Wednesday, May 9, 2018

గురువు కోసం అన్వేషణ చేసేవాళ్ళు,గురు చరిత్ర చదవండి

గురువు కోసం అన్వేషణ.
గురువు కోసం అన్వేషణ చేసేవాళ్ళు,గురు చరిత్ర చదవండి, రోజూ పారాయణ చేయండి,గురువులు తప్పక దర్శన మిస్తారు. మీ పట్టుదల శ్రద్ధ,భక్తిని బట్టి గురువులు లబిస్తారు.
ఎంత తీవ్రముగా మీ కోరిక వుంటే అంత తొందరగా దొరుకుతారు. మనసులో వేదన, పరితాపము వుండాలి. గురువులను మీ భక్తి శ్రద్దలతో మెప్పిస్తే, వాళ్ళు మీకు మంత్ర దీక్ష ఇస్తారు.
డబ్బుతో గురువులను కొనకూడదు. ధనాశ చూపి మంత్రములను పొందకూడదు. చాలా శ్రద్దతో, తపనతో భక్తీ తో మంత్రములను పొందాలి.
గురువులు పర దేవతా స్వరూపము. వారి అనుగ్రహము మీ పైన కలగాలి, అంత వరకు వేచి వుండాలి.
ఒక బ్యాంకు లో ఇంటి మీద అప్పు తీసుకోవాలంటే 15సం. లింకు డాక్యుమెంట్ అడుగుతారు. మధ్యలో ఎక్కడ లేక పోయానా, ఆ లింక్ తెగి పోయినట్లే. ఆ ఆస్తి ఎలావచ్చిందో తెలిపే లింక్ డాక్యుమెంట్ తీసుకొని రమ్మంటారు.
అదే విధముగా గురువులకు కూడా ఆ మంత్ర దీక్ష ఎలా వచ్చినదో తెలిపే లింక్ వుండాలి. ఎవరి నుంచి ఎవరికీ వచ్చినది తెలపాలి.  దీనినే గురు త్రయము అని అంటారు.
౧. స్వ గురువు
౨. పరమ గురువు
౩,  పరమేష్టి గురువు
వీరి పేర్లు తెలిసి వుండాలి, గురు పరంపర అవిచ్చిన్నంగా వుండాలి. మద్యలో ఎక్కడా తెగి వుండ కూడదు.
తల్లి దండ్రుల ఆస్తి పిల్లలకు వచ్చినట్లు, గురువుల తపశక్తి శిష్యులకు గురు త్రయము ద్వారా వస్తుంది.
గురు త్రయమునకు కూడా మంత్రము వున్నది. రోజూ గురు త్రయమును స్మరించి, వారి పాదములను స్పృశించి, మిగతా మంత్రానుష్టానము చేయవలెను.
గురు.త్రయము లేకుండా తీసుకొనిన మంత్రముల ద్వారా సాధకునికి  రక్షణ వుండదు. ఆ మంత్రములు అంతగా ఫలించవు.  గురు త్రయము  అనేది సాధకునికి రక్షణ కవచము. అది లేనిదే చాలా కష్టములు ఎదుర్కోన వలసి వస్తుంది.
అది లేకుండా ఎవరైనా మంత్రములు ఇస్తే, ఆ ఇచ్చిన గురువులకు అంత బాధ్యత లేదు, అయన మీ బాధ్యత తీసుకోలేదు అని అర్ధము. గురువులు శిష్యుల బాధ్యత తీసుకోవలెను. అప్పుడే శిష్యుడు చేసే తప్పులు దోషములు గురువుకు అంటుతాయి. 
నిత్యకర్మానుష్ఠానములో, మంత్రానుష్టానములో  చేసే తప్పుల వలన కలిగే పాపములు, దోషములు  గురువుకు కూడా కొంత సంక్రమిస్తాయి. శిష్యుడు తప్పు చేస్తే అది గురువుకు చెందుతుంది.
అందు వలన కొంత మంది గురు త్రయము ఇవ్వకుండా మంత్రములు ఇస్తారు. దాని వలన మనకు లాభము వుండదు. మన కోసము తన తపము త్యాగము చేసే వాడె గురువు. అటువంటి త్యాగశీలి మనకు కావాలి.
అంతే గాని ఎవరి దగ్గర అంటే వారి దగ్గర తీసుకొంటే దాని వలన ఉపయోగము ఉండదు. మంత్రము ఫలించదు. మంత్రానుష్టానము చేసేవాడె ఇంకొరికి మంత్రము ఇవ్వగలడు.  అప్పుడే ఆ మంత్రము ఫలించును.
కొంత మంది ఒక్కో మంత్రము ఒక్కో గురువు దగ్గర తీసుకొంటూ వుంటారు. ఇలా చేయ కూడదు. గురువు అనే వాడు ఒక్కడే వుండాలి. ఒక్కరి దగ్గరనే మంత్ర దీక్ష తీసుకోవాలి.
మనకు నచ్చ లేదని గురువులనుమార్చకూడదు.
నమ్మకముతో గురువులను ఆశ్రయించాలి. గురువుల కోసము మన:,ధన:,ప్రాణములను సహితము ధారాలంగా అర్పించే విధముగా మనము వుండాలి.
గురువులు శిష్యులను తన కన్న బిడ్డలుగా చూడాలి. ప్రతి చోటా ఇద్దరికీ త్యాగము మిన్నగా వుండాలి. త్యాగము లేనిదే గురు శిష్య పరంపర కోన సాగదు.
కావున మీరందరు గురు పరంపర తో కూడిన మంత్ర దీక్షలు తీసుకొని, మంత్రములను అనుష్టానము చేస్తూ,నిత్య జీవితములోని, సంసారములోని కష్టనష్టాలను దూరం చేసుకొని, ఆ పర దేవత కృపకు పాత్రులు అగుదురని ఆశిస్తూ,..
ఓం శ్రీ గురుః  పరమ కారణ భూతాశక్తిః  ... అని భావనోపనిషత్తు చెప్పు చున్నది.
శ్రీవిద్యా పూర్ణ దీక్ష నొసగిన శ్రీ గురువులు  శ్రీ పరాదేవి స్వరూపులే. శ్రీ గురుదేవుల అనుగ్రహము చేత మహా వాక్య ప్రాప్తి, ( శ్రీవిద్యా పూర్ణ దీక్ష యందు మహా వాక్యములతో గూడిన మహా పాదుకలను ఇచ్చెదరు.)
దాని వలన బ్రహ్మాత్మైక్య సిద్ది లభించుచున్నందున శ్రీ గురువులే పరమ కారణమైన పరాశక్తి స్వరూపులని,       శ్రీ గురువులకు శ్రీ మాతకు అభేదము అని చెప్పు చున్నది.
లోకా సమస్తా సుఖినో భవంతు..!!
                           శ్రీ మాత్రే నమః

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS