Thursday, February 7, 2019

200 ఏళ్ల కిందటే నిషేధం అయప్ప ఆలయంలోకి మహిళలకు ప్రవేశం లేదు 1820లో బ్రిటిష్‌ అధికారుల సర్వే నివేదిక

(ఆంధ్రజ్యోతి సౌజన్యంతో...)
200 ఏళ్ల కిందటే నిషేధం
అయప్ప ఆలయంలోకి మహిళలకు ప్రవేశం లేదు
1820లో బ్రిటిష్‌ అధికారుల సర్వే నివేదిక
రుతుక్రమం వయసులో ఉన్న మహిళలు శబరిమలకు వెళ్లకూడదు! ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం! కానీ, నిర్దిష్టంగా ఎప్పటి నుంచి ఈ నిషేధం అమల్లో ఉన్నదనేది ఎవరికీ తెలియదు. దీనిపై ఇప్పుడు ఒక కీలకమైన ఆధారం దొరికింది. 200 ఏళ్ల కిందటే ఈ నిషేధం ఉందని బ్రిటిష్‌ పత్రాల ద్వారా స్పష్టమైంది. ‘మెమొయిర్‌ ఆఫ్‌ ది సర్వే ఆఫ్‌ ది ట్రావెన్‌కోర్‌ అండ్‌ కొచిన్‌’ పేరిట బ్రిటిష్‌ ప్రభుత్వం రెండు భారీ సంపుటాలను ప్రచురించింది. మద్రాస్‌ ఇన్‌ఫ్యాంట్రీకి చెందిన లెఫ్టినెంట్‌లు బెంజమిన్‌ స్వైన్‌, పీటర్‌ ఐర్‌ కానర్‌ ఐదేళ్లపాటు పర్యటించి ఈ సర్వే నిర్వహించారు. 1820లో పూర్తయిన ఈ సర్వే వివరాలతో 1893లో ఒక సంపుటి, 1901లో మరో సంపుటిని ప్రచురించారు.

‘‘రజస్వల అయిన తర్వాతి నుంచి నిర్దిష్టంగా కొంత వయసు వరకు మహిళలు ఈ ఆలయంలోకి రాకూడదు’’ అని తెలిపారు. పర్వతం వెలిసిన ఈ ఆలయాన్ని ‘చౌరిముల్ల’ (అయ్యప్ప స్వామి)కు అంకితం చేసినట్లుగా తెలిపారు. దీనిని ‘పర్వత దేవతల’ ఆలయంగా రాశారు. పవిత్రమైన పదునెట్టాంబడి (18 మెట్లు) గురించి కూడా ప్రస్తావించారు. చిన్న ఆలయాన్ని అప్పటికే తామ్ర (రాగి) పత్రాలతో తాపడం చేశారని తెలిపారు. అప్పట్లోనే ఈ ఆలయానికి ఏటా (జనవరి 12 నుంచి ఐదు రోజులపాటు) 10 నుంచి 15వేల మంది భక్తులు వచ్చేవారని వివరించారు.

గవర్నర్‌తో సీఎం భేటీ
సుప్రీంకోర్టు తీర్పును ఆధారంగా చేసుకుని భక్తులపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన ఆంక్షలు విధించిందంటూ కాంగ్రెస్‌, బీజేపీ నేతలు గవర్నర్‌ సదాశివానికి పలుమార్లు ఫిర్యాదు చేశారు. దీనిపై చర్చించేందుకు తాను సీఎంను పిలిచినట్లు పి.సదాశివం పలుమార్లు ట్విటర్‌ వేదికగా చెప్పారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ గురువారం రాజ్‌భవన్‌కు వెళ్లారు. శబరిమల అంశంపై వివరణ ఇచ్చారు. మరోవైపు... శబరిమల వివాదంపై కేరళ మంత్రి కడకంపల్లిని ఫేస్‌బుక్‌లో దూషించిన మడియాంకుళం ఆలయ ప్రధాన పూజారి మాధవన్‌పే మలబార్‌ దేవస్వం బోర్డు సస్పెండ్‌ చేసింది.

ఇది స్పష్టమైన రుజువు
శబరిమలలో సంతానోత్పత్తి వయసులో ఉన్న మహిళలపై నిషేధంపై బ్రిటిష్‌ ప్రభుత్వ నివేదికే తిరుగులేని ఆధారమని చరిత్రకారుడు శశిభూషణ్‌ పేర్కొన్నారు. ట్రావెన్‌కోర్‌ రాజ్యంలో ఇది అలిఖిత చట్టంగా అమలైందని స్పష్టమైందన్నారు. 1991లో కేరళ హైకోర్టు ఈ నిషేధానికి చట్టబద్ధత కూడా కల్పించిందన్నారు.

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS