి వారిని " కళ్యాణ ప్రాప్తిరస్తు " అని దీవించి అనుగ్రహించే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్న క్షేత్రం తిరుపతికి అత్యంత సమీపంలోని శ్రీనివాసమంగాపురం . ఇక్కడే స్వామి వారు శ్రీ పద్మావతి అమ్మవారిని కళ్యాణం చేసుకున్నారు . ఆయన్ను దర్శించే భక్తుల జీవితాలలో కల్యాణానికి సంబంధిచిన అడ్డంకులను పారద్రోలి సంతోషాన్ని చిగురింపజేస్తారు .

పెళ్ళికాని వారితో శ్రీనివాస మంగాపురం ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటుంది. ప్రతిరోజూ వేలాది భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. వీరిలో పెళ్లి కావాలని కోరుకుని కంకణాలు కట్టే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని... గుడిలో ఇచ్చే కళ్యాణ కంకణాలు కట్టుకుంటే ఆరు మాసాల్లోపు పెళ్లిళ్లు జరుగుతాయని భక్తుల విశ్వాసం. 

నిన్నమొన్నటి వరకు చిత్తూరు, తిరుపతి జిల్లాలోని ప్రజలే కల్యాణ వెంకటేశ్వరస్వామి దర్శనానికి ఎక్కవుగా వచ్చేవారు. అయితే ఈ నమ్మకం ఆ నోట...ఈ నోట పడి ఇటీవల కాలంలో బాగా వ్యాప్తిలోకి వచ్చింది. స్వామి విశిష్టత ఈ మధ్యకాలంలో అందరికీ తెలియడంతో... ఇప్పుడు కేవలం మన రాష్ట్రం నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు. 

భక్తుల నమ్మకానికి తగ్గట్టుగా ఇక్కడ స్వామివారిని దర్శించుకున్నవెంటనే పెళ్లికాని అమ్మాయిలకు.. అబ్బాయిలకు వెంటనే పెళ్లిళ్లు జరగడంతో స్వామి వారికి ఇటీవల కాలంలో ఇంకా బాగా పాపులారిటీ వచ్చింది. ఈ కారణంగా ఇటీవల కాలంలో ఈ గుడికి ఎన్నడూ లేనంత రద్దీ పెరిగింది. తిరుపతికి సరిగ్గా 12 కిలోమీటర్ల దూరంలో శ్రీనివాస మంగాపురం ఉంది.

వివిధ దోషాల కారణంగా పెళ్లిళ్లు ఆలస్యమవుతోన్న అమ్మాయిలు, అబ్బాయిలు, వారి తల్లిదండ్రులు ప్రతీ రోజు వేల సంఖ్యలో స్వామివారిని దర్శించుకునేందుకు ఎగబడుతున్నారు. వీరితో పాటు స్వామి వారిని దర్శించుకున్న తర్వాత పెళ్లైన అబ్బాయిలు, అమ్మాయిలు... జంటలుగా స్వామి వారి పున:దర్శనం కోసం వస్తున్నారు. దీంతో ప్రస్తుతం రోజుకి 30 నుంచి 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. 

ఇక స్థలప్రాశస్త్యం వివరాల్లోకి వెళితే... పద్మావతి అమ్మవారిని వివాహమాడిన వెంకటేశ్వరుడు తిరుమల గిరులకు ఈమార్గం గుండా వెళ్తుంటే... నూతన వధూవరులు గిరుల పర్యటన చేయకూడదని అగస్త్యమహాముని సూచించారని... దాంతో శ్రీవారు శ్రీనివాస మంగాపురంలోనే ఆరు నెలలు పాటు ఉండిపోయారన్నది పురాణప్రాశస్త్యం. 

ఓం నమో వేంకటేశాయ

Monday, November 13, 2023

 కార్తీకమాసం ప్రారంభం



శరదృతువు ఉత్తర భాగంలో వచ్చే కార్తీకమాసం నెల రోజులు పర్వదినాలే. కార్తీకంలో తెల్లవారు జామునే లేచి తలారా స్నానం చేసి , శుభ్రమైన దుస్తులు ధరించి , తులసికోట ముందు భగవన్నామ సంకీర్తన చేస్తూ ధూప , దీప , నైవేద్యాలు సమర్పిస్తారు. ఇలా చేస్తే మనసంతా ఆధ్యాత్మిక పరిమళాలతో నిండి అలౌకికమైన , అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది. మామూలు రోజులలో భగవదారాధన మీద అంతగా శ్రద్ధ పెట్టనివారు , గుడిలో కాలు పెట్టని వారిని సైతం పవిత్రమైన ఆధ్యాత్మిక వాతావరణమే గుడికి తీసుకెళ్తుంది. వారిని దేవుని ముందు కైమోడ్చేలా చేసి , పాపాలు పటాపంచలు చేసి మోక్షప్రాప్తి కలిగిస్తుంది ఈ మాసం. 


అందుకే ఇది ముముక్షువుల మనసెరిగిన మాసం.

న కార్తీక నమో మాసో న శాస్త్రం నిగమాత్పరమ్ నారోగ్య సమముత్సాహం న దేవః కేశవాత్పరః


కార్తీక మాస మహాత్మ్యాన్ని మొదటగా వశిష్ట మహర్షి జనక మహారాజుకు వివరించగా శౌనకాది మునులకు సూతుడు మరింత వివరంగా చెప్పాడు.

కార్తీక మాసంలో ఆర్చనలు , అభిషేకాలతోపాటు , స్నాన దానాదులు కూడా అత్యంత విశిష్టమైనవే. నదీస్నానం , ఉపవాసం , దీపారాధన , దీపదానం , సాలగ్రామ పూజ , వన సమారాధనలు ఈ మాసంలో ఆచరించదగ్గ విధులు. కార్తీకమాసంలో శ్రీ మహావిష్ణువు చెరువులలో , దిగుడు బావులలో , పిల్ల కాలువలలోనూ నివసిస్తాడు. అందుకే ఈ మాసంలో వాపీ , కూప , తటాకాదులలో స్నానం చేయడం ఉత్తమం. కుదరని పక్షంలో సూర్యోదయానికి ముందే మనం స్నానం చేసే నీటిలోనే గంగ , యమున , గోదావరి , కృష్ణ , కావేరి , నర్మద , తపతి , సింధు మొదలయిన నదులన్నింటి నీరూ ఉందని భావించాలి.


కార్తీకమాసంలో దశమి , ఏకాదశి , ద్వాదశి తిథులలో శ్రీమహావిష్ణువును తులసిదళాలతోటీ , కమలాలతోటి పూజిస్తే జీవించినన్నాళ్లూ ధనానికి లోటు లేకుండా ఉండి , సమస్త సౌఖ్యాలు కలగటంతోపాటు అంత్యమున జన్మరాహిత్యం కలుగుతుందట. 


అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం రోజున , మాసశివరాత్రినాడు , సోమవారం నాడు , కార్తీక పున్నమి నాడూ రుద్రాభిషేకం చేసి , బిల్వదళాలతోనూ , రుద్రాక్షలతోనూ పూజించిన వారికి అనంతమైన సౌఖ్యాలతోబాటు అంత్యమున శివసాయుజ్యం పొందుతారని కార్తీక పురాణం చెబుతోంది.


ఈ మాసంలో ప్రతి రోజూ పుణ్యప్రదమైనదే. అయితే ఏ తిధిన ఏమి చేస్తే మంచిదో తెలుసుకుని దాని ప్రకారం ఆచరిస్తే మరిన్ని ఉత్తమ ఫలితాలు కలుగుతాయి.


కార్తీక శుద్ధపాడ్యమి: తెల్లవారు జామునే లేచి స్నానం చేసి , అందుబాటులో ఉన్న ఏదైనా ఆలయానికెళ్లి , 'నేను చేయ దలచుకున్న కార్తీక వ్రతం నిర్విఘ్నంగా సాగేటట్లు అనుగ్రహించమని ప్రార్థించి సంకల్పం చెప్పుకుని ఆకాశ దీపాన్ని సందర్శించుకోవాలి.


విదియ: ఈ రోజు సోదరి ఇంటిల్లి ఆమె చేతి భోజనం చేసి , కానుకలు ఇచ్చి వచ్చిన వారికి యమగండం వాటిల్లదని పురాణోక్తి.


తదియ: అమ్మవారికి కుంకుమపూజ చేయించుకోవడం వల్ల సౌభాగ్య సిద్ధి.


చవితి:  కార్తీక శుద్ధ చవితి నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరునికి పుట్టలో పాలు పోయాలి.


పంచమి: దీనికి జ్ఞానపంచమి అని పేరు. ఈ రోజు సుబ్ర హ్మణ్య ప్రీత్యర్థం ఆర్చనలు చేయించుకున్నవారికి జ్ఞానవృద్ధి కలుగుతుంది.


షష్టి: నేడు బ్రహ్మచారికి ఎర్రని కండువా దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. 


సప్తమి: ఈరోజు ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి దానమివ్వడం వల్ల ఆయుష్షు వృద్ధి అవుతుంది. 


అష్టమి: ఈ గోపాష్టమి నాడు చేసే గోపూజ విశేష ఫలితాలనిస్తుంది.


నవమి: నేటి నుంచి మూడు రోజులపాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి.


దశమి: ఈ రోజు రాత్రి విష్ణుపూజ చేయాలి.


ఏకాదశి: ఈ ఏకాదశికే బోధనైకాదశి అని పేరు. ఈ రోజు విష్ణుపూజ చేసిన వారికి ఉత్తమ గతులు కలుగుతాయి. 


ద్వాదశి: ఈ రోజు క్షీరాబ్ది ద్వాదశి. నేటి సాయంకాలం ఉసిరి మొక్క. తులసి మొక్కల వద్ద దామోదరుని ఉంచి పూజ చేసి , దీపాలు వెలిగించడం సర్వపాపాలనూ నశింపచేస్తుంది.


త్రయోదశి: ఈరోజు సాలగ్రామ దానం చేయడం వల్ల సర్వకష్టాలూ దూరమవుతాయి.


చతుర్దశి: పాషాణ చతుర్ధశి వ్రతం చేసుకునేందుకు మంచిది.


కార్తీక పూర్ణిమ: మహా పవిత్రమైన ఈ రోజు నదీస్నానం చేసి శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవడం వల్ల సర్వపాపాలూ ప్రక్షాళనమవుతాయి.


కార్తీక బహుళ పాడ్యమి:  ఈ రోజు ఆకుకూర దానం చేస్తే శుభం.


విదియ: వనభోజనం చేయడం విశేష ఫలాలనిస్తుంది. 


తదియ: పండితులకు , గురువులకు తులసి మాలను సమర్పించడం వల్ల తెలివితేటలు వృద్ధి అవుతాయి.


చవితి: పగలంతా ఉపవసించి , సాయంత్రం వేళ గణపతిని గరికతో పూజించి , ఆ గరికను తలగడ కింద పెట్టుకుని పడుకుంటే దుస్వప్న దోషాలు తొలగి సకల సంపదలూ కలుగుతాయి.


పంచమి: చీమలకు నూకలు చల్లడం , శునకాలకు అన్నం తినిపించడం శుభఫలితాలనిస్తుంది.


షష్ఠి: గ్రామదేవతలకు పూజ జరిపించడం మంచిది.


సప్తమి: జిల్లేడు పూలతో గుచ్చిన దండను ఈశ్వరునికి సమర్పిస్తే సంపదలు వృద్ధి అవుతాయి.


అష్టమి: కాలభైరవాష్టకం చదివి గారెలతో దండచేసి , కాల భైరవానికి (కుక్కకు) సమర్పించడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది.


నవమి:  వెండి లేదా రాగి కలశంలో నీరు పోసి పండితునికి దానమిస్తే పితృదేవతలు తరిస్తారు.


దశమి: ఈ రోజు అన్న సంతర్పణ చేస్తే విష్ణువుకు ప్రీతిపాత్రులై , కోరికలు తీరతాయి.


ఏకాదశి: విష్ణ్వాలయంలో దీపారాధన , పురాణ శ్రవణం , పఠనం , జాగరణ విశేషఫల ప్రదం.


ద్వాదశి: అన్నదానం లేదా స్వయంపాకం సమర్పించడం శుభప్రదం.

త్రయోదశి నవగ్రహారాధన చేయడం వల్ల గ్రహదోషాలు తొలగుతాయి.


చతుర్దశి: ఈ మాస శివరాత్రినాడు చేసే ఈశ్వరార్చన , అభిషేకం అపమృత్యుదోషాలను , గ్రహబాధలను తొలగిస్తాయి.


అమావాస్య: నేడు పితృదేవతల పేరిట అన్నదానం లేదా ఉప్పు పప్పుతో కూడిన సమస్త సంబారాలను దానం చేయడం వల్ల పెద్దలకు నరక బాధ తొలగి , స్వర్గసుఖాలు కలుగుతాయి.


ఈ మాసంలో చేసే స్నాన , దాన , జపాల వల్ల అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి. అయితే అలా రోజూ చేయలేని వారు కనీసం ఏకాదశి , ద్వాదశి , పూర్ణిమ , సోమవారాలలో లేదా ఒక్క పూర్ణిమ లేదా కనీసం ఒక్క సోమవారం నాడయినా సరే నియమ నిష్టలతో ఉపవాసం ఉండి , గుడికి వెళ్లి దీపం వెలిగిస్తే లభించే పుణ్యఫలాన్ని వర్ణించడం తనవల్ల కాదని బ్రహ్మ చెప్పాడు. కార్తీక పౌర్ణమి నాడు పగలంతా ఉపవాసముండి రుద్రాభిషేకం చేయించి శివాలయంలో మట్టి ప్రమిదలో 365 ఒత్తులను ఆవునేతితో వెలిగిస్తే సమస్త పాపాలూ భస్మీపటలమై ఇహలోకంలో సర్వసౌఖ్యాలను అనుభవించి అంత్యంలో పుణ్యలోకాలు పొందుతారని కార్తీక పురాణంలోని అనేక గాథలు , ఇతివృత్తాలు , ఉపకథలను బట్టి తెలుస్తుంది. క్షీరాబ్ది ద్వాదశి వ్రతం , సత్యనారాయణస్వామి వ్రతం , కేదారేశ్వర వ్రతం కార్తీక మాసంలో చేసుకునే వ్రతాలు.


గడపదాటి వెళ్లనివారు సైతం కార్తీక మాసంలో వన సమారాధనలో వనసమారాధనలో ఉసిరిగ చెట్టు నీడన సాలగ్రామ రూపంలో శ్రీహరిని పూజించి శక్తి కొలది బ్రాహ్మణ సమారాధన చేసిన వారిని యముడు కన్నెత్తి కూడా చూడలేడని కార్తీక పురాణం బోధిస్తోంది. వనభోజనం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోయి విష్ణుసాయుజ్యం పొందుతారు. 


కార్తీకమాసంలో వనభోజనం ఎవరు చేస్తారో , పురాణం ఎవరు వింటారో వారికి ఉత్తమ గతులు కలగడంతో పాటు హోమం చేసేటప్పుడు, జపం చేసేటప్పుడు , దేవతార్చన సమయంలో , పితృతర్పణ సమయంలో , భ్రష్టులు , చండాలురు , సూతకం ఉన్న వాళ్ల మాటలు వినడం వల్ల కలిగే పాపాలు తొలగుతాయి.

కార్తీకమాసం విష్ణుస్వరూపమని విష్ణు భక్తులు , కాదు ఈశ్వరార్చనే ప్రశస్తమని శివభక్తులు భావిస్తారు. ఒకరకంగా ఆ ఇరువురిదీ వాదనా సరైనదే. ఎలాగంటే ఈ మాసం శివకేశవులకిరువురికీ ప్రీతిపాత్రమైనదే.


తామసం కలిగించే ఉల్లి , వెల్లుల్లి , మద్యం , మాంసం జోలికి పోరాదు. ఎవ్వరికీ ద్రోహం చేయరాదు. పాపపు ఆలోచనలు చేయకూడదు. దైవదూషణ తగదు. దీపారాధనలకు తప్ప నువ్వులనూనెను ఇతరత్రా అవసరాలకు ఉపయోగించరాదు. మినుములు తినకూడదు. నలుగు పెట్టుకుని స్నానం చేయరాదు. కార్తీక వ్రతం పాటించేవారు ఆ వ్రతం చేయని వారి చేతి వంట తినరాదు.


ఈ మాసంలో చేసే ఉపవాసం , జాగరణ , స్నానం , దానం మామూలుగా చేసేటప్పటికంటే ఎన్నో రెట్లు అధిక ఫలాన్నిస్తాయి. విష్ణువును తులసి దళాలు , మల్లి , కమలం జాజి , అవిసె పువ్వు , గరిక , దర్భలతోను , శివుని బిల్వదళాలతోనూ , జిల్లేడుపూలతోనూ అర్చించిన వారికి ఇహపర సౌఖ్యాలతోబాటు ఉత్తమ గతులు కలుగుతాయి. శక్తి లేని వారు ఉదయం స్నానం , జపం , దేవతారాధన యధావిధిగా చేసి మధ్యాహ్న భోజనం చేసి , రాత్రికి మాత్రం భోజనం చేయకూడదు. పాలు , పళ్లు తీసుకోవచ్చు

Tuesday, November 7, 2023

హోమములు చేసుకుంటే ఏమిటి ఫలితం? ఏ హోమం చేసుకుంటే ఏ కోరిక సిద్ధిస్తుంది?

హోమములు చేసుకుంటే ఏమిటి ఫలితం? ఏ హోమం చేసుకుంటే ఏ కోరిక సిద్ధిస్తుంది?




🌿అగ్ని ముఖముగానే అందరి దేవతారాధనలు జరుగుచున్నవి . అగ్ని యందు మంత్ర పూర్వకముగా దేవీ దేవతలను ఆవాహన చేసి, ఆ దేవతలను సంతృప్తి పరచు విధానమే ఈ హోమములు. 

🌸ఈ క్రింద వివిధ కోరికలను అనుసరించి ఏ విధమైన హోమములు చేసుకోవాలో చెప్పటం జరిగినది. హోమం చేయడం వలన ఆ దేవుని అనుగ్రహం లభించి ఆ కోరికలు సిద్ధిస్తాయి. కాబట్టి ఈ హోమములు చేసుకుని మీ కోరికలు తీర్చుకుంటారు అని భావిస్తున్నాను.


గణపతి హోమం :

🌿విఘ్నాలను తొలగించే విఘ్ననాయకుడు వినాయకుడు. మనుషులు ప్రారంభించే ప్రతి కార్యాల్లోనూ మొదటగా గణపతిని పూజించడం జరుగుతుంది. ప్రారంభించిన కార్యం ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి కావాలని వినాయకుడిని పూజిస్తారు.

🌸జీవితంలో ఎదురయ్యే కష్టాలను, ప్రతికూల అంశాలను తొలగించడానికి వినాయకుడికి గణపతి హోమం చెయ్యాలి. గణపతి హోమం చేయడం వలన విజయము,ఆరోగ్యము,సంపద కార్య సిద్ధి కలుగుతాయి.మన హిందూ ధర్మం ప్రకారం ఏ శుభకార్యం చేయాలన్నా మొదటగా గణపతి హోమంతోనే ప్రారంభిస్తారు.


రుద్ర హోమం

🌿రుద్ర అనునది శివునికి మరొక నామము. శివుడు లేదా రుద్రుని అనుగ్రహం కొరకు చేసే హోమాన్ని రుద్రహోమము అంటారు. ఈ హోమం చేయుట వలన శివుని అనుగ్రహం పొంది తద్వారా అపమృత్యు భయాలు తొలగింపబడి, 

🌸దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొంది శక్తి సంపన్నులు అవుతారుఅని పురాణాలు చెబుతున్నాయి. మృత్యువు మీద విజయాన్ని సాధించడానికి కూడా ఈ రుద్ర హోమం చేస్తారు.ఈ రుద్రహోమం అత్యంత శక్తివంతమైనది.


చండీ హోమం

🌿మన హిందూ పురాణాల ప్రకారం అత్యంత శక్తిస్వరూపిణి చండీ మాత. జీవితంలో ఎదురయ్యే అన్ని కష్టాలను తొలగించడానికి, ఆనందమైన జీవితాన్ని గడపడానికి,సిరిసంపదల కోసం చండి హోమం చేస్తారు. చండి హోమం నిర్వహించడం వలన జీవితంలో ఉన్న ప్రతికూల అంశాలన్నీ తొలగిపోతాయి అంటారు.

🌸చండీ హోమం చేసేప్పుడు నవగ్రహాలను ఆవాహన చేసుకొని చేయడం జరుగుతుంది.చండీ హోమాన్ని ఎక్కువగా శుక్రవారం రోజు లేదా అష్టమి,నవములలో చేయడం శ్రేష్టం. సప్తశతిలో ఉన్నటువంటి 13 అధ్యాయాల ప్రకారంగా చండీహోమం చేసేందుకు 13 రకాల విభిన్నమైన పదార్థాలను వాడడం జరుగుతుంది.కాబట్టి ఇది చాలా శక్తివంతమైనది.


గరుడ హోమం

🌿శ్రీమహావిష్ణువు వాహనంగా పిలువబడే దైవ స్వరూపమే గరుడుడు. గరుడుడు అనంతమైన శక్తికి, జ్ఞానానికి స్వరూపం. గరుడార్, గరుడ భగవాన్ అని పిలిచుకొనే గరుడుడికి చేసే హోమమే ఈగరుడ హోమం. సరైన విధివిధానాలతో కనుక గరుడ హోమం చేసినట్లయితే ఆకర్షణ శక్తి పెరగడం ,అనేక విషయాల పట్ల, వ్యక్తుల పట్ల ఆధిపత్యాన్ని సాధించడం, శత్రువుల మీద విజయం, ప్రమాదాల నుంచి రక్షించబడడం,

🌸అన్ని శారీరక, మానసిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా ఈ గరుడ హోమం చేయడం వలన జ్ఞానము అలాగే జ్ఞాపకశక్తి వృద్ధి జరుగుతుంది. విద్య అభివృద్ధి కలుగుతుంది.


సుదర్శనహోమం

🌿మహావిష్ణువుకు అత్యంత శక్తివంతమైన ఆయుధమే సుదర్శన చక్రం. ఈ ఆయుధం చాలా శక్తివంతమైన ఆయుధం అవ్వడమే కాకుండా దైవిక శక్తి కలిగి ఉండి దుష్టశక్తులను సంహరిస్తుంది. జీవితంలో లేక కుటుంబంలో జరుగుతున్న ప్రతికూల అంశాలకు కారణమైన దుష్టశక్తుల నుండి రక్షింపబడడానికి ,నరదృష్టి తొలగించడానికి ఈ సుదర్శన హోమం చేస్తారు. 

🌸గృహ ప్రవేశ సమయంలో మరియు మిగిలిన శుభకార్యాల సమయంలో కూడా సుదర్శన హోమం చేస్తారు. హోమాగ్నికి అష్ట ద్రవ్యాలను సమర్పిస్తూ అత్యంత పవిత్రమైన సుదర్శన మంత్రాన్ని జపిస్తూ ఈ హోమం చేస్తారు.


మన్యుసూక్త హోమం

🌿మన వేదాలనుసరించి మన్యు అనగా ఆగ్రహం అని, లేదా మరొక అర్థం లో తీవ్రమైన భావావేశము అని అర్థం. మన్యు దేవుడి ఆశీస్సుల కోసం చేసే హోమము మన్యుసూక్త పాశుపత హోమం. ఈ హోమాన్ని ప్రధానంగా శత్రు సంహారం కోసం చేయడం జరుగుతుంది. కోర్టు కేసుల లాంటి దీర్ఘకాలిక సమస్యల నుండి విముక్తి కోసం ఈ హోమాన్ని చేయాలి.


లక్ష్మీ కుబేర పాశుపతహోమం

🌸సంపదకి దేవతలుగా లక్ష్మీ దేవిని, కుబేరున్ని మనం పూజిస్తాము.జీవితంలో ఆర్థికంగా కష్టాలను ఎదుర్కొంటున్న వారికోసం చేసేదే ఈ లక్ష్మి కుబేర పాశుపత హోమం.మానవ జీవితంలో ఆర్థిక వృద్ధి, సిరి సంపదల కొరకు లక్ష్మీదేవిని ,కుబేరుడిని ఈ హోమంలో పూజిస్తారు. ఈ హోమాన్ని శుక్రవారం రోజున చేయడం శ్రేష్టం. ఎందుకనగా శుక్రవారాన్ని లక్ష్మీ వారం అంటాం కదా.


మృత్యుంజయ పాశుపత హోమం

🌿మానవుడు మరణం నుంచి విజయాన్ని పొందడమే మృత్యుంజయం.ఆ పేరులో ఉన్నట్టుగానే మృత్యువుపైన విజయాన్ని సాధించడం కోసం మృత్యుంజయ పాశుపత హోమం చేయించుకుంటారు. 

🌸ప్రాణ హాని ,తీవ్రమైన అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొందడం కోసం ఈ హోమం చేస్తారు. దుష్టశక్తులను అదుపుచేసి, సంహరించే భూత నాథుడిగా పిలవబడే ఆ శివుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఈ హోమం చేస్తారు.ఈ హోమం చేసుకునేవారు హోమానికి సంబంధించిన మంత్రాన్ని 21సార్లు జపించవలసి ఉంటుంది.


నవదుర్గ పాశుపత హోమం

🌿ఇలలో భక్తుల చేత దుర్గామాత నవదుర్గగా పూజింప బడుతుంది....
స్వస్తీ.....🚩🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

Monday, November 6, 2023

దశ దానాలు అంటే ఏమిటి .?*

*దశ దానాలు అంటే ఏమిటి .?*


🍁🍁🍁🍁🍁
🌳దానం, ధర్మం అనే మాటలు మీరు వినే ఉంటారు. ఎవరైనా పేదవానికి మీ శక్తి కొలది చేసే ద్రవ్యసహాయము కానీ, వస్తు సహాయమును కానీ.. ‘ధర్మం’ అంటారు.

🌳ఇలా ‘ధర్మం’ చేయడం వల్ల వచ్చిన పుణ్యఫలం ఇహలోక సౌఖ్యాలకు దోహదం చేస్తుంది. మంత్రపూర్వకంగా ఓ సద్బ్రాహ్మణునకు చేసిన దానఫలం., పరలోక సుఖాలను అందించడమే కాకుండా, ఉత్తమజన్మ సంప్రాప్తించడానికి ఉపయోగపడుతుంది.

 🌳 ‘ధర్మం’ చెయ్యడానికి పరిథులు లేవు. నీకు తోచినది ఏదైనా ధర్మం చెయ్యవచ్చు. కానీ, ‘దానం’ చెయ్యడానికి కొన్ని పరిథులు ఉన్నాయి. ఏదిపడితే అది దానం చెయ్యడానికి వీలులేదు. అలాచేయడానికి మీరు సిద్ధంగాఉన్నా., తీసుకోవడానికి విప్రులు సిద్ధంగా ఉండరు.
శాస్త్రనియమానుసారం దానయోగ్యమైనవి కొన్నే ఉన్నాయి. వాటినే దానం చెయ్యాలి. వాటినే *‘దశ దానాలు’* అంటారు. ఇవి మొత్తం పది దానాలు.

 *" గో భూ తిల హిరణ్య ఆజ్య  వాసౌ ధాన్య గుడానిచ*
 *రౌప్యం లవణ మిత్యాహుర్దశదానాః ప్రకీర్తితాః "*

👉   దూడతో కూడుకున్న ఆవు, భూమి, నువ్వులు, బంగారము, ఆవునెయ్యి, వస్త్రములు, ధాన్యము, బెల్లము, వెండి, ఉప్పు...ఈ పదింటిని దశ ధానములు గా శాస్త్రం నిర్ణయించింది.

 వీటినే మంత్ర పూర్వకంగా దానం చెయ్యాలి. అప్పుడే ఫలితం ఉంటుంది. మరి, ఏ ఏ దానంవల్ల ఏ ఏ ఫలం వస్తుందో తెలుసుకోవాలి కదా..

*🐄 గో దానం*
 :::
గోవు అంగములందు పదునాలుగు లోకాలు ఉన్నాయి. బాగా పాలు ఇచ్చేది, మంచి వయసులోనున్నది, దూడతో కూడుకున్నది అయిన ఆవును బంగారు కొమ్ములు, వెండి డెక్కలు, కంచు మూపురము, రాగి తోక, నూతన వస్త్రములతో అలంకరించి, ఆ ఆవుతోపాటు పాలు పితుక్కునే పాత్రను ఇస్తూ, ఫల, దక్షిణ, తాంబూలములతో యథావథిగి దానం చెయ్యాలి. గోవుకు కనీసం ఆరు నెలల గ్రాసాన్ని కూడా ఇవ్వాలి. ఈ దానంతో   శ్రీమహావిష్ణువు సంప్రీతుడై, దాతకు స్వర్గలోక ప్రాప్తిని కలిగిస్తాడు.

*🌏  భూ దానం*
 :::
 కృతయుగంలో హిరణ్యాక్షుని కారణంగా శూన్యంలోకి దొర్లిపోతూంటే.. శ్రీహరి వరాహావతారం ధరించి, ఆ భూమిని తన దంష్ట్రాగ్రంపై నిలిపి ఉద్ధరించాడు. సుక్షేత్రము, సమస్త సస్యసమృద్ధము అయిన భూమిని దానం చేయుటచేత అనంత పుణ్యఫలం లభిస్తుంది. ఈ దానంతో శంకరుడు సంప్రీతుడై., దాతకు శివలోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు.

*🕳️ తిల దానం*
 :::
 తిలలు అంటే నువ్వులు. శ్రీమహావిష్ణువు శరీరం నుంచి పుట్టిన నువ్వులను దానం చెయ్యడంవలన సమస్త పాపములు నశిస్తాయి.ఈ దానంతో శ్రీమహావిష్ణువు సంప్రీతుడై., దాతకు విష్ణులోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు.

*🥇 హిరణ్య (సువర్ణ) దానం* :::

హిరణ్యము అంటే బంగారం. బ్రహ్మదేవుని గర్భం నుండి పుట్టిన బంగారాన్ని దానం చేయడం వలన, దాత సమస్త కర్మల నుంచి విముక్తుడు అవుతాడు. ఈ దానంతో అగ్నిదేవుడు సంప్రీతుడై., దాతకు అగ్నిలోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు.

*🍯  ఆజ్య (నెయ్యి) దానం*

 :::
 ఆజ్యము అంటే ఆవునెయ్యి. ఈ నెయ్యి కామధేనువు పాలనుండి ఉద్భవించింది. ఈ నెయ్యినే యఙ్ఞ, యాగాదులందు సకల దేవతలకు ఆహారంగా హవిస్సు రూపంలో సమర్పిస్తారు. అట్టి ఆజ్యాన్ని దానం చేయడం వలన సకల యఙ్ఞఫలం లభిస్తుంది.ఈ దానంతో మహేంద్రుడు సంప్రీతుడై., దాతకు ఇంద్రలోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు. 

*👔🥻  వస్త్రదానం*
 :::
 శీతోష్ణములనుండి శరీరానికి రక్షణ కలిగించే వస్త్రము కేవలం అలంకారినికే కాకుండా, మాననాన్ని కూడా కాపాడుతుంది. అట్టి వస్త్రాలను దానం చేయడం వలన, సర్వ దేవతలు సంతోషించి,సకల శుభాలు కలుగాలని దాతను దీవిస్తారు.

*🎋  ధాన్య దానం*
 :::
 జీవి ఆకలిని తీర్చేది ఈ ధాన్యము. జీవి ఉత్పత్తికి ఈ ధాన్యమే కారణము. అట్టి ధాన్యాన్ని ఓ బండెడు దానం చేయుట వలన, సకల దిక్పాలకులు సంతృప్తిచెంది, దాతకు ఇహలోకమందు సకలసౌఖ్యము అనుగ్రహించి, పరమందు దిక్పాలకలోక ప్రాప్తిని అనుగ్రహిస్తారు.

*🧈 గుడ (బెల్లం) దానం*
 :::
 రుచులలో మధురమైనది బెల్లం. ఈ బెల్లం చెరుకురసం నుండి పుట్టింది. ఈ బెల్లం అంటే వినాయకునకు, శ్రీమహాలక్ష్మీదేవికి ఇష్టం. ఈ దానంతో లక్ష్మీ, గణపతులు  సంప్రీతులై., దాతకు అఖండ విజయాలను, అనంత సంపదలను అనుగ్రహిస్తారు.

 *🥈రజత (వెండి) దానం*
 :::
 అగ్నిదేవుని కన్నీటి నుండి ఉత్పన్నమైనది ఈ వెండి.ఈ దానంతో శివ, కేశవులు., పితృదేవతలు సంప్రీతులై., దాతకు సర్వసంపదలను, వంశాభివృద్ధిని  అనుగ్రహిస్తారు.

 🫙 *లవణ(ఉప్పు)దానం* :::
 రుచులలో ఉత్తమమైనది ఉప్పు. ఈ దానంతో మృత్యుదేవత సంప్రీతుడై., దాతకు ఆయుర్దాయమును, బలాన్ని, ఆనందాన్ని అనుగ్రహిస్తాడు.

*👉  ఇవి దశ దానాలు.* ఈ దానాలను గ్రహణ సమయాల్లో, పర్వదినాల్లో, సంక్రమణాల్లో చేస్తే దాని ఫలం పదింతలు అవుతుంది. ఈ దానాలను భక్తి,శ్రద్ధలతో చేయాలిగాని, దానగ్రహీతకు ఏదో ఉపకారం చేస్తున్నామనే భావనతో చేయరాదు. అలా చేస్తే ఫలితం శూన్యం అనే నిజాన్ని గుర్తించి మరీ దానం చేయండి.
🌼🌼🌼🌹🌼🌼🌼

Sunday, November 5, 2023

దేవుడి ఉంగరాలు పెట్టుకునే ప్రతి ఒక్కరూ తప్పక ఈ విషయం తెలుసుకోండి*



 *దేవుడి ఉంగరాలు పెట్టుకునే ప్రతి ఒక్కరూ తప్పక ఈ విషయం తెలుసుకోండి* ...!!


కొంతమంది ఉంగరాలను స్టైల్ కోసం ధరిస్తూ ఉంటే, మరో కొంతమంది జాతక ప్రకారం, రక రకాల స్టోన్స్ ఉన్న ఉంగరాలను ధరిస్తూ ఉంటారు,

అయితే మరికొంతమంది మాత్రం, భక్తితో దేవుడు ఉంగరాలను ధరిస్తూ ఉంటారు, ఉదయం లేచిన వెంటనే కళ్ళకు అద్దుకోవాలి, దండం పెట్టుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు.

అయితే దేవుడి ప్రతిమ ఉన్న ఉంగరాలను ధరించడం లో, కొన్ని పద్ధతులను పాటించాలని, లేకపోతే నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయని, పండితులు చెబుతున్నారు. 

ఉంగరం లో ఉన్న దేవుడి ప్రథమ తల మన మణికట్టు వైపు, 
దేవుడి కాళ్లు మన గోర్ల వైపు ఉండేలా ధరించాలి.

ఎందుకంటే మన శరీరం చేతి వేళ్ళ గోర్లు, భూమిని చూస్తూ ఉంటాయి.
ఉంగరాలను కళ్ళను అడ్డుకునే టప్పుడు, చేతిని ముడిచి కళ్ళకు అద్దుకోవాలి.

ఇక మహిళలు అయితే, ఇబ్బంది రోజులలో దేవుడి ఉంగరాలు ధరించరాదు,

అలాగే భోజనం చేసేటప్పుడు, 
ఉంగరానికి ఎంగిలి అంట కూడదు, ఇక దూమపానం చేసేటప్పుడు, ఆ పొగ మనం ధరించిన దేవుడి ప్రతిమను తగలకూడదు,

ఇటువంటి జాగ్రత్తలను పాటిస్తే, దేవుడి ఉంగరాలను, దేవుడి ప్రతిమ గల ఉంగరాలను ధరించాలని, లేకపోతే మనకు మంచి జరగకపోగా చెడు జరిగే ప్రమాదం, ఉందని పండితులు హెచ్చరిస్తున్నారు...

ఖడ్గమాలాస్తోత్రానికి ఆ పేరు ఎందుకు వచ్చింది ?

ప్ర: ఖడ్గమాలాస్తోత్రానికి ఆ పేరు ఎందుకు వచ్చింది ? మరి 'అస్య శ్రీ శుద్ధ శక్తిమాలా మంత్రస్య' అని ఎందుకన్నారు ? ఖడ్గమాలలోని ఆ పేర్లన్నీ ఎవరివి?


జ:  #ఖడ్గమాల #శ్రీవిద్య కు చెందినది. తొలుత #లలితాత్రిపురసుందరి నామం చెప్పబడి, అటు పై న్యాసాంగ దేవతలు, తిథినిత్యా దేవతలు, దివ్యౌఘ సిద్ధాఘ మానవౌఘ గురు మండల నామాలు; ఆ తరువాత క్రమంగా శ్రీచక్ర నవావరణ దేవతల నామాలు, నవచక్రేశ్వరీ నామాలు, చివరగా దేవీ విశేషణాలు చెప్పబడ్డాయి.
ఒకే అక్షరం గల మంత్రాలు 'పిండ' మంత్రాలనీ, రెండక్షరాలు కలవి 'కర్తరి' అనీ, మూడు నుండి తొమ్మిది అక్షరాలు కలవి   'విధి బీజముల'నీ, 10 నుండి 20 అక్షరాల వరకు కలవి మంత్రములనీ, 21 నుండి ఎన్ని అక్షరాలున్నా మాలామంత్రములనీ వ్యవహరింపబడుతాయి. ఆ కారణం చేతనే ఇది మాలా మంత్రం!
15 అక్షరాల #పంచదశీ (శ్రీ)విద్యను ఆధారం చేసుకుని 15 విధాల మాలా మంత్రాలు ఏర్పడ్డాయి. అవి: #శుద్ధశక్తిమాల, నమోంత శక్తిమాల, స్వాహాంత శక్తిమాల. తర్పణాంత శక్తిమాల, జయాంత శక్తిమాల, శుద్ధ శివ సంబుద్ధ్యంతమాల, నమోంత శివమాల, స్వాహాంత శివమాల, తర్పణాంత శివమాల, జయాంత శివమాల, శుద్ధమిధున మాల, నమోంత మిధునమాల, స్వాహాంత మిధునమాల, తర్పణాంత మిధునమాల, జయాంత మిధునమాల.
ఇందులో ప్రసిద్ధంగా లభిస్తున్నది 'శుద్ధశక్తిమాల'. దీనిని 'ప్రకృతిమాల' అని కూడా అంటారు. ఈ మాలా మంత్రాలను వివిధ ప్రక్రియలతో ఉపాసించి కొన్ని సిద్ధులను పొందవచ్చు. పై చెప్పిన 15 విధాల మాలామంత్రాలకు 15 సిద్ధులున్నాయి. అందులో మొదటిది 'ఖడ్గసిద్ధి'. తరువాత చెప్పబడిన పదునాలుగు : పాదుకాయుగ్మ సిద్ధి, అంజన సిద్ధి, బిల సిద్ధి, వాక్సిద్ధి, దేహ సిద్ధి, లోహ సిద్ధి, అణిమాద్యష్ట సిద్ధి, వశీ కరణ సిద్ధి, ఆకర్షణ సిద్ధి, సమ్మోహన సిద్ధి, స్తంభన సిద్ధి, చతుర్వర్గ సిద్ధి, ఐహికాముష్మిక సిద్ధి, భోగ మోక్ష సిద్ధి.
ఒక్కొక్క సిద్ధి కోసం ఈ మాలా మంత్రాలను వివిధ (15) విధాల వినియోగిస్తారు. 'ఖడ్గాది' 15 సిద్ధుల నిచ్చే మాలా మంత్రము కనుక ఇది 'ఖడ్గమాల' అని లోకంలో ప్రసిద్ధి పొందింది.
' తాదృశం ఖడ్గమాప్నోతి యేన హస్త స్థితేనవై।
 అష్టాదశ మహాద్వీప సమ్రాద్భక్తా ( సమ్రాడ్భోక్తా)       భవిష్యతి ll ' - అని ప్రస్తుత లభ్య గ్రంథాలలో ఉంది.
కానీ ఈ శుద్ధశక్తిమాలను 14వ దైన ఐహికాముష్మిక సిద్ధి కోసం వినియోగించడమే మంచిదని విజ్ఞుల అభిప్రాయం. దానికి సంబంధించిన శ్లోకం :
  అలౌకికం లౌకికం చేత్యానంద ద్వితయం సదా|
 సులభం పరమేశాని త్వత్పాదౌ భజతాం నృణామ్| శుద్ధశక్తిమాలను నిష్కామంతో జపించితే సర్వ (15) సిద్ధులూ లభిస్తాయని శాస్త్ర వచనం. సర్వసిద్ధులలో మొదటిది 'ఖడ్గసిద్ధి' కనుక - దానిని మొదలుకొని మిగిలిన సిద్దులను ఇచ్చే శుద్ధశక్తి మాలామంత్రాన్ని 'ఖడ్గమాల'గా వ్యవహరిస్తున్నాం.🙏🙏

ఆహారంలో ఐదు విధాలైన దోషాలు

*ఆహారంలో ఐదు విధాలైన దోషాలు*


*మనం తీసుకునే ఆహారంలో ఐదు విధాలైన దోషాలు యిమిడివున్నాయి...*

1.  *అర్ధ దోషం*
2.  *నిమిత్త దోషం*         
3.  *స్ధాన దోషం*
4.  *గుణ దోషం*   
5.  *సంస్కార దోషం*.

*ఈ ఐదు దోషాలను గుర్తించి స్వీకరించకపోతే ఎన్నో అనర్ధాలు కలుగుతాయని పెద్దలు చెపుతారు* 

*అర్ధ దోషం*

*ఒక సాధువు  తన శిష్యుని ఇంటికి భోజనానికి వెళ్ళాడు. భోజనం చేస్తున్నప్పుడు ఎవరో  ఒక వ్యక్తి  వచ్చి ఆ శిష్యునికి  ధనంతో వున్న మూటని ఇవ్వడం చూశాడు*

*భోజనం చేసి, సాధువు ఒక గదిలో విశ్రాంతి తీసుకోసాగాడు. ఆ గదిలోనే  శిష్యుడు ఉంచిన డబ్బు మూట వుంది*. 

*హఠాత్తుగా సాథువు మనసులో ఒక దుర్భుధ్ధి కలిగింది, ఆ మూటలో నుండి కొంత డబ్బును తీసుకుని తన సంచీలో దాచేశాడు.*

*తరువాత శిష్యుని వద్ద సెలవు తీసుకుని, తిరిగి తన ఆశ్రమానికివెళ్ళి పోయాడు. మరునాడు పూజా సమయంలో తను చేసిన పనికి సిగ్గుతో పశ్చాత్తాపం చెందాడా సాధువు*  

*తను శిష్యుని ఇంట్లో చేసిన దోషభూయిష్టమైన భోజనం వల్లనే తనకా దుర్బుధ్ధి కలిగిందని రాత్రి ఆహారం జీర్ణమయి, ప్రొద్దుననే  మలంగా విసర్జించబడిన తర్వాత మనసు నిర్మలమై పరిశుధ్ధమైనట్టు అర్థం చేసుకున్నాడు*

*వెంటనే  తాను తస్కరించిన డబ్బును తీసుకొని శిష్యుని ఇంటికి వెళ్ళి జరిగినదంతా చెప్పి, ఆ డబ్బును  తిరిగి ఇచ్చేశాడు. తర్వాత శిష్యుడిని ఎలాంటి వృత్తి ద్వారా డబ్బు సంపాదిస్తున్నావని అడిగాడు*. 

*శిష్యుడు తలవంచుకొని, "నన్ను క్షమించండి, స్వామి! యిది సన్మార్గంలో వచ్చిన డబ్బు కాదు." అని తలవంచుకొన్నాడు*.

*ఈ విధంగా సన్మార్గంలో సంపాదించని డబ్బుతో కొన్న పదార్థాలతో, తయారు చేసిన ఆహారం భుజించడమే అర్ధదోషం. మనం న్యాయంగా సంపాదించిన దానితోనే ఆహారం తయారు చేసుకుని, భుజించడం ముఖ్యం* 

*నిమిత్త దోషం*

*మనం తినే ఆహారాన్ని  వండేవారు కూడా మంచి మనసు కలవారై వుండి, సత్యశీలత కలిగి దయ, ప్రేమ కల మంచి స్వభావము కలిగినవారై ఉండాలి*

*వండిన ఆహారాన్ని క్రిమికీటకాలు, పక్షులు జంతువులు తాక కూడదు. ఆహారం మీద దుమ్ము, శిరోజాలు  వంటివి పడ కూడదు*.

*అపరిశుభ్రమైన ఆహారం మనసుకి అసహ్యత కలిగిస్తుంది. దుష్టులైన వారి చేతి వంట భుజిస్తే వారి దుష్ట గుణాలు అవతలివారికి అబ్బుతాయి*

*భీష్మాచార్యుల వారు కురుక్షేత్ర యుధ్ధంలో బాణాలతో  కొట్టబడి, యుధ్ధం ముగిసేవరకు అంపశయ్య పై ప్రాణాలతోనే  వున్నాడు. ఆయన చుట్టూ పాండవులు, ద్రౌపది శ్రీ కృష్ణుడు వున్నారు. వారికి భీష్ముడు మంచి మంచి  విషయాలను  బోధిస్తూ వచ్చాడు*

*అప్పుడు ద్రౌపది కి ఒక అనుమానం కలిగింది. ఇప్పుడు ఇంత వివేకంగా ఆలోచిస్తు మాట్లాడే భీష్ముడు ఆనాడు దర్యోధనుడు నా వస్త్రాలు ఊడ్చమని దుశ్శాసనునికి ఆదేశించినప్పుడు ఎందుకు ఎదిరించి మాటాడలేక పోయాడు? అని అనుకొన్నది*

*ఆమె మనసులో ఆలోచనలు గ్రహించిన భీష్ముడు*
*'అమ్మా ! నేను అప్పుడు దుర్యోధనుని, ప్రాపకంలో వారిచ్చిన ఆహారం భుజిస్తూ వచ్చాను*. 

*నా స్వీయ బుధ్ధిని ఆ *ఆహారం తుడిచి పెట్టింది. *శరాఘాతములతో, ఛిద్రమైన దేహంతో, ఇన్ని రోజులు ఆహారం తీసుకోనందున, పాత రక్తం - బిందువులుగా బయటికి పోయి నేను ఇప్పుడు *పవిత్రుడినైనాను*

*నా బుద్ధి వికసించి, మీకు మంచి మాటలు చెప్పగలుగుతున్నాను అన్నాడు భీష్ముడు*

*చెడ్డ గుణములు వున్న వారు ఇచ్చిన ఆహారం తినినందు వలన మనిషిలోని మంచి గుణములు నశించి* *'నిమిత్త దోషం'* *ఏర్పడుతోంది*

*స్ధాన దోషం*

*ఏ స్ధలంలో ఆహారం వండబడుతున్నదో, అక్కడ మంచి ప్రకంపనలు వుండాలి. వంట చేసే సమయంలో అనవసరమైన చర్చలు, వివాదాల వలన చేయబడిన వంటకూడా పాడైపోతుంది*

*యుధ్ధరంగానికి, కోర్టులు, రచ్చబండలు వున్న చోట్లలో వండిన వంటలు అంత మంచివి కావు*.

*దుర్యోధనుడు  ఒకసారి యాభైఆరు రకాల వంటలు వండించి శ్రీ కృష్ణుని  విందు భోజనానికి పిలిచాడు. కాని కృష్ణుడు దుర్యోధనుని పిలుపును నిరాకరించి విదురుని యింటికి భోజనానికి వెళ్ళాడు. కృష్ణుని చూడగానే విదురుని భార్య సంతోషంగా ఆహ్వానించి ఉపచారాలు చేసింది.  తినడానికి ఏమిటి పెట్టడం అని యోచించి,  ఆనంద సంభ్రమాలతో తొందర పాటు పడి, అరటి పండు తొక్కవలిచి, పండు యివ్వడానికి బదులుగా తొక్కని అందించింది. కృష్ణుడు దానినే  తీసుకొని  ఆనందంతో భుజించాడు. ఇది చూసిన విదురుడు భార్యవైపు కోపంగా చూశాడు. అప్పుడు కృష్ణుడు, "విదురా! నేను ఆప్యాయతతో  కూడిన ప్రేమకోసమే ఎదురు చూస్తున్నాను. నిజమైన శ్రద్ధా భక్తులతో యిచ్చిన ఫలమో, పుష్పమో, తోయమో, జలమో, ఏదైనా సంతోషంగా తీసుకుంటాను అని అన్నాడు*

*మనం ఆహారం వడ్డించినప్పుడు, ప్రేమతో వడ్డించాలి*

*గుణ దోషం*

*మనం వండే ఆహారం సాత్విక ఆహారంగా వుండాలి. సాత్విక ఆహారం, ఆధ్యాత్మికాభివృధ్ధిని కలిగిస్తుంది. రజోగుణం కలిగించే ఆహారం మనిషిని  లౌకిక మాయలో పడేస్తుంది. స్వార్ధాన్ని పెంచుతుంది*

*సంస్కారదోషం*

*ఆహారం వండే వారి సంస్కారం బట్టి దోషం ఏర్పడుతుంది. సంస్కారవంతుల చేతి వంట ఆరోగ్యాన్ని ఇస్తే సంస్కారహీనుల చేతి వంట లేని పోని రోగాల్ని తెచ్చి పెడుతుంది*

Sunday, September 3, 2023

నిత్యజీవితంలో పాటించవలసిన నూరు నియమాలు

నిత్యజీవితంలో పాటించవలసిన నూరు నియమాలు


1. తల్లిదండ్రులను పూజించాలి. ఏ స్థితిలోనూ దూషించరాదు.

2. మంత్రోపదేశం చేసినవారు మాత్రమే గురువు. (తక్కిన విద్యలు నేర్పినవారు అధ్యాపకులు మాత్రమే) అట్టి గురువును ఏ పరిస్థితిలోనూ నిందించరాదు. ఆయన ఎదురుగా కాళ్ళుచూపి కూర్చోరాదు.

3. భోజనం తూర్పు, ఉత్తర దిక్కులవైపు కూర్చొని చేయాలి. 
4. నడుస్తూ కాని, నిలబడి కాని మలమూత్రాదులు విడువరాదు. 
5. బట్టలు ధరించకుండా నదులలో స్నానం చేయరాదు. 
6. దేవాలయాల్లోనూ, గోశాలలోను మలమూత్రాదులు విడువరాదు. 
7. మలమూత్ర విసర్జన ఉత్తర, దక్షిణ దిశలుగా మాత్రమే చేయాలి. 
8. తూర్పు, దక్షిణ దిక్కుల తల పెట్టి నిద్రపోవాలి, ఉత్తర, పశ్చిమాల వైపు తల పెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలౌతారని మార్కండేయ పురాణం చెబుతుంది. 

9. ఇంటికి గురువు వస్తే టక్కున లేచి నిలబడి ఎదురుగావెళ్ళి లోపలికి గౌరవంగా తీసుకొని వచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టకుండా మాట్లాడరాదు. సాగనంపేటపుడు బయటకు వచ్చి గురువుని కొంచెం దూరం అనుసరించాలి. 

10. పైన అనగా భుజాలమీదుగా వస్త్రం లేకుండా దైవపూజ చేయరాదు, భోజనం చేయకూడదు. 
11. రెండు చేతులతో ఎప్పుడూ తల గోక్కోరాదు. 
12. గురుపాపం ఎవరికీ చెప్పరాదు. గురువునకు కోపం వస్తే తక్షణం ప్రసన్నం చేసుకోవాలి. 
13. ఇతరుల చెప్పులు, వస్త్రాలు ధరించకూడదు. 
14. చతుర్దశి, అష్టమి దినాలలో తలంటు పనికిరాదు. స్త్రీ సంగమం పనికిరాదు. 
15. అన్నము తిన్నాక కంచంలో చేయి కడుక్కోరాదు. చేయి కడిగిన తరువాత ఆ చేతిని విదల్చరాదు.

16. గురువు కోరితే ఏదైనా ఇమ్మని శాస్త్ర వచనం. అటువంటి గురువును ఏ పరిస్థితిలోను అసహ్యించుకొనరాదు. 10వేల యజ్ఞాల ఫలితం కూడా ఈ ఒక్క కార్యంతో నశించిపోతుంది. కనుక గురుధిక్కారం పనికిరాదు. 

17. పిసినిగొట్టుతో, శత్రువుతో, అసత్యం పలికే వాడితో భర్తను తిట్టే స్త్రీతో కలిసి భోజనం చేయటం మహాపాపం. 
18. స్నానం చేయకుండా అన్నం వండరాదు. ఆ అన్నం తినరాదు. 
19. నోటితో అగ్నిని ఆర్పరాదు, ఊదరాదు. 
20. పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు. అటువంటి వారిని నిందించరాదు. 
21. పుణ్య కార్యాల్లో చోళ్ళు, జొన్నలు, వెల్లుల్లి, ఉల్లి, చద్ది పదార్థాలు తినరాదు, ఉపయోగించరాదు. 
22. ప్రయాణం మధ్యలో భోజనాదులకు నియమంలేదు. 
23. తడిసిన బట్టల నీళ్ళు ఇతరులపై పడేట్లు విదిలించరాదు. 

24. ఎట్టి పరిస్థితులలోను ఆత్మహత్య చేసుకోరాదు. అలా చేసుకున్నవారు కొన్ని వేల జన్మలు పిశాచ జన్మలెత్తి వికలాంగులై పుడతారు. 

25. తెలిసినవారి మరణ వార్త విన్న వెంటనే గాని, పురిటి వార్త విన్న వెంటనే గాని కట్టుబట్టలతో స్నానం చేయాలి. 
26. పుష్కర స్నానాదులలో చొక్కాతో స్నానం చేయరాదు. కండువా మాత్రమే ఉండవలెను. 

27. ఏకాదశి నాడు ఎన్ని అన్నంమెతుకులు తింటే అన్ని పురుగులు తిన్నట్లు లెక్క అని శాస్త్ర వచనం. కావున అన్నం భిన్నం చేసుకొని తినాలి. ఒక్క నిర్జలైకాదశి అనగా జేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు మాత్రం ఫలహారం కూడా పనికి రాదు. 
60 సం.లు దాటిన వారికి, 11 సం.లు లోపు వారికి ఈ నియమం వర్తించదు. అనారోగ్య వంతులకు ఈ పై నియమాలు లేవు. 

28. కూర్చొని తొడలు, కాళ్ళు ఊపరాదు. అలా ఊపినవాడు వచ్చే జన్మలో కుంటివాడై పుడతాడు. 
29. తూర్పు, ఉత్తరముఖంగా దంతధావనం చేయాలి. పడమర, దక్షిణ దిక్కుగా నిలబడి చేయకూడదు. 
30. ఉమ్ము మాత్రం తూర్పు, పడమరగా వేయరాదు. 
31. శివపూజకు మొగలిపువ్వు పనికిరాదు. 
32. ఒకేసారి నీరు, నిప్పు రెండు చేతులతో గాని, ఒకే చేత్తోగాని పట్టుకెళ్ళరాదు. 

33. నిద్రపోతున్న వారిని అనవసరంగా లేపుట, పురాణ కథలు జరుగుతున్నపుడు విఘ్నం కలుగ చేయుట, భార్యాభర్తలను విడదీయుట, తల్లిని బిడ్డను విడదీయుట బ్రహ్మహత్యాపాతకాలతో సమానం. (వేళాపాళ లేకుండా నిద్రించేవారి విషయంలో వర్తించదు. 

34. చిన్న పిల్లల్ని చూడ్డానికి వెళ్ళేటప్పుడు, అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు, గురుదర్శనానికి వెళ్ళేటప్పుడు, పురాణం వినటానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరాదు. ఏదో ఒకటి సమర్పించుకోవాలి. 

35. ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు. ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు. 
36. పురాణాలు దానం చేస్తే గొప్ప విద్యావేత్తలు అవుతారు. 
37. గొడుగు, చెప్పులు కలిపి కాని, గోవును గాని దానం చేస్తే భయంకర యమమార్గం సులభంగా దాటగలరు. 
38. అన్నదానం, జలదానం చేసేవారు సుఖమైన మరణం పొందుతారు. 
39. సువర్ణదానం చేసేవారు ఐశ్వర్యవంతుల ఇళ్ళలో పుడతారు. 
40. కాశీలో గురుపూజ చేసిన వారిని కైలాసవాస సౌఖ్యం లభిస్తుంది. 
41. ఒకరి బట్టలు మరొకరు కట్టరాదు. ఒకరు తీసివేసిన జందెం మరొకరు ధరించరాదు. 
42. సంకల్పం చెప్పకుండా నదీస్నానం పనికిరాదు. ఒకవేళ చేస్తే ఇంటిలో స్నానం చేసినట్లే. నదీస్నాన ఫలితంరాదు. 43. ఉమ్మితో వెళ్ళు తడిపి పుస్తకంలో పుటలు తిప్పరాదు. 
44. వ్యసనపరులతో, మూర్ఖులతో వాదోపవాదనలు చేయరాదు. 
45. విష్ణు ఆలయంలో 4 ప్రదిక్షిణలు, అమ్మవారి గుడిలోనూ శివాలయంలోనూ 3 ప్రదక్షిణలు చేయాలి. 

46. ఆలయంలో ఆత్మప్రదిక్షిణ అనునపుడు తన చుట్టూ తాను తిరగరాదు. నమస్కారం చేస్తే చాలు, గుడి చుట్టూ ప్రదిక్షిణం మాత్రమే చేయాలి. 

47. నవగ్రహ ప్రదక్షిణ, పూజానంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించవచ్చు. 

48. శివాలయంలో కొబ్బరికాయ కొట్టిన తరువాత ఒక చిప్పను మనకిచ్చినా దానిని తీసుకోరాదు. జ్యోతిర్లింగాలు, స్వయంభూలింగాలు, బాణాలింగాలు అయితే మాత్రం ప్రసాదం స్వీకరించవచ్చు. 

49. సంధ్యా సమయంలో నిద్ర, తిండి, మైధునం పనికిరాదు. 

50. బహిష్టు కాలంలో పొయ్యి వెలిగించినా, అన్నం వంటివి వండినా పిల్లల వల్ల దుఃఖాల పాలౌతారు. కనుక అవి పనికిరావు. 

51. చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయుట, ఒట్టు పెట్టుట దోషం. 

52. నిలబడికాని, అటూఇటూ తిరుగుతూ కాని అన్నం తినటం వల్ల క్రమంగా దరిద్రుడౌతాడు. రాబోయే జన్మలో బిచ్చగాడు అవుతాడు. 

53. నోట్లో వ్రేళ్ళు పెట్టుకొనుట, గోళ్ళుకొరుకుట చేయరాదు. 
54. దేవాలయ ప్రాంగణంలో ఉమ్మడం, పొగత్రాగటం రెండూ నిషిద్దాలే.
55. ఆదివారం, శుక్రవారం, మంగళవారం తులసిఆకులు కోయరాదు. 
56. చీకటి పడ్డాక పువ్వులు, ఆకులు చెట్లనుండి త్రుంచరాదు. 
57. గురువుద్వారా మంత్రోపదేశం పొందనివాడు ఎప్పటికీ తరించలేడు. కనుక ఉపదేశం పొందితీరాలి.

58. చెట్లు, దేవతా విగ్రహాలు ఈశాన్యంలో ఉంటే వాటిని బరువులుగా భావించి తీసివేసేవారు, తీసివేయమని సలహా ఇచ్చేవారు ఏడు జన్మలు ఉబ్బసపు రోగులుగా పుడతారు. ఈ పనులు చేయుట దైవద్రోహం కనుక చేయరాదు. 

59. గురువులకు, అర్చకులకు, పౌరాణికులకు సరిగా పారితోషంఇవ్వక, వారికి ఋణపడేవారు నూరుజన్మలు కుక్కలుగా, చండాలురుగా పుట్టి కష్టనష్టాల పాలవుతారు. 

60. శివలింగార్చన ఆడువారు కూడా చేయవచ్చు. 

61. ఇంట్లో విగ్రహాలుంటే ఏమీ ప్రమాదం లేదు. పరులకు అపకారం కోరి పూజ చేసేవారికి మాత్రమే నియమాలు. తక్కిన వారికి పూజా విషయాలలో పెద్ద పెద్ద నియమాలు లేవు. 

62. నిద్రనుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి వామన నామస్మరణ చేయాలి.
63. పాచి ముఖంతో అద్దం చూసుకొనరాదు. 
64. హారతి ఇచ్చాక దేవునిపై నీరు చల్లాలి. హారతి ఇచ్చే పాత్రపై కాదు. 
65. తీర్థం తీసుకున్నాక, ఆ చేతిని కడుక్కోవాలి తప్ప, అరచేతిని తలపై రాసుకొనరాదు. 

66. స్నానం చేశాక శరీరం తుడుచుకొని తడి-పొడి తువ్వాలు కట్టుకొని పూజ చేయరాదు. పూజా మందిరంలో ప్రవేశించరాదు. పూర్తిగా ఆ తుండును తడిపి నీరు పిండి మాత్రమే కట్టుకోవాలి. లేదా వేరే శుభ్రమైన వస్త్రాలు పూజకు ధరించాలి. 

67. ఉపవాసం ఉన్నపుడు, జాగరణ చేసినపుడు పరులదోషాలు తలుచుకోరాదు. 
68. శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు. కొంచెం దూరం ఉంచాలి. 
69. తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు, గురువులకు పెట్టరాదు. సాధ్యమైనంత జాగ్రత్త వహించాలి. పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే ఆ అన్నం తీసివేసి మళ్ళీ వడ్డించి నేయి వేయాలి. 

70. అన్నం తింటున్న వారెవరినీ తిట్టరాదు, దెప్పి పొడవరాదు.

71. నిజం తెలుసుకోకుండా ఎవరినీ నిందించరాదు, అభాండాలు వేయరాదు. అలా చేస్తే అవతలి వారి పాపాలన్నీ అభాండాలు వేసిన వారి తలకు చుట్టుకుంటాయి. 

72. ఇస్తానని వాగ్దానం చేసి దానమివ్వనివాడు వందజన్మలు దరిద్రుడై పుడతాడు, వాగ్బంగం చాలా దోషం. 

73. అన్నం తినేటప్పుడు కంచానికి బాగా దగ్గరగా కూరలు, మజ్జిగ మున్నగునవి ఉన్నపాత్రలు పెట్టరాదు. మనం తినేటప్పుడు ఎంగిలి ఆ పాత్రలలో పడితే ఆ పదార్థాన్ని మరొకరికి వడ్డిస్తే, వాడికి "యముడు" మల ముత్రాదులు ఆహారంగా ఇస్తాడు. 

74. తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి. దీనిని కాయిక తపస్సు అంటారు.

75. గురువునకు ఉపదేశ సమయాలలో కాని, పురాణాదులు వినేటప్పుడు కాని పాదాలు ఒత్తితే 7 జన్మల పాపాలు తొలుగుతాయి. 

76. గురువుగారి బట్టలు ఉతికి ఆరవేసిన వారికి 3 జన్మల పాపాలు తొలగుతాయి. 

77. మంత్రోపదేశం చేసిన గురుని ఆజ్ఞ పాటించేవారికి ఏ పాపమూ అంటదు. పునర్జన్మ ఉండదు. (ఇది తప్పక పాటించవలసిన ముఖ్య పవిత్ర నియమము. దీనికి సాటి మరొకటి లేదు). పరాశర సంహితలో ఈ విషయాలున్నాయి. 

78. అష్టమి, పూర్ణిమ, చతుర్థశి కాలలో స్వయంపాకం దానం చేస్తే అన్నపానాలకు ఏనాడు లోటుండదు. 
79. ఎక్కువ వేడిగా, ఎక్కువ చల్లగా ఉండే పదార్థాలు స్వీకరించరాదు. 
80. భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరవేయకుండా వాటితో దైవపూజ చేయరాదు.

81. శవాన్ని స్మశానం దాకా మోసినా, శవాన్ని ఇంటి దగ్గర ఉండటానికి అనుమతినిచ్చినా నరకానికి పోకుండా స్వర్గానికి పోతాము. 

82. గృహప్రవేశ కాలంలో గాని, ఏడాదిలోపు గాని ఆ ఇంట మణిద్వీప పరాయణం చేయడం మంచిది. ఇది వాస్తుదోషాలను పరిహరిస్తుంది.

83. భోజనానికి ముందు, అనంతరం కూడా కాళ్ళు కడుక్కోవాలి. 
84. సకల పురాణేతిహాస కోవిదుడు కాని వాని వద్ద మంత్రోపదేశం పొందరాదు. 

85. పుట్టిన రోజునాడు దీపాలు కానీ, కొవ్వొత్తులు కానీ ఆర్పరాదు. నోటితో అగ్నిని ఊదుట ఘోరపాపం. అటువంటివారు గ్రహణపు మొర్రితో మళ్ళీ జన్మమెత్తి దుఃఖాలు పొందుతారు. 

86. తలకి నూనె రాసుకొని ఆ చేతులతో పాదాలకు ఆ నూనెజిడ్డు పులమరాదు. 

87. శుక్ర, శనివారం వంటి వార నియమాలు పెట్టుకున్నవారు హోటలు టిఫిన్లు తినుటగానీ, ఆనాటి అల్పహారాదులలో ఉల్లి వాడుట కాని నిషేదము. ఇది ప్రయాణ మధ్యంలో ఉన్న వారికి వర్తించదు. 

88. చీటికి, మాటికి యజ్ఞోపవీతం తీసి పక్కనపెట్టడం, తాళి తీసేస్తుండటం రెండూ భయంకర దోషాలే. 

89. క్రూరుడు, దుష్టుడు కాని మగనితో తాళికట్టించుకొన్న భార్య, కాపురం చేయక ఏడిపించటం, చెప్పిన మాట వినకపోవటం, తాళి తీసి భర్త చేతిలో పెట్టడం చేయరాదు. ఇలా చేసిన స్త్రీలకి వంద జన్మలలో వైధవ్యం కానీ, అసలు పెళ్లి కాకపోవడం జరుగుతుంది. 

90. దీపాలు పెట్టేవేళ తలదువ్వుకోరాదు. ఇలా చేసిన స్త్రీలకి వందల జన్మలలో వైధవ్యం కాని, అసలు పెళ్లి జరగకపోవడం వంటివి జరుగుతాయి. 

91. దిగంబరంగా నిద్రపోరాదు. 
92. కలియుగంలో ఆలయంలో జంతువధ నిషేధం. 
93. విజయదశమి, శివరాత్రి దినాలలో మాంసాహారం, ఉల్లి పనికిరాదు. 

94. ఆచమనం చేసిన నీటిని దైవనివేదనలకు, అర్చనలకు వాడరాదు, కనుక వేరొక పాత్రలో శుద్ధ జలాన్ని ఈ కార్యాలకు వినియోగించుకోడానికి తెచ్చుకోవాలి. 

95. దీపారాధనకు అగ్గిపెట్టె వాడకూడదని ఏ శాస్త్రాలు చెప్పలేదు. కనుక అగ్గిపెట్టెతో దీపం వెలిగించుకోవచ్చు. 
96. దీపారాధనకు ఒక కుంది మాత్రమే వాడినపుడు మూడు వత్తులు వేయాలి. 

97. కొబ్బరికాయ కొట్టాక వెనుకవైపు పీచు తీయాలనే నియమం కూడా తప్పనిసరి కాదు. శుభ్రత కోసం పీచు తీయవచ్చు, తీయకపోతే దోషం లేదు. 

98. కొబ్బరికాయను నీళ్ళతో కడిగి కొట్టడం చాలా తప్పు, కొబ్బరికాయను పీచు ఒలిచివేశాక నీళ్ళతో కడగరాదు. 
99. మాడిన అన్నం, అడుగంటిన పాయసం, కంపు వచ్చే నేయి ఇటువంటివి నైవేద్యానికి పనికిరావు. 

100. ఆలయ ప్రాంగణంలో అర్చకునిపై కేకలు వేయరాదు. అర్చకునిలో దోషం ఉంటే బయటకు పిలిచి మందలించాలి, లేదా మరింత దుష్టుడైన అర్చకునినైతే మూడు మాసాల జీతమిచ్చి ఆ పదవినుంచి తొలగించి వేయాలి.

గ్రామార్వణం

గ్రామార్వణం


ఒక వ్వక్తి ఒక గ్రామం నుండి మరి యొక గ్రామానికి వలస వెళ్ళి ఆ గ్రామం తనకు నివాసయోగ్యమైనదా... కాదా అని విచారించి ఎన్నుకొనే విధానం గ్రామార్వణం అంటారు. మనం పుట్టిన ఊరు, మన తల్లిదండ్రుల దగ్గర పెరిగినప్పటి ఊరు విషయంలో గ్రామార్వణం చూడనవసరం లేదు. ఉద్యోగరీత్యా మార్పులు తీసుకునే ఊళ్ల విషయంగా గ్రామార్వణం చూడనవసరం లేదు. వ్యాపార విషయంగాను మరియు రిటైర్మెంట్ లైఫ్ గడిపేందుకు వెళ్లే ఊరు విషయంలోను గ్రామార్వణం చూసుకోవడం శ్రేయస్కరం. ఎవరి మీద అయినా ఆధారపడి జీవనం చేయువారికి గ్రామార్వణం అవసరం లేదు.అర్వణము అంటే అచ్చి రావటం. గ్రామాలు, నగరాలు, స్థలాలు, క్షేత్రాలు కొన్ని కొందరికి అచ్చి వస్తాయి. కొందరికి అచ్చిరావు. ఒకరికి పని చేసిన మందు మరొకరికి పని చేయకపోవచ్చు. ఒక్కొక్కప్పుడు హాని కూడా చేయవచ్చు.

ఈ అర్వణం చూసే విధానం ‘కాలామృతం’ జ్యోతిర్నిబంధం, వాస్తు ప్రదీపం, జ్యోతిర్విధాభరణం, ముహూర్త రత్నాకరం వంటి గ్రంథాలలో ఒక్కొక్క విధానం చెప్పబడింది.

వాస్తు శాస్తర్రీత్యా అర్వణం చూసేటప్పుడు, జన్మనక్షత్రం కాకుండా నామ నక్షత్రమే చూడాలని శాస్త్రంలో నిర్దేశించారు.

శ్లో.దేశే గ్రామే, గృహే,
యుద్ధే, సేవాయాం
వ్యావహారికే
నామరాశేః ప్రధానత్వం
జన్మరాశిఃన చింతయేల్ -అని శాస్త్ర ప్రమాణము.

దేశం గురించి,అనారోగ్య సమయాలలో,గ్రామం గురించి,గృహ ప్రవేశ విషయాలలో,సేవకుని స్వీకరించే విషయాలలో,దానం చేసేటప్పుడు నామరాశికి ప్రాదాన్యం ఇవ్వాలి.యాత్రలకు,వివాహ విషయాలలో జన్మ రాశి ప్రాదాన్యం పొందుతుంది.

కనుక నామరాశినే ప్రధానంగా భావించాలి. ఇంకా ఉత్తమమైనది ఇంటి పేరున అర్వణం చూసుకోవటం మరీ మంచిది. దానివలన వారసులందరికీ అది లాభించి, యోగించే అవకాశం ఉంటుంది. అకారాది వర్గ సిద్ధాంతంగా, ధన, రుణ, సంఖ్యలనే సిద్ధాంతంగా కాకిణుల సిద్ధాంతపరంగా ఎన్నేన్నో అర్వణం చూసే విధానాలున్నాయి. పండితులు వారివారి అనుభవాలను బట్టి అనుసరిస్తూ ఉంటారు.గ్రామార్వాణానికి సులభమైన మార్గం ద్వారా తెలుసుకుందాం.

నామ నక్షత్ర రాశికి రెండు, ఐదు, తొమ్మిది, పది, పదకొండు రాశులైన గ్రామ నక్షత్ర రాశులు చక్కగా అర్వణవౌతాయి.

గ్రామార్వాణం కట్టే మొదటి పద్దతి

రాజశేఖర్ అనే వ్యక్తికి హైదరాబాదు అర్వణం అవుతుందా?

రాజశేఖర్ పేరులోని మొదటి అక్షరం “రా” తులారాశిలోకి వస్తుంది.గ్రామం హైదారాబాద్ లోని మొదటి అక్షరం “హై” మిధున రాశిలోకి వస్తుంది.పై పట్టికలో చూపిన విధంగా తులారాశి నామరాశికి గ్రామ రాశి మిధున రాశికి సుఖాన్ని కలిగిస్తుంది.తులారాశికి మిధునరాశి తొమ్మిదవ రాశి అవుతుంది కాబట్టి రాజశేఖర్ అనే వ్యక్తికి హైదరాబాద్ అర్వణమవుతుంది. ‘అధికస్య అధికం ఫలం’ అన్నట్టుగా నక్షత్ర రీత్యా కూడా అర్వణమైతే ఇంకా బాగుంటుందని సంపత్ , క్షేమ, సాధన, మిత్ర, పరమ మైత్ర తారలయితే ఇంకా బావుంటుందని చెప్పే పండితులూ ఉన్నారు.

Friday, September 1, 2023

దశ_మహా_విద్యలు_వాటి_ఫలితాలు

దశ_మహా_విద్యలు_వాటి_ఫలితాలు



1. తొలి మహా విద్య శ్రీకాళీదేవి

కృష్ణ వర్ణంతో ప్రకాశించే శ్రీకాళీదేవి దశమహావిద్యలలో మొదటి మహావిద్య. ఆశ్వయుజమాసం కృష్ణపక్ష అష్టమీ తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైనది. శ్రీకాళీదేవి ఉపాసన ఎంతో ఉత్కృష్టమైనదిగా శాక్రేయసంప్రదాయం చెబుతోంది. తంత్రోక్త మార్గంలో శ్రీకాళీ మహా విద్యని ఆరాధిస్తే సకల వ్యాధుల నుంచి, బాధల నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాదు శత్రు నాశనం, దీర్షాయువు, సకలలోక పూజత్వం సాధకుడికి కలుగుతుంది.

2వ మహావిద్య శ్రీతారాదేవి

దశ మహావిద్యలలో రెండవ మహా విద్య శ్రీతారాదేవి. నీలవర్ణంతో భాసించే ఈ దేవికి చైత్రమాసం శుక్లపక్ష నవమి తిథి ప్రీతిపాత్రమైంది. శ్రీతారాదేవి వాక్కుకి అధిదేవత. ఈ దేవిని నీలసరస్వతి అని కూడా పిలుస్తారు. తారాదేవి సాధనవల్ల శత్రునాశనం, దివ్యజ్ఞానం, వాక్సిద్ధి, ఐశ్వర్యం, కష్టనివారణ సాధకుడికి లభిస్తుంది.

3వ మహా విద్య శ్రీషోడశీదేవి

అరుణారుణ వర్ణంతో ప్రకాశించే శ్రీషోడశీదేవి దశమహావిద్యలలో 3వ మహావిద్యగా ప్రసిద్ధిపొందింది. పరమ శాంతి స్వరూపిణి అయిన ఈ దేవికి మార్గశిరమాస పూర్ణిమాతిథి ప్రీతిపాత్రమైనది. ఈ తల్లినే లలిత అని, రాజరాజేశ్వరి అని, మహాత్రిపురసుందరి అని అంటారు. ఎంతో మహిమాన్వితమైన ఈ మహావిద్యని ఉపాసిస్తే ఆసాధకుడికి అన్నిరకాల కష్టనష్టాలనుంచి విముక్తి మానసికశాంతి, భోగం, మోక్షం కలుగుతాయి.

4వ మహావిద్య శ్రీ భువనేశ్వరీదేవి

దశ మహావిద్యలలో 4వ మహావిద్య శ్రీ భువనేశ్వరీదేవి. ఉదయించే సూర్యుడిలాంటి కాంతితో ప్రకాశించే ఈ దేవికి భాద్రపద శుక్లపక్ష అష్టమీ తిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవి సంపూర్ణ సౌమ్యస్వరూపిణి. ఈ దేవిని ఉపాసించే సాధకుడికి మూడో కన్ను తెరుచుకుంటుంది. భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకునే శక్తి లభిస్తుంది. అంతేకాదు, రాజ్యధికారాన్ని సమస్త సిద్దుల్ని సకల సుఖభోగాల్ని ఈదేవి అనుగ్రహంతో సాధకులు పొందవచ్చు.

5వ మహావిద్య శ్రీ త్రిపుర భైరవీ దేవి

దశమహావిద్యలలో 5వ మహా విద్య వేల సూర్యుల కాంతితో ప్రకాశించే శ్రీ త్రిపుర భైరవీ దేవి. ఈ దివ్యశక్తి స్వరూపిణికి మాఘమాసం పూర్జిమాతిథి ప్రీతిపాత్రమైనది. ఆర్తత్రాణ పారాయణి అయిన ఈ మహావిద్యని ఆరాధిస్తే వివిధ సంకటాల నుంచి, బాధల నుంచి విముక్తి లభిస్తుంది. సకల సుఖభోగాలను పొందే శక్తి, సకల జనాకర్షణ, సర్వత్రా ఉత్కర్షప్రాప్తి సాధకుడికి కలుగుతుంది.

6వ మహావిద్య శ్రీ ఛిన్నమస్తాదేవి

దశ మహావిద్యలలో 6వ మహావిద్య శ్రీ ఛిన్నమస్తాదేవి. ఈ దేవినే వజ్ర వైరోచినీ, ప్రచండ చండీ అని కూడా పిలుస్తారు. వైశాఖ మాసం శుక్లపక్ష చతుర్థి తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైంది. శాక్తేయ సంప్రదాయంలో భిన్నమస్తాదేవికీ ఎంతో ప్రశస్తివుంది. ఈ దేవిని నిష్టతో ఉపాసిస్తే సరస్వతీసిద్ధి, శత్రువిజయం, రాజ్యప్రాప్తి, పూర్వజన్మ పాపాలనుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాదు, ఎటువంటి కార్యాలనైనా ఆవలీలగా సాధించే శక్తి ఈ దేవి ప్రసాదిస్తుంది.

7వ మహావిద్య శ్రీ ధూమవతీ దేవి

దశ మహావిద్యలలో 7వ మహావిద్య.. ధూమ వర్ణంతో దర్శనమిచ్చే శ్రీ ధూమవతి దేవికి చెందింది. జ్యేష్ఠమాసం శుక్లపక్ష అష్టమీతిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైంది. ఈ దేవతకి ఉచ్చాటనదేవత అని పేరు. తన ఉపాసకుల కష్టాల్ని, దరిద్రాల్ని ఉచ్చాటన చేసి అపారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ ధూమవతీదేవి ఆరాధనవల్ల సాధకుడికి వివిధ వ్యాధుల నుంచి, శోకాల నుంచి విముక్తి లభిస్తుంది.

8వ మహావిద్య శ్రీ జగళాముఖీ దేవి

దశమహావిద్యలలో 8వ మహావిద్య.. పసుపు వర్ణంతో ప్రకాశించే శ్రీ జగళాముఖీ దేవికి చెందింది. స్తంభన దేవతగా ప్రసిద్ధి పొందిన ఈ మహాదేవికి వైశాఖమాస శుక్లపక్ష అష్టమీతిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవతా ఉపాసన వల్ల సాధకుడికి శత్రువుల వాక్యని స్తంభింపచేసే శక్తి లభిస్తుంది. ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో, వాదప్రతివాద విషయాల్లో ఎదుటిపక్షం వారి మాటల్ని స్థంభింపచేసి వ్యవహార విజయాన్ని సాధకులకు ప్రసాదిస్తుంది.

9వ మహావిద్య శ్రీ మాతంగీదేవి

దశ మహావిద్యలలో తొమ్మిదవ మహావిద్య.. మరకతమ వర్ణంతో ప్రకాశించే శ్రీ మాతంగీదేవి కి చెందింది. వశీకరణ దేవతగా ప్రశస్తి పొందిన మాతంగీదేవికి వైశాఖమాసం శుక్లపక్ష తృతీయాతిథి ప్రీతిపాత్రమైనది. రాజమాతంగీ, లఘుశ్యామలా, ఉచ్చిష్టచండాలి, అనే పేర్లతో కూడా ఈ దేవిని పిలుస్తుంటారు. ఈ దివ్య స్వరూపిణి ఉసాసనవల్ల వాక్సిద్ధి, సకల రాజ స్త్రీ పురుష వశీకరణాశక్తి, ఐశ్వర్యప్రాప్తి సాధకుడికి లభిస్తాయి.

10వ మహావిద్య శ్రీ కమలాత్మికాదేవి

పద్మాసనాసీనయై స్వర్ణకాంతులతో ప్రకాశించే శ్రీ కమలాత్మికాదేవి దశ మహావిద్యలలో 10వ మహావిద్యగా ప్రశస్తిపొందింది. సకల ఐశ్వర్య ప్రదాయిని అయిన ఈదేవికి మార్గశిరే అమావాస్యతిథి ప్రీతిపాత్రమైనది. కమలాత్మిక లక్ష్మీస్వరూపిణి అని అర్థం. శాంత స్వరూపిణి అయిన ఈ మహావిద్యని ఉపాసిస్తే సకలవిధ సంపదల్ని పుత్రపౌత్రాభివృద్ధిని, సుఖసంతోషాల్ని సాధకుడికి శ్రీ కమలాత్మికాదేవి ప్రసాదిస్తుంది.

సేకరణ:-
     🌿#శుభమస్తు🌿

🙏 లోకాస్సమస్తా స్సుఖినో భవంతు🙏

🚩సర్వేజనాః సుఖినోభవంతు🚩

Wednesday, August 30, 2023

శ్రీచక్రార్చన అనగానేమీ??వాటి వివరణ🌹🌻

  శ్రీచక్రార్చన అనగానేమీ??వాటి వివరణ



 శ్రీమాత్రేనమ:  శ్రీచక్రానికి మించిన చక్రము ఈ సృష్టిలో ఏదీ లేదు. అందుకే అది “చక్రరాజము” అయినది. సమస్త దోషములను నివారించి సమస్త కోరికలను తీర్చి, సకల సౌభాగ్యాలు ఇచ్చే దివ్యమైన యంత్రము శ్రీచక్రం. శ్రీవిద్యోపాసన, శ్రీచక్రార్చన అందరికీ సులభసాధ్యమైన పని కాదు. అయిననూ పట్టుదలతో శ్రద్ధతో సాధించలేనిది ఏదీ లేదు ఈ లోకంలో.

మానవ దేహమే శ్రీచక్రము. సాధకుని దేహమే దేవాలయము. మానవ దేహము నవ రంద్రములతో కూడినది.


శ్రీచక్రము తొమ్మిది చక్రముల సమూహము. శరీరంలోని షట్చక్రాలకూ, శ్రీచక్రము లోని తొమ్మిది చక్రములకు అవినాభావ సంబధము కలదు.


శరీరంలోని తొమ్మిది ధాతువులకు ఇవి ప్రతీకలు. శ్రీచక్రము లోని తొమ్మిది చక్రములను తొమ్మిది ఆవరణములుగా చెప్పెదరు. 


అందుకే శ్రీచక్రమునకు నవావరణ పూజ చేయుదురు.


నాలుగు శివ చక్రములు, ఐదు శక్తి చక్రములు కలసి మొత్తం తొమ్మిది చక్రములతో శ్రీదేవి విరాజిల్లుతూ వుంటుంది.


తొమ్మిది చక్రములలో విడివిడిగా ఒక్కో దేవత వసిస్తూ వుంటుంది. చివరన బిందువులో కామకామేశ్వరులు నిలయమై వుంటారు.


శివ, శక్తి, చక్రములతో కలసి శివశక్తైక్య రూపిణి లలితాంబిక అయినది.


అర్ధనారీశ్వర తత్వమై, కామ కామేశ్వరుల నిలయమై, సృష్టికి ప్రతి రూపమై వెలుగొందినది ఈ శ్రీచక్రము.


సృష్టికి సూక్ష్మ రూపమే ఈ శ్రీచక్రము. శ్రీ దేవి నిలయమే ఈ శ్రీచక్రము. శ్రీచక్రమే శ్రీదేవి. శ్రీదేవియే శ్రీచక్రము.


శ్రీచక్రము 3 రకములుగా లోకంలో పూజింపబడుచున్నది. ౧. మేరు ప్రస్తారము ౨. కైలాస ప్రస్తారము ౩. భూ ప్రస్తారము.


సప్త కోటి మహా మంత్రములతో సర్వ దేవతా స్వరూపమైన శ్రీచక్రమును విప్పూజించిన యెడల, సర్వ శక్తులూ, జ్ఞానము, మోక్షము ప్రాప్తించునని


మన పూర్వీకులు, ఋషులు విప్వక్కాణించి యున్నారు.


శ్రీచక్రము యొక్క నాలుగు ద్వారాలు నాలుగు వేదాలకు ప్రతీకలు. ఆ ద్వారాలలో గనుక ప్రవేశించి నట్లైతే దేవీ సాక్షాత్కారం లభించినట్లే.


ఈ శ్రీవిద్యను మొదట్లో పరమేశ్వరుడు పరమేశ్వరికి ఉపదేశించెను. పరమేశ్వరుడు జగత్తునందు గల ప్రాణుల కామ్య సిద్దుల కొరకు చతుషష్టి (64) తంత్రములను సృష్టించెను.


కామేశ్వరీ దేవి కోరిక మేరకు చతుర్విధ పురుషార్ధములు ఒక్క మంత్ర తంత్రము వలన కలుగునట్లుగా శ్రీవిద్యా తంత్రమును, శ్రీచక్ర యంత్రమును ఆ పరమేశ్వరుని చే నిర్మింపబడినవి. శ్రీచక్రము అన్ని మంత్ర, యంత్ర, తంత్రములలో కెల్లా గొప్పదని, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు, పరమేశ్వరి యొక్క ప్రతి రూపమని చెప్పుదురు. కాబట్టి అధికారముకల వారికి శ్రీవిద్యా తంత్రము, మిగతా వారికి చతుషష్టి (64) తంత్రములు అని మన ఋషులు నిర్దేశించిరి. ఈ శ్రీవిద్యోపాసన వలన, శ్రీచక్రార్చన వలన ఈశ్వరానుగ్రహం చే ఆత్మ విచారణ యందు ఆసక్తి కలిగి, ఐహిక భోగముల యందు విరక్తి కలుగును. అందువలన బ్రహ్మ జ్ఞానము లభించును. అందుకే దీనిని బ్రహ్మవిద్య అని అన్నారు.


శ్రీవిద్యా మహా మంత్రములు అనునవి మోక్ష సాధనమగు మార్గములుగా చెప్పబడినవి.


ఆత్మ జ్ఞానము, బ్రహ్మ జ్ఞానము కావలయును అనేవారికి ఇవి నిర్దేశింపబడినవి.

  🌹శ్రీమాత్రే నమః🙏🌺  

శ్రీ కనకధారా స్తోత్రం

 శ్రీ కనకధారా స్తోత్రం



🌺శ్రీ శంకరాచార్యులచే రచించబడిన కనకధారా స్తోత్రమును ప్రతిరోజు, త్రికాలములందు పఠించువారు కుబేరునితో సమానుడగును

శ్రీ శంకర భవత్పాదులు ఒకరోజు భిక్షకు వెళ్ళినపుడు కడు బీదరాలైన ఒక అవ్వ స్వామికి భిక్ష ఇవ్వడానికి తనవద్దయేమిలేకపోయేసరికి బాధతో, ఇల్లంతా వెతికితే ఒక ఉసిరిగకాయ మాత్రమే ఆమెకి దొరికింది. స్వామి నా దగ్గర బిక్ష ఇవ్వడానికి ఈ ఉసిరి మాత్రమే ఉంది. అని గురువుకి సమర్పించింది. ఆమె భక్తికి ఆచార్యుల హృదయం ద్రవించి, ఆమె దారిద్ర్యాన్ని తొలగించడానికి లక్ష్మీదేవిని స్తుతించారు. లక్ష్మీదేవి ప్రసన్నయై, స్వామి కోరినట్లు, ఆ ముసలమ్మ ఇంట కనకవర్షం కురిపించింది. ఆ స్తోత్రమే కనకధారస్తోత్రం.

ఈ స్తోత్రమును పఠించినవారికి లక్ష్మీదేవి ప్రసన్నురాలై సర్వాభీష్ట సిద్ధి కలుగచేస్తుంది. 🌺


🌺అంగం హరేః పులకభూషణ మాశ్రయంతీ

భృఙ్గాఙ్గనేవ ముకుళాభరణం తమాలం |

అంగీకృతాఖిల విభూతిర పాంగలీలా

మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః || 1 ||

భావం: మొగ్గలతో నిండియున్న చీకటి కానుగ చెట్టుకు ఆడుతుమ్మెదలు ఆభరణములైనట్లు, పులకాంకురములతోడి శ్రీహరి శరీరము నాశ్రయించినదియు, సకలైశ్వర్యములకు స్థానమైనదియు అగు లక్ష్మీదేవి యొక్క చక్కని క్రీగంటిచూపు నాకు శుభములను ప్రసాదించుగాక.. 🌺


🌺ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః

ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని |

మాలా దృశోర్మధుకరీవ మహోత్పలే యా

సా మే శ్రియం దిశతు సాగరసంభవాయాః || 2 ||

భావం:  పెద్ద నల్లకలువపైనుండు ఆడుతుమ్మెదవలె శ్రీహరి ముఖమునందు ప్రేమ లజ్జలచే ముందుకు వెనుకకు ప్రసరించుచున్న సాగర సంజాత అయిన యా లక్ష్మీదేవి యొక్క కృపాకటాక్షము నాకు సంపదను ప్రసాదించుగాక...


ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందం

ఆనందకంద మనిమేషమనంగతంత్రం |

ఆకేకర స్థిత కనీనికపక్ష్మనేత్రం

భూత్యై భవేన్మమ భుజంగ శయాంగనాయాః || 3 ||

భావం: నిమీలిత నేత్రుడును, ఆనందమునకు కారణభూతుడు అయిన మురారిని సంతోషముతో గూడుటచే, ఱెప్పపాటు లేనిదియు, కామ వశమైనదియు, కుచితమైన కనుపాపలును, ఱెప్పలును గలదియు అగు లక్ష్మీదేవి యొక్క కటాక్షము నాకు సంపద నొసంగును గాక.


బాహ్వంతరే మధుజితః శ్రితకౌస్తుభే యా

హారావళీవ హరినీలమయీ విభాతి |

కామప్రదా భగవతోపి కటాక్షమాలా

కళ్యాణమావహతు మే కమలాలయాయాః || 4 ||

భావం: భగవంతుడగు శ్రీహరికిని కామప్రదయై, అతని వక్షస్థలమందలి కౌస్తుభమున ఇంద్రనీలమణిమయమగు హారావళివలె ప్రకాశించుచున్న కమలాలయ అగు లక్ష్మీదేవి యొక్క కటాక్షమాల నాకు శుభమును చేకూర్చుగాక 🌺


🌺కాలాంబుదాళి లలితోరసి కైటభారేః

ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ |

మాతుస్సమస్త జగతాం మహనీయమూర్తిః

భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః || 5 ||

భావం:  కారుమబ్బులపై తోచు మెరుపుతీగ వలె నీలమేఘశ్యాముడగు విష్ణుదేవుని వక్షస్థలమందు ప్రకాశించుచున్న, ముల్లోకములకును తల్లియు, భార్గవ నందనయు అగు ఆ లక్ష్మీదేవి నాకు శుభముల నిచ్చుగాక..


ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్

మాంగళ్యభాజి మధుమాథిని మన్మథేన |

మయ్యాపతేత్తదిహ మంథరమీక్షణార్ధం

మందాలసం చ మకరాలయకన్యకాయాః || 6||

భావం: ఏ క్రీగంటి ప్రభావమున మన్మధుడు మాంగల్యమూర్తియగు మధుసూదనుని యందు ముఖ్యస్థానమును ఆక్రమించెనో అట్టి క్షీరాబ్ధి కన్య అగు లక్ష్మీదేవి యొక్క మందమగు నిరీక్షము నాయందు ప్రసరించునుగాక


విశ్వామరేంద్ర పదవిభ్రమదానదక్షం

ఆనందహేతురధికం మురవిద్విషోపి |

ఈషన్నిషీదతు మయి క్షణమీక్షణార్థం

ఇందీవరోదరసహోదరమిందిరాయాః || 7 ||

భావం:  సమస్త దేవేంద్ర పదవి నీయగలదియు, మురవైరియగు విష్ణువు సంతోషమునకు కారణమైనదియు, నల్లకలువలను పోలునదియు అగు లక్ష్మీదేవి కటాక్షము కొంచెము నాపై నిలిచియుండును గాక 🌺


🌺ఇష్టా విశిష్టమతయోపి యయా దయార్ద్ర

దృష్ట్యా త్రివిష్టపపదం సులభం లభంతే |

దృష్టిః ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం

పుష్టిం కృషీష్ట మమ పుష్కరవిష్టరాయాః || 8 ||

భావం:  పద్మాసని అయిన లక్ష్మీదేవి దయార్ధ దృష్టివలననే విశిష్టమతులగు హితులు సులభముగా ఇంద్రపదవిని పొందుచున్నారు. వికసిత కమలోదర దీప్తిగల ఆ దృష్టి, కోరిన సంపదను నాకు అనుగ్రహించుగాక


దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారా

అస్మిన్న కించన విహంగశిశౌ విషణ్ణే |

దుష్కర్మఘర్మమపనీయ చిరాయ దూరం

నారాయణ ప్రణయినీ నయనాంబువాహః || 9 ||

భావం:  శ్రీమన్నారాయణుని దేవి అయిన లక్ష్మీదేవి దృష్టియనెడు మేఘము దయావాయు ప్రేరితమై, నా యందు చాలాకాలముగా ఉన్న దుష్కర్మ తాపమును తొలగించి, పేదవాడ ననెడి విచారముతో ఉన్న చాతకపు పక్షి అగు నాపై ధనవర్ష ధారను కురిపించునుగాక.


గీర్దేవ తేతి గరుడధ్వజసుందరీతి

శాకంభరీతి శశిశేఖరవల్లభేతి |

సృష్టిస్థితి ప్రళయకేలిషు సంస్థితాయై

తస్యై నమస్త్రిభువనైకగురోస్తరుణ్యై || 10 ||

భావం:  వాగ్దేవత అనియు, గరుడధ్వజ సుందరి అనియు, శాకంభరి అనియు, శశిశేఖర వల్లభా అనియు పేరు పొందినదియు, సృష్టి, స్థితి, లయముల గావించునదియు, త్రిభువనములకు గురువైన విష్ణుదేవుని పట్టమహిషి అగు లక్ష్మీదేవికి నమస్కారము. 🌺


🌺శ్రుత్యై నమోస్తు శుభకర్మఫలప్రసూత్యై

రత్యై నమోస్తు రమణీయగుణార్ణవాయై |

శక్త్యై నమోస్తు శతపత్రనికేతనాయై

పుష్ట్యై నమోస్తు పురుషోత్తమవల్లభాయై || 11 ||

భావం:  పుణ్యకార్యములు ఫలము నొసగు శ్రుతిరూపిణియు, సౌందర్య గుణసముద్ర యగు రతిరూపిణియును, పద్మనివాసిని అగు శక్తి రూపిణియు అగు లక్ష్మీదేవికి నమస్కారము.


నమోస్తు నాళీకనిభాననాయై

నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై |

నమోస్తు సోమామృత సోదరాయై

నమోస్తు నారాయణ వల్లభాయై || 12 ||

భావం: పద్మమును బోలిన ముఖము గలదియు, క్షీరసముద్ర సంజాతయు, చంద్రునికిని, అమృతమునకు తోబుట్టువును, నారాయణుని వల్లభయును అగు లక్ష్మీదేవికి నమస్కారము.


నమోస్తు హేమాంబుజ పీఠికాయై

నమోస్తు భూమండల నాయికాయై |

నమోస్తు దేవాదిదయాపరాయై

నమోస్తు శార్ఙ్గాయుధ వల్లభాయై || 13 ||

భావం:  బంగారు పద్మము ఆసనముగా గలదియును, భూమండలమునకు నాయిక అయినదియును, దేవతలలో దయయే ముఖముగా గలదియును, విష్ణువునకు ప్రియురాలును అయిన లక్ష్మీదేవికి నమస్కారము. 🌺


🌺నమోస్తు దేవ్యై భృగునందనాయై

నమోస్తు విష్ణోరురసిస్థితాయై |

నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై

నమోస్తు దామోదరవల్లభాయై || 14 ||

భావం:  భృగుమహర్షి పుత్రికయును, దేవియు, విష్ణు వక్షస్థల వాసినియు, కమలాలయము, విష్ణువుకు ప్రియురాలును అయిన లక్ష్మీదేవికి నమస్కారము.


నమోస్తు కాంత్యై కమలేక్షణాయై

నమోస్తు భూత్యై భువనప్రసూత్యై |

నమోస్తు దేవాదిభిరర్చితాయై

నమోస్తు నందాత్మజవల్లభాయై || 15 ||

భావం:  తామరపువ్వు వంటి కన్నులు గలదియు, దేదీప్యమానమైనదియు, లోకములకు తల్లియు, దేవతలచే పూజింపబడునదియు, విష్ణువుకు ప్రియురాలు అగు లక్ష్మీదేవికి నమస్కారము..


సంపత్కరాణి సకలేంద్రియ నందనాని

సామ్రాజ్యదానవిభవాని సరోరుహాక్షి |

త్వద్వందనాని దురితాహరణోద్యతాని

మామేవ మాతరనిశం కలయంతు మాన్యే || 16 ||

భావం:  పద్మములవంటి కన్నులు గల పూజ్యురాలవగు నోయమ్మా, నిన్ను గూర్చి చేసిన నమస్కృతులు సంపదను కల్గించునవి, సకలేంద్రియములకును సంతోషమును కలిగించునవి, చక్రవర్తిత్వము నొసగ గలవి, పాపములను నశింపచేయునవి, ఓ తల్లీ అవి ఎల్లపుడును నన్ను అనుగ్రహించుగాక. 🌺


🌺యత్కటాక్ష సముపాసనావిధిః

సేవకస్య సకలార్థసంపదః |

సంతనోతి వచనాంగమానసైః

త్వాం మురారిహృదయేశ్వరీం భజే || 17 ||

భావం:  ఏ దేవి యొక్క కటాక్ష వీక్షణమున సేవకులకు సకలార్ధ సంపదలు లభించునో, అట్టి మురారి హృదయేశ్వరి యగు లక్ష్మీదేవిని మనోవాక్కాయములచే త్రికరణశుద్ధిగా సేవింతును.


సరసిజనిలయే సరోజహస్తే

ధవళతమాంశుకగంధమాల్యశోభే |

భగవతి హరివల్లభే మనోజ్ఞే

త్రిభువనభూతికరి ప్రసీద మహ్యమ్ || 18 ||

భావం: కమలములవంటి కన్నులు గల ఓ తల్లీ, చేతియందు పద్మమును ధరించి, తెల్లని వస్త్రము, గంధము, పుష్పమాలికలతో ప్రకాశించుచున్న భగవతీ, విష్ణుప్రియా, మనోఙ్ఞురాలా, ముల్లోకములకును సంపదను ప్రసాదించు మాతా, నన్ననుగ్రహింపుము.


దిగ్ఘస్తిభిః కనక కుంభముఖావసృష్ట

స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగీమ్ |

ప్రాతర్నమామి జగతాం జననీమశేష

లోకాధినాథగృహిణీ మమృతాబ్ధిపుత్రీమ్ || 19 ||

భావం: దిగ్గజములు కనకకుంభములతో తెచ్చిన వినిర్మల ఆకాశ జలములచే అభిషేకించబడిన శరీరము కలదియు, లోకములకు జననియు, విశ్వప్రభువగు విష్ణుమూర్తి గృహిణియు, క్షీరసాగర పుత్రియు అగు లక్ష్మీదేవికి ఉదయమున నమస్కరించుచున్నాను. 🌺


🌺కమలే కమలాక్ష వల్లభేత్వం

కరుణాపూరతరంగితైరపాంగైః |

అవలోకయ మామకించనానాం

ప్రథమం పాత్రమకృత్రిమం దయాయాః || 20 ||

భావం: శ్రీహరి వల్లభురాలివైన ఓ లక్ష్మీదేవి, దరిద్రులలో ప్రధముడను, నీ దయకు తగిన పాత్రమును అగు నన్ను నీ కరుణాకటాక్షముతో చూడుము.


దేవి ప్రసీద జగదీశ్వరి లోకమాతః

కళ్యాణదాత్రి కమలేక్షణజీవనాథే |

దారిద్ర్యభీతిహృదయం శరణాగతం మామ్

ఆలోకయ ప్రతిదినం సదయైరపాంగైః || 21 ||


స్తువంతి యే స్తుతిభిరమీభిరన్వహం

త్రయీమయీం త్రిభువనమాతరం |

రమామ్ గుణాధికా గురుతరభాగ్యభాగినో

భవంతి తే భువి బుధభావితాశయాః || 22 ||


ఎవరీ స్తోత్రములచే ప్రతిరోజు వేదరూపిణియు, త్రిలోకమాతయు అగు లక్ష్మీదేవిని స్తుతింతురో వారు విద్వాంసులకే భావితాశయులై, గుణాధికులై అత్యంత భాగ్యశాలురగుచున్నరు. 🌺

RECENT POST

కాణిపాకం శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు

కాణిపాకం శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు ప్రతీరోజు ఈ స్తోత్రం కనీసం 4 సార్లుపఠిస్తేచాలామంచిది ఇంకా ఎక్కువ సార్లు పఠించే సమయము, శక్తి...

POPULAR POSTS