Monday, February 14, 2022

మహాభారతం లో కురుక్షేత్ర యుద్ధ సమయంలో 50 లక్షల మంది పాల్గొన్నారు. వారికి వంట వండినవారు ఎవరు?

ఇంట్లో మనం నలుగురికి లేదా ఐదుగురికి 
వంట చేయగలం. అంతకంటే ఎక్కువ మందికి 
చేయటం కొంచెము కష్టమైన పని. మరి 50 లక్షల 
మందికి వంట చేయడం అంటే మామూలు 
విషయం కాదు. మహాభారతం లో కురుక్షేత్ర యుద్ధ సమయంలో 50 లక్షల మంది పాల్గొన్నారు. వారికి 
వంట వండినవారు ఎవరు? ఆసక్తికరమైన 
ఈ విషయం తెలుసుకొందాము.


      మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాన 
కొందరు, పాండవుల పక్షాన కొందరు, ఇలా 
అందరూ కలిసి 50లక్షలకు పైగా యుద్ధంలో 
పాల్గొన్నారు. కానీ ఇంత జరుగుతున్నా 
ఇద్దరు రాజులు పాల్గొన లేదు. అందులో ఒకరు 
విదర్భ రాజైన రుక్మి,, రెండవవాడు బలరాముడు.
ఆ ఇద్దరు తప్ప అన్ని రాజ్యాలు పాల్గొన్నాయి.
 
       దక్షిణ భారతంలోని ఉడిపి రాజ్యం 
కురుక్షేత్ర యుద్ధానికి వచ్చింది. ఉడిపిరాజైన 
నరేషుడు సైన్యాన్ని తీసుకొని యుద్ధ ప్రాంతానికి వెళ్లినప్పుడు కౌరవులు తమ వైపు నిలబడాలని 
మరో వైపు పాండవులు తమవైపు నిలబడాలని కోరుతారు. 

       అప్పుడు ఉడిపి రాజు తన తెలివితో ఎటూ వెళ్ళకుండా సలహా కోసం శ్రీకృష్ణ దగ్గరికి వెళ్తాడు.
అందరూ యుద్ధం గురించే ఆలోచిస్తున్నారు మరి 
ఇన్ని లక్షల మందికి భోజనాలు గురించి ఏమైనా ఆలోచించారా? ఎవరు వండి పెడతారు? అని 
శ్రీకృష్ణుడిని అడుగుతాడు.

       మీరన్నది నిజమే మరి మీ దగ్గర ఏదైనా 
ఆలోచన ఉందా అని నరేషుడుని శ్రీకృష్ణుడు అడుగుతాడు.

     ఇప్పుడు జరుగుతున్న ఈ మహాయుద్ధం 
అన్నదమ్ముల మధ్య, నాకు ఈ యుద్ధంలో 
పాల్గొనడం ఇష్టం లేదు. అందువల్ల నేను, 
నా సైన్యం ఇరువర్గాల యుద్ధంలో పాల్గొనము.
కానీ ఇరువైపుల వారందరికి భోజనం చేసి 
పెడతాము అని ఉడిపిరాజు  చెపుతాడు.

    అప్పుడు శ్రీకృష్ణుడు, రాజా! మీ ఆలోచన 
చాలా అద్భుతమైనది, 50 లక్షల మందికి 
భోజనాలు వండాలంటే భీముడు మరియు 
అతని సైన్యానికి మాత్రమే వీలవుతుంది. 
కానీ ఈ సమయంలో పోరాడటం భీమునకు 
ముఖ్యం. అందువల్ల యుద్ధక్షేత్రం వదిలి 
రాలేడు. కాబట్టి 50 లక్షల మందికి భోజనం 
వండటం మీ వల్లే సాధ్యమవుతుంది,
అందరికీ భోజనాలు తయారుచేయమని 
చెపుతాడు.

   నరేషుడు తన సైన్యంతో కలిసి అక్కడ ఉన్న 
సైన్యాలకు భోజనం తయారు చేస్తాడు. ఎలా 
వండేవాడు అంటే ...  తాను వండిన భోజనం 
ఒక్క మెతుకు కూడా మిగలకుండా, 
వృధాకాకుండా వండేవాడు.

    రోజులు గడుస్తున్న కొద్దీ సైన్యం కూడా 
తగ్గిపోయ్యేది. అయినా సరే వంట మాత్రం 
అందరికీ సరిపోయేలా వండేవాడు నరేశుడు.
ఇది ఎలా సాధ్యం? అంత మంది చనిపోతున్నా 
మిగిలిన వారికి మాత్రమే సరిపోయేలా ఎలా వంట చేస్తున్నారు? అది కూడా ఒక్క మెతుకు కూడా
 మిగలకుండా? అసలు నరేశునికి ఈ రోజు 
ఇంతమంది మాత్రమే చనిపోతారని, మిగిలిన 
వారికి మాత్రమే భోజనం వండాలి అని ఎలా 
తెలుస్తుంది? అని అందరూ ఆశ్చర్యానికి 
గురయ్యేవారు.
 
    ఇలా18 రోజులు గడిచిపోయాయి. 
పాండవులు గెలిచారు. పట్టాభిషేకం 
జరుగుతుంది. అప్పుడు ధర్మరాజు 
ఉడిపి నరేషుడుని అడుగుతాడు, మమ్మల్ని 
అందరూ తక్కువ సైన్యం ఉన్నా గెలిచామని పొగుడుతున్నారు. కానీ నేను మాత్రం నిన్ను మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నాను. 
ఎందుకంటే 50 లక్షల మందికి సైన్యమునకు 
వంట చేయడం, అది కూడా ఒక మెతుకు 
కూడా మిగలకుండా, వృధాకాకుండా వండడం 
అంటే మాటలు కాదు. ఇది మహా అద్భుతం! 
ఇలా ఎలా చేశావు? అని అంటాడు.

     అప్పుడు నరేషుడు నవ్వుతూ మీరు గెలిచారు 
కదా! దాని యొక్క గొప్పతనం ఎవరికి ఇస్తారు 
అని అడిగాడు. అప్పుడు యుధిష్టరుడు తడుముకోకుండా శ్రీకృష్ణుడే దీనికి మూలమని, 
మా విజయం యొక్క గొప్పతనం మొత్తం 
శ్రీకృష్ణునికి చెందుతుంది అని చెప్తాడు.

     అప్పుడు నరేషుడు, మీరు గెలవడానికే కాదు, 
నేను ఇంతమందికి సరిపడా వంట వండడానికి 
కూడా శ్రీకృష్ణుడే కారణం. ఈ గొప్పతనమంతా 
శ్రీకృష్ణునికే చెందుతుంది అని చెప్తాడు.

     ఇది విని సభలో ఉన్నవారంతా ఆశ్చర్యానికి 
గురి అవుతారు. ఇది ఎలా సాధ్యం? శ్రీకృష్ణుడు 
ఎలా కారణం అని నరేషుడుని అడుగుతారు. 
అప్పుడు నరేషుడు అసలు రహస్యాన్ని అందరి 
ముందు ఇలా చెప్తాడు...

       శ్రీకృష్ణుడు ప్రతి రోజు రాత్రి పెసరకాయలు 
తినేవాడు. శ్రీకృష్ణుడు తినకపూర్వం పెసరకాయలు
నేను లెక్క పెట్టి పెట్టే వాడిని. శ్రీకృష్ణుడు తిన్న 
తర్వాత మళ్లీ పెసరకాయలను లెక్కపెట్టే వాడిని.
శ్రీ కృష్ణుడు ఎన్ని కాయలు అయితే తింటాడో 
దానికి వెయ్యిరెట్లు సైన్యం చనిపోయేవారు. 
అంటే శ్రీకృష్ణుడు 50 పెసరకాయలు తింటే 
దానికి వెయ్యి రెట్లు అంటే 50 వేల మంది 
సైనికులు మరుసటి రోజు యుద్ధంలో 
చనిపోయేవారు. ఈ కారణం వల్ల ఏ రోజు 
కూడా భోజనం వృధా కాకుండా నేను మిగతా 
వారికి భోజనం వండే వాడిని అని చెప్పాడు. 
ఇది విని సభలోని వారందరూ శ్రీకృష్ణలీలకు 
ముగ్ధులు అవుతారు.

     ఈ కథ మహాభారత కథలలో ఒక అరుదైన 
కథ. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని 
కృష్ణ మందిరంలో ఈ కథ ఇప్పటికీ వినిపిస్తూ 
ఉంటారు.

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS