Friday, March 18, 2022

దేవుడు కలలో కనపడితే ఫలితం ఏమిటి

 దేవుడు కలలో కనపడితే ఫలితం ఏమిటి



మనం తరచూ కలలు కంటుంటాం. చాలామందికి నిత్యం తమ జీవితాల్లో జరిగే విషయాలు, అంశాలు కలల్లో కనిపిస్తుంటాయి. అయితే మీకు ఎప్పుడైనా కలలో దేవుడు కనిపించాడా.? ఒకవేళ మీ కలలో దేవుడు కనిపిస్తే ఏం జరుగుతుంది.? దేవుడు కలలో కనిపిస్తే.. దేనికి సంకేతం.? స్వప్న శాస్త్రం ప్రకారం.. ప్రతీ కలకు ఓ అర్ధం ఉంటుంది. అలాంటి పరిస్థితిలో, మీరు కలలో దేవుడిని చూస్తే.. దానికి ప్రత్యేకమైన సంకేతం ఉంటుంది. కలలో ఏ దేవుడు కనిపిస్తే.. ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం..


దుర్గామాత కోపంగా కనిపిస్తే..


మీ కలలో దుర్గామాతను కోపంగా చూసినట్లయితే, ఆ కల అశుభ పరిణామానికి సంకేతం. అంటే ఆ తల్లి మీపై కోపంగా ఉందని అర్థం. ఒకవేళ దుర్గామాత సింహంపై స్వారీ చేసినట్లు మీకు కలలో కనిపిస్తే.. మీ జీవితంలో సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని అర్ధం.


శివుడిని కలలో చూస్తే..

మీ కలలో శివుడిని చూసినట్లయితే, మీరు సమస్యల నుంచి అతి త్వరలో విముక్తి పొందనున్నట్లు అని అర్ధం. శివుడు కలలోకి వచ్చాడంటే.. అన్ని ఇబ్బందులు తొలిగినట్లే. అంతేకాకుండా మీ కలలో శివలింగాన్ని చూసినట్లయితే, ఆ కల కూడా ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు. మీ జీవితంలో పురోగతి, కీర్తిని పొందుతారని.. దాని సంకేతం.


రాముడిని కలలో చూస్తే..

మీరు కలలో రాముడిని చూస్తే.. చాలా శుభప్రదం. మీ జీవితంలో పురోగతికి అవకాశాలు లభిస్తాయని అర్థం. అయితే అందుకు మీ విధులను మీరు సక్రమంగా నిర్వర్తించాలని ఆ కల సంకేతం.


కలలో శ్రీకృష్ణుని దర్శనం..

మీకు కలలో శ్రీకృష్ణుడు కనిపిస్తే.. స్నేహం, లేదా మరేదైనా బంధం ద్వారా మీ జీవితంలో ప్రేమ చిగురిస్తుందని దాని అర్ధం. ఒకవేళ మీరు ఎవరితోనైనా ప్రేమలో ఉంటే.. ఈ కల చాలా పవిత్రమైనది అని అంటారు.


కలలో విష్ణువు దర్శనం..

మీ కలలో విష్ణువును చూసినట్లయితే, మీరు విజయం సాధిస్తారని.. జీవితంలో పురోగతిని పొందుతారని అంటారు.


లక్ష్మీదేవి కలలో కనిపిస్తే..

మీ కలలో లక్ష్మీదేవి కమలంపై కూర్చున్నట్లు కనిపిస్తే, అది చాలా పవిత్రమైన కలగా పరిగణిస్తారు. ఈ కల సంపదకు చిహ్నం. కలలో లక్ష్మీమాతను చూస్తే.. మీకు డబ్బు త్వరలోనే లభిస్తుందని.. లాభాలను పొందుతారని అంటారు.

గ్రహ దోషాలను తొలగించే స్నానపు విధానం.

 గ్రహ దోషాలను తొలగించే స్నానపు విధానం.



సూర్య దోషం తొలగడానికి : ఆదివారం 


మనం స్నానం చేసే నీటిలో కుంకుమపువ్వు గాని ఎర్రటి పూలు గాని ఆ బకెట్లో కొంచెం వేసి స్నానం చేసుకుంటే సూర్య దోషం తగ్గుతుంది


చంద్ర దోషం తొలగడానికి: సోమవారం


నీటిలో కొంచెం పాలు కానీ లేక పెరుగు గాని వేసుకుని స్నానం చేస్తే చంద్ర దోషం తగ్గుతుంది


కుజదోషం తొలగడానికి: మంగళవారం


నీటిలో బిల్వ ఆకులను గాని బిల్వ ఆకు పొడిని గాని వేసి స్నానం చేస్తే కుజదోషం తగ్గుతుంది


బుదదోషం తొలగడానికి: బుధవారం


నీటిలో సముద్రపు నీరు గానీ గంగా నది నీరు గాని లేక రాళ్ల ఉప్పు గాని వేసి స్నానం చేస్తే బుధ దోషం తగ్గుతుంది


గురు దోషం తొలగడానికి: గురువారం


నల్ల యాలకులను నీటిలో ఉడికించి వాటిని మనం స్నానం చేసే నీటిలో పోసి స్నానం చేస్తే గురు దోషం తగ్గుతుంది


శుక్ర దోషం తొలగడానికి: శుక్రవారం


యాలకులను నీటిలో ఉడికించి ఆ ఉడికించిన నీటిని మనం స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేస్తే శుక్ర దోషం తగ్గుతుంది


శని దోషం తొలగడానికి: శనివారం


నీటిలో నల్ల నువ్వులను నేటి స్నానం చేస్తే శని దోషం తగ్గుతుంది


రాహు దోషం తొలగడానికి: శనివారం


(మహి షాసి, అనేది సామ్రాణి ఇది నాటు మందు షాపులో దొరుకుతుంది )ఈ మహిషా సి పొడిచేసి నీటిలో ఉడకబెట్టి స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేస్తే రాహు దోషం తగ్గుతుంది


కేతు దోషం తొలగడానికి: మంగళవారం


గరిక (గడ్డి) నీ ఉడకబెట్టి ఆ నీటిని మనం స్నానం చేసే నీటిలో కలుపుకుని స్నానం చేస్తే కేతు గ్రహ దోషం తగ్గుతుంది


పైన చెప్పిన విధంగా ఆయా రోజుల్లో స్నానాన్ని ఆచరించి గ్రహ దోషాలను తగ్గించుకోవాలి

అనారోగ్య నివారణకు శని దేవుని శాంతి మంత్రం

 అనారోగ్య నివారణకు

శని దేవుని శాంతి మంత్రం



శని వలన కలిగే ఒంటి నొప్పులకి, కీళ్ళ నొప్పులకి, మోకాళ్ళ నొప్పులకి కింద మంత్రం చదువుకోవాలి.


ఏల్నాటిశని,అష్టమ శని,కంటక శని,శని మహార్దశ, అంతర్దశ జరుగుతున్నప్పుడు కొంతమందికి ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు వస్తాయి. ఇలాంటి నొప్పులు ఉన్నప్పుడు నడుము నుండి క్రింది పాదాల వరకు నువ్వుల నూనె పట్టించి శని ఉపశమన మంత్రాన్ని పఠిస్తూ రెండు గంటల తరువాత వేడి నీళ్ళతో స్నానం చేస్తే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.


నువ్వుల నూనె లో కాపర్ వంటి మూలకాలు మరియు యాంటీ ఆక్సిడెంట్'లను కలిగి ఉండటం వలన శక్తివంతంగా కీళ్ళ నొప్పులను, వాపులను తగ్గిస్తుంది. అంతేకాకుండా, ఇందులో ఉండే మూలకాలు, మినరల్స్ రక్తనాళాలకు, కీళ్ళను దృడంగా ఉండేలా చేస్తాయి.


నువ్వుల నూనెతో ప్రతి రోజూ శరీరానికి మర్దన చేస్తే చర్మానికి నిగారింపే కాక చిన్నతనంలో వచ్చే వృద్ధాప్య ఛాయలను కూడా అరి కట్టవచ్చు. అలాగే, చిన్న పిల్లలకు నువ్వుల నూనెతో మర్దన చేయడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. ప్రతిరోజూ నువ్వుల నూనెతో తలకు మాలిష్‌ చేయడం వల్ల జుట్టు బాగా పెరగడంతో పాటు మేధాశక్తి ఎక్కువవుతుంది. పిల్లలు పక్క తడపకుండా ఉండడానికి కూడా నువ్వుల నూనె పని చేస్తుంది.


ఏల్నాటిశని, అష్టమ శని, కంటక శని, శని మహార్దశ, అంతర్దశ జరుగుతున్నప్పుడు కొంతమందికి బద్దకం ఎక్కువగా ఉంటుంది. అలాంటివారు ప్రతిరోజు దేవాలయ ప్రదక్షిణలు గాని, వాకింగ్ గాని మేడిటేషన్ గాని చేస్తే శని తృప్తి పడి మన నిత్య కార్యక్రమాలు సవ్యంగా జరిగేటట్టు చేస్తాడు.


శనైశ్చరో మహాభాగో! సర్వారిష్ట నివారక: !

కాకధ్వజో రుద్రరూపో! కలికల్మష నాశక:!!


ధీరో గంభీరో !ధృడసంకల్ప కారక: !

దేవదేవో దుర్నిరీక్షో! దేవాసురవందిత:!!


కరాళో కంటకో క్రుద్ధో! కష్టనష్టకారక: !

పవిత్రో ప్రలోభో !ప్రారబ్ధకర్మ ఫలప్రద:!!


నిర్గుణో నిత్యతృత్పో! నిజతేజ ప్రకాశిత: !

నిరుపమో నిష్కళంకో! నీలాంజన సమప్రభ:!!


మందో మహావీరో! మదమాత్సర్య నాశక: !

ప్రసన్నో ప్రమోదో !శరణాగత వత్సల:!!


శనైశ్చర పంచకమిదం య: పఠేత్సతం నర:

సర్వకష్ట వినిర్ముక్తో శ్రీ శనైశ్చర కరుణాం లభేత్!!

కలశం పై ఉంచిన కొబ్బరికాయను ఏమి చేయాలో తెలుసుకుందాం...

 కలశం పై ఉంచిన కొబ్బరికాయను ఏమి చేయాలో తెలుసుకుందాం...




సాధారణంగా కలశాన్ని నోములు,వ్రతాలు చేసుకొనే సమయంలో పెడుతూ ఉంటాం. వారి తాహతును బట్టి రాగిచెంబు లేదా వెండి చెంబును కలశంగా వుంచి, దానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి, ఆ కలశంలో కొంచెం నీరు పోసి అక్షింతలు, పసుపు, కుంకుమలు , గంధం, పూలు వేస్తారు.


కలశంపై మావిడి ఆకులు చుట్టూఉండేలా పెట్టి, వస్త్రం చుట్టిన కొబ్బరికాయను పెట్టి పూజ చేస్తారు.


మన ఇంటిలో ఏదైనా పూజలు జరిగినప్పుడు కలశం పెట్టటం ఆచారంగా వస్తుంది. అయితే చాలా మందికి కలశంపై ఉంచిన కొబ్బరికాయను ఏమి చేయాలో అర్ధం కాదు. కలశం మీద పెట్టిన కొబ్బరికాయను పూజ చేయించటానికి వచ్చిన బ్రాహ్మణులకు ఇవ్వచ్చు. ఒకవేళ బ్రాహ్మణులు లేకపోతే పారే నీటిలో నిమజ్జనం చేయవచ్చు. కొబ్బరికాయను బ్రాహ్మణులకు ఇచ్చిన లేదా పారే నీటిలో నిమజ్జనం చేసినఎటువంటి దోషాలు ఉండవు..


దేవాలయంలో కలశాన్ని పెడితే పూర్ణాహుతి చేస్తారు. అదే ఇంటిలో కలశాన్ని పెడితే కొబ్బరికాయను బ్రాహ్మణులకు ఇవ్వడం లేదా పారే నీటిలో నిమజ్జనం చేస్తూ ఉంటారు. ఇది మన పూర్వీకుల నుంచి ఒక ఆచారంగా వస్తుంది. మన పెద్దలు చెప్పిన సంప్రదాయాలను అనుసరించటం మన విధి.

గురు గ్రహ దోషాలు - నివారణ

 గురు గ్రహ దోషాలు - నివారణ



నవగ్రహాల్లో బృహస్పతి గ్రహం ఒకటి. దీన్నే గురుగ్రహం అని కూడా అంటారు. ఇది పురుష గ్రహం, బ్రాహ్మణ కులంగా కూడా చెబుతారు. సత్త్వగుణ ప్రధానమైన ఈ గ్రహం భూమిపై నివసించే జీవులపై, మానవులపై ప్రభావం చూపుతుంది.


ఈ గ్రహ ప్రాబల్యం బాగా ఉన్న వారికి విద్య, బుద్ధి, జ్ఞానం బాగా ఉంటుంది. ఈ గ్రహం బాగుంటే వారు అమితమైన తేజోవంతులుగానూ, ధనవంతులుగానూ ఉంటారని శాస్త్రం చెబుతోంది. ఇక ఈ గ్రహానికి సంబంధించిన వ్యాధులు, గురు గ్రహ దోషానికి పరిహార క్రియలను పరిశీలిస్తే.. కాలేయం, వెన్నుపూస, తొడలు, చెవులు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, మధుమేహం, నత్తి, మతిమరుపు, శరీరానికి నీరు పట్టడం, కఫం వంటి వ్యాధులు గురు గ్రహ ప్రభావంతో కలుగుతాయి.

అలాగే గౌరవహాని, పండితపామరులతో వివాదం, స్థానచలనం, అధికార నష్టం, తీర్థయాత్రలలో ఇబ్బందులు, స్వార్థం, సంతానదోషం, ధననష్టం, పుత్ర విరోధం, దైవ, గురు భక్తి లోపించడం ఇవి సామాన్యంగా గురు గ్రహ బలహీనతవలన కలిగే ఇబ్బందులు, లోపాలని శాస్త్రం చెబుతుంది.

గురుగ్రహ దోషాలు, వ్యాధుల పరిహారం కోసం మంచి పుష్యరాగ మణిని గురువారం రోజు శివ పంచాక్షరి మంత్రం, గురుగ్రహ మంత్రంతో కలిపి జపించిన తర్వాత ధరించాలి. స్త్రీలు పాదాలకు ధరించే పసుపు, గడపలకు పసుపు రాయటం, పూజా కార్యక్రమాల్లోనూ, స్నానానికి మనం వినియోగించే పసుపు ఎన్నో వ్యాధుల్ని నివారించగలదు. కాబట్టి పసుపు రంగు వేయబడిన గది గోడల మధ్య నివాసం ఈ లోపాన్ని పూరిస్తుంది.


జాతకంలో గురువు బలహీనంగా ఉంటే.. సంతాన సౌఖ్యత లేక పోవటం, కీర్తి గౌరవ ప్రతిష్టలకు నశించుట, నిత్యం వాహన ప్రమాదాలు దయాదాక్షిణ్యాలు లేక పోవుట, ఇతరులను కష్ట పెట్టే విధంగా నిర్మొహమాటంగా సత్యం చెప్పుట,నీష్ఠూరంగా మాట్లాడటం, షుగర్, క్యాన్సర్, మూత్ర రోగాలు, పెద్ద పొట్టతో కలిగిన దేహం, పరులను నమ్మి సెక్యూరిటీగా ఉండటం, గురువు జాతక చక్రంలో ఏ అవయవం మీద ఆదిపత్యం వహిస్తే ఆ అవయవ పరిమాణాన్ని పెంచి పెద్దది చేస్తాడు.


వ్యాధి వస్తే తొందరగా తగ్గదు. లైఫ్ లో ఎంజాయ్ మెంట్ ఉండదు. జీవితంలో సుఖం, సంతోషం లేక పోవుట, దైవంపై నమ్మకం లేకపోవుట, పెద్దల యందు గౌరవం లేకపోవుట, ఆచారములు పాటించకుండుట, ఉన్నత విద్యకు ఆటంకాలు, నియంతగా ప్రవర్తించుట, ధనమునకు ఇబ్బందులు కలుగుట, ఎన్ని పూజలు, వ్రతాలు చేసినా ఫలితం లేకపోవుట, జీర్ణశక్తి లేకపోవుట.లివర్‌కు సంబంధించిన వ్యాధులు కలుగుచున్నప్పుడు గురుగ్రహ దోషంగా గుర్తించి గురు గ్రహ అనుగ్రహం కొరకు గురుచరిత్ర పరాయణ చేయడం, గురువులను గౌరవించుట, దైవ క్షేత్రములు సందర్శించుట, శనగలు దానం చేయుట, పంచముఖ రుద్రాక్షను లేదా కనక పుష్యరాగమును  ధరించవచ్చును

రావి ఆకులపై ప్రమిదను వుంచి నువ్వుల నూనెతో దీపమెలిగిస్తే..............!!

 రావి ఆకులపై ప్రమిదను వుంచి నువ్వుల నూనెతో దీపమెలిగిస్తే..............!!





రావిచెట్టు విశేషాలతో కూడుకున్నది.శాపాలు, దోషాలు, పూర్వ జన్మ కర్మలను ఈ రావిచెట్టు తొలగించగలదు. అందుకు మీరు చేయాల్సిందల్లా రావిచెట్టును పూజించడమే. 


అంతేగాకుండా ఇంట్లో రావిచెట్టు ఆకులను వుంచి దానిపై దీపం వెలిగించడం ద్వారా శాప,దోష,కర్మ ఫలితాలు వుండవు.పూర్వజన్మల పాపాలు తొలగిపోతాయి.రావిచెట్టు ఆకులను తీసుకొచ్చి దానిపై ప్రమిదలను వుంచి నువ్వుల నూనెతో దీపమెలిగించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. 

శనిగ్రహ దోషాలు, సర్పదోషాలు, రాహు-కేతుదోషాలు, నవగ్రహ దోషాలు తొలగిపోతాయి.


అలాగే ....సోమవారం జన్మించిన వారు రావి ఆకులు మూడింటిపై నువ్వుల నూనెతో ప్రమిదల ద్వారా దీపం వెలిగించాలి. మంగళవారం జన్మించిన జాతకులు రెండు దీపాలు, బుధవారం జన్మించిన జాతకులు మూడు దీపాలు, గురువారం జన్మించిన జాతకులు ఐదు దీపాలు, శుక్రవారం జన్మించిన వారు ఆరు దీపాలు, 

శనివారం జన్మించిన జాతకులు 9 దీపాలు, 

ఆదివారం జన్మించిన జాతకులు 12 రావి ఆకులపై ప్రమిదలను వుంచి నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి.


రావిచెట్టు ఆకు కాడ దేవుని పటాల వైపు వుండేలా,

ఆకు చివరి భాగం మనల్ని చూసే విధంగా దీపాన్ని వెలిగించాలి. 


దీపం వెలిగించాక ఆ దీపం ముందు కూర్చుని దోషాలన్నీ తొలగిపోవాలని ప్రార్థించాలి. ఇలా చేస్తే దోషాలు తొలగి, శుభ ఫలితాలను ఆశించవచ్చునని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.


ఇంకా శుక్రవారం పూట శ్రీ మహాలక్ష్మీ దేవిని పూజించడం...ఆమె అనుగ్రహం పొందాలంటే.. 

తమలపాకుపై ప్రమిదలను వుంచి దీపం వెలిగించడం శుభప్రదం. ఇంకా తమలపాకుపై ప్రమిదను వుంచి నేతితో దీపమెలిగించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు వుండవని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు

దిష్టిని తొలగించే... 'శుభదృష్టి గణపతి'..కన్నుద్రుష్టి గణపతి ఫోటో ఉత్తర దిశలో వుంచితే

 దిష్టిని తొలగించే... 'శుభదృష్టి గణపతి'..కన్నుద్రుష్టి  గణపతి ఫోటో ఉత్తర దిశలో వుంచితే



ఈ ''శుభదృష్టి గణపతి'' దివ్యరూపాన్ని ఇంటిలో వుంచుకుని నిత్యం పూజించడం ద్వారా ఇంట్లోని యావన్మంది గృహసభ్యులుపై ప్రసరించే దిష్టి యొక్క దుష్ప్రభావం సూర్యరశ్మి సోకినమంచులాకరిగిపోతుంది


కీడు కలిగించే చెడు దృష్టిని ''దిష్టి'' అంటారు. 

దీని గురించి ఒక నానుడి కూడా మనకు తెలిసిందే. ''నరుడు దృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది'' అంటారు. దీని అనుభవం పొందిన వారికి దీని ప్రభావం ఎలా ఉంటుందో తెలుస్తుంది. 

 

దృష్టి అంటే చూపు. మనం చూసేది. సహజంగా దేనినైనా చూడటం వలన హాని ఉండదు. కానీ ఈర్ష్యా ద్వేషాలతో చూసే చెడు దృష్టి చాలా హాని చేస్తుంది.


 ఆ చెడుదృష్టి తాకే మనిషినైనా, మరిదేనినైనా మాడి మసి చేస్తుంది.పిడుగు పడినపుడు చెట్లు ఎలామాడిపోతాయో, అట్లే ఈ చెడు దృష్టి ప్రభావం వుంటుంది. అనుభవంలో ఇది చాలామందికి తెలిసిన సత్యం. 


ఈ వైజ్ఞానిక యుగంలో అనేక భయంకరమైన వ్యాధులను నయం చేసేందుకు ఎన్నో కొత్త కొత్త మందులు కనిపెట్టడం జరిగింది. జరుగుతోంది కూడా. కాని ఈ దిష్టి దుష్ప్ర భావాన్ని అణచి వేసేందుకు ఏ వైజ్ఞానికుడు ఏ విరుగుడు కనిపెట్టలేకపోయాడు. కనీసం ఈ విషయమై ఎలాంటి పరిశోధన చేయనులేదు. 

 

కానీ దిష్టిని సమూలంగా నాశనం చేసి ప్రపంచాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. మహా శ్రేష్ఠుడైన అగస్త్య మహాముని దీనికి తగిన పరిహారం ఒక శక్తి అని ఆ మహాశక్తి పేరు సర్వశక్తి వంతుడైన ''శుభదృష్టి గణపతి'' అని కనుగొన్నాడు.


అశుభ దృష్టి అయిన దిష్టి రాక్షసుని సంహరించగల ఒకే ఒక్క దైవశక్తి మహాగణపతి యొక్క అనేక రూపాలలో 33వ రూపమే ఈ ''శుభదృష్టి గణపతి''. 

 

ఈ శుభదృష్టి గణపతి యొక్క రూపం చాలా విచిత్రంగా వుంటుంది. శ్రీ మహావిష్ణువు తర్వాత శంఖు, చక్రాలను ధరించిన దైవశక్తి. శ్రీమహేశ్వరునివలె ఈయన త్రినేత్రుడు. త్రిశూలధారిగా ఈయన జగన్మాత యొక్క అంశం. 


ఇతర దేవతల వలె అనేక ఆయుధాలను ధరించి, సింహమును వాహనంగా చేసుకుని వుంటాడు. మూషికము కూడా ఈయన పాదాల చెంత వుంటుంది. మహా పరాక్రమశాలి రూపంతో ఈ మహాగణపతి పూర్ణ వికసిత పద్మంలో విజయోత్సాహ వీరునిలా నిలబడి వుంటాడు. తొమ్మిది నాగదేవతలు ఈయన తలచుట్టూ తిరిగి వుంటారు. 

 

ప్రజ్వలించు అగ్ని జ్వాలలో ఏభై ఒక్క నేత్రాలతో తన సాధారణ స్వరూపానికి విరుద్ధంగా తన విశ్వరూపంతో రుద్ర స్వరూపుడు ''శుభదృష్టి గణపతి"గా ఉద్భవించుట జరిగింది. 


సర్వజనులకు మేలు చేకూర్చే ఈ శుభదృష్టి గణపతి ఒక్కడే దిష్టి అనే దృష్టిని సంహరించి.. సర్వజనాలను రక్షించి, శుభం, సుఖశాంతులు సమృద్ధిగా అందిస్తాడు. 


ఈ ''శుభదృష్టి గణపతి'' దివ్యరూపాన్ని ఇంటిలో వుంచుకుని నిత్యం పూజించడం ద్వారా ఇంట్లోని యావన్మంది గృహసభ్యులుపై ప్రసరించే దిష్టి యొక్క దుష్ప్రభావం సూర్యరశ్మి సోకిన మంచులా కరిగిపోతుంది. 

 

ఈ శుభదృష్టి గణపతిని కంపెనీలు, ఫ్యాక్టరీలు, ఆఫీసులు, దుకాణాల్లో పూజించడం వల్ల దుష్ట శక్తుల ప్రభావాలు తొలగి మంచి లాభాలు, అభివృద్ధి చేకూరుతుంది. ప్రతీ ఒక్కరూ ఈ శుభదృష్టి గణపతిని ఆరాధించాలి. 


గృహంలో ఈ శుభదృష్టి గణపతి పటాన్ని గోడపై ఉత్తరదిశ చూసేలా తగిలించాలి. పూజాగదిలో కానీ, ఇంటికి వచ్చే అందరి దృష్టి ఆకర్షించే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. 


ఈ శుభదృష్టి గణపతి శత్రువులను సంహరించి, యుద్ధరంగం నుంచి వచ్చిన విజేతలా, విజయలక్ష్మి వరించిన వీరునిగా సమర రూపంతో విజయోత్సాహంతో దర్శనమిస్తాడు

శ్రీ కాలభైరవస్వామి ప్రధాన క్షేత్రాలు..

 శ్రీ కాలభైరవస్వామి ప్రధాన క్షేత్రాలు..





1. వారణాసి (ఉత్తరప్రదేశ్) :


కాలభైరవునికి బ్రహ్మ హత్యాపాతకం తొలగించిన స్థలంగా ఈ క్షేత్రం ప్రసిద్ది చెందినది.. అందుచే శివుని ఆజ్ఞ ప్రకారం వారణాసి క్షేత్రపాలకుడు కాలభైరవుడు..


2. ఉజ్జయిని (మధ్యప్రదేశ్ లో ఇండోర్) :


గర్బాలయంలోని శ్రీకాలభైరవుని విగ్రహం పూర్తిగా సింధూరంతో పూయబడి ఉంటుంది.. స్వామి విగ్రహం అల్కాహాల్ ను సేవించుట సైన్సుకు కూడా అంతుబట్టని విచిత్రము..


3. దంతేవాడ (చత్తిస్ ఘడ్ లో జగదల్ పూర్) :


ప్రాచీనాలయం ధ్వంసం కాగా భైరవమూర్తులు ఒక చిన్న పాకలో కొన్ని శతాబ్ధాలు అర్చించబడినాయి.. ప్రస్తుతం కన్పించే భైరవమందిరం ఇటుకలతో నిర్మించబడిన గోడలు, పై కప్పుగా పెంకులతో కన్పిస్తుంది..


ఈ మందిరంలో నాలుగు భైరవమూర్తులు దర్శినమిస్తాయి..


1. వనభైరవుడు

2. జటాభైరవుడు

3. గధాభైరవుడు

4. తాండవభైరవుడు.


4. తేజ్ పూర్ (అస్సాం లో గౌహతి) :


ఇచ్చటి ప్రాచీనాలయంలోని స్వామి పేరు 'మహాభైరవుడు' లింగరూపంలో పూజలందుకుంటాడు. సుమారు 5,500 సం.ల క్రితం శివభక్తుడైన బాణాసురుడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించి, పూజించినట్లు స్థలపురాణం.


నాగులు ఈ లింగాన్ని పూజించేవి అనుటకి నిదర్శనంగా ఆలయ ప్రాంగణంలో సర్పస్తంభాలు, ఆలయం ముందు ప్రవేశద్వారంపై భాగంలో సర్ప ప్రతిమలు కనిపిస్తాయి..


5. ఇసన్నపల్లి / రామారెడ్డి (తెలంగాణ లో కామారెడ్డి జిల్లా) :


సుమారు 11 వ శతాబ్దం లో స్వామి వారి ఆలయం నిర్మించబడింది..


దక్షిణ భారతదేశంలో ఏకైక భైరవక్షేత్రంగా, గ్రహాపీడలను తొలగించే క్షేత్రంగా ఇది చెందినది.


ప్రధాన గర్బాలయంలో 7 అడుగుల ఎత్తుతో ఉన్న కాలభైరవస్వామి వారి విగ్రహం నిల్చోని దిగంబరంగా దర్శనమిస్తుంది..


6. రామగిరి (ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి జిల్లా) :


ఇచ్చట 9వ శతాబ్దంలో నిర్మించబడిన శ్రీ కాలభైరవాలయం, శ్రీ వాలేశ్వర స్వామి వారి ఆలయం ప్రక్కప్రక్కనే ఒకే ప్రాకారంలో అమరియున్నవి.  ఆలయంలో స్వామివారి విగ్రహం సుమారు ఐదు అడుగుల ఎత్తులో గంభీరంగా ఉంటుంది..


7. భైరవసెల (శ్రీశైల క్షేత్రం దగ్గర) :


ఎచ్చటా కానరాని సహజ సిదమైన 7 జలపాతాలతో, లోయలు, కొండలతో ప్రకృతి సౌందర్యంతో పరవశింపజేసే ఈ క్షేత్రంలో ఒకేసారి పాతికమంది కూర్చోవడానికి వీలున్నట్లు భైరవగుహ, ఆ గుహలో శివస్వరూపుడైన భైరవుడు.. ఒక శివలింగం.. స్థానిక చెంచుల దేవుడైన నిరాకార 'బయన్న' దర్శనమిచ్చును..


8. అడవివరం (ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం) :


ప్రకృతి సౌందర్యం మధ్యలో ఆలయం, గోడలు ఏమిలేకుండా పైకి మెట్లు నఇర్మించబడి, చుట్టూ మండపంతో ఓపేన్ ఎయిర్ లో భైరవుడు దర్శనమిస్తాడు..


9. ఖాట్మండు (నేపాల్) :


నేపాల్ దేశ రాజధానిగా ఈ క్షేత్రం ఉన్నది.. నేపాలీయులందరూ కాలభైరవుని ఎక్కువగా ఆరాధిస్తారు..


అందుకే ఇచ్చట అనేక దేవీ దేవతల విగ్రహాలతో పాటు ప్రతిష్ఠించబడిన శ్రీకాలభైరవస్వామికి విశేషంగా పూజలు జరుగుతుంటాయి.. ఇక్కడ స్వామి చిత్రవిచిత్రంగా ఆలంకారాలు చేస్తారు..


10. భైరవకోన (భైరవకొండ) (ఆంధ్రప్రదేశ్ లో బంగోలు జిల్లా) :


ఇక్కడ త్రిముఖదుర్గ అమ్మవారు కొలువైఉంటారు.. అమ్మవారి శిరస్సు మాత్రమే ఉంటుంది.. కార్తికపూర్ణిమ నాటిరాత్రి 7 - 8 గం.ల మధ్య దేవీ ఏదురుగా ఉన్న జలాశయంలో చంద్రకిరణాలు ప్రసరించబడి అమ్మవారి ముఖం మీదికి పరావర్తనం చెందుట అపూర్వం.. క్షేత్రపాలకుడైన కాలభైరవస్వామి గుహాలయం శివాలయాలకు ఎదురుగా నిర్మించబడినది.


11. తిరువైసనల్లూరు (తమిళనాడు లో కుంబకోణం) :


ఇచ్చటి శివయోగినాథాలయంలోని గర్బగుడిలో యోగ భైరవుడు, జ్ఞాన భైరవుడు, స్వర్ణాకర్షణ భైరవుడు, ఉన్మత్త భైరవుడు అను నాలుగు విగ్రహాలను ఒకేసారి దర్శించడానికి వీ‌లుగా ఉన్నవి.


12. న్యూడిల్లి :


ఈ క్షేత్రంలో పురాణాఖిల్లాకు దగ్గరగా అతిప్రాచీనమైన కాలభైరవస్వామి ఆలయం ఉన్నది. మహాభారత కాలంలో పాండవులు ఈ స్వామిని ఆరాధించినట్లు స్థల పురాణం.


13. ధున్నాస్ (ఉత్తరప్రదేశ్) :


ఇచట ధర్మశాలతో పాటుగా శ్రీకాలభైరవస్వామి ఆలయం ఉన్నది. ఇచట నుండి కొంచం దూరం ముందుకు వెల్తే ప్రధాన పీఠ రహదారిలో కాళీమాత మందిరాన్ని దర్శించవచ్చు..


14. మున్నంగి (ఆంధ్రప్రదేశ్ లో గుంటూర్ జిల్లాలో)  :


స్వయంభువులు గా వెలిసిన కాలభైరవుడిని చూడవచ్చు..


15. భైరవపాడు (ఆంధ్రప్రదేశ్ లో గుంటూర్ జిల్లా) :


స్వయంభువులు గా వెలిసిన కాలభైరవుడిని చూడవచ్చు..


16. అధియమాన్ కొట్టాయ్ (కర్నాటక లోని ధర్మపురి జిల్లా) :


9వ శతాబ్దంలో అధియమాన్ అను చక్రవర్తిచే ఇచ్చట కాలభైరవాలయం నిర్మింపబడినది.


17. కచ్ఛాద్రి (కర్నాటక లోని కొల్లూర్ దగ్గర) :


ఇచ్చట గల కొండపై గల ఆలయంలో శ్రీకాలభైరవస్వామి తో పాటుగా ఉమాదేవిగా పిలువబడు అమ్మవారు దర్శనమిస్తారు

ఆలయాలకు వెళ్తాము కానీ అక్కడ ఇచ్చే దేవుడి ప్రసాదాలను ఎలా తినాలో చాలా మందికి తెలియదు ...!! వాటి వివరాలు తెలుసుకోండి...

 ఆలయాలకు వెళ్తాము కానీ అక్కడ ఇచ్చే దేవుడి ప్రసాదాలను ఎలా తినాలో చాలా మందికి తెలియదు ...!! 

వాటి వివరాలు తెలుసుకోండి...



 శివయ్య గుడిలో బిల్వ తీర్థం ఇస్తే 

వెంకయ్య గుడిలో తులసిదళం తీర్థం ఇస్తారు.

 

కొంతమంది స్వయం ఠీవిగా చేతిలో తీసుకుంటారు ఇంకొంతమంది వేరొకరి చేతి నుండి వారి చేతుల్లోకి ఒంపుకుంటారు 

అలాగే గుడిలో చక్కరపొంగళి పులిహోర లాంటివి ఇచ్చినప్పుడు కూడా తినేప్పుడు పొరపాట్లు ఎన్నో జరుగుతుంటాయి 


తీర్థం తీసుకోవాలి అంటే ఎడమచేతి పైన కుడిచేతిని పెట్టి తీర్థం తీసుకుని రెండు కళ్ళకు మొక్కుకుని ఆ తరువాత తాగాలి ,,

తాగేసాక ఆ అరచేతిని తలపైన తుడుచుకుంటారు ..

అలా చేయకండి !

రెండు చేతులలోకి తుడుచుకోండి .


స్త్రీలు తీర్థం ప్రసాదం గుడిలో తీసుకునేప్పుడు వారి పైట కొంగును చేతులతో పట్టుకుని ,పూలు అయితే పైటకొంగులోనే  తీసుకోవాలి 


అలాగే చక్కర పొంగలి లాంటివి ఇచ్చినప్పుడు కుడిచేత్తో తీసుకుని అలాగే నోట్లో వేసేసుకుంటుంటారు కొందరు .

పక్షులకు చేతులు లేవు కనుక అవి అలా తింటాయి , మనకు దేవుడు రెండు చేతులు ఇచ్చాడు కనుక చక్కగా కుడి చేత్తో ప్రసాదాన్ని తీసుకుని ఎడమచేతిలోకి మార్చుకుని కుడిచేత్తో కొద్దికొద్దిగా తీసుకుని తినాలి ..


అలా కాకుండా కుడిచేతిలోకి తీసుకుని ఒకేసారి నోటితో కొరికారంటే మరుజన్మలో పక్షులై పుడతారని చెబుతారు ...


మన అరచేతిలో ముక్కోటి దేవతలు నివాసం ఉంటారని అందుకే నిద్ర లేవగానే అరచేతిని మొదటగా చూడమని మన పెద్దలు చెప్పారు  అదే శాస్త్రం కూడా చెబుతున్నది .


తెలియని వారు ఇప్పుడైనా తెలుసుకుని నడుచుకుంటారుగా ..

దేవుడి ప్రసాదం తీసుకుని ఎలా తినాలో తెలుసుకున్నారు అని అనుకుంటున్న

శివుడు మనకు పదకొండు. ఏకాదశ రుద్రులు అవతారాలతో ఏకాదశ రుద్రులుగా దర్శనమిస్తాడు.

 శివుడు మనకు పదకొండు.    ఏకాదశ రుద్రులు   అవతారాలతో ఏకాదశ రుద్రులుగా దర్శనమిస్తాడు. 



ఓంనమస్తేస్తు భగవన్ 'విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయనమః' అని రుద్రనమకంలో చెప్పబడినది.


దీనిప్రకారం ఏకాదశ రుద్రులపేర్లు 1. విశ్వేశ్వరుడు, 2.మహాదేవుడు,3. త్రయంబకుడు , 4.త్రిపురాంతకుడు, 5.త్రికాగ్నికాలుడు, 6.కాలాగ్నిరుద్రుడు, 7.నీలకంఠుడు, 8.మృత్యుంజయుడు, 9.సర్వేశ్వరుడు,10. సదాశివుడు మరియు 11. శ్రీమన్మహాదేవుడు. 


ఈ ఏకాదశ రుద్రులు ఎక్కడెక్కడ ప్రతిష్టించబడినారో వివరాలు మనం తెలుసుకుందాము.


1. విశ్వేశ్వర రుద్రుడు- వ్యాఘ్రేశ్వరం .(శ్రీబాలాత్రిపుర సుందరీ సమేత వ్యాఘ్రేశ్వర స్వామి):


పూర్వకాలంలో ఒకబ్రాహ్మణోత్తముడు వ్యాఘ్రాన్ని (పులి) శివునిగా భావించి బిళ్వపత్రాలతో అర్చన చేయటంవల్ల ఆ పులి శివలింగరూపాన్ని పొందిందని కధ కలదు. వ్యాఘ్రము శివునిగా అవతరించుటచే వ్యాఘ్రేశ్వర స్వామి అని పిలువబడెను.


2. మహాదేవరుద్రుడు- కె. పెదపూడి (శ్రీపార్వతీ సమేత మేనకేశ్వర స్వామి):


విశ్వామిత్రుని తపోభంగముకొరకు ఇంద్రుడు మేనకను పంపెను. విశ్వామిత్రునకు, మేనకకు శకుంతల జన్మించెను. తరువాత మేనక స్వర్గమునకు పోవుదమని ప్రయత్నించగా ఆమె వెళ్ళలేకపోయినది. అపుడు ఆమె శివుని ప్రార్ధించగా ఆయన ఒకశివలింగమును మేనకకు ఇచ్చి ఆప్రదేశములో ప్రతిష్ఠింపుమనెను. అపుడు మేనక కృష్ణరాయుడు పెదపూడి (కె.పెదపూడి) నందు శివలింగమును ప్రతిష్ఠించి స్వర్గమునకు పోయెనని కధ కలదు. మేనకచే ప్రతిష్ఠింప బడుటచే మేనకేశ్వరస్వామి అని పిలువబడెను. 


3. త్రయంబకేశ్వరుడు - ఇరుసుమండ (శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత ఆనందరామేశ్వర స్వామి):


రావణుని సంహరించిన తరువాత శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై పుష్పకవిమానంలో అయోధ్యకు వెళ్తుండగా మార్గమధ్యంలో ఇరుసుమండ వద్ద వారి పుష్పకవిమానం కదలకుండా నిలిచిపోయినది. అపుడు శ్రీరామచంద్రుడు శివుని ప్రార్ధించి ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించెనని కధ కలదు. అపుడు వారి పుష్పకవిమానము ముందుకు కదలగా వారందరూ ఆనందభరితులైరి. రామునిచే ప్రతిష్ఠింపబడినది కావున రామేశ్వరుడని, అందరికీ ఆనందదాయకమగుటచే ఆనందరామేశ్వరుడని పిలువబడెను. 


4. త్రిపురాంతక రుద్రుడు - వక్కలంక (శ్రీ అన్నపూర్ణా సమేత విశ్వేశ్వర స్వామి):


తారకాసురుని పుత్రులు ముగ్గురు మూడుపురములుగా మారి త్రిపురాసురులుగా పేరొందినారు. దేవతలందరూ త్రిపురాసురులను సంహరింపుమని శివుని ప్రార్ధించగా వారిని శివుడు సంహరించి వక్కలంక గ్రామము నందు శివలింగరూపంలో ఆవిర్భవించెనని కధ కలదు. అపుడు ఆగ్రామపు బ్రాహ్మణోత్తములచే శివలింగము ప్రతిష్ఠింపబడి విశ్వేశ్వరునిగా పిలువబడెను. 


5. త్రికాగ్నికాల రుద్రుడు- నేదునూరు (సర్వమంగళా పార్వతీ సమేత శ్రీ చెన్నమల్లేశ్వర స్వామి):


మూడు అగ్నులయందు హోమము చేసిన ద్రవ్యములను స్వీకరించి శివుడు లింగరూపమును పొందుటచే త్రికాగ్ని కాలునిగా పిలువబడి అగస్త్యమహర్షిచే నేదునూరు గ్రామమున ఈశివలింగము ప్రతిష్ఠింపబడినది. శ్రీ ఉమాచెన్నమల్లేశ్వర స్వామిగా సర్వజనులచే కొలువబడుచున్నాడు.


6. కాలాగ్ని రుద్రుడు- ముక్కామల (బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ రాఘవేశ్వర స్వామి):


రావణ సంహారం తరువాత అగస్త్య మహాముని అయోధ్యకేగుచున్న రామునిచే ఈప్రదేశమున శివలింగాన్ని ప్రతిష్ఠింపజేసెను. కాలాగ్ని రుద్రుడు శ్రీరామునకు దివ్యాస్త్రములను, ఖడ్గమును ప్రసాదించెను. రాఘవునిచే ప్రతిష్ఠింపబడుట వల్ల రాఘవేశ్వరస్వామిగా పిలువబడెను.


పాండవ వనవాస కాలంలో శివుడు అర్జునుని పరీక్షింపదలచి కిరాతునివేషంలో అర్జునుని ధైర్యపరాక్రమములను చూచి పాశుపతాస్త్రమును ప్రసాదించెనని, ఆయనే ఈ కాలాగ్నిరుద్రుడని మరియొక కధ కలదు. 


7. నీలకంఠ రుద్రుడు - మొసలపల్లి ( శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత అనంత భోగేశ్వర స్వామి )


దేవతలు మరియు రాక్షసులు క్షీరసాగర మధన సమయంలో వెలువడిన విషవాయువులను ఎవ్వరికీ హానికలిగించకుండా చేయుటకు శివుడు తనకంఠమునందు నిక్షిప్తముచేసికొని నీలకంఠుడైనాడు. 


ఆగరళకంఠుడే మొసలపల్లి గ్రామమునందు లింగరూపమున ఆవిర్భవించెను. తనను కొలిచినవారికి అనంతభోగాలను అందించేవాడు, మరియు అనేక భోగులను (పాములను) ఆభరణములుగా ధరించినవాడు అగుటవల్ల అనంత భోగేశ్వరస్వామిగా పిలువబడెను.


8. మృత్యుంజయ రుద్రుడు- పాలగుమ్మి (శ్యామలాంబా సమేత శ్రీచెన్నమల్లేశ్వర స్వామి):


శివుడు అర్ధాయుష్కుడైన మార్కండేయుని మృత్యుముఖమునుండి రక్షించి, యముని జయించి "మృత్యుంజయుడు" అయ్యెను. ఈ మృత్యుంజయ రుద్రుడు పాలగుమ్మి గ్రామమునందు లింగరూపమున ఆవిర్భవించి చెన్నమల్లేశ్వర స్వామిగా పిలువబడెను. 


9. సర్వేశ్వర రుద్రుడు- గంగలకుర్రు అగ్రహారం (ఉమాపార్వతీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి):


దక్షుని యజ్ఞంలో సతీదేవి తనతండ్రి చేసిన అవమానాన్ని భరించలేక తనకాలితో నేలపై వ్రాయుటవల్ల ఏర్పడిన అగ్నిజ్వాలలందు కాలిబూడిద అయినపుడు శివుడు ఆగ్రహించి ఉగ్రరూపుడై నృత్యముచేసి తనజటాజూటములో ఒక జటను తీసి నేలపై కొట్టుటవల్ల శివాంశ సంభూతుడైన వీరభద్రుడు జన్మించెను. వీరభద్రుడు అపుడు దక్షయజ్ఞమును ధ్వంసముచేసెను. ఉగ్రరూపుడైన శివుడు వీరేశ్వరస్వామిగా లింగరూపమున గంగలకుర్రు అగ్రహారమునందు వేదపండితులైన బ్రాహ్మణోత్తములచే ప్రతిష్ఠింపబడెను. 


10. సదాశివ రుద్రుడు- గంగలకుర్రు (సర్వమంగళా పార్వతీ సమేత శ్రీచెన్నమల్లేశ్వర స్వామి):


పూర్వం బ్రహ్మవిష్ణులు తమలో ఎవరుగొప్పవారని వాదనకుదిగి శివుని వద్దకు వచ్చిరి. అపుడు శివుడు ఆద్యంతములులేని లింగరూపమును ధరించి బ్రహ్మను తన శిరస్సును చూచిరమ్మని విష్ణువును తన పాదములను చూచిరమ్మని పంపెను. విష్ణువు శివుని పాదములను కనుగొనలేక తిరిగివచ్చి చూడలేకపోయితినని చెప్పెను. కాని బ్రహ్మమాత్రము శివుని శిరస్సును చూడకపోయినను ఒకఆవును, మొగలిపువ్వును సాక్ష్యము తెచ్చుకొని తాను చూచితినని చెప్పెను. శివునికి ఆగ్రహము వచ్చి బ్రహ్మకు పూజాపునస్కారములు లేకుండా శపించి విష్ణువే అగ్రగణ్యుడని చెప్పెను. ఆలింగధారియైన సదాశివుడు గంగలకుర్రు గ్రామములో వేదపండితులైన బ్రాహ్మణోత్తములచే ప్రతిష్ఠింపబడెను. 


11. శ్రీమన్మహాదేవ రుద్రుడు- పుల్లేటికుర్రు (శ్రీబాలాత్రిపురసుందరీ సమేత అభినవ వ్యాఘ్రేశ్వరుడు):


పూర్వకాలంలో విష్ణుమూర్తి శివుని సహస్రకమలాలతో సహస్రనామాలతో పూజించెను. దానికి సంతసించిన మహాదేవుడు విష్ణువుకు సుదర్శన చక్రమును బహూకరించెను. ఆమహాదేవుడు పుల్లేటికుర్రు గ్రామమునందు లింగరూపమున ఆవిర్భవించెను. పుల్లేటికుర్రు గ్రామానికి 'పుండరీకపురము' అని పూర్వకాలంలో పేరు ఉండెడిది. పుండరీకము అనగా వ్యాఘ్రము(పులి) అని అర్ధము కలదు. వ్యాఘ్రేశ్వరమునందు వ్యాఘ్రేశ్వరస్వామి ఉండుటచేత ఈ గ్రామమునందు శివుడు అభినవ వ్యాఘ్రేశ్వర స్వామి అనుపేరుతో పిలువబడెను.

కొత్త తులసి మొక్కను పాతడానికి గానీ, మార్చివేయడానికి గానీ మంచి రోజులు చూడాలా? ఇంట్లో బిల్వవృక్షం (మారేడు) ఉండవచ్చా? దళాలు ఏ రోజుల్లో కోయాలి? ఎన్నాళ్ళు వాడవచ్చు?

 కొత్త తులసి మొక్కను పాతడానికి గానీ, మార్చివేయడానికి గానీ మంచి రోజులు చూడాలా? ఇంట్లో బిల్వవృక్షం (మారేడు) ఉండవచ్చా? దళాలు ఏ రోజుల్లో కోయాలి? ఎన్నాళ్ళు వాడవచ్చు?



శాస్త్రరీత్యా ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస్యాలంటారు. ఆ రోజుల్లో కొత్తగా తులసి మొక్కను మార్చి పాతడం కూడదు. ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, అమావాస్య, శుక్రవారాలలో తులసిని కోయరాదు.

ఇంట్లో బిల్వవృక్షం పెంచుకోవచ్చు. తగిన స్థలం ఉండి, చక్కగా వృద్ధిపొందే అవకాశం ఉన్నప్పుడు బిల్వాన్ని వేయవచ్చు. ఈశాన్య, తూర్పు, ఉత్తర దిశలలో బిల్వవృక్షాన్ని వేయవచ్చు. బిల్వంతో శివార్చన చేయడం మహా పుణ్యఫల ప్రదం. బుధ శని వారాల్లో మారేడు దళాలు కోయాలి. అప్పుడు కోసి భద్రపరచుకొని రోజూ వాడవచ్చు. నిన్న పూజించిన బిల్వాన్ని కడిగి ఇవాళ మళ్ళీ పూజించవచ్చు. అలా ముప్పది రోజుల వరకు పూజించవచ్చు. చతుర్దశి, అమావాస్య, పూర్ణిమ, చతుర్ధి, అష్టమి తిథుల్లో బిల్వాలను కోయకూడదు. వాటికి ముందే కోసి దాచి వాడుకోవాలి.

1008 కూరలతో భోజనం!

 1008 కూరలతో భోజనం!


              


వెయ్యిన్ని ఎనిమిది రకాలు కూరలు ఉన్నాయా?అసలు మామూలు దినమైనా తినడానికి అన్ని రకాలు దొరుకుతాయా? 


ఒక వేళ ఉన్నా ఎవరైనా అన్ని కూరలు వంటలో వాడుతారా? వడ్డిస్తారా?ఒక వేళ వడ్డించినా అన్ని ఎవరు తినగలరు?.


ఒకసారి తమ పితరుల శ్రాద్ధము తిథి భోజనానికి భోక్తగా రమ్మని వశిష్ఠులు విశ్వామిత్రులను పిలిచినారు .


దానికి విశ్వామిత్రులు దానికేమి వస్తాను కాని నాదొక నిబంధన మీరు ఒకవెయ్యి ఎనిమిది రకాల కూరగాయలతో వంట చేసి నాకు వడ్డించవలెను అన్నారు.


మీరు అడిగిన వెయ్యిన్ని ఎనిమిది రకాల కూరలు ఉపయోగించి వంట చేయమని అరుంధతికి చెబుతాను అన్నారు.శ్రాద్ధ దినము రానే వచ్చింది విశ్వామిత్రులు రానే వచ్చినారు. 


వారికి అరటి ఆకు పరచి కాకర కాయకూర పనస పండు మరియు నల్లేరు తీగతో పచ్చడి చేసి ఇంకా కొన్ని కూరలు మాత్రము వాడి చేసిన వంటను అరుంధతి వడ్డించింది. 


వెయ్యిన్ని ఎనిమిది కూరలు అయితే లేవు.దానికి విశ్వామిత్రులు కోపించి ఇదేమిది? ఈ ఆకులో వెయ్యిన్ని ఎనిమిది రకాల కూరలు ఎక్కడున్నాయి ? అన్నారు.


దానికి వశిష్ఠులు నేను తమ కోరికను అరుంధతి వద్ద ముందే చెప్పి ఉంచినాను.మీ కోరిక ప్రకారమే చేస్తాను అని చెప్పింది కూడా అడుగుతాను ఉండండి అన్నారు.


వీరి మాటలు వింటున్న అరుంధతి తానే ముందుకు వచ్చి ఈ శ్లోకాన్ని విశ్వామిత్రులకు చెపుతుంది


కారవల్లీ శతం చైవ వజ్రవల్లీ శత త్రయం పనసమ్ షట్ శతశ్చైవ శ్రాద్ధకాలే విధీయతే


దాని అర్థము:    శ్రాద్ధ సమయములో వడ్డించిన ఒక కాకరకాయ నూరు కూరగాయలకు సమానము. మరియు వజ్రవళ్ళి [ నల్లేరు ]  పచ్చడి మూడు వందల కూరలకు సమానము. పనసపండు ఆరు వందల కూరలకు సమానము.


ఇవి మూడూ కలిపితే మొత్తం వెయ్యి కూరలు.ఇవికాక ఇంకొక ఎనిమిది రకాల కూరలు వండి వడ్డించినాను అంది నమస్కరించి వినయముతో.


అది విని విశ్వామిత్రులు తబ్బిబ్బై నోటమాట రాక భోజనము చేసి  వెళ్లారుట.


   లోకా సమస్తా సుఖినోభవన్తు!

ఉదయాన్నే తులసి దగ్గర దీపం పెట్టి ఎవర్నిచూడాలి?

 ఉదయాన్నే తులసి దగ్గర దీపం పెట్టి ఎవర్నిచూడాలి?




కార్తీక మాసానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? కుమార స్వామిని కార్తికేయుడు అని కూడా అంటారు కదా... ఆయన నుంచి ఈ పేరు వచ్చింది. కృత్తికలు పెంచబడ్డ వాడు కాబట్టే కుమారస్వామి కార్తికేయుడు అయ్యాడు. 


అందుకే.. ఈ నెల దినాలు.. కృత్తికా నక్షత్రాలకు పూజిస్తే.. కుమారస్వామి ఆనందిస్తాడు. కార్తిక మాసం ఉన్నన్ని నాళ్లూ... సూర్యోదయానికి ముందే దీపాలు వెలిగించి తులసిని పూజించాలి. ఆ తర్వాత.. కృత్తికా నక్షత్రాలను పూజించాలి. అలాగే సూర్యాస్తమయం తర్వాత కూడా చేయాలి. అలా చేస్తే కృత్తికా నక్షత్రాలతో పాటు కార్తికేయుడు కూడా చల్లగా చూస్తాడు. 

పసుపు-పరిహారాలు

 పసుపు-పరిహారాలు



పసుపుని సంస్కృతంలో హరిద్ర అని అంటారు. పసుపును అన్ని శుభకార్యాల్లో ఉపయోగిస్తారు. శాస్త్రాల్లో పేర్కొన్న కొన్ని ముఖ్య వస్తువులు ఎవరి నుంచి అయినా పొందవచ్చు. వాటికి మైల ఉండదు. అవేమిటంటే...

1. పసుపు, 2. కుంకుమ, 3. పూలు, 4. పళ్లు, 5. తమలపాకు, 6. వక్క, 7. పాలు, 8. పెరుగు, 9. నేయి, 10. తేనె, 11. కూరగాయలు, 12. తులసి, 13. గంధం అరగదీసే సానరాయి, 14. గంధం చెక్క

వీటిలో పసుపుకు మొదటి స్థానం కల్పించబడింది. అలానే సుమంగళులకు తాంబూలం లేదా ఆకు, వక్క ఇచ్చే సమయంలో మొదట పసుపు ఇచ్చి తరువాత కుంకుమ ఇస్తారు.

పసుపు సౌభాగ్యానికి చిహ్నం. ఈ కారణం చేతనే సుమంగుళులు తన భర్తకు శుభం కోరుతూ మాంగల్యానికి పసుపును ఉంచి నమస్కరిస్తారు.

దేవీ ఆలయాల్లో, నవరాత్రి పూజా సమయంలో దేవికి పసుపుతో చేసే అలంకారాలు ముఖ్యమైనవి. గోదాదేవి లేదా ఆండాళ్ అమ్మవారి దేవాలయానికి మీరు వెళ్లినప్పుడు మీకు పసుపు ప్రసాదాన్ని అందిస్తే

పసుపును ఇంటికి తీసుకు వచ్చి వంటల్లో లేదా స్నానం చేసేందుకు ఉపయోగిస్తారు అలా కాకుండా 

ప్రసాదంగా పసుపును పొంది ఇంటికి తీసుకు వచ్చినప్పుడు ఈ విధంగా చేయండి .

1. దేవుని ప్రసాదమైన పసుపును ప్రతి దినం పూజాస్థానంలో ఉంచి పూజిస్తే ఇంటికి, ఇంట్లో ఉన్నవారికి అన్ని విధాలా ధన, కనక, వస్తు, వాహనాలు వృద్ధి చెందుతాయి.

2. పసుపును నీటిలో వేసి స్నానం చేస్తే దేహ కాంతి పెరుగుతుంది. సమస్త చర్మరోగాలు నయం అవుతాయి. పసుపును నీటిలో వేసి చేసే స్నానాన్ని మంగళ స్నానం అని పిలుస్తారు.

3. పసుపుతో గౌరీదేవిని చేసి పూజించటం ద్వారా ఇంట్లో ఉండే వధువుకు ఉన్న వివాహ దోషాలు తొలగిపోయి, త్వరలో వివాహం నిశ్చయమవుతుంది.

4. దేవికి పసుపు రంగు చీరను ఇస్తే ఇంట్లో ఉండే దోషం మరియు దైవ దోషాలు తొలగిపోతాయి.

5. దుకాణాల్లో చాల రోజులుగా అమ్ముడు కాకుండా మిగిలి ఉండే వస్తువులపై కొద్దిగా పసుపు పొడిని చల్లితే వెంటనే వ్యాపారమవుతుంది.

6. పసుపు నీటితో ఇంటిని కడిగితే ఆ ఇంటికి ఆ ఇంటివారికి డబ్బుకు సమస్య రాదు, అప్పుల బాధ తొలగిపోతుంది.

7. కామెర్లు ఉన్నవారి ఇంటి వారు పసుపును దానంగా ఇస్తే కామెర్ల రోగం తొలగిపోతుంది.

8. ప్రతి సంవత్సరం కామెర్లు వచ్చేవారు సుమంగుళులకు పసుపు రంగు చీర తాంబూలాలను దానంగా ఇస్తే కామెర్ల సమస్య తలెత్తదు.

9. గృహదేవతను పసుపు నీటితో కడిగితే విగ్రహాలకు దైవ కళ పెరుగుతుంది.

10. వ్యాపారం జరుగని దుకాణాల్లో దక్షణావృత శంఖాన్ని పసుపు రంగు కాగితంలో చుట్టి దానిని గల్లాపెట్టెలో ఉంచితే వ్యాపారం బాగా అవుతుంది

తులసి వివాహం , ఈ పండుగ ప్రాముఖ్యత , పూజా విధులు

 తులసి వివాహం , ఈ పండుగ ప్రాముఖ్యత , పూజా విధులు



మన దేశంలో హిందువులకు తులసి పండుగ చాలా పవిత్రమైనది. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం ఈ పండుగను కార్తీక మాసంలో శుక్లపక్ష నాడు జరుపుకుంటారు. 


ఈ రోజున హిందూ భక్తులందరూ తులసి చెట్టుకు వివాహం జరిపిస్తారు. ఇంతకీ తులసి చెట్టుకు ఎవరు తాళి కడతారు ? ఎవరితో వివాహం జరిపిస్తారు ? ఎందుకు ఈ పండుగను జరుపుకుంటారో ఈ కథలో తెలుసుకుందాం..


హిందూ పురాణాల ప్రకారం..


హిందూ పురాణాలలో తులసి దేవిని వృందగా పిలుస్తారు. ఈమె కాలనేమి అనే రాక్షసుడికి అందమైన కూతురు. ఈ యువరాణి జలంధర్ అనే రాక్షసుడిని వివాహం చేసుకుంటుంది. శివుడి మూడో కన్ను నుండి పుట్టిన అగ్నిలో నుండి పుట్టడం వల్ల జలంధరుడికి అపారమైన శక్తులు ఉంటాయి. జలంధర్ దేవుళ్లంటే అసహ్యం. కానీ దేవుళ్లను అమితంగా ఆరాధించే వృందను ప్రేమిస్తు ఉంటాడు. ఈమె మహావిష్ణువుకు మహాభక్తురాలు.


పెళ్లి తర్వాత పెరిగిన శక్తి..


ఆ యువరాణితో పెళ్లి తర్వాత ఆమె భక్తి , పవిత్రత వల్ల జలంధరుడికి శక్తి మరింత పెరిగిపోతుంది. అది ఎంతలా అంటే ఆఖరికి ఈశ్వరుడు కూడా జలంధరుడిని ఓడించలేకపోతాడు. అతని మూర్ఖత్వంతో శివుడినే ఓడించి ఈ సమస్త విశ్వానికి అధిపతి కావాలని కలలు గంటాడు. ఈ సమయంలో దేవుళ్లందరూ విష్ణుమూర్తి సహాయం కోరతారు. విష్ణుమూర్తి వృంద తన భక్తురాలు కావటంతో ఆమెకు జరగబోయే అన్యాయం వల్ల సందిగ్ధంలో పడతాడు. కానీ జలంధరుడి వల్ల జరిగే నష్టం వల్ల విష్ణువు ఓ మాయ చేయాలని నిర్ణయించుకుంటాడు.


జలంధరుని రూపంలో విష్ణువు..


పరమ శివునితో జలంధరుడు యుద్ధంలో ఉండగా , విష్ణువు వృంద వద్దకు జలంధర రూపంలో వస్తాడు. ఆమె అతన్ని గుర్తు పట్టలేక అతడే జలంధర్ అని భావిస్తుంది. కానీ అతను ఆమె తాకగానే తన భర్త కాదని గ్రహిస్తుంది. దీంతో ఆమె పతివ్రత నిష్ట భగ్నం అవుతుంది. వెంటనే జలంధరుడు బలహీనుడు అవుతాడు. అంతలోనే నిజం తెలుసుకున్న ఆమె మహావిష్ణువు నిజ రూపాన్ని కోరుతుంది. ఆమె తను పూజించిన దేవుడే తనను మాయ చేశాడని తెలుసుకుని బాధపడుతుంది.


వృందకు శాపం..


శ్రీ మహావిష్ణువు మారు రూపం తెలుసుకుని , తన పవిత్రతపై జరిగిన మోసానికి ఆమె విష్ణువుని రాయిలా మారిపోమని శపిస్తుంది. విష్ణువు ఆమె శాపాన్ని అంగీకరించి గండక నది వద్ద సాలిగ్రామ శిలగా మారతాడు. ఆ తర్వాత జలంధరుడు పరమశివుని చేతిలో హతుడవుతాడు. దీంతో ఆమె బాధపడుతూ , తన జీవితాన్ని కూడా ముగించాలి అనుకుంటుంది.


లక్ష్మీదేవి విజ్ఞప్తి..


మహా విష్ణువు భార్య లక్ష్మీదేవి జలంధరుడి భార్యతో తన మాటలను వెనక్కి తీసుకొని శాపం ప్రభావాన్ని ఆపమని కోరుతుంది. అప్పుడు ఆమె తన శాపాన్ని వెనక్కి తీసుకుంటుంది. అయితే విష్ణువు యొక్క సాలిగ్రామ రూపాన్ని వివాహం చేసుకున్న తర్వాత ఈ శాపం అంతమవుతుందని చెబుతుంది. దీని తర్వాత ఆమె సతిగా మారుతుంది. (ప్రాచీన కాలంలో హిందూ వితంతువులు చేసిన స్వీయ - ప్రేరణ చర్య). ఆమె దేహం పూర్తిగా కాలిపోయిన తర్వాత తులసి మొక్క బూడిద నుండి పుట్టిందని పురాణాల ప్రకారం తెలిసింది.


తులసి పూజా విధానం..


తులసి చెట్టును లేదా తులసి మొక్క తీసుకుని చిన్న మండపంలా ఏర్పాటు చేసుకోండి.

మండపం చుట్టూ ఎర్రటి చీరతో కట్టండి. అలాగే తులసి మొక్కను లేదా చెట్టును కూడా ఎర్రటి వస్త్రంతో చుట్టవచ్చు.

ఆ తర్వాత తులసి కొమ్మలకు ఎర్రటి గాజులతో అలంకరించండి.

విఘ్నేశ్వరుడు మరియు ఇతర దేవుళ్లకు ప్రార్థనలు చేయండి. అప్పుడు సాలిగ్రామ్ ను కూడా ఆరాధించండి.

తులసి చెట్టు దగ్గర కొబ్బరికాయ , చక్కెర బొమ్మలు , ఐదు రకాల పండ్లను ఉంచండి. అనంతరం హారతి ఇచ్చి తులసి మరియు లార్డ్ సాలిగ్రామ్ జపిస్తూ ప్రార్థించండి.


పండుగ యొక్క ప్రాముఖ్యత..


తులసి వివాహం చేయడం వల్ల వివాహ జీవితంలో కష్టాల నుండి ప్రయోజనం పొందవచ్చు. అలాగే పెళ్లి చేసుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఈ తులసి పూజను చేస్తే వారికి పరిష్కారం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ పండుగ వివాహ సంబంధిత సమ్యలను తొలగిస్తుందని చెబుతారు.


ద్వాదశ దీపాలు..


క్షీరాబ్ది ద్వాదశిగా పిలుచుకునే తులసి పండుగ రోజున సాయంత్రం వేళలో హిందువుల ఇళ్లలో తులసి మొక్క , లేదా తులసి చెట్టు దగ్గర ధాత్రి (ఉసిరి మొక్కను) ఉంచి విష్ణుమూర్తికి పూజలు చేస్తారు. అలాగే 12 లేదా 16 లేదా 21 దీపాలను వెలిగించి మహిళలు ప్రత్యేకంగా పూజలు చేస్తారు. వీటినే ద్వాదశ దీపాలు అంటారు. ఆ రోజున ప్రతి ఇంటా దీపాల కాంతులతో వెలుగులు విరాజిల్లుతాయి. వైవియస్ఆర్


తులసి మొక్కను గౌరీదేవిగా


తులసి మొక్కను గౌరీదేవిగా , ఉసిరి మొక్కను శ్రీ మహావిష్ణువుగా పూజింపడం వల్ల , గౌరీ పూజ చేయడం వ్లల ఆర్థిక బాధలు తొలగి , సర్వ సంపదలు కలుగుతాయి. ఉసిరి మొక్కను సాక్షాత్తు విష్ణుమూర్తిగా భావిస్తారు కాబట్టి , స్వామి ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీ…


శివుడిని మూర్తి రూపంలో కంటే లింగరూపంలో ఆరాధించడం వల్ల కలిగే ఫలితాలు విశేషంగా ఉంటాయి.

 శివుడిని మూర్తి రూపంలో కంటే లింగరూపంలో ఆరాధించడం వల్ల కలిగే ఫలితాలు విశేషంగా ఉంటాయి. పరమేశ్వరుడి విగ్రహాన్ని పూజించేవారికంటే, శివలింగారాధన చేసేవరిలో తెజస్సు, శక్తి అధికంగా ఉంటాయని కృష్ణపరమాత్మ మహాభారతంలో చెప్తారు. మనకు లోకంలో చాలా రకాల లింగాలు కనిపిస్తాయి. అందులో ఈ రోజు ఒక 2 లింగాల గురించి చెప్పుకుందాం.


 


లింగం అంటే గుర్తు, ప్రతిరూపం (Symbol) అని అర్దం. అన్నిటియందు ఆ పరమశివుడు అంతర్యామిగా ఉన్నాడు. ఈ సృష్టి అంతా లింగమే. అందుకే రుద్రం ఈ జగత్తు అంతా వ్యాపించి ఉన్న శివతత్వాన్ని ప్రకటించింది.


కొండలు, పర్వతాలు, నదులు, శిలలు, మొక్కలు, చెట్లు ..... ఇలా కదలనివాటిని స్థావరములు అంటారు. ఈ స్థావరములన్నీ #శివస్వరూపం అంటున్నది శివ పురాణం. అందుకే ఇవన్నీ స్థావర లింగాలు అంటున్నది శివ పురాణం. మనం మొక్కలకు నీరు పోస్తే (ఏ చెట్టైనా కావచ్చు), అది కూడా శివార్చనగా భావించి అనుగ్రహం ప్రసాదిస్తాడు పరమశివుడు. అట్లాగే ప్రకృతి వనరులను విచ్చలవీడిగా దోచుకోవడం స్థావర లింగ రూపంలో ఉన్న శివుడికి చేసే అపచారం అయితే ప్రకృతి వనరులను సంరక్షించుకోవడం, అవసరమైనంత మేర, వృధా చేయకుండా వాడుకోవడం శివుడికి ఇచ్చే గౌరవం. ఇంకా చెప్పాలంటే నీరు వృధా చేయడం కూడా శివుడికి అపచారమే. ఇది దీని కిందే వస్తుంది. 


రెండవది జంగమ #లింగం. జంగమాలంటే కదిలేవి అని అర్దం. జంతువులు, మనుష్యులు, పక్షులు, క్రిమికీటకాలు లాంటివి. ఇవి కూడా శివుడి స్వరూపాలే. వీటిని జంగమ లింగాలు / లింగం అంటారు. ఆపదలో ఉన్నవారికి పవిత్ర భావనతో, ఏ ఉపకారం ఆశించకుండా చేసే సాయం, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, దైవభావంతో పెద్దలకు, దీనులకు సేవ చేయడం జంగం లింగానికి చేసే అర్చన. ఇక ఇది చలికాలం, అనేకమంది చలికి వణుకుతూ రోడలపై పడుకుంటారు. అటువంటి వారికి దుప్పట్లు పంచడం, ముష్టివారికి కాసింత అన్నం పెట్టడం, చదువు యందు ఆసక్తి ఉన్న పేద విద్యార్ధులకు పుస్తకాలు పంచిపెట్టడం, పీజు కట్టడం కూడా ఈ జంగమ లింగానికి అర్చన క్రిందే వస్తుంది. 


మనకు శివ పూజ చేయాలన్న తపన ఉండాలి కానీ, అందుకు అనేక మార్గాలు చూపించాడు మహాశివుడు.


ఓం నమః శివాయ

బ్రాహ్మీముహూర్తంలో లేస్తే ఏంటట అనేవారికి సమాధానం

 బ్రాహ్మీముహూర్తంలో లేస్తే ఏంటట అనేవారికి సమాధానం 




ఉదయాన్నే నిద్రలేవాలని మన పెద్దవాళ్లు తెగ పోరేవారు. అలా చెప్పీ చెప్పీ చాలా తరాలు వెళ్లిపోయాయి. తరం మారుతున్న కొద్దీ జీవవనశైలి మారిపోతోంది. నిద్రలేచే సమయాలూ, పనిచేసే వేళలూ మారిపోతున్నాయి. కొన్నాళ్ల తరువాత పని చేయడానికీ, నిద్రపోవడానికీ రాత్రీపగలుతో సంబంధమే లేకపోవచ్చు. కానీ ఇప్పటికీ బ్రాహ్మీముహూర్తం` అన్న మాట అక్కడక్కడా వినిపిస్తూనే ఉంటుంది. ఇంతకీ ఆ బ్రాహ్మీముహూర్తం అంటే ఖచ్చితంగా ఏ సమయంలో వస్తుంది. ఆ సమయంలో నిద్రలేవడం వల్ల ప్రయోజనం ఏంటి!


సూర్యోదయానికి 96 నిమిషాల ముందున్న కాలాన్ని బ్రాహ్మీముహూర్తం అంటారు. అయితే రుతువుని బట్టి సూర్యోదయ వేళలు మారిపోతూ ఉంటాయి కాబట్టి, 4:00 -4:30 a.mని బ్రాహ్మీముహూర్తంగా అనుకోవచ్చు. బ్రాహ్మీ అంటేనే సరస్వతి అని అర్థం. మన పెద్దలు చాలా ఆలోచించే ఆ పేరు పెట్టారేమో అనిపిస్తుంది. ఈ సమయంలో నిద్రలేవడం వల్ల ఉపయోగం ఏంటి అని అడిగే ప్రశ్నకు చాలానే జవాబులు వినిపిస్తాయి.


ఆ సమయంలో ప్రకృతి మొత్తం ప్రశాంతంగా, నిద్రలోని ఆఖరి జామును గడుపుతూ ఉంటుంది. సూర్యుని వేడి భూమిని కాస్త తాకుతూ ఉంటుంది, కానీ వెలుతురు ఇంకా మనల్ని చేరుకోదు. అంటే రాత్రివేళ చల్లదనాన్నీ, పగటివేళ చురుకుదనాన్నీ ఏకైక కాలంలో కలిగిఉండే సమయం ఇదన్నమాట! అందుకే ఈ సమయంలో మనుషులు సత్వగుణం ప్రధానంగా ఉంటారట. లేలేత కిరణాలు శరీరాన్ని తాకడం చాలా మంచిదని వైద్యులు కూడా చెబుతున్నారు కాబట్టి, ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని సూర్యనమస్కారాలు చేయడమో, వ్యాహ్యాళికి వెళ్లడమో చేస్తే ఆరోగ్యానికి మంచిది.


మనలో జీవగడియారం అనేది ఒకటి ఉంటుంది. అది మనం ఏర్పరుచుకున్న అలవాట్లను బట్టీ, ప్రకృతిని బట్టీ నడుచుకుంటూ ఉంటుంది. నిద్రపోవడం, లేవడం, కాలకృత్యాలు తీర్చుకోవడం… ఇవన్నీ సమయానికి అనుకూలంగా చేస్తేనే ఆరోగ్యంగా ఉంటాం. సాక్షాత్తూ ఆయుర్వేదమే `తన ఆరోగ్యాన్నీ, ఆయుష్షునూ కాపాడుకోవాలని అనుకునేవాడు బ్రాహ్మీముహూర్తంలో లేవాలి` అని చెబుతోంది.


 పైగా ఆయుర్వేదం ప్రకారం ఈ సమయం `వాత` ప్రధానంగా ఉంటుంది. శరీరంలో కదలికలనీ, ఆలోచనలనీ, రక్తప్రసరణనీ ప్రభావితం చేసేది ఈ `వాత` లక్షణం. ఈ లక్షణం మన శరీరంలో ప్రముఖంగా ఉన్నప్పుడు మనం ఎలాంటి పనినైనా చురుగ్గా చేయగలం; ప్రశాంతంగా ఉండగలం; మంచి ఆలోచనలు చేయగలం; చదివినదానిని ఆకళించు చేసుకుని దీర్ఘకాలం జ్ఞప్తికి ఉంచుకోగలం.


ధ్యానం చేయాలనుకునేవారికి కూడా ఈ సమయం చాలా అనుకూలమని యోగశాస్త్రం చెబుతోంది. మన శరీరంలో ఇడ, పింగళ, సుషుమ్న నాడులు ఉంటాయిని యోగుల నమ్మకం. బ్రాహ్మీముహూర్తంలో సుషుమ్న నాడి చాలా ఉత్తేజితంగా ఉండి… ధ్యానం చాలా సులువుగానూ, ప్రభావవంతంగానూ సాగే అవకాశం ఉంటుందట.


ఉదయాన్నే మన శరీరంలోనూ, చుట్టూ ఉన్న ప్రకృతిలోనూ ఉండే ప్రశాంతత వల్ల యోగా, ధ్యానం, చదువు… చాలా తేలికగా ప్రభావవంతంగా సాగుతాయి. రోజువారీ చేయాల్సిన విధులకు (ఉద్యోగం, కాలేజ్‌, వంటావార్పూ…) ముందు కాస్త సమయం చేజిక్కుతుంది. అలా కాకుండా ఆలస్యంగా లేచి ఒక్కసారిగా మన పనులలో చేరేందుకు పరిగెత్తడం వల్ల… మన మనసు, శరీరం విపరీతమైన ఒత్తిడికి లోనవుతాయి.


గుండెజబ్బులు ఉన్నవారికి తెల్లవారుజామునే గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందనీ, పైగా అలా వచ్చే గుండెపోటు చాలా తీవ్రంగా ఉంటుందనీ వైద్య గణాంకాలన్నీ సూచిస్తున్నాయి. గుండెల్లో రక్తనాళాలను గడ్డకట్టించే `థ్రోంబస్‌` అనే సమస్య ఉదయం వేళల్లోనే ఎక్కువగా ఉంటుందట. ఇలా ఎందుకు జరుగుతుందనే దానికి ఖచ్చితమైన కారణాలు ఏవీ చెప్పలేకపోతున్నారు వైద్యులు. పైగా ఇదే సమయంలో మనం హడావుడిగా లేచి విధుల్లోకి చేరాలనే టెన్షన్‌లో మనలోని రక్తపోటు మరింత ఎక్కువై అది గుండెపోటుకి దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.


 అయితే బ్రాహ్మీముహూర్తంలోనే నిద్రలేచి, వీలైతే కాసేపు ధ్యానం చేసుకుని… స్థిమితంగా రోజువారీ పనులకి సిద్ధపడితే మన రక్తపోటు కూడా సాధారణంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇన్ని చదివిని తరువాత బ్రాహ్మీముహూర్తంలో లేవడాన్ని ఛాదస్తం అని ఎలా అనుకోగలం చెప్పండి! 


సర్వ్ జనాః సుఖినోభవంతు..


ఓం నమః శివాయ

అంత్యక్రియలు అప్పుడు కుండలో నీరు పోసి రంధ్రాలు పెట్టి పగలగొడతారు ఎందుకో తెలుసా?

 అంత్యక్రియలు అప్పుడు కుండలో నీరు పోసి రంధ్రాలు పెట్టి పగలగొడతారు ఎందుకో తెలుసా?



     వాస్తవానికి శరీరం ఆత్మ రెండు వేరు వేరు. కలియుగ ధర్మం ప్రకారం.. మనిషి జీవితకాలం 120 సంవత్సరాలు. కానీ... ఈ మందుల తిండికి ఆయుష్షు 100 సంవత్సరాల లోపు పడిపోయింది. ఇంకా కొందరైతే ఈ కొత్త కొత్త రోగాలకు 60 కే అంతిమయాత్ర అవుతుంది.

    ఆత్మ చెప్పినట్టు శరీరం వినాలంటే... శరీరం ఆరోగ్యంగా ఉండాలి. శరీరంలో ప్రాణం ఉన్నంత సేపు అందులో ఆత్మ ఉంటుంది. శరీరం చనిపోయిందంటే ఆత్మ అందులో ఉండలేదు. ఎందుకంటే ఆత్మ చెప్పినట్టు శరీరం వినే స్థితిలో లేదు.

    బతికి ఉన్నంత కాలం భార్యాపిల్లలు, బంధువులు, స్నేహితులు, తాగుడు, తినుడు, పైసా సంపాదన లో లీనమై పోతుంది. ఎప్పుడైతే మనిషి చనిపోతాడో... శరీరం నుండి ఆత్మ వేరైపోతుంది. శరీరాన్ని దహనం చేసే దాకా... ఆత్మ, మళ్లీ తన శరీరం లోకి చొచ్చి తిరిగి శరీరాన్ని లేపి, మళ్ళి... తన వాళ్లతో కలిసి ఉండాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది.

    పాడె కట్టి శరీరాన్ని ఎత్తుకు పోయేటప్పుడు స్మశానానికి కొద్ది దూరంలో దాన్ని దింపి, చిన్న ముల్లెలో కట్టిన బియ్యాన్ని

(డెలివరీ అయి బిడ్డ బతికి చనిపోయిన ఆడవాళ్ళకి ఆవాలను కడతారు) విప్పి కింద పోస్తారు.

ఎందుకంటే.. శరీరాన్ని కాల్చిన తర్వాత కూడా ఇంటి మీద.. తన వాళ్ళ మీద.. ఇష్టంతో ఆత్మ ఇంటికి రావాలంటే శరీరం మీద చల్లిన ప్యాలాలను, ఈ బియ్యాన్ని, పూర్తిగా ఒక్కో గింజను లెక్కించిన తర్వాతనే... ఆత్మకి తన వాళ్లను చూడడానికి అనుమతి దొరుకుతుంది. అది కూడా సూర్యోదయం లోపు మాత్రమే.. అంతలోపు లెక్కించకపోతే, మళ్ళీ... తిరిగి మొదటి నుండి లెక్కించాలి.

   శరీరాన్ని చితి మీద పెట్టి కుండలో నీరు పోసి దానికి రంధ్రాలు చేసి చుట్టూ తిరుగుతారు. ఎందుకంటే... కుండా నీ శరీరం లాంటిది, అందులో ఉన్న నీరు, నీ ఆత్మ లాంటిది. కుండకు పెట్టిన రంధ్రం నుండి నీరు ఎలాగైతే వెళ్లి పోయిందో... నీ శరీరం నుండి నీ ఆత్మ బయటికి పోయింది. కుండను కింద పడేసి పగలగొడతాం అంటే.. ఇప్పుడు నీ శరీరాన్ని కాల్చేస్తాము. ఇంకా నీకు ఈ శరీరం ఉండదు, నువ్వు వెల్లిపో.. అని ఆత్మకు మనమిచ్చే సంకేతం.


హిందూ సాంప్రదాయం లో చేసే ప్రతి పనికి ఓ అర్థం దాగి ఉంటుంది. కానీ తెలిసిన వారు, తెలియని వాళ్లకు చెప్పరు. అదే మన ఖర్మ...

ఇలా ఎందుకు చేస్తున్నారు, అంటే...

ఏమో నాకు తెలియదు మా తాత ఇలాగే చేసాడు నేను ఇలాగే చేస్తున్నాను

కానీ.. ఎందుకు చేస్తున్నానో తెలియదు.


దయచేసి భారత ఆచార, సాంప్రదాయాల గురించి తక్కువ అంచనా వేయకండి. అందులో నిగూఢ అర్థం దాగి ఉంటుంది....

ఏ వారం.. ఏ పూజ... ఏ ఫలితం?

 ఏ వారం.. ఏ పూజ... ఏ ఫలితం?



కొంతమంది భక్తులు ఎప్పుడు ఏ దేవుడికి పూజ చేస్తే ఎలాంటి పుణ్యఫలితం దక్కుతుందో తెలిస్తే కచ్చితంగా ఆ పూజ మాత్రమే చేసుకుని త్వరగా ఫలితాన్ని పొందాలనుకుంటుంటారు. అలాంటి వారికోసమేనన్నట్టు శివమహా పురాణం విద్యేశ్వర సంహిత పద్నాలుగో అధ్యాయంలో దీనికి సంబంధించిన విషయాలున్నాయి. దేవతల ప్రీతి కోసం అయిదు విధాలైన పూజ ఏర్పడింది. 


మంత్రాలతో జపం, హోమం, దానం, తపస్సు, సమారాధనలు అనేవే అయిదు విధాలు. సమారాధనం అంటే దేవుడి ప్రతిమ నుంచే వేదిక. ప్రతిమ, అగ్ని, లేక బ్రాహ్మణుడిని షోడశోపచారాలతో పూజించటం ఈ నాలుగు రకాలలో ఒక దానికంటే ఒకటి ఉత్తమమైనది. పూజలు మనకున్న ఏడు వారాలలో ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవతకు చెయ్యాల్సి ఉంటుంది.


ఆదివారం: ఆదివారం ఆదిత్యుడిని, ఇతర దేవతలను, వేద పండితులను పూజించాలి. ఆదిత్య పూజ వల్ల నేత్ర సమస్యలు, శిరోరోగం, కుష్ఠురోగం తగ్గుతాయి. ఆదిత్యుడిని పూజించి వేద పండితులకు భోజనం పెట్టాలి. ఇలా ఒక రోజు నుంచి ఒక మాసం, ఒక సంవత్సరం లేక మూడు సంవత్సరాల పాటు రోగ తీవ్రతననుసరించి పూజ చేయాలి. దీనివల్ల సూర్యానుగ్రహప్రాప్తి కలుగుతుంది.


సోమవారం: సోమవారం సంపద కోరుకోనేవారు లక్ష్మీదేవిని ఆరాధించాలి. ఆ రోజున పూజ తర్వాత వేద పండిత దంపతులకు నెయ్యితో భోజనం పెట్టాలి.


మంగళవారం: రోగాలు తగ్గటం కోసం మంగళవారం కాళీదేవతను పూజించాలి. మినుము, కంది, పెసరపప్పులతో చేసిన పదార్థాలతో వేద పండితులకు భోజనం పెట్టాలి.


బుధవారం: బుధవారం పెరుగు అన్నాన్ని విష్ణువుకు నివేదించాలి. ఈ పూజ, నివేదనల వల్ల పూజ చేసిన వారి కుమారులు, మిత్రులు, భార్య తదితరులకు చక్కటి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది.


గురువారం: గురువారం ఆయుష్షును, ఆరోగ్యాన్ని కోరేవారు తమ ఇష్టదైవం ఎవరైతే వారికి పాలతో, నెయ్యితో చేసిన పదార్థాలను నివేదించాలి. వస్త్రాలను కూడా నివేదించి అర్చన చేయడం మేలు.


శుక్రవారం: శుక్రవారం కూడా ఇష్టదైవాన్ని శ్రద్ధతో ఆరాధించి భోగాలను పొందవచ్చు. ఆ రోజున పూజానంతరం వేదపండితుల తృప్తి కోసం షడ్రుచులతో కూడిన భోజనాన్ని పెట్టాలి. స్త్రీల సంతృప్తి కోసం మంచి మంచి వస్త్రాలను బహూకరించాలి.


శనివారం: శనివారం రుద్రాది దేవతల ఆరాధన మంచిది. అపమృత్యువు నుంచి తప్పించుకోవాలనుకునేవారు ఆనాడు నువ్వులతో హోమం చేసి నువ్వులను దానం ఇచ్చి నువ్వులు కలిపిన అన్నంతో పండితులకు భోజనం పెట్టాలి. ఇలా చేయటం వల్ల పూజ చేసిన వ్యక్తికి మంచి ఆరోగ్యం చేకూరుతుంది.


ఇలా ఏడు రోజులతో ఏ దేవతకు పూజ చేసినా ముందుగా సంతోషపడేది శివుడేనని శివపురాణం వివరిస్తోంది. ఆ వారాలకు సంబంధించిన దేవతల ఆనందమే తన ఆనందంగా శివుడు భావించుకొంటాడు. ఆ పూజాఫలాన్ని ఆ దేవతలుకాక శివుడే స్వయంగా ఆ భక్తులకు ప్రసాదిస్తాడు. సృష్టి ప్రారంభంలో ముల్లోకాల అభివృద్ధి కోసం పాప పుణ్యాలు రెండిటినీ శివుడు కల్పించాడు. పాపం చేయటం లేదా పుణ్యం చేయటమనేది మానవుల పూర్వజన్మ కర్మఫలాన్ని అనుసరించి ఉంటుంది. 


చేస్తున్నది పాపమని పెద్దలు లేదా గురువుల నుంచి తెలుసుకొని ఆ పాపకార్యాలను విడిచిపెట్టి పుణ్య సంపాదన కోసం మనిషి ప్రయత్నం చేయాలి. ఈ క్రమంలోనే కర్మఫలాన్ని అనుసరించి వచ్చిన కొన్ని రోగాలను, కష్టాలను తప్పించుకోవడం కోసం పూజలు రూపొందాయి. ఈ విషయాన్ని గ్రహించి ఎవరు ఏ ఫలితం కావాలనుకొంటే ఆ రోజున ఆ పూజ చేసుకోవచ్చన్నది శివపురాణం ఇస్తున్న సూచన

భోజనం - సదాచార నియమాలు............!

 భోజనం - సదాచార నియమాలు............!!


1. భోజనానికి ముందు,తరువాత తప్పక కాళ్ళు, చేతులు  కడుక్కోవాలి.  తడికాళ్ళను తుడుచుకుని భోజనానికి కూర్చోవాలి.

2. తూర్పు, ఉత్తరం వైపు కూర్చుని భోజనం చేయడం మంచిది.

3. ఆహార పదార్థాలు(కూర, పప్పు, పచ్చళ్ళు, మొ.) తినే పళ్ళానికి తాకించరాదు.  అలా చేస్తే అవి ఎంగిలి  అవుతాయి. 

ఎంగిలి పదార్థాలు ఎవ్వరికీ పెట్టరాదు. చాలా దోషం.  

4. అన్నపు పాత్రలో నేతి గిన్నెను పెట్టి కాచడం చేయరాదు. మెతుకులు నేతిలో పడరాదు.

5. భోజనం చేస్తున్నప్పుడు మధ్యలో లేవకూడదు.

6. ఎంగిలి చేతితో ఏ పదార్థాన్ని చూపించరాదు. తాకరాదు.  

7. ఎడమచేతితో తినే కంచాన్ని ముట్టుకోకూడదు.  ఒకవేళ కంచాన్ని ముట్టుకుంటే ..వెంటనే ఎడమచేతితో నీటిని ముట్టుకోవాలి.  

8. సొట్టలు ఉన్న కంచం, విరిగిన కంచం భోజనానికి పనికిరాదు.  

9. నిలబడి అన్నం తింటూ ఉంటే క్రమంగా దరిద్రులు అవుతారు.

10. ఉపనయనం అయినవారు తప్పక ఆపోశనము పట్టి గాయత్రీ మంత్రంతో ప్రోక్షణ చేసుకుని భోజనం చేయాలి. ఉపనయనం కాని వారు భగవన్నామము ఉచ్చరించి భోజనం చేయాలి.

11. అన్నం తింటున్నప్పుడు వంట బాగాలేదని దూషించడం, కోపముతో అన్నం పెట్టేవారిని తిట్టడం చేయరాదు.

12.  ఆపోశనము అయ్యాక ఉప్పు వడ్డించుకోరాదు. ఏవైనా పదార్థాలలో ఉప్పు తక్కువైతే  ఆ పదార్థాలు ఉన్న గిన్నెలలో ఉప్పు వేసుకుని వడ్డించుకోవాలి.

13. కంచం ఒడిలో పెట్టుకుని భోజనం చేయరాదు. పడుకునే  మంచం మీద భోజనం చేయరాదు.  (ఇది వృద్ధులకు, అనారోగ్యం ఉన్నవారికి వర్తించదు.)

14. మాడిన అన్నాన్ని నివేదించరాదు.  అతిథులకు పెట్టరాదు.

15. భోజనం అయ్యాక క్షురకర్మ చేసుకోరాదు. (వెంట్రుకలు కత్తిరించడం)

16. గురువులు లేదా మహాత్ములు ఇంటికి వస్తే  మనం తినగా మిగిలినవి పెట్టరాదు. మళ్ళీ ప్రత్యేకంగా వంటచేయాలి. 

17. భోజనం వడ్డించేటప్పుడు పంక్తిబేధం చూపరాదు. అనగా ఒకరికి ఎక్కువ వడ్డించడం మరొకరికి తక్కువ వడ్డించడం చేయరాదు. 

18. భోజనం చేస్తున్నప్పుడు తింటున్న పదార్థాలలో వెంట్రుకలు, పురుగులు వస్తే తక్షణం విడిచిపెట్టాలి.

19. వడ్డన పూర్తి అయ్యాక విస్తరిలో లేదా కంచంలో ఆవునెయ్యి వేసుకుంటే ఆహారం శుద్ధి అవుతుంది. 

20. భగవన్నామము తలుచుకుంటూ లేదా భగవత్ కథలు వింటూ  వంట వండడం, భోజనం చేయడం చాలా ఉత్తమం. 

21. ఉపాసకులను, ఏదైనా దీక్షలో ఉన్నవారిని ఎక్కువ తినమని బలవంతపెట్టరాదు. ( అతిగా ఆహారం స్వీకరిచడం వారి అనుష్ఠానానకి  ఇబ్బంది అవ్వచ్చు) 

22. భోజనం చేస్తున్నవారు (అనగా భోజనం మధ్యలో తింటూ) వేదం చదువరాదు.  

23. గిన్నె మొత్తం ఊడ్చుకుని తినరాదు. ఆహార పదార్థాలను కాళ్ళతో తాకరాదు.

24. భోజనం చేస్తున్నప్పుడు నీళ్ళ పాత్రను కుడివైపు ఉంచుకోవాలి.

25. స్త్రీలు బహిష్టు కాలంలో వంట వండరాదు, వడ్డించరాదు. వారు ఆ 4 రోజులు ఎవరినీ తాకరాదు. వడ్డన సమయంలో అక్కడ ఉండరాదు.

26. అరటిఆకుల వంటి వాటిలో   భోజనం చేసిన వ్యక్తి  వాటిని మడవకూడదు  (తిన్న విస్తరిని మడవడం అనాచారం).   తన ఇంటిలో ఒక్కడు ఉన్నప్పుడు ఈ నియమం వర్తించదు.

27. ఎంగిలి విస్తరాకులను తీసేవాడికి వచ్చే పుణ్యం అన్నదాత కు కూడా రాదని శాస్త్రం. (జగద్గురువైన శ్రీ కృష్ణుడు కూడా ధర్మరాజు చేసిన రాజసూయయాగం లో లక్షలాది మంది తిన్న ఎంగిలి ఆకులు ఎత్తాడని మహాభారతం చెబుతోంది.)    

28.  భోజనం అయ్యాక రెండుచేతులూ,కాళ్ళూ కడుక్కోవాలి.  అవకాశం లేనప్పుడు రెండు చేతులైనా తప్పక కడుక్కోవాలి.  నోరు నీటితో పుక్కిలించుకోవాలి.

29.  భోజనం అయ్యాక నేలను లేదా బల్లను శుద్ధి(మెతుకులు తీసేసి,తిన్న చోట తడిగుడ్డతో శుభ్రం) చేసి   మాత్రమే అక్కడ వేరేవారికి భోజనం వడ్డించాలి.(ఇప్పటికీ సదాచారాలు పాటించే కొందరి ఇళ్ళల్లో గోమయం లేదా పసుపు నీళ్ళు చల్లి మరీ శుద్ధి చేస్తారు.)  

30.  స్నానం చేసి మాత్రమే వంట వండాలని కఠోర నియమము.  పెద్దలు,సదాచారపరులు హోటళ్ళలో మరియు ఎక్కడంటే అక్కడ భోజనం  చేయకపోవడానికి ఇదే ముఖ్యకారణం.  అక్కడ వంట చేసే వారు స్నానం చేసారో లేదో తెలియదు,

పాచిముఖంతో వంట చేసినా, రోడ్డు మీద తిరిగే చెప్పులు ధరించి వంటచేసినా దోషం.  అవి తిన్న వారికి మెల్లగా వారి మనసుపై ప్రభావం చూపుతుంది. పుణ్యం క్షీణిస్తుంది.

31. ఒకసారి వండాక అన్నము, కూర, పప్పు వంటి ఇతర ఆహార పదార్థాలను మళ్ళీ వేడి చేసి తినరాదు. ద్విపాక దోషం వస్తుంది. 

32. ఆడవారు గాజులు ధరించకుండా భోజనం చేయరాదు. వడ్డించరాదు.

RECENT POST

కాణిపాకం శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు

కాణిపాకం శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు ప్రతీరోజు ఈ స్తోత్రం కనీసం 4 సార్లుపఠిస్తేచాలామంచిది ఇంకా ఎక్కువ సార్లు పఠించే సమయము, శక్తి...

POPULAR POSTS