Saturday, June 1, 2024

ఆంజనేయ స్వామి లేని #ఒంటిమిట్ట రామాలయం

*ఆంజనేయ స్వామి లేని #ఒంటిమిట్ట రామాలయం*
                  

రామాలయం లేని ఊరూ రామాయణం వినని వారూ ఉండరంటారు. దేశంలో ఏ రామాలయానికి వెళ్లినా రాముడి కుడివైపున లక్ష్మణుడు, ఎడమ వైపున సీతాదేవి, పాదాల దగ్గర నమస్కార భంగిమలో హనుమంతుడి విగ్రహాలు దర్శనమిస్తాయి.కానీ ఈ ఆలయంలో ఆంజనేయుడి విగ్రహం ఉండదు. అలాంటి అరుదైన ఆలయమే ఒంటిమిట్ట రామాలయం. ఏకశిలపైన సీతారామలక్ష్మణ విగ్రహాలున్న ఈ ఆలయంలో రాముడు యోగముద్రలో దర్శనమివ్వడం విశేషం.

 *ఆంధ్రా అయోధ్యగా పిలిచే ఈ ఆలయం కడప జిల్లాలో ఉంది.*

ఆంధ్రా అయోధ్యగా అపర భద్రాద్రిగా గుర్తింపు పొందిన కడప జిల్లా ఒంటిమిట్ట రామాలయంలోని గర్భగుడిలో మనకు ఏకశిలపైన సీతారామలక్ష్మణ విగ్రహాలు కనిపిస్తాయి తప్ప హనుమంతుడి విగ్రహం ఉండదు. ఈ ఆలయం బయట హనుమంతుడి గుడి విడిగా ఉంటుంది. కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో ఏటా జరిగే సీతారామ కల్యాణాన్ని చూసేందుకు రెండు కళ్లూ చాలవంటారు.

 #స్థలపురాణం 

   ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి వివిధ కథలు ప్రచారంలో ఉన్నాయి.

     ఒకప్పుడు ఒంటిమిట్ట కీకారణ్యంలా ఉండేదట. పద్నాలుగేళ్ల వనవాస సమయంలో రాముడు సీతా లక్ష్మణ సమేతుడై ఈ అరణ్యంలోనూ కొంతకాలం గడిపినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆ సమయంలో మృకండు, శృంగి అనే మహర్షుల ఆశ్రమం ఇక్కడే ఉండేదట. వాళ్లు చేసే యజ్ఞయాగాలకు రాక్షసులు ఆటంకం కలిగించడంతో రాముడు వాళ్లను హతమార్చి యాగరక్షణ చేశాడట.

      అందుకు ప్రతిగా ఈ మహర్షులు ఏకశిలపైన సీతారామ లక్ష్మణుల విగ్రహాలను చెక్కించారనీ... అయితే   ఆ తరువాత రాముడి భక్తుడైన జాంబవంతుడు ఆలయం నిర్మించి ఆ విగ్రహాలను అందులో ప్రతిష్ఠించాడనీ అంటారు.

   ఈ ఆలయానికి సంబంధించి మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఈ ప్రాంతంలో ఒంటడు, మిట్టడు అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారట. బోయవాళ్లైన వీళ్లు ఈ అటవీప్రాంతాన్ని సంరక్షించేవారు.

   ఓసారి ఈ ప్రాంతానికి ఉదయగిరిని పాలించే కంపరాజు వచ్చాడు, ఈ అన్నదమ్ములు రాజుకు అన్నిరకాల సేవలు చేయడమే కాక చుట్టూ ఉన్న ప్రాంతాలనూ చూపించారు. ఆ రాజు ఆనందించి ఏదయినా కోరుకోమని చెప్పగా, ఇక్కడ రామాలయం కట్టించమని అడిగారట.రాజు ఈ ప్రదేశాన్ని మొత్తం పరిశీలించి గుడి కట్టేందుకు అవసరమైన నిధుల్ని అందించి ఆ బాధ్యతను వీళ్లకే అప్పగించి వెళ్లిపోయాడు. దాంతో వీళ్లిద్దరూ ఎంతో భక్తిశ్రద్ధలతో కొన్నేళ్లు కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించారట. వాళ్లిద్దరూ కట్టించడం వల్లే ఈ ఆలయానికి ఒంటిమిట్ట రామాలయం అనే పేరు వచ్చిందని అంటారు.ఆ తరువాత ఉదయగిరి రాజు సోదరుడైన బుక్కరాయలు తన దగ్గరున్న నాలుగు సీతారామలక్ష్మణ ఏకశిల విగ్రహాల్లో ఒకదాన్ని ఈ ఆలయంలో ప్రతిష్ఠించాడని చెబుతారు.

No comments:

Post a Comment

RECENT POST

స్యయంభూ ఏకరూప దత్తాత్రేయ స్వామి మన పల్నాడు ప్రాంత ఎత్తిపోతల

నిజమైన స్యయంభూ ఏకరూప దత్తాత్రేయ స్వామి  మన పల్నాడు ప్రాంత ఎత్తిపోతల లో తప్పితే ఎక్కడా ప్రపంచంలో లేరు..ప్రపంచంలో ఎన్ని దత్తాత్రేయ ఆలయాలు ఉన్న...

POPULAR POSTS