Sunday, June 9, 2024

మార్వాడ దేశం లో ఒకప్పుడు ఉన్న కర్మాబాయి అనే మహిళ పూరీ జగన్నాథ స్వామి కి మహాభక్తురాలు.

చాలా బాగుంది - పూర్తిగా చదవండి


మార్వాడ దేశం లో ఒకప్పుడు ఉన్న కర్మాబాయి అనే మహిళ పూరీ జగన్నాథ స్వామి కి మహాభక్తురాలు. 

ఆమె తన ఐహికమైన బరువుబాధ్యతలు అన్నీ తీరిన తర్వాత పూరీ జగన్నాథ స్వామి క్షేత్రానికి వచ్చి అక్కడే స్థిరనివాసం ఏర్పరుచుకుని ఉండిపోయింది.

నిత్యం స్వామివారి సేవలో నిమగ్నమయిపోయేది. 

ప్రతిరోజూ ఆమె నిద్రలేచి కాలకృత్యాలు అన్నీ తీర్చుకోవడమే ఆలస్యం, అల్లం, ఇంగువ, మరికొన్ని దినుసులతో నెయ్యి, కలిపి చేసే కిచిడీ అనే వంటకాన్ని చేసి స్వామికి నివేదించి దానిని యధాతథంగా ఆలయానికి పంపేది. అక్కడకూడా నివేదనమయ్యాక అర్చకులిచ్చిన ప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకుని తినేది.

క్రమక్రంగా ఆ జగన్నాథుడికి ఆ కిచిడి ఇష్టభోగమయిపోయింది. ముందస్తుగా కర్మాబాయి పంపిన కిచిడీ పూర్తికానిదే మిగిలిన భోగాలేవీ సక్రమంగా అమరేవి కావు.. మెల్లమెల్లగా ఆ రహస్యాన్ని గమనించిన ఆచార్యులు, అర్చకులు స్వామి ఇష్టప్రకారమే నివేదనను కొనసాగించేవారు.

అనతికాలంలోనే ఈ కర్మాబాయి భక్తి గురించి అందరూ గుర్తించసాగారు. ఆ రోజుల్లో జగన్నాథుడికి ఒక బైరాగి గొప్ప భక్తికలవాడు ఉండేవాడు. ఈ బైరాగి పిలిచిన వెంటనే స్వామి పలుకుతాడు అని ప్రతీతి. అటువంటి భక్తుడైన ఆ బైరాగి కర్మాబాయి గురించి విని, ఆమెను కలవాలని తన పూరీ యాత్ర సందర్భముగా అనుకున్నాడు. ఆమెను దర్శించడానికి వెళ్ళాడు.

ఆమె కిచిడీ చేసే పద్ధతి ఆ బైరాగి కి నచ్చలేదు. ఒక మడీ, ఆచారం ఏమీ లేకుండా వండేస్తున్న పద్ధతి నచ్చలేదు. ఆ ఇంట్లోనే వండి, అక్కడే స్వామికి నివేదన చేసి, అదే పదార్థాన్ని జగన్నాథ స్వామి ఆలయానికి పంపడం అతనికి నచ్చలేదు.

ఆ బైరాగి కర్మాబాయి కి ఆచారవ్యవహారాలు బోధించాడు. ఇంట్లో నివేదించిన పదార్థాన్ని అలా గుడికి పంపొద్దు అని చెప్పాడు. మడి కట్టుకుని వంట చేయాలని చెప్పాడు.

అమాయకురాలైన కర్మాబాయి అవన్నీ విని కలవరపడింది. తాను ఇన్నాళ్లూ తప్పు చేసాను అని అనుకుంది. ఆ బైరాగి చెప్పినట్టే పాటిస్తాను అని అనుకుంది.

మరునాడు నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకుని, శుచిగా స్నానం చేసి కొంచెం కిచిడీ చేసి ఇంట్లో స్వామికి నివేదన చేసింది. గుడికి పంపడానికి మడి కట్టుకుని వేరేగా ప్రత్యేక వంటకం చేయడానికి సిద్ధపడుతుంది. సరిగ్గా అప్పుడే ఒక సాధువు ఆమె ఇంటి ముందర నిలబడి , ఆకలికి తాళలేకపోతున్నాను అని, ఏముంటే అది, ఇంత ఆహారం పెట్టమని వేడుకుంటున్నాడు. ఏదో ఒకటి తినకపోతే అక్కడే ప్రాణాలు వదిలేస్తాడేమో అన్నంత దీనంగా ఉన్నాడు ఆ సాధువు.

కర్మాబాయి కి ఏమీ తోచలేదు. గుడికి పంపే వంటకం ఇంకా తయారు కాలేదు. అది గుడికి పంపి అర్చకులు నివేదన చేసి తనకు ప్రసాదంగా పంపితే తప్ప తన ఇంట్లో వంటకూడా చేసుకోని అలవాటున్న ఆ తల్లికి ఏమీ తోచలేదు. ఆలోచిస్తే ఒకటి తట్టింది.

తాను ఇంట్లో చేసిన కిచిడీ, ఇంట్లో స్వామికి నివేదన చేసి అలాగే ఉంచింది. అదెలాగూ గుడికి పంపొద్దు. తాను గుడికి నివేదన పంపి అర్చకులు నివేదన చేసిన తర్వాత వచ్చే ప్రసాదం తప్ప ఏమీ ఇప్పుడు తినదు. కనుక, ఆ కిచిడీ ఆ సాధువు కి పెట్టేస్తే అని అనుకుంది. అలా చేస్తే అతని ఆకలీ తీరుతుంది, ఆ ప్రాణాలూ నిలబడతాయి అని అనుకుంది.

ఆ సాధువు కి ఇంట్లో స్వామికి నివేదన చేసిన కిచిడీ వడ్డించింది. అతనెంతో ఆత్రంగా, ఆప్యాయంగా ఆ కిచిడీ తిని, ఆమెకు కృతజ్ఞతలు చెప్పి, ఆశీర్వదించి వెళ్ళిపోయాడు.

ఆ తరువాత మడి కట్టుకుని, గబగబా జగన్నాథస్వామి ఆలయంలో ఇవ్వాల్సిన వంటను చేసి తానె తీసుకుని ఆలయానికి వెళ్ళింది. అర్చకులు, నిన్న తనకు ఆచారవ్యవహారాలు చెప్పిన బైరాగి తన గురించే ఎదురుచూస్తున్నారు.

ఇంత ఆలస్యం ఏమిటమ్మా అని కించిత్ విసుక్కుని ఆ వంటను తీసుకుని స్వామి కి అడ్డంగా ఉన్న తెర ముందర పెట్టి, తెర తొలిగించారు. ఒక్కసారి అందరూ ఉలిక్కిపడ్డారు.

స్వామి నోటికంతా కిచిడీ అంటుకుని ఉంది. మూతి సరిగ్గా కడుక్కోని చిన్ని పిల్లవాడి ముఖం ఎంత అందంగా ఉంటుందో స్వామి మొఖం అంత అందంగా ఉంది.

ఆ మహిమ కు అందరూ ఆశ్చర్యపోయినా, అలా స్వామి నోటికి ఆహారపదార్థం అలా అంటుకుని ఉండడం అరిష్టం అని భావించారు అర్చకులు. ఆ బైరాగి ని అడిగారు. స్వామి నీవు అడిగితె పలుకుతారు కదా, అసలేమయ్యిందో కనుక్కోండి అని అడిగారు.

సరే అని ఆ బైరాగి స్వామిని అడిగారు. అప్పుడు స్వామి వైపునుండి అదృశ్యవాణి వినిపించసాగింది.

బైరాగీ, నీకు ఒక్కడికే కాదు, ఇక్కడ ఉన్న వారందరికీ చెప్తున్నాను, శ్రద్దగా వినండి. కేవలం భక్తిశ్రద్దలతో పరిశుద్దంతరంగయైన కర్మాబాయి ప్రేమగా పంపే కిచిడీ భోగమంటే నాకు ఇష్టమని మీకు అందరికీ తెలుసు. కానీ, నిన్న నా ఇంకో భక్తుడైన ఈ బైరాగి ఆమె దగ్గరకు వెళ్లి భక్తిశ్రద్దలతో బాటు ఆచారాలు, వ్యవహారాలూ ఇవీ అంటూ నూరిపోశాడు. అంతటితో ఆమె ఇంతవరకు తాను పాటించనవన్నీ అపచారాలు అని అభిప్రాయపడ్డది. భయపడ్డది. దుఃఖించింది. 

తన ఇంట్లో ఉన్న నా మూర్తికి ఎప్పటిలాగే నివేదన చేసి, ఆలయ నిమిత్తం మడి కట్టుకుని మరోసారి వంటకు ఉపక్రమించింది.

దానివల్ల నిత్యం నాకు జరిపే భోగానికి అయిదు ఘడియలు ఆలస్యం అయ్యింది. నేనా ఆలస్యం తో ఆకలికి తాళలేకపోయాను. ఆమె పంపలేదు కనుక మీరు నివేదన జరపలేదు. నాకు భోగం అందలేదు. ఆమె తన ఇంట్లో నా గురించి చేసుకున్న కిచిడీ భోగం ఉండడం వల్ల, అది అంటే నాకు ఎంతో ఇష్టం కావడం వల్ల, ఆమె ఇంటికే వెళ్లి నాకు నివేదించిన భోగాన్నే తిని వచ్చేసాను. మళ్ళీ ఇక్కడ ఆమె తెచ్చే వంటకం నివేదన ఉన్నందువల్ల తొందరలో నా నోరు కడుక్కోవడం మరిచిపోయాను. ఇక మీ ఆచారాల ప్రకారం భోగ నివేదన కానివ్వండి అని వినిపించింది.

ఆ విధంగా వినిపించిన స్వామి వారి అదృశ్యవాణి విని అందరూ ఆశ్చర్యపోయారు. అర్చకులు స్వామి ఆదేశాలప్రకారం మంత్రపూర్వకంగా భోగ నివేదన జరిపించారు.

కర్మాబాయి మాత్రం స్వామి వారు తన పై చూపిన కరుణకు ఆనందంతో సుడులు తిరిగిపోయింది. అంతటి పరిశుద్దాత్మురాలికి ఆచారవ్యవహారాలు నేర్పబోయిన తన అవివేకానికి ఆ బైరాగి సిగ్గుపడిపోయాడు. అయితే, తాను పాటిస్తున్న అచారాలన్నీ వృధానా అని అనుకున్నాడు. 

వెంటనే జగన్నాథుడు జవాబు ఇచ్చాడు ఆ బైరాగికి. అమాయకుడా, మనసు నాయందు లగ్నం కావడం కోసమే ఆ అచారాలన్నీ అవసరమే. కానీ, ఎవరి మనసు సర్వం జగన్నాథం అని నాకే అర్పితమయ్యిందో, వాళ్లకు ఆచారవ్యవహారాలతో నిమిత్తం లేదు. నాకామె జరిపే భోగాన్ని నేను అమృతపాయంగా స్వీకరిస్తుంటే మా ఇద్దరి మధ్యలో మడి బట్టలు ఎందుకయ్యా అని. అంతే కాదు, ఆచారవ్యవహారాలు తెలిసిన వారు, ఆ ప్రకారమే చేయాలి, అప్పుడు కూడా భక్తి శ్రద్ధ విశ్వాసాలే ముఖ్యం. నాకు నివేదించేవి నేను ఆరగించాలనే కోరిక కలిగి ఉండాలి. ఆచారవ్యవహారాలు తెలియని వారైనా సరే భక్తి శ్రద్ధ విశ్వాసాలతో నేను ఆరగించాలనే కోరికతో నివేదించే వాటిని నేను తప్పక స్వీకరిస్తాను.

బైరాగి సిగ్గుపడ్డాడు. కర్మాబాయి కి క్షమాపణ చెప్పుకున్నాడు. స్వామి అతనిని క్షమించాడు. భగవంతుని ఆజ్ఞ ప్రకారం కర్మాబాయి తన జీవితాంతం స్వామి నివేదనకు భోగం పంపించేది. 

ఆ నాడే కాదు, ఈ నాడు కూడా, ఇప్పటికీ కూడా, కర్మాబాయి జ్ఞాపకార్థం జగన్నాథుని గుడిలో స్వామి భోగాలలో కిచిడీ భోగం బంగారు పళ్లెంలో ఉంచి భోగం జరుపుతారు. 

ఎంత పావనమైన విషయం కదా...

మనం త్రికరణశుద్ధిగా భగవంతుడిని మనసులో నిలుపుకొని స్వామికి రోజూ ఇంత వంటకాన్ని నివేదన చేస్తే, స్వామి స్వీకరిస్తాడు.

జై జగన్నాథ

(సేకరణ)

Saturday, June 8, 2024

ముక్తినిచ్చే స్థలాలు

*ముక్తినిచ్చే స్థలాలు*

                
*'అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికాపురీ ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయకాః'*

*ఈ శ్లోకం అర్థం: -*
*అయోధ్యా, మధుర, మాయ (హరిద్వార్), కాశీ, కాంచీపురం, అవంతిక(ఉజ్జయిని), ద్వారక ... ఈ ఏడు ముక్తినిచ్చే స్థలాలు(నగరాలు).          ఈ ఏడు ముక్తి క్షేత్రాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం…*

*1).అయోధ్య:-*
అయోధ్య అంటే శత్రువులు చొరబడటానికి వీలులేని సురక్షిత స్థానం అని అర్థం. ఇది మానవోత్తముడు, మర్యాదపురుషోత్తముడూ అయిన శ్రీరాముడి జన్మభూమి. సరయూ నదీతీరంలో వెలసిన ఈ మోక్షధామం దర్శనమాత్రంగా జన్మను చరితార్థం చేస్తుందంటారు.

*2). మధుర:-*
మధుర అంటే తీయనైన అని అర్థం. పూర్ణావతార పురుషుడైన శ్రీకృష్ణుడు నడయాడిన పవిత్రస్థానం.

*3) మాయ:-*
దీనినే హరిద్వార్‌ అని పిలుస్తారు. విష్ణువు సన్నిధికి చేర్చే ముఖద్వారం ఈ పుణ్యస్థలం. హిమవత్పర్వతాల నుంచి ప్రవహించే గంగానది మొట్టమొదట నేలపై అడుగుమోపే విశిష్ట పుణ్యక్షేత్రం ఈ మాయానగరం.

*4) కాశీ:-*
భూలోక కైలాసంగా ప్రసిద్ధి చెందిన         ఈ పుణ్యక్షేత్రం పవిత్ర గంగానదీ తీరంలో వెలసిన పరమ శివసన్నిధానం. వరుణ, అసి అనే రెండు నదులు ఇక్కడే గంగా నదిలో సంగమించడం వల్ల ఈ పట్టణానికి ‘వారణాసి’ అని కూడా పేరు.

*5) కాంచీపురం:-* 
దక్షిణ భారతంలోని పవిత్ర నగరం ఇది. కంచి, కాంచీపురం, కాంజీపురం అనే పేర్లతో అలరారే ఈ పుణ్యధామం శివుడికి, విష్ణువుకు, శక్తికి నెలవు. అద్వైత తత్త్వాన్ని ప్రవచించిన ఆదిశంకరులు స్థాపించిన కామకోటి పీఠం ఇక్కడే ఉంది. ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తే మోక్షం సంప్రాప్తిస్తుందని ప్రాచీన కాలం నుంచీ కొనసాగుతున్న విశ్వాసం.

*6) అవంతిక:-*
భారత భూమిలోని మధ్యప్రదేశంలో విరాజిల్లే ‘ఉజ్జయినీ’ నగరానికే ‘అవంతిక‘ అనిప్రాచీననామం. శిప్రా నదీతీరంలో వెలుగొందే ఈ పట్టణం మహాకాళనాథు డైన శివుడికి నిలయం. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన ఈ నగరాన్ని గురించి మహాకవి కాళిదాసు ఎంతో అద్భుతంగా వర్ణించాడు. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే పునర్జన్మ ఉండదని ప్రతీతి.

*7). ద్వారవతి:-* 
అంటే ‘ద్వారకానగరం.’   శ్రీకృష్ణుడి పాదస్పర్శతో పునీతమైన దివ్యధామం ఇది. కృష్ణుడు నివసించిన ద్వారకానగరం సముద్రంలో కలిసిపోయింది. తీరంలో నూతనంగా నిర్మించిన ఆధునిక ద్వారకానగరం ద్వారకానాథ్‌గా ప్రసిద్ధం. ఇక్కడ ద్వారకాధీశుడి ఆలయం ఉంది. ఈ ఆలయంలోకి స్వర్గద్వారం ద్వారా ప్రవేశించిన భక్తులు మోక్షద్వారం ద్వారా వెలుపలికి వస్తారు. ఈ కారణంగా ఇది ముక్తిదాయక నగరంగా ప్రసిద్ధి చెందింది.

🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

Thursday, June 6, 2024

జ్ఞానప్రదాయిని కొల్లూరు మూకాంబిక

#జ్ఞానప్రదాయిని కొల్లూరు మూకాంబిక ......!!
కర్ణాటకలో పడమటి కొండలలో అందమైన కొండలు లోయలు ఫల వృక్షాల మధ్య కొల్లూరు లో మూకాంబికా క్షేత్రం ఉంది.


#కామాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రాంత ప్రజలను విపరీతంగా బాధిస్తుంటే అందరూ పార్వతీదేవిని శరణు కోరారు.

#కామాసురుడు ఒక మహిళ చేతులలోనే చస్తాడని గ్రహించిన దేవి వాడిని అవలీలగాసంహరించింది. 
ఆమె ధైర్యానికి మెచ్చి శివుడు ఇక్కడ తన కాలి మడమతో శ్రీ చక్రాన్ని సృష్టించి ప్రతిష్టించాడని ప్రతీతి.

#ఆలయానికి కనీసం 1200 ఏళ్ళ చరిత్ర ఉంది. హలుగల్లు వీర సంగయ్య అనే రాజు అమ్మ వారి విగ్రహం చెక్కించాడని చెప్పుకొంటారు.

#మంగుళూరు నుండి నూట ముప్ఫై కిలోమీటర్ల దూరంలో ఉడిపి క్షేత్రానికి ఎనభై కిలోమీటర్ల దూరం కొండల మధ్య ప్రకృతి అందాలు విందు చేస్తుండగా కుడజాద్రి శిఖరంపై ఈ ఆలయం కనువిందు చేస్తుంది.

#తమిళనాడుకు అతి సమీపంలో ఉంటుంది. బంగారు శిఖరంతో భక్త జనాల దృష్టిని ఆకర్షిస్తుంది.

#ఇక్కడి విశేషం ఏమిటంటే అమ్మ వారు జ్యోతిర్లింగంగా శివునితో కలిసి ఉండటం. #ఆదిశంకరాచార్యుల వారు ఆలయంలో శ్రీ చక్రాన్ని ప్రతిష్ఠించటంతో మూకాంబికాదేవి ఆలయానికి విశేష ప్రాచుర్యం లభించింది.

#పంచముఖ గణేశ ప్రతిమ అద్భుత శిల్ప నైపుణ్యంతో విరాజిల్లుతుంది.

#కర్ణాటకలోని ఏడు ముక్తిక్షేత్రాలలో కొల్లూరు ఒకటి. మిగిలినవి ఉడిపి, సుబ్రహ్మణ్య, కోడేశ్వర, శంకర నారాయణ, గొకర్ణ క్షేత్రాలు.

#కుడజాద్రి పర్వతంపై ఆదిశంకరాచార్యులు అమ్మవారి కటాక్షం కోసం తపస్సు చేయడంతో అమ్మావారు ప్రత్యక్షం అయ్యారట.

#ఆదిశంకర్యాచార్యులు అమ్మవారిని తన జన్మస్థలమైన కేరళకు రమ్మని అడిగారట. దేవి శంకరాచార్యుల కోరిక మన్నించి ఆదిశంకరాచాయుల వెంట వస్తానని కానీ వెనక్కి తిరిగి చూడకూడదని, అలా వెనక్కి తిరిగి చూస్తె చూసిన స్థలంలోనే స్థిరంగా ఉండిపోతానని అమ్మవారు చెప్పారట.

#ఆ షరతుకు అంగీకరించిన ఆదిశంకరాచార్యులు ముందు నడుస్తుండగా అమ్మవారు ఆయన్ని అనుసరించారట.

#అలా వెళ్తూ ఉండగా కొల్లూరు ప్రాంతానికి రాగానే దేవి కాలి అందెల శబ్దం వినిపించకపోవడంతో ఆదిశంకరాచార్యులు వెనక్కు తిరిగి చూశారట.

#అలా మాట తప్పడంతో అమ్మవారు తనకు అక్కడే ప్రతిష్టించమని చెప్పడంతో ఆదిశంకరాచార్యులు శ్రీచక్రంతో పాటు మూకాంబిక పంచలోహ విగ్రహాన్ని కూడా ప్రతిష్టించారని ప్రతీతి.

#గర్భాలయం లో ''శంకర సింహాసనం'' ఉంది. మూకాంబిక సరస్వతి మహాకాళి, శక్తిలా సంయుక్త స్వరూపంగా భావిస్తారు.

#అమ్మవారు కొలువైన కుడజాద్రి పర్వతం మీదనే ఆదిశంకరులు తపస్సు చేసిన అంబవనం, చిత్రమూలం ప్రదేశాలున్నాయి.

#సర్వేజన సుఖినోభావంత్ 

@highlight

Wednesday, June 5, 2024

సాయిభక్త శ్రీ బి.వి. నరసింహస్వామిగారి పండరిపుర క్షేత్ర అనుభవం.

*సాయిభక్త శ్రీ బి.వి. నరసింహస్వామిగారి పండరిపుర క్షేత్ర అనుభవం.*


*సద్గురు అన్వేషణలో శ్రీ బి.వి. నరసింహ స్వామి గారు ఉత్తరదేశ పర్యటన గావిస్తున్నారు.*
*ఆ పర్యటనలో భాగంగా పండరిపురం పాండురంగ దర్శనమైనది.* 
*అక్కడివారు అక్కడగల బాపుమాయి అనే యోగినిని దర్శించుకోమని సలహ ఇచ్చారు. బాపుమాయి ఒక విశిష్ట యోగిని శరీరంపై ఒక తుండుగుడ్డ మాత్రమే ధరించేది.*

*భక్తులను ఒక పైసా ఇమ్మని అడిగేది. అది తీసుకుని అక్కడగల చంద్రభాగా నది వద్దకి వెళ్ళి " అమ్మా ! చంద్రభాగా ! ఈ దబ్బునంతా జాగ్రత్తగా దాచు " అని భక్తులు ఇచ్చిన నదిలో వేసేది.* 
*ఒకరోజు బి.వి.నరసింహస్వామి గారు పండరిపురంలో బాపుమాయిని చూశారు. అమె వెంట వెళ్లసాగాడు. ఆమె అయనను చూసి "ఎవరు నీవు ? " అని ప్రశ్నించింది ." నేనొక యాత్రికుడను " అని అన్నాడు స్వామి."*
 *నాకు ఇల్లు లేదు, స్మశానంలో ఉంటాను " అని శ్మశానం వైపు దారితీసింది.*

*" నాకు స్మశానమంటే భయం లేదు. అక్కడికి పోకూడదనే నియమము లేదు " అని ఆమె వెనుక పోసాగాడు. ఆమె స్మశానం చేరింది. అదిచూసి కొంతసేపైన తరువాత, ఆయనతో " నీకు ఆకలిగా ఉందా ? " అని అడిగింది.*
 *నిజంగానే ఆయన ఆకలితో ఉన్నాడు.*
*" అవును. ఆకలిగానే వుంది " అని జవాబిచ్చాడు.*
*ఇంతలో ఒక పెద్ద హొటల్ లో పనిచెసే వ్యక్తి ,ప్రత్యేక దుస్తులు ధరించి, అనేక విశేష భోజన పదార్ధాలు నిండిన ప్లేటుతో వచ్చాడు.* 
*ఆ ప్లేటులో అన్నము, రొట్టెలు, పప్పు, స్వీట్లు ఉన్నాయి.*
*అప్పుడు అయనను భోజనం చేయమనీ అన్నది.*
*ఆయన వెంటనే భోజనం చేశాడు. ఆ భోజనం అయనకు ఎంతో తృప్తిని ఇచ్చింది. ఆ భోజనం తెచ్చిన వ్యక్తి ఖాళీప్లేటుతో వెళ్లిపోయాడు.*

*తరువాత బాపుమాయి అతనితో " నీకు ఏమి కావాలి ? " అని అడిగింది.* 

*అందుకు ఆయన "నేను దేవుడిని చూడాలని వుంది " అని అన్నాడు అందుకు ఆమె పకపక నవ్వింది ." నీవు ఒక మొద్దువు.*
 *ఇప్పుడు నీకు భోజనము తెచ్చినవాడు ఆ పాండురంగడే ! నర సంచారములేని ఈ ప్రదేశానికి ఆయనగాఁక మరెవరు భోజనం తెస్తారు అని అన్నది బాపుమాయి.* *నరసింహస్వామి దిగ్భ్రాంతి చెందాడు.* 
*ఆమె ఆయనతో* 
*" సర్వానంతర్యామి అయిన ఆ సర్వేశ్వరుని దర్శించే అర్హత ఇంకా నీకు రాలేదు.* 
*ఉత్తర దిశలో నీ గురువు నీకోసం ఎదురుచూస్తున్నారు. నీవు వెంటనే బయలుదేరు " అని చెప్పి వెల్లిపోయింది.*

*తరువాత కొద్దిరోజులకు ఆయనకు సమర్థ సద్గురువు షిర్డిసాయినాధుని సమాధి దర్శనమైనది.*

తిరుమల శ్రీవారి కీ లక్ష నుండి కోటి రూపాయలు కు పైగా డోనేషన్ ఇచ్చేవారికి కల్పించే సౌకర్యాలు

*తిరుమల శ్రీవారి కీ లక్ష నుండి కోటి రూపాయలు కు పైగా డోనేషన్ ఇచ్చేవారికి కల్పించే సౌకర్యాలు*



🕉️ *లక్ష - ఐదు లక్షల రూపాయల డొనేషన్ :*

తిరుమలలో లక్ష నుంచి 5 లక్షల రూపాయల డొనేషన్ ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం ఒకరోజు 5 మందికి సుపథం దర్శనం కల్పిస్తారు. 1 రోజు 100/- రూమ్ ఇస్తారు . 6 చిన్న లడ్డులు ఒక దుప్పట ఒక బ్లౌజ్ పీస్ ఇస్తారు.


🕉️ *ఐదు - పది లక్షల రూపాయల డొనేషన్*

తిరుమలలో ఐదు నుంచి 10 లక్షల రూపాయల డొనేషన్ ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం మూడు రోజులు 5 మందికి సుపథం దర్శనం కల్పిస్తారు. 3 రోజులు 100/- రూమ్ ఇస్తారు . 10 చిన్న లడ్డులు మరియు ఒక మహాప్రసాదం ఒక దుప్పట ఒక బ్లౌజ్ పీస్ ఇస్తారు.


🕉️ *పది - 25 లక్షల రూపాయల డొనేషన్ : -*

తిరుమలలో 10 - 25 లక్షల రూపాయల డొనేషన్ ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం మూడు రోజులు 5 మందికి బ్రేక్ దర్శనం కల్పిస్తారు. 3 రోజులు 500/- రూమ్ ఇస్తారు . 20 చిన్న లడ్డులు మరియు 10 మహాప్రసాదాలు ఒక దుప్పట ఒక బ్లౌజ్ పీస్ ఇస్తారు మరియు 1 సిల్వర్ కాయిన్ (50 గ్రాములు )



🕉️  *25 - 50 లక్షల రూపాయల డొనేషన్ :*

తిరుమలలో 25 - 50 లక్షల రూపాయల డొనేషన్ ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం ఒక రోజు సుపథం దర్శనం మరియు మూడు రోజులు 5 మందికి బ్రేక్ దర్శనం కల్పిస్తారు. 3 రోజులు 1500/- రూమ్ ఇస్తారు . 4 పెద్ద లడ్డులు 5 చిన్న లడ్డులు మరియు 10 మహాప్రసాదాలు ఒక దుప్పట ఒక బ్లౌజ్ పీస్ ఇస్తారు మరియు 1 గోల్డ్ డాలర్ ( 5 గ్రాములు ) +ఒక సిల్వర్ కాయిన్ (50 గ్రాములు )


🕉️  *50 - 75 లక్షల రూపాయల డొనేషన్ :*

తిరుమలలో 50 - 75 లక్షల రూపాయల డొనేషన్ ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం ఒక రోజు సుప్రభాత సేవ మరియు 2 రోజులు సుపథం దర్శనం మరియు మూడు రోజులు 5 మందికి బ్రేక్ దర్శనం కల్పిస్తారు. 3 రోజులు 2000/- రూమ్ ఇస్తారు . 6 పెద్ద లడ్డులు 10 చిన్న లడ్డులు మరియు 10 మహాప్రసాదాలు ఒక దుప్పట ఒక బ్లౌజ్ పీస్ ఇస్తారు మరియు 1 గోల్డ్ డాలర్ ( 5 గ్రాములు ) +ఒక సిల్వర్ కాయిన్ (50 గ్రామ)



🕉️  *కోటి రూపాయల డొనేషన్ :*

తిరుమలలో 75 లక్షల - 1 కోటి రూపాయల డొనేషన్ ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం రెండు రోజులు సుప్రభాత సేవ మరియు 3 రోజులు సుపథం దర్శనం మరియు 3 రోజులు 5 మందికి బ్రేక్ దర్శనం కల్పిస్తారు. 3 రోజులు 2500/- రూమ్ ఇస్తారు . 8 పెద్ద లడ్డులు 15 చిన్న లడ్డులు మరియు 10 మహాప్రసాదాలు ఒక దుప్పట ఒక బ్లౌజ్ పీస్ ఇస్తారు మరియు 1 గోల్డ్ డాలర్ ( 5 గ్రాములు ) +ఒక సిల్వర్ కాయిన్ (50 గ్రాములు )


🕉️  *కోటి రూపాయల పైన డొనేషన్ :*

తిరుమలలో 1 కోటి రూపాయల పైన డొనేషన్ ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం 3రోజులు సుప్రభాత సేవ మరియు 4 రోజులు సుపథం దర్శనం మరియు 3 రోజులు 5 మందికి బ్రేక్ దర్శనం కల్పిస్తారు. 3 రోజులు 3000/- రూమ్ ఇస్తారు . 10 పెద్ద లడ్డులు 20 చిన్న లడ్డులు మరియు 10 మహాప్రసాదాలు ఒక దుప్పట ఒక బ్లౌజ్ పీస్ ఇస్తారు మరియు 1 గోల్డ్ డాలర్ ( 5 గ్రాములు ) +ఒక సిల్వర్ కాయిన్ (50 గ్రాములు ) మరియు వేద ఆశీర్వచనం

Saturday, June 1, 2024

ఆంజనేయ స్వామి లేని #ఒంటిమిట్ట రామాలయం

*ఆంజనేయ స్వామి లేని #ఒంటిమిట్ట రామాలయం*
                  

రామాలయం లేని ఊరూ రామాయణం వినని వారూ ఉండరంటారు. దేశంలో ఏ రామాలయానికి వెళ్లినా రాముడి కుడివైపున లక్ష్మణుడు, ఎడమ వైపున సీతాదేవి, పాదాల దగ్గర నమస్కార భంగిమలో హనుమంతుడి విగ్రహాలు దర్శనమిస్తాయి.కానీ ఈ ఆలయంలో ఆంజనేయుడి విగ్రహం ఉండదు. అలాంటి అరుదైన ఆలయమే ఒంటిమిట్ట రామాలయం. ఏకశిలపైన సీతారామలక్ష్మణ విగ్రహాలున్న ఈ ఆలయంలో రాముడు యోగముద్రలో దర్శనమివ్వడం విశేషం.

 *ఆంధ్రా అయోధ్యగా పిలిచే ఈ ఆలయం కడప జిల్లాలో ఉంది.*

ఆంధ్రా అయోధ్యగా అపర భద్రాద్రిగా గుర్తింపు పొందిన కడప జిల్లా ఒంటిమిట్ట రామాలయంలోని గర్భగుడిలో మనకు ఏకశిలపైన సీతారామలక్ష్మణ విగ్రహాలు కనిపిస్తాయి తప్ప హనుమంతుడి విగ్రహం ఉండదు. ఈ ఆలయం బయట హనుమంతుడి గుడి విడిగా ఉంటుంది. కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో ఏటా జరిగే సీతారామ కల్యాణాన్ని చూసేందుకు రెండు కళ్లూ చాలవంటారు.

 #స్థలపురాణం 

   ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి వివిధ కథలు ప్రచారంలో ఉన్నాయి.

     ఒకప్పుడు ఒంటిమిట్ట కీకారణ్యంలా ఉండేదట. పద్నాలుగేళ్ల వనవాస సమయంలో రాముడు సీతా లక్ష్మణ సమేతుడై ఈ అరణ్యంలోనూ కొంతకాలం గడిపినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆ సమయంలో మృకండు, శృంగి అనే మహర్షుల ఆశ్రమం ఇక్కడే ఉండేదట. వాళ్లు చేసే యజ్ఞయాగాలకు రాక్షసులు ఆటంకం కలిగించడంతో రాముడు వాళ్లను హతమార్చి యాగరక్షణ చేశాడట.

      అందుకు ప్రతిగా ఈ మహర్షులు ఏకశిలపైన సీతారామ లక్ష్మణుల విగ్రహాలను చెక్కించారనీ... అయితే   ఆ తరువాత రాముడి భక్తుడైన జాంబవంతుడు ఆలయం నిర్మించి ఆ విగ్రహాలను అందులో ప్రతిష్ఠించాడనీ అంటారు.

   ఈ ఆలయానికి సంబంధించి మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఈ ప్రాంతంలో ఒంటడు, మిట్టడు అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారట. బోయవాళ్లైన వీళ్లు ఈ అటవీప్రాంతాన్ని సంరక్షించేవారు.

   ఓసారి ఈ ప్రాంతానికి ఉదయగిరిని పాలించే కంపరాజు వచ్చాడు, ఈ అన్నదమ్ములు రాజుకు అన్నిరకాల సేవలు చేయడమే కాక చుట్టూ ఉన్న ప్రాంతాలనూ చూపించారు. ఆ రాజు ఆనందించి ఏదయినా కోరుకోమని చెప్పగా, ఇక్కడ రామాలయం కట్టించమని అడిగారట.రాజు ఈ ప్రదేశాన్ని మొత్తం పరిశీలించి గుడి కట్టేందుకు అవసరమైన నిధుల్ని అందించి ఆ బాధ్యతను వీళ్లకే అప్పగించి వెళ్లిపోయాడు. దాంతో వీళ్లిద్దరూ ఎంతో భక్తిశ్రద్ధలతో కొన్నేళ్లు కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించారట. వాళ్లిద్దరూ కట్టించడం వల్లే ఈ ఆలయానికి ఒంటిమిట్ట రామాలయం అనే పేరు వచ్చిందని అంటారు.ఆ తరువాత ఉదయగిరి రాజు సోదరుడైన బుక్కరాయలు తన దగ్గరున్న నాలుగు సీతారామలక్ష్మణ ఏకశిల విగ్రహాల్లో ఒకదాన్ని ఈ ఆలయంలో ప్రతిష్ఠించాడని చెబుతారు.

నవగ్రహాల దోష నివారణకు నవ నారసింహ క్షేత్రాలు..!

#నవగ్రహాల దోష నివారణకు నవ నారసింహ 
క్షేత్రాలు..!
ఓం నమో నారాయణ..!!🙏


#హిరణ్యకశిపుడిని సంహరించి వికటహట్ట్ హాసాలు చేస్తూ అహోబిల కొండల్లో తిరుగుతూ తొమ్మిది ప్రదేశాల్లో 
వివిధ రూపాల్లో వెలసారని ప్రతీతి. 

జ్వాల నరసింహ స్వామి
అహోబిల నరసింహ స్వామి
మాలోల నరసింహ స్వామి
వరాహ నరసింహస్వామి (క్రోడా)
కారంజ నరసింహస్వామి
భార్గవ నరసింహస్వామి
యోగానంద నరసింహస్వామి
చత్రవట నారసింహస్వామి
పావన నరసింహ స్వామి

1.జ్వాలా నరసింహ క్షేత్రము.🙏
(కుజగ్రహా అనుగ్రహానికి..దోషాలు పోవడానికి..)

నవ నరసింహ క్షేత్రాల్లో ఒక్కటైనా యాదగిరి గుట్ట. హైదరాబాద్ నుండి 65 కి మీ దూరంలో ఉంది. 
ఇక్కడ కొండపైన వెలసిన నరసింహస్వామికి 
ఘనమైన చరిత్ర ఉంది . 
పూర్వం  యాదవ మహర్షి ఈ కొండ పైన తపస్సు చేసాడట. 
అప్పుడు మహావిష్ణువు ప్రత్యక్షమవ్వగా తనకు 
నరసింహమూర్తిని మూడు అంశాలతో దర్శనం అనుగ్రహించమని కోరాడట.
అప్పుడు స్వామి గండబేరుండ నరసింహుడు, 
జ్వాల నరసింహుడు,యోగానంద నరసింహుడు 
అనే రూపాలలో కనిపించాడట. 
ఎప్పటికి స్వామి తన కళ్ళముందే ఉండవలసిందిగా యాదవ మహర్షి కోరటం వలన స్వామి అలాగే కొండపైన వెలసాడట. 
స్వామి వెలసిన స్థలం కొండ పైన గుహలో ఉంది.

వైకుంఠవాసుని అశురుడు (హిరణ్యకశిపుడు) నిందించినను శ్రీమన్నారాయణుడు తొణకలేదు, 
కాని తన భక్తుడైన ప్రహ్లదుని హింసించడం సహించలేక పోయాడు. అందుకే హరి నరహిగా ఆవిర్భవించాడు. ప్రహ్లదుని కొరకు స్ధంభమునందు వెలసి ప్రహ్లదుని మాట సత్యం చేసి అతి భయంకర రూపంతో హిరణ్యకశిపుని వక్షాన్ని చీల్చి సంహారం చేసినందుకు ఈ స్వామిని 
"జ్వాలా నరసింహుడు" గా వ్యవహరిస్తారు. 
ఇక్కడ స్వామి వారిని దర్శించుకుంటే 
కుజగ్రహ దోషాలు తొలుగుతాయి.

2. అహోబిల నరసింహ స్వామి.🙏
(గురుగ్రహ అనుగ్రహానికి..దోషాలు పోవడానికి..)

నారాయణుడు ఉగ్రనారసింహ అవతారం దాల్చి హిరణ్యకశపుని చీల్చి చెండాడిన క్షేత్రమిదేనని 
స్థల పురాణం చెబుతుంది. 
హిరణ్యకశపుని చీల్చి చెండాడిన నరసింహ స్వామి 
ఉగ్ర రూపాన్ని చూసి దేవతలు అహో .. బలం, అహో బలం అని ఆశ్చర్యంతో పొగడేరటా.
అందుకీ ఈ క్షేత్రానికి అహోబిల నరసింహ స్వామి దేవాలయంగా పేరు వచ్చింది అని చెబుతారు.

ముక్కోటి దేవతలు స్తోత్రము చేసిన కోపము తగ్గని నృసింహ స్వామిని ప్రహ్లాదుడు తపస్సు చేయగా "స్వయంభు" తనకు తానే సాలగ్రామముగా, 
ఎవరు ప్రతిష్ఠచేయని మూర్తిగా ఈ బిలమునందే వెలసినారు. 
ప్రహ్లాదుడు ప్రార్ధించగా గరుడాద్రి పర్వత క్రింద భవనాశిని తీరమునందు గుహలోపల స్వయంభువుగా వెలసి ప్రహ్లాదునికి దర్శనమిచ్చినదియే ఈ అహోబిలం. 
ఈ అహోబిలానికి దేవతలు స్తుతించినందున 
అహోబలం అని, బిలం నందు స్వయముగా వెలసినందుకు అహోబిలం అని రెండు విధాలుగా అభివర్ణించారు. 
ఈ నరసింహా స్వామిని పూజించిన వారికి 
గురుగ్రహా దోషాలు నివారణ అవుతాయి. 

3. మాలోల నరసింహ స్వామి..🙏
(శుక్రగ్రహ అనుగ్రహానికి.. దోషాలు పోవడానికి..)

వేదాద్రి పర్వతంమీద లక్ష్మీనృసింహ స్వామిగా 
"మా" అనగ లక్ష్మి లోల యనగ "ప్రియుడు" అని అర్ధం. 
ఈ దేవాలయానికి మార్కొండలక్ష్మమ్మపేటు అని కూడా పిలుస్తారు. 
ఎగువ అహోబిలానికి 1 కి.మీ దూరం లో 
ఈ ఆలయం కలదు. 
స్వామి వారు ప్రసన్నాకృతిలో దర్శనమిస్తారు. 
వేదాద్రి శిఖరాన చదునైన ప్రదేశంలో ఈగుడి నిర్మించబడినది. 
ఇక్కడి శిల్పము వామపాదాన్ని మడుచుకొని, దక్షిణపాదాన్ని వంచి కిందకు వదలి సుఖాసీనుడై ఉన్నాడు. 
స్వామివారి ఎడమ తొడపై లక్ష్మీదేవి స్వామివారి 
వామ హస్తము లక్ష్మీదేవిని ఆలింగనము చేసుకొన్నట్లుగా యున్నది. 
స్వామి శంఖు, చక్ర, వరద, హస్తాలతో యున్నది. భూతలం నుండి ఆవిర్భవించిన తామరపై లక్ష్మీదేవి పాదాలు ప్రకాశిస్తున్నాయి. 
ఇదొక ప్రశంతమైన సుందరమైన చోటు, 
ధ్యాన అనుష్టాలకు చక్కని వేదిక. 
ఈ నరసింహా స్వామిని పూజించినవారికి శుక్రగ్రహ దోషాల నుండి విముక్తి కలుగుతుంది. 

4. వరాహ నరసింహస్వామి (క్రోడా)..🙏
(రాహుగ్రహ అనుగ్రహానికి.. దోషాలు పోవడానికి..)

వేదాద్రి పర్వతముయందు వేదములను భూదేవిని సోమకాసురుడు అపహరించుకొని పోగా 
వరాహ నరసింహుడుగా శ్రీమన్నారాయణుడు అవతరించి భూలోకం కిందకు వెళ్ళి సోమకాసుని సంహరించి 
భూదేవి సహితంగా పైకితెచ్చినందుకు ఈ క్షేత్రానికి 
వరాహ నరసింహ క్షేత్రమని పేరు. 
భూదేవిని ఉద్ధరించిన వరాహస్వామి. 
ఈ నరసింహా మూర్తిని దర్శించిన రాహుగ్రహ దోషాలు తొలగిపోతాయి. 

5. కారంజ నరసింహస్వామి..🙏
(చంద్రగ్రహ అనుగ్రహానికి..దోషాలు పోవడానికి..)

కారంజ వృక్ష స్వరూపిమైన శ్రీ కారంజ నరసింహ మూర్తికి కరంజ వృక్షము క్రింద పద్మాసనంతో వేంచేసియున్న స్వామికి కారంజ నరసింహస్వామి అని పేరు.
పగడలువిప్పి నిలిచిన ఆదిశేషుని క్రింద ధ్యాననిమగ్నుడైన మూర్తి.
గోబిలుడనే మహర్షి తపస్సు చేసినందుకు ఆయనకు ప్రత్యక్షమైనారని మరియు శ్రీ ఆంజనేయస్వామి ఇక్కడ తపస్సు చేయగా నృసింహస్వామి దర్శనమివ్వగా అందుకు ఆంజనేయుడు "నాకు శ్రీరామ చంద్రమూర్తి తప్ప వేరెవ్వరు తెలువదనగా" నృసింహుడు నేనే శ్రీరాముడ 
నేనే నృసింహస్వామి సాంగ (ధనస్సు) హస్తములతో దర్శన మివ్వగా ఈ స్వామికి కారంస్వామి అని పేరు. 
ఈ స్వామికి పాలనేత్రము (త్రినేత్రము) కలదు. 
అందుకే అన్నమయ్య "పాలనేత్రానల ప్రబల విద్ద్యులత కేళి విహార లక్ష్మీనరసింహ" అని పాడారు. 
ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి చంద్రగ్రహ అనుగ్రహం లభించును.

6. భార్గవ నరసింహస్వామి..,,🙏
(సూర్యగ్రహ అనుగ్రహానికి..దోషాలు పోవడానికి..)

పరశురాముడు ఈ అక్షయ తీర్ధ తీరమందు తపస్సు చేయగా శ్రీ నృసింహాస్వామి హిరణ్యకశిపుని సంహరం చేసే స్వరూపంగా దర్శనమిచ్చాడు. 
కావున ఈ క్షేత్రానికి భార్గవ నరసింహ క్షేత్రమని పేరు. 
ఈ స్వామిని "భార్గోటి" అని ప్రాంతీయ వాసులు పిలుస్తారు. 
పరశురాముని పూజలందుకున్న దివ్యధామము. 
ఈ ఆలయం దిగువ అహోబిలానికి 2 కి.మీ. దూరం లో ఉత్తర దిశ (ఈశాన్యము) యున్నది. 
స్వామి వారి విగ్రహం, పీఠంపై చతుర్బాహయుతమై 
శంఖు చక్రాన్వితములైన ఊర్ద్వబాహువుల, 
అసురుని ప్రేవులను చీలుస్తు రెండు హస్తాలు, ఖడ్గహస్తుడైన హిరణ్య కశిపుడు, 
ప్రక్కలోనే అంజలి ఘటిస్తున్న ప్రహ్లాదుడు, 
ప్రభావళి నందు దశావతారములతో ఈ విగ్రహము కలిగియున్నది. 
ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి సూర్యగ్రహ అనుగ్రహం లభించును.

7. యోగానంద నరసింహస్వామి..🙏
(శనిగ్రహ అనుగ్రహానికి..దోషాలు పోవడానికి..)

యోగమునందు ఆనందమును ప్రసాదించుచున్నాడు. కాబట్టి స్వామివారికి యోగానంద నరసింహ స్వామి 
అని పిలవబడుచున్నాడు. 
యోగపట్టంతో, విలసిల్లినాడు, 
ప్రహ్లాదుని ఈ యోగ నృసింహుని అనుగ్రహంతో యోగాభ్యాసం చేసినాడట. 
మనశ్చాంచల్యము కలిగిన బ్రహ్మ నరసింహుని గురించి తపస్సు చేసి మన:స్ధిరత్వమును సాధించెను. 
ఈ ప్రదేశము యోగులకు, దేవతలకు నిలయం.
ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి శనిగ్రహ అనుగ్రహం లభించును.

8. చత్రవట నారసింహస్వామి..🙏
(కేతుగ్రహ అనుగ్రహానికి..దోషాలు పోవడానికి..)

పద్మాసనంతో అభయహస్తాలతో నల్లగా నిగనిగలాడుతున్న ఈమూర్తి చాలా అందమైన ఆకర్షణీయమైన మూర్తి. "హా హా" "హుహ్వా" అను 
ఇద్దరు గంధర్వులు అతి వేగముతో గానం చేసి 
నృత్యం చేయగా నృసింహస్వామిసంతోషించి 
వారికి శాప విమోచనం గావించెను. 
కిన్నెర, కింపుర, నారదుల ఈ క్షేత్రం నందు గానం చేసిరి. సంగీతాన్ని అనుభవించినట్లు ఉండే ఈ స్వామిని 
చత్రవట స్వామి అని పిలుస్తారు. 
ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి కేతుగ్రహ అనుగ్రహం లభించును.

9. పావన నరసింహ స్వామి..🙏
(బుధగ్రహ అనుగ్రహానికి..దోషాలు పోవడానికి..)
పరమపావన ప్రదేశం లో ఏడుపడగల ఆదిశేషుని క్రింద తీర్చిదిద్దిన మూర్తి.
ఈ స్వామివారి పేరులోనే సమస్త పాపములను, 
సంసారం లో జరిగే సుఖ:దుఖా:లను తొలగించగలిగేవాడని అర్ధమగుచున్నది. 
మరియు "భరద్వాజ" ఋషి ఇచ్చట తపస్సు చేయగా స్వామి వారు మహాలక్ష్మీ సహితంగా వారికి దర్శనమిచ్చారు. 
కావున ఈ స్వామికి పావన నరసింహస్వామి అని పేరు. ఈ క్షేత్రాన్ని పాములేటి నరసింహస్వామి అని కూడా పిలుస్తారు. 
ఎగువ అహోబిలానికి 6 కి.మీ. దూరములో 
దక్షిణ దిశలో యున్నది. 
పాపకార్యములు చేసినవారు ఈ స్వామిని దర్శించినంతనే పావనులగుదురు. 
బ్రహ్మోత్సవముల దగ్గరనుండి ప్రతి "శనివారం" నృసింహ జయంతి వరకు అద్భుతంగా వేడుకలు జరుగును. 
ఈ క్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో వారి వారి కష్టములను, పాపములను భగవంతుని ప్రార్ధనా రూపముగా సేవించి దర్శించుకుంటారు. 
ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి బుధగ్రహ అనుగ్రహం లభించును.

RECENT POST

మార్వాడ దేశం లో ఒకప్పుడు ఉన్న కర్మాబాయి అనే మహిళ పూరీ జగన్నాథ స్వామి కి మహాభక్తురాలు.

చాలా బాగుంది - పూర్తిగా చదవండి మార్వాడ దేశం లో ఒకప్పుడు ఉన్న కర్మాబాయి అనే మహిళ పూరీ జగన్నాథ స్వామి కి మహాభక్తురాలు.  ఆమె తన ఐహికమైన బరువుబా...

POPULAR POSTS