Wednesday, May 9, 2018

హనుమజ్జయంతి ప్రత్యేకం

       
  హనుమజ్జయంతి ప్రత్యేకం                                హనుమ - ఆచార్యుడు
       జీవునిలో భగవంతుని పొందాలి అనే ఆర్తి కలిగినపుడు, భగవానుడే ఆచార్యుని ఎంచి, జీవుని వద్దకు పంపుతాడు.
       ఆచార్యుడు వేద సంపన్నుడు, భగవదనుభవము పొందినవాడు కావలెను.
    "శ్రోత్రియమ్ బ్రహ్మనిష్ఠమ్" అని శ్రుతి.
అ) శ్రోత్రియుడు
        హనుమ మొదటగా రామలక్ష్మణులను కలసి మాటలాడినప్పుడు శ్రీరాముడు లక్ష్మణునితో హనుమను ప్రశంసించిన విషయం అతిగొప్పది.
      హనుమ ఋగ్వేద,యజుర్వేద,సామవేదములను అధ్యయనము చేసినవాడని విశేషణాలతో పొగడబడ్డాడు.
      ఋగ్వేదమున ప్రతివర్ణానికీ స్వరముంటుంది. గురువు వద్ద ఎంతో శిక్షణ పొందినగానీ దానిని సరిగా చదువలేరు. అందుకని హనుమను "ఋగ్వేద వినీతుడు" అన్నాడు రాముడు. 'వినీతుడు' అంటే 'శిక్షితుడు".
        యజుర్వేదంలో ఒక అనువాకంలో వాక్యము మరొక అనువాకంలో కనబడుతూంటుంది. అవి కలియకుండ ధారణ అవుసరం. అందుచే "యజుర్వేద ధారిణః" అన్నాడు.
        సామవేదము గాన ప్రధానము. గానములో మార్పులు చేయు జ్ఞానము "విదుషత్వము". అది కలవాడని హనుమను శ్రీరాముడు "సామవేద విదుషః" అని గుర్తించాడు.
     కాబట్టి హనుమ మూడుగా నున్న వేదాలకు సంబంధించి,
శిక్షణ పొందినవాడు,  జ్ఞప్తియందుంచుకొనేవాడు,  ప్రయోగించువాడు అని
మెచ్చుకోబడి శ్రోత్రియుడయ్యాడు.
ఆ) బ్రహ్మనిష్ఠుడు
         వేదాధ్యయన జ్ఞానముతో అభ్యాసము చేయుచూ, భగవత్తత్త్వము అనుభవించుట బ్రహ్మనిష్ఠ.
      రామలక్ష్మణులను తన భుజస్కంధాలపై ఆసీనులను చేసి, సుగ్రీవుని వద్దకు తీసుకు వెళ్ళాడు హనుమ. తద్వారా పరమాత్మతో అనుభూతి పొంది, బ్రహ్మనిష్ఠుడయ్యాడు.
    పరమాత్మ వేదజ్ఞానపరాయణుడైన హనుమను గుర్తించి, తాను హనుమకు పరమాత్మానుభూతి కూడా కలిగించి ఆచార్యుని చేశాడు.
        "లంక" అనే దేహంలో,
        "సీత" అనే జీవుని,
        "రావణుడు" అనే ఇంద్రియాలు బంధించి యుంచితే,
      ఆ "సీత" అనే జీవుడు
          "రాముడు" అనే పరమాత్మను పొందాలని ధ్యానిస్తున్నప్పుడు,
          "హనుమ" అనే ఆచార్యునితో అక్కడకు,
          "అంగుళీయకము"తోపాటు తన సందేశాన్ని భగవంతుడైన శ్రీరాముడు పంపాడు.
    మనం కూడా ఆ సందేశం పొందాలి.
    సరియైన విషయమై
శిక్షణ(Training),
జ్ఞప్తి(Memory),
జీవితంలో ఆచరణ(Application) అనే మూడూ శ్రోత్రియునిగా తయారుచేసి, తద్వారా,
      సాధనలో అనుభూతితో బ్రహ్మనిష్ఠునిగానూ చేసి,
      మనలను తావలెనే మార్చి అనుగ్రహిస్తాడు హనుమ.
          జై శ్రీరామ్ జై హనుమాన్
                    =x=x=x=
    — రామాయణం శర్మ
            భద్రాచలం
     హనుమజ్జయంతి ప్రత్యేకం
2. హనుమంతుడు - కుండలినీ యోగ సాధకుడు
        యోగి, కుండలినీశక్తిని మూలాధారము నుండి పైకి ప్రయాణింపజేసి, స్వాధిష్ఠాన - మణిపూర - అనాహత - విశుద్ధ - ఆజ్ఞా చక్రములను అతిక్రమించి, చివరికి సహస్రారపద్మాతర్గత బిందు స్వరూపమైన పరబ్రహ్మ సాక్షాత్కారమున పొందుతాడు. అదే యోగ సిద్ధి.
        హనుమంతుడు జితేంద్రియుడు. అంటే ఇంద్రియ చాపలం లేనివాడు. బుద్ధిమతాంవరిష్ఠుడు. అనగా ఇతర విక్షేపములు లేని బుద్ధి, లక్ష్యశుద్ధి కలవాడు.
1. మూలాధారం:
        హనుమంతుడు మహేంద్రపర్వతం నుండి ఆకాశంలోకి ప్రయాణించడం అంటే మూలాధారంనుంచీ కుండలినీ శక్తిని ఊర్ధ్వముఖంగా ప్రయాణింపజేయడం.
2. స్వాధిష్ఠాన చక్రం:
        మైనాకుడు సహాయం చేయవచ్చినా అదికూడా గమనానికి అవాంతరమే కదా! ప్రలోభాలకీ సుఖాలకీ ఆశించక, ఆటంకాన్ని దాటటం స్వాధిష్ఠానాన్ని అతిక్రమించడం.
3. మణిపూర చక్రం:
       తనని సురస మ్రింగెదనని, తన నోట ప్రవేశింపమని అడ్డగించింది. ఆ సురస నోట ప్రవేశించి, బయటపడి తప్పించుకొనడం మణిపూర చక్రాన్ని అతిక్రమించడం.
4. అనాహత చక్రం:
       సింహిక ఛాయాగ్రహణం చేయగా, దానిని సంహరించటం అనాహతాన్ని దాటి పైకి సాగటము.
5. విశుద్ధి చక్రం:
       లంకా ప్రవేశానికి లంకానగర అధిష్థాన దేవత అడ్డువచ్చింది.
      ఆమెను గెలవటం విశుద్ధి చక్రాన్నతిక్రమించడం.
6. ఆజ్ఞా చక్రం:
         మండోదరిని చూచి సీతయే అని పరమానందం పొందాడు.
        కానీ లక్షణాలనిబట్టీ, వివేచనచేనూ ఆమె సీత కాదనుకొన్నాడు.
       ఆజ్ఞా చక్రాన్ని చేరిన కుండలిని, అదే గమ్యమనుకొని ఆనందపడి, మరల విచక్షణా జ్ఞానంచే,  గమ్యానికి ఇంకా ప్రయత్నం చేయవలసి ఉందని గ్రహించడం ఆజ్ఞా చక్రాన్ని దాటటం.
7. సహస్రార చక్రం:
         అశోకవనంలో సీతాదేవిని చూచి, ఆనందించడం సహస్రార చక్ర ప్రవేశం.
         ఆరు చక్రాలనీ జయించుకొని వచ్చిన సిద్ధపురుషునికి సహస్రార చక్రాంతర్గత బిందురూపిణి అయిన శ్రీ భువనేశ్వరీ దర్శనమైనదని అర్థం.
        చివరకు సీతారాములను తిరిగి కలిపి అయోధ్య చేర్చిన ఆంజనేయ సమారాధనలో సర్వేశ్వరి సాయుజ్యం గోచరిస్తుంది.
         ఈ విధంగా మారుతి యోగసిద్ధుడు.
                    =x=x=x=
  — రామాయణం శర్మ
          భద్రాచలం

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS