పంచారామాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు ఇలా కొన్ని పుణ్యక్షేత్రాలు ఒక సంఖ్యతో చెప్పుకుంటూ ఉంటాం. అలాగే ప్రసిద్ధి చెందాయి ఆ క్షేత్రాలు. ఆ కోవలో చెప్పుకోవలసినవే అష్టగణపతి ఆలయాలు. ఇవి వినాయక ఉత్సవాలకు అత్యంత ప్రసిద్ధి చెందిన, గాణాపత్య సంప్రదాయానికి పెట్టింది పేరైన మహారాష్ట్రలో, వివిధ ప్రదేశాల్లో కొలువుతీరి ఉన్నాయి. ఇవి స్వయంభూ వినాయక ఆలయాలు. ఈ దేవాలయాల గురించి హిందువుల పవిత్ర గ్రంథాలైన గణేశ్ ముద్గల పురాణాలలో కూడా ప్రస్తావన ఉందని చెప్తారు పెద్దలు..
అష్టగణపతి ఆలయాలు దర్శించుకుంటే సకలకష్టాలు తొలగి, సర్వసుఖాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ అష్ట గణపతి యాత్రలో మొట్టమొదట చెప్పుకోవలసినది మయూర గణపతి క్షేత్రం..
#మయూరగణపతి_క్షేత్రం
ఈ క్షేత్రం మహారాష్ట్రలోని బారామతి తాలూకాలోని ‘మోర్ గావ్’ గ్రామంలో ఉంది. ఈ క్షేత్రంలో ఉండే వినాయకుని ‘మయూరేశ్వర్’ అని పిలుస్తారు. నిజానికి వినాయకుని వాహనం ఎలుక కదా. కానీ, ఇక్కడ వినాయకుని వాహనం మయూరం (నెమలి). పూర్వం సింధురాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రాంతంలోని ప్రజలను, మునులను, దేవతలను నానా కష్టాలు పెడుతూంటే తమను రక్షించమని వినాయకుని ప్రార్థించారు. అప్పుడు వినాయకుడు మయూరవాహనం మీద వచ్చి ఆ రాక్షసుణ్ణి సంహరించి అందరికీ ఆనందం కలిగించాడు. అందుకే ఇక్కడ వినాయకుడు మయూరవాహనం మీద దర్శనమిస్తాడు. హిందీలో మోర్ అంటే ‘నెమలి’. అందుకే ఈ స్వామిని ‘మోరేశ్వర్’ అని పిలుస్తారు. అరణ్యవాసకాలంలో పాండవులు ఈ స్వామిని పూజించారని, వారు పూజించిన అసలైన వినాయక విగ్రహం, ప్రస్తుతమున్న విగ్రహానికి వెనుకన ఉంటుందని చెప్తారు. ఈ ఆలయం చూడడానికి హిందూ ఆలయంలా కాక నాలుగువైపులా మినార్లతో ఒక మసీదు మాదిరిగా కనిపిస్తుంది. అప్పట్లో తురుష్క చక్రవర్తుల దాడులు ఎక్కువగా జరిగేవని ఆ దాడుల నుంచి కాపాడడం కోసం ఈ ఆలయాన్ని అలా కట్టారనీ చెప్తారు. ఈ క్షేత్రంలో వినాయకచవితినాడు, విజయదశమినాడు ఎంతో వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి..
#సిద్ధివినాయక_క్షేత్రం
ఈ క్షేత్రం అహ్మదునగర్ జిల్లాలోని ‘శ్రీగొండ’ పట్టణానికి సమీపంలోనున్న చిన్నకొండమీద ఉంది. ఈ ఆలయం మొట్టమొదట శ్రీ మహావిష్ణువు చేత నిర్మించబడిందని, ఆ తరువాత ఈ ఆలయాన్ని పీష్వాలు నిర్మించారని స్థలపురాణం చెప్తోంది. సాధారణంగా వినాయకుని తొండం ఎడమ వైపునకు తిరిగి ఉంటుంది. కానీ ఇక్కడి వినాయకుని తొండం మాత్రం కుడిచేతి వైపునకు తిరిగి ఉంటుంది. అదే ఈ వినాయకుని ప్రత్యేకత. ఇక్కడ స్వామివారు సిద్ధి, బుద్ధి సమేతుడై కొలువుతీరి ఉంటాడు.
పూర్వం మధు, కైటభులనే రాక్షసులను సంహరించడం కోసం శ్రీమహావిష్ణువు ఈ వినాయకుని సహాయం తీసుకున్నాడనీ, అందుకు కృతజ్ఞతగా శ్రీమహావిష్ణువే స్వయంగా ఈ లంబోదరుణ్ణి ఇక్కడ ప్రతిష్ఠించి, ఆలయం నిర్మించాడనీ స్థల పురాణం చెప్తుంది. వినాయకుడి వరం వలన కార్యసిద్ధి జరిగింది కాబట్టి ఈ ప్రాంతం సిద్ధక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయానికి ఒక్క ప్రదక్షిణ పూర్తి చేయాలంటే సుమారు అరగంట సేపు కొండ చుట్టి రావాల్సి ఉంటుంది. అయినా కోరిన కోరికలు తీర్చే స్వామి, పనులను సానుకూల పరిచే కార్యసిద్ధి గణపతి కనుక, భక్తులు ఎంతో భక్తిగా, శ్రమకు వెనుకాడకుండా, గిరి ప్రదక్షిణం చేసి మొక్కులు తీర్చుకుంటారు..
#వరద_వినాయక_క్షేత్రం
పూణె నగరానికి ఎనభై కిలోమీటర్ల దూరంలోని ‘మహద్’ గ్రామంలో వెలిసిన స్వామి వరదవినాయకుడు. పూర్వం ఈ ప్రాంతాన్ని రుక్మాంగదుడు అనే రాజు పాలించేవాడు. ఒకరోజు రుక్మాంగదుడు భార్యాసమేతుడై ఈ గ్రామంలోని ‘వాచక్నవి’ దర్శనార్థం వచ్చాడు. రుషిపత్ని మహారాజుని, అతడి వైభోగాన్ని చూసి అతడి మీద మనసుపడుతుంది. మహారాజు ఆమె కోరికను సున్నితంగా తిరస్కరించి వెళ్లిపోతాడు. ఈ సంగతి తెలిసి ఇంద్రుడు మహారాజు రూపంలోవచ్చి రుషిపత్నితో కలుస్తాడు. ఆ కారణంగా ‘గృత్సమధుడు’ అనే పుత్రుడు కలుగుతాడు. అతను పెరిగి పెద్దవాడయ్యాక, తన జన్మరహస్యం తెలుసుకుని వినాయకుని గురించి తపస్సు చేస్తాడు. వినాయకుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటాడు. ‘అందరి పాపాలు పోయేలా నువ్వు ఇక్కడ ఉండాలి’ అన్నాడు గృత్సమధుడు. అతడి భక్తికి మెచ్చిన వినాయకుడు అక్కడ స్వయంభువుడుగా వెలిసాడు. అదే వరదవినాయక క్షేత్రం. ఈ ఆలయంలోని దీపం కొన్ని శతాబ్దాల నుంచీ అఖండంగా వెలుగుతూనే ఉందని చెప్తారు..
#గిరిజాత్మజ్_వినాయక_క్షేత్రం
పూణేకు 90 కి.మీ.ల దూరంలో ఉన్న ‘లేన్యాద్రి’ పర్వతంమీద, బౌద్ధగుహల మధ్యన ఉన్న ఆలయమే ‘గిరిజాత్మజ వినాయక ఆలయం’. పార్వతీదేవి ఇక్కడ 12 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాతే నలుగుపిండితో చేసిన బాలగణపతికి ప్రాణం పోసిందనీ, తనకు కౌమారప్రాయం వచ్చేవరకూ గణపతి తన తల్లితో కలిసి ఇక్కడే ఉన్నాడనీ స్థల పురాణం చెప్తోంది. ఎత్తైన కొండ మీద గుహలో కొలువుతీరాడు స్వామి. స్తంభాలు లేకుండా కేవలం ఏకశిలనే ఆలయంగా మలిచి మెట్లు నిర్మించారు. 307 మెట్లు ఎక్కి ఆలయానికి చేరుకోవాలి. నడవలేనివారి కోసం డోలీల సౌకర్యం కూడా ఉంటుంది. విద్యుద్ధీపాల అవసరం లేకుండా పగటివేళలో సూర్యకిరణాలు ఆలయంలో పడేలా నిర్మించడంచేత ఈ స్వామిని చక్కగా దర్శించకోవచ్చు..
#చింతామణి_గణపతి_క్షేత్రం
షోలాపూర్-పూణె మార్గంలో, పూణేకు 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘థేవూర్’ గ్రామంలో వెలిసాడు చింతామణి గణపతి. ఈ గ్రామంలో కపిల మహాముని కొంతకాలం తపస్సు చేసాడట. ఆయన దగ్గర భక్తుల కోరికలు తీర్చే ‘చింతామణి’ అనే మణి ఉంది. ఓసారి ఈ ప్రాంతాన్ని పాలించిన అభిజిత్ మహారాజు కుమారుడు ‘గుణ’ కపిలమహర్షి ఆశ్రమానికి వచ్చి ఆ మణి ప్రభావాన్ని గుర్తిస్తాడు. ఆ మణిని అపహరించుకొని వెళ్ళిపోతాడు. దాంతో కపిలమహర్షి గణపతి సాయంతో ఆ రాజును జయిస్తాడు. ఆ మణిని తిరిగి పొందుతాడు. స్వామివారి అనుగ్రహంతో వచ్చిన ఆ మణిని తిరిగి గణపతి మెడలో అలంకరిస్తాడు. అప్పటి నుంచి ఈ గ్రామం ‘కదంబనగర్’ గానూ, ఈ స్వామి ‘చింతామణి గణపతి’ గానూ ప్రసిద్ధి పొందాడు. రాజుతో యుద్ధం కదంబ వృక్షం దగ్గర జరిగిన కారణంగా, ఆ ప్రాంతాన్ని కదంబ తీర్థం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయాన్ని పీష్వాల కాలంలో నిర్మించారు..
#మహాగణపతి_క్షేత్రం
రంజన్ గావ్ గ్రామంలో కొలువుతీరిన ఈ ‘మహాగణపతి’ పరమేశ్వరుడే స్వయంగా ప్రతిష్టించిన స్వామి. త్రిపురాసుర సంహార కాలంలో పరమేశ్వరుడు కూడా ఈ గణపతిని తలచుకుని, రాక్షసునితో యుద్ధం చేసి, అతడిని సంహరించాడని పురాణ కథనం. అందుకు ప్రతిగా శివుడే ఈ ‘మహాగణపతిని’ ఇక్కడ ప్రతిష్ఠించాడని గణేశపురాణం చెబుతుంది. దక్షిణాయనంలో సూర్యకిరణాలు నేరుగా ఈ విగ్రహంమీద పడడం ఈ క్షేత్రం ప్రత్యేకత. 18వ శతాబ్దంలో పీష్వాలు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. సిద్ధి, బుద్ధి సమేతుడై పద్మంలో కొలువు తీరి ఉంటాడు స్వామి..
#విఘ్నహార్_వినాయక_క్షేత్రం
ఓఝూర్ పట్టణంలో కుకడి నది ఒడ్డున ఉంది ఈ ఆలయం. ఆలయంలో సిద్ధి, బుద్ధి సమేతుడై కొలువుతీరి ఉంటాడు స్వామి. పూర్వం ఈ ప్రాంతంలో విఘ్నాసురుడు అనే రాక్షసుడు మునులను హింసిస్తూంటే, ఆ బాధలు భరించలేని ఆ మునులు తమను కాపాడమని వినాయకుని ప్రార్థించగా వినాయకుడు ఆ రాక్షసునితో యుద్ధం చేస్తాడు. వినాయకుని గెలవడం తనవల్ల కాదని గ్రహించిన ఆ రాక్షసుడు ఆయన శరణుకోరి, తన పేరుమీద ఇక్కడే కొలువుతీరమని వేడుకుంటాడు. అతడి కోరిక ప్రకారం గణపతి అక్కడ స్వయంభూ మూర్తిగా వెలిసాడు. అందుకే ఈ స్వామిని ‘విఘ్నహార్ వినాయక్’ అని అంటారు. అప్పట్లో ఈ స్వామికి మునులే ఆలయం కట్టించారని, ఆ తరువాతి కాలంలో ‘చిమాజి’ ఆ ఆలయాన్ని పునర్నిర్మించాడని చారిత్రిక కథనాలు చెప్తున్నాయి. బంగారుపూతతో మిలమిల మెరుస్తూ ఆకర్షణీయంగా ఉంటుంది ఆలయశిఖరం..
#బల్లాలేశ్వర_క్షేత్రం
పూణేకి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది పాలి క్షేత్రం. అష్ట వినాయక క్షేత్రాలలో భక్తుడి పేరుమీద వెలసిన స్వామి ఈ బల్లాలేశ్వరుడు. పూర్వం ఈ గ్రామం పేరు ‘పల్లిపుర్’. ఈ గ్రామానికి చెందిన వర్తకుడు కల్యాణ్ సేఠ్. అతని కుమారుడు బల్లాల్. బల్లాల్ గణపతికి మహాభక్తుడు. బల్లాల్ తన స్నేహితులతో కలసి అడవికి వెళ్లి అక్కడున్న రాతి వినాయకుని పూజించి, రోజూ ఆలస్యంగా ఇంటికి వచ్చేవాడట. ఈ విషయం తెలుసుకున్న అతని స్నేహితుల తల్లిదండ్రులు బల్లాల్ కారణంగానే తమ పిల్లలు కూడా కొండలు, గుట్టలు పట్టుకొని తిరుగుతున్నారని కల్యాణ్ సేఠ్కు ఫిర్యాదు చేసారు. అలా ఇతరులు తనను వేలెత్తి చూపడంతో కోపం వచ్చిన సేఠ్ ‘బల్లాల్’ను అడవికి తీసుకునివెళ్లి,అక్కడ అతన్ని ఒక చెట్టుకి కట్టి స్పృహతప్పేలా కొట్టి, అతడు పూజించే రాతివిగ్రహాన్ని విసిరేసి వెళ్లిపోయాడు. అలా ఆపదలో పడిపోయిన బల్లాల్, వినాయకుని ప్రార్థించాడు. తన భక్తుడు ఆపదలో ఉండడంతో వినాయకుడు వచ్చి బల్లాల్ కట్లువిప్పి, విడిపించి, ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. ‘ఈ రాతిలోనే నువ్వు ఉండాలి’ అని కోరుకున్నాడు. భక్తుని కోరిక మేరకు వినాయకుడు ఆ రాతివిగ్రహంలో ఐక్యమయ్యాడు. ప్రస్తుతం ఆలయంలో ఉన్న విగ్రహం అదే. ముందు ఈ ఆలయాన్ని చెక్కలతో నిర్మించారు. ఈ ఆలయం వెనుక దుండి వినాయకును విగ్రహం ఉంటుంది. బల్లాల్ తండ్రి విసిరిపారేసిన రాతి వినాయక విగ్రహమే దుండి వినాయక విగ్రహం. భక్తులు ముందుగా దుండి వినాయకుని దర్శించిన తరువాత ప్రధాన ఆలయంలోని వినాయకుని దర్శిస్తే స్వామిని దర్శించిన ఫలితం లభిస్తుందని చెప్తారు. భక్తుడైన బల్లాల్ కోరిక మేరకు వెలిసాడు కాబట్టి ఈ వినాయకుని ‘బల్లాలేశ్వర్’ అని పిలుస్తారు..
మహారాష్ట్రలోని పూణే నుంచి ఈ అష్టవినాయక యాత్ర చేయడం సౌకర్యంగా ఉంటుంది. అన్ని ప్రాంతాల నుంచి పూణేకి రైలు, విమాన, బస్సు సౌకర్యాలున్నాయి. మహారాష్ట్ర పర్యాటక శాఖ ఈ యాత్ర కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తోంది. ముంబై, షోలాపూర్ నగరాల నుంచి అయితే అష్టవినాయక క్షేత్ర దర్శనం ప్యాకేజీ బస్సులు కూడా ఉన్నాయి...
మావూరు విజయలక్ష్మి, 9160370290
Jagriti Telugu Weekly
#శ్రీ🚩
.jpg)
No comments:
Post a Comment