Sunday, January 16, 2022

గ్రహ దోషాలు - పరిహారాలు

 గ్రహ దోషాలు - పరిహారాలు



      మానవుడిపై గ్రహాల ప్రభావం ఉంటుంది నవగ్రహాలలో ఒక్కో గ్రహం, దాని తాలూక దోషం, ఆయా వ్యక్తులకు మనఃశాంతి లేకుండా చేస్తుంటాయి. అందువల్ల గ్రహదోషం అనగానే వాటికి శాంతి చేయించాలి.


అయితే జ్యోతిశ్శాస్త్ర గ్రంథాలలో రవి ఈశ్వరారాధన చేస్తారు. చంద్రుడు గౌరీ ఉపాసకులు. కుజ దిశ సుబ్రహ్మణ్యం అధిదేవత అని, బుధుడికి విష్ణువు ఆరాధ్య దైవము అని, గురువుకు శివుడు, శుక్రుడికి లక్ష్మీ ఉపాసన, శనికి శివారాధన, రాహువుకు దుర్గ, కేతువుకు గణపతి అని చెప్పబడింది. దీని ఆధారంగా వివిధమైన విధానాలు పెద్దలు, మహర్షులు వ్యవస్థ చేశారు.


సాధారణంగా ఆరోగ్య సమస్యలు నడిచే విషయంలో సూర్య నమస్కారాలు అరుణ పారాయణ చేయించడం ఒక విధి. రవి దశ, గురు దశ, శని దశ, కేతు దశ నడిచేటప్పుడు ఇది బాగా పని చేస్తుంది. చంద్రగ్రహం వలన వచ్చే ఆరోగ్య సమస్యలకు సూర్య నమస్కారాలతోపాటు దుర్గా అనుష్ఠానం చేయించాలి. అలాగే కుజ దశ నడిచే సందర్భంలో సుబ్రహ్మణ్య ఆరాధన, బుధ దశ విషయంలో లక్ష్మీనృసింహానుష్ఠానం, శుక్ర దశలోనూ కేతు దశలోనూ లక్ష్మీ నృసింహానుష్ఠానం, శనితో సంబంధంగా ఆరోగ్య సమస్యలు వున్నప్పుడు మృత్యుంజయ జపం, రాహువుతో సంబంధంగా ఆరోగ్య సమస్యలకు దుర్గా అనుష్ఠానం మంచిది. అలాగే మృత్యుప్రదం అయిన ఆరోగ్య సమస్యలు తీవ్రంగా బాధించే సమయంలో నిత్యం ‘మృత్యుంజయ పాశుపతం’ చేయించాలి.


వివాహము ఆలస్యం

వివాహం ఆలస్యం, ప్రయత్నాలలో చికాకులు విషయంగా రవితో సంబంధం అయిన సందర్భంలో శివ కల్యాణం చేయించడం, నిత్యం శివాలయంలో శివారాధన చేయడం, చంద్రుడితో దోషం ఉన్నప్పుడు గిరిజా కళ్యాణం చేయించడం మరియు సుబ్రహ్మణ్య పూజలు చేయడం, బుధ గ్రహంతో దోషం వున్నప్పుడు రుక్మిణీ కళ్యాణం ఘట్టం రోజూ పారాయణ చేయడం అలాగే కుదిరినప్పుడు శ్రీనివాస కళ్యాణం చేయించడం, గురువుతో వివాహ విషయమై దోషం వున్నప్పుడు శివ కల్యాణం చేయించి పంచాక్షరీ మంత్రానుష్ఠానం చేయించడం. శుక్ర సంబంధమయిన దోషంతో వివాహ ప్రతిబంధకాలు వున్నవారు రుక్మిణీ కళ్యాణం పారాయణ చేయడం లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేయడం అవసరం.


శని దోషంగా ఉండి వివాహ విషయంగా ప్రతిబంధకాలు ఎదురైనప్పుడు శివ కళ్యాణం చేయించి నిత్యం రామనామం చెబుతూ ఆంజనేయ స్వామికి 108 ప్రదక్షిణలు చేయడం, రాహువుతో వివాహ విషయంగా ప్రతిబంధకాలు ఉన్నప్పుడు పార్వతీ కళ్యాణం చేయించి రోజూ దుర్గా సప్తశ్లోకా పారాయణ, ఇంకా లలితా సహస్ర పారాయణ చేయడం, కేతువుతో దోషం చెప్పబడినప్పుడు విఘ్నేశ్వరుడికి చతురావృత్తి తర్పణాలు చేయించి నిత్యం లక్ష్మీ నృసింహ స్తోత్ర పారాయణ చేయడం శుభకరం.


అయితే ఏ గ్రహ సంబంధమయిన దోషం వున్నా ‘కన్యాపాశుపతం’ చేయిస్తారు. గ్రహ సంబంధమైన ఏ విధమైన దోషం ఉన్ననూ నిత్యం నవగ్రహాలకు ప్రదక్షిణలు 11 చేసి అనంతరం శివుడికి 11 ప్రదక్షిణలు చేసి శివసన్నిధిలో విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం శుభం. దీనికి కారణం సృష్టి పరిపాలకులు గ్రహ గమన నిర్దేశకులు హరిహరులు సంతృప్తి పొందితే సత్వరం శుభ ఫలితాలు ఉంటాయి. పై శాంతి చేయించడం ద్వారా జాతకంలో రాసి వున్న వివాహ దశలు కాలం మారవు. ప్రయత్నాలలో అవరోధాలు చికాకులు తొలగుతాయి.


ఇక విద్యా విషయంగా పరిశీలిస్తే రవి దోషంగా ఉంటే అనుగ్రహం కావలసి వచ్చినను గురు శని విషయంలో కూడా దక్షిణా మూర్తి ఆరాధన త్వరగా సత్ఫలితాలను ఇస్తుంది. చంద్రగ్రహ విషయంలో బాలానుష్ఠానం, కుజ గ్రహ విషయంలో సుబ్రహ్మణ్య ఆరాధన, బుధ గ్రహ విషయంలో హయగ్రీవోపాసన, శుక్రగ్రహ విషయంలో హయగ్రీవోపాసన, రాహు గ్రహ విషయంలో బాలామంత్రానుష్ఠానం, కేతువు గ్రహ విషయంలో శ్రీవిద్యా గణపతి అనుష్ఠానం చెబుతారు. అయితే ‘ఈశానస్సర్వ విద్యానాం’ అనే వేద వాక్యం ఆధారంగా ‘ఓం నమశ్శివాయ’ శివ షడక్షరీ మంత్రానుష్ఠానం దీక్షగా మెడిటేషన్ చేసిన వారికి విద్యా విజ్ఞాన యోగం తప్పక లభిస్తుంది.


పిల్లలు సరిగా మాట వినకపోయినా, సరైన దారిలో లేకున్నానూ, విద్యా ఉద్యోగ వివాహ విషయములలో సమస్యలతో ఉంటే.. శ్రీరామ శ్శరణం మమ’ అని 108 ప్రదక్షిణలు ఆంజనేయ స్వామికి ప్రతిరోజూ చేయడం ద్వారా తల్లిదండ్రులు సత్ఫలితాలు అందుకుంటారు.


ఉద్యోగ విషయంలో రవి గురు శని దోషం ఉంటే పాశుపతి అభిషేకం చేయించి ప్రదోష కాలంలో శివాలయంలో చండీ ప్రదక్షిణలు చేయాలి. చంద్ర శుక్ర రాహు దోషం ఉంటే చండీ సప్తశతీ పారాయణ, కుజగ్రహ దోషం ఉంటే సర్పసూక్తంతో అభిషేకం, బుధ కేతు గ్రహ దోషం ఉంటే లక్ష్మీ గణపతి అనుష్ఠానం శ్రేయస్కరం.సమస్యలు ఇటువంటి పరిహారాలకు లొంగనపుడు పూర్తి జాతక పరిశీలన చేయించి సరియైన పరిహారం చేసుకుంటే ఉపశమనం లభిస్తుంది

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS