Friday, January 12, 2018

గ్రహాలు అధిదేవతలు పూజావిధానాలు

గ్రహాలు అధిదేవతలు పూజావిధానాలు
ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అధిదేవత ఉన్నారు. ఆయా గ్రహ అధిదేవతను ఉపాసిస్తే ఆ గ్రహ తీవ్రత తగ్గుతుంది. రవి కి రామావతారాన్ని, చంద్రుడికి కృష్ణావతారాన్ని, కుజుడికి నరసింహ అవతారాన్ని, బుధుడికి బుద్ధావతారాన్ని, గురువుకి వామనావతారాన్ని, శుక్రుడికి పరశురామావతారాన్ని, శనికి కూర్మావతారాన్ని, రాహువుకి వరాహావతారాన్ని, కేతువు కి మీనావతారాన్ని పూజించాలి. నవగ్రహాలలో ఏ గ్రహం యొక్క తీవ్రత అధికంగా ఉందో తెలుసుకొని శ్రీమన్నారాయణ అవతార ధ్యానం చేస్తే ఆ గ్రహా తీవ్రత తగ్గుతుంది. ఇది ఒక విధమైన శాంతి.
కొంతమంది భక్తులు ఎప్పుడు ఏ దేవుడికి పూజ చేస్తే ఎలాంటి పుణ్యఫలితం దక్కుతుందో తెలిస్తే కచ్చితంగా ఆ పూజ మాత్రమే చేసుకుని త్వరగా ఫలితాన్ని పొందాలనుకుంటుంటారు. అలాంటి వారికోసమేనన్నట్టు శివమహా పురాణం విద్యేశ్వర సంహిత పద్నాలుగో అధ్యాయంలో దీనికి సంబంధించిన విషయాలున్నాయి.
దేవతల ప్రీతి కోసం అయిదు విధాలైన పూజ ఏర్పడింది. మంత్రాలతో జపం, హోమం, దానం, తపస్సు, సమారాధనలు అనేవే అయిదు విధాలు. సమారాధనం అంటే దేవుడి ప్రతిమ నుంచే వేదిక. ప్రతిమ, అగ్ని, లేక బ్రాహ్మణుడిని షోడశోపచారాలతో పూజించటం ఈ నాలుగు రకాలలో ఒక దానికంటే ఒకటి ఉత్తమమైనది. పూజలు మనకున్న ఏడు వారాలలో ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవతకు చెయ్యాల్సి ఉంటుంది.
ఆదివారం: ఆదివారం ఆదిత్యుడిని, రామావతారాన్ని, శివుడిని, ఇతర దేవతలను, వేద పండితులను పూజించాలి. ఆదిత్య పూజ వల్ల నేత్రరోగం, శిరోరోగం, కుష్ఠురోగం తగ్గుతాయి. ఆదిత్యుడిని పూజించి వేద పండితులకు భోజనం పెట్టాలి. ఇలా ఒక రోజు నుంచి ఒక మాసం, ఒక సంవత్సరం లేక మూడు సంవత్సరాల పాటు రోగ తీవ్రతననుసరించి పూజ చేయాలి. దీనివల్ల సూర్యానుగ్రహప్రాప్తి కలుగుతుంది.
సోమవారం: సోమవారం సంపద కోరుకోనేవాడు పార్వతీపరమేశ్వరులను, కృష్ణావతారాన్ని, ఆరాధించాలి. పొంగళి నైవేద్యం పెట్టాలి. ఆ రోజున పూజ తర్వాత వేద పండిత దంపతులకు నెయ్యితో భోజనం పెట్టాలి.
మంగళవారం: రోగాలు తగ్గటం కోసం మంగళవారం కాళీదేవతను, నరసింహ అవతారాన్ని,సుబ్రమణ్యేశ్వర స్వామిని, మంగళ చండిని పూజించాలి. మినుము, కంది, పెసరపప్పులతో చేసిన పదార్థాలతో వేద పండితులకు భోజనం పెట్టాలి.
బుధవారం: బుధవారం విష్ణువు, బుద్ధావతారాన్నిఆరాధించాలి. పెసరపప్పు అన్నాన్ని విష్ణువుకు నివేదించాలి. ఈ పూజ, నివేదనల వల్ల పూజ చేసిన వారి భార్య కుమారులు, మిత్రులు, తదితరులకు చక్కటి విద్య, ఆరోగ్యం ప్రాప్తిస్తుంది.
గురువారం: గురువారం వామనావతారాన్ని, సాయిబాబా, హయగ్రీవుడిని, దత్తాత్రేయను ఆరాధించాలి. ఆయుష్షును, ఆరోగ్యాన్ని కోరేవారు తమ ఇష్టదైవం ఎవరైతే వారికి పాలతో, నెయ్యితో చేసిన పదార్థాలను నివేదించాలి. వస్త్రాలను కూడా నివేదించి అర్చన చేయడం మేలు.
శుక్రవారం: శుక్రవారం పరశురామావతారాన్ని,లక్ష్మీదేవిని,లలితాదేవిని పూజించాలి. ఇష్టదైవాన్ని శ్రద్ధతో ఆరాధించి భోగాలను పొందవచ్చు. ఆ రోజున పూజానంతరం వేదపండితుల తృప్తి కోసం షడ్రుచులతో కూడిన భోజనాన్ని పెట్టాలి. స్త్రీల తృప్తి కోసం మంచి మంచి వస్త్రాలను బహూకరించాలి.
శనివారం: శనివారం కూర్మావతారాన్ని, రుద్రాది దేవతల ఆరాధన మంచిది. అపమృత్యువు నుంచి తప్పించుకోవాలనుకునేవారు ఆనాడు నువ్వులతో హోమం చేసి నువ్వులను దానం ఇచ్చి నువ్వులు కలిపిన అన్నంతో పండితులకు భోజనం పెట్టాలి. ఇలా చేయటం వల్ల పూజ చేసిన వ్యక్తికి మంచి ఆరోగ్యం చేకూరుతుంది.
ఇలా ఏడు రోజులతో ఏ దేవతకు పూజ చేసినా ముందుగా సంతోషపడేవాడు శివుడేనని శివపురాణం వివరిస్తోంది. ఆ వారాలకు సంబంధించిన దేవతల ఆనందమే తన ఆనందంగా శివుడు భావించుకొంటాడు. ఆ పూజాఫలాన్ని ఆ దేవతలుకాక శివుడే స్వయంగా ఆ భక్తులకు ప్రసాదిస్తాడు.

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS