Sunday, January 16, 2022

అమ్మవారి నవరాత్రి పూజా విధి , పూజకు ఉపయోగించాల్సిన సామాగ్రి

 అమ్మవారి నవరాత్రి పూజా విధి , పూజకు ఉపయోగించాల్సిన సామాగ్రి



శరన్నవరాత్రుల పూజా విధానం , తప్పక తెలుసుకోవాల్సినవి

శ్రీదేవీ శరన్నవరాత్రులు ప్రారంభించే ముందురోజునాటికే పూజాసామగ్రి , పూజాద్రవ్యాలు , హోమద్రవ్యాలు సిద్దం చేసుకోవాలి. 


పూజామందిరంలో 9 అంగుళాలు ఎత్తుగల పీఠాన్ని ఏర్పరచుకొని , పీఠముపై ఎర్రని వస్త్రము పరిచి , బియ్యము పోసి , దానిపై సువర్ణ , రజిత , లేదా తామ్రా కలశమును ఉంచి , కలశమునకు దారములు చుట్టి , కలశములో పరిశుద్ద నదీజలములను నింపి ,

అందు లవంగములు , యాలకులు , జాజికాయ , పచ్చకర్పూరము మొదలగు సువర్ణద్రవ్యాలు వేసి , నవరత్నాలు , పంచలోహాలను వేసి , పసుపు , కుంకుమ , రక్తచందన , చందనాదులను వేసి , మామిడి , మారేడు , మోదుగ , మర్రి , జమ్మి చిగుళ్ళను ఉంచి , పరిమళ పుష్పాదులను వేసి , దానిపై పీచు తీయని , ముచ్చిక కలిగిన టెంకాయనుంచి , దానిపై ఎర్రని చీర , రవిక వేసి , కలశమును చందన , కుంకుమ , పుష్పాదులతో అలంకరించాలి.


యధా శాస్త్రీయముగా విఘ్నేశ్వరపూజ చేసి , రక్షాబంధన పూజ చేసి , రక్షాబంధనాన్ని ధరించి , కలశస్థాపన పైన చెప్పిన విధంగా చేసి , ప్రాణప్రతిష్ట కరన్యాసములు చేసి , షోడశ ఉపచారములతో శ్రీసూక్త విధానంగా , సహస్ర నామములతో , త్రిశతీ నామములతో ,


అష్ణోత్తర శతనామములతో , దేవీఖడ్గమాలా నామములతో , పసుపు , కుంకుమ , హరిద్రాక్షతలు , కుంకుమాక్షతలు , రక్తచందనాక్షతలు , శ్రీచందనాక్షతలు , బిల్వదళములు , తులసీదళములు , పరిమళ పుష్పాదులతో అర్చన చేసి , నవకాయ పిండివంటలతో రకరకాలైన ఫలములను , చలివిడి , వడపప్పు , పానకము , తేనె , పంచదార , పెరుగు , నివేదన చేసి , మంగళహారతిచ్చి అమ్మవారిని ఈ విధంగా ప్రార్థించాలి. తల్లీ ! ఈ నవరాత్రులు నా ఈ శరీరాన్ని మనసును నీ అధీనం చేస్తున్నాను.


నాచే ఈ నవరాత్ర ప్రతదీక్ష దిగ్విజయంగా నిర్వహింపచేసుకొని , నన్ను ఆశీర్వదించు తల్లీ ! అని ప్రార్థించాలి. హస్తా నక్షత్రముతో కూడుకొన్న పాడ్యమినాడు మాత్రమే కలశస్థాపన చేయాలి. ఈ విధంగా నవరాత్ర వ్రతము ఆరంభించిన దగ్గరనుండి బ్రాహ్మీముహూర్తంలో నిద్రలేచి , స్నాన సంధ్యాదులు ముగించుకొని , త్రికాలార్చనగానీ , షట్కాలార్చనలతోగానీ అమ్మవారిని తృప్తి పరుసూ , ఉదయం నుండీ , సాయంత్రం వరకూ ఉపవాసము ఉండి , సాయంకాల అర్చన ముగించుకొని , అమ్మవారికి మహానివేదన చేసి , నక్షత్రములను దర్శించి భోజనము చేయాలి.



ఉల్లి , వెల్లుల్లి విసర్జించాలి. సాంసారిక సుఖానికి దూరంగా ఉండాలి. మరొనంగా ఉండాలి. పరిశుద్ధంగా , పవిత్రంగా ఉండాలి. భూమిపైనే శయనించాలి. ప్రతినిత్యము అమ్మవారిని నవదుర్గా రూపములో అలంకరించి  ఆరాధించాలి. అమ్మవారియొక్క విగ్రహాన్ని స్థాపన చేసుకోదలచిన వారు అమ్మవారు సింహవాహనాన్ని అధిరోహించి , అష్టభుజాలతో , అష్టవిధ ఆయుధాలను ధరించి , సౌమ్యమూర్తియై , అభయప్రదానం సౌమ్యస్వరూపిణిగా గానీ , చతుర్భుజాలతో పద్మాసనం వేసుకొని , సింహాసనం మీద కూర్చొని , చతుర్భుజాలలో అభయ , వరద , పాశ , అంకుశములను ధరించి , సౌమ్యమూర్తిగా కిరీటములో చంద్రవంకను ధరించినటువంటి విగ్రహాన్నిగానీ స్థాపించుకొని ఆరాధించాలి. 


ప్రతినిత్యము అమ్మకు ప్రియమైన చండీసప్తశతీ , దేవీభాగవత , సౌందర్యలహరి పారాయణలను చేసుకుంటూ వుండాలి. సువాసినీపూజ , కుమారీపూజ , శ్రీచక్ర నవావరణార్చనాది అర్చనలతో అమ్మవారిని తృప్తిపరుస్తూ ఉండాలి.


గీత , వాద్య , నృత్యాదులతో అమ్మవారికి ఆనందాన్ని కలుగచేయాలి. నామసంకీర్తనలతో ఆ తల్లిని ఆనందింప చేయాలి. వందలు , వేల దీపాలు వెలిగించి ఆ తల్లికి సంతోషాన్ని కలుగచేయాలి. అమ్మవారికి ప్రియమైన శ్రీవిద్య , చండీ , దశమహావిద్యాది హోమాదులతో అమ్మను తృప్తిపరచాలి.


అమ్మకు ప్రియమైన బాలాషడక్షరీ , లలితాపంచదశాక్షరీ , రాజరాజేశ్వరీ మహాషోడశాక్షరీ , మహామంత్రాదులను యధాశక్తి జపించాలి. ఎర్రని వస్త్రాలు మాత్రమే ధరించాలి. ఎర్రచందనము , చందనము , పసుపు , కుంకుమ ధరించాలి.


అమ్మకు ప్రియమైన ముత్యాల , పగడాల , రుద్రాక్ష మాలికలను ధరించాలి. అమ్మభావన కలిగి , అమ్మను ఆరాధిసూండాలి. పరుషమైన మాటలు , అమంగళకరమైన వాక్యాలు పలుకకూడదు. పండితులు , బ్రాహ్మణులు , భక్తులు విచ్చేసినయెడల శక్యానుసారము పూజించి , సత్కరించాలి. ఈవిధంగా శక్త్యానుసారము నవరాత్రి వ్రతాన్ని ఆచరించాలి

No comments:

Post a Comment

RECENT POST

స్యయంభూ ఏకరూప దత్తాత్రేయ స్వామి మన పల్నాడు ప్రాంత ఎత్తిపోతల

నిజమైన స్యయంభూ ఏకరూప దత్తాత్రేయ స్వామి  మన పల్నాడు ప్రాంత ఎత్తిపోతల లో తప్పితే ఎక్కడా ప్రపంచంలో లేరు..ప్రపంచంలో ఎన్ని దత్తాత్రేయ ఆలయాలు ఉన్న...

POPULAR POSTS