Monday, February 12, 2018

శివరాత్రి పండుగ విశిష్టత ఏమిటి



శివరాత్రి అంటే ఏమిటి..శివరాత్రి పూజావిధానం ఎలా.. శివరాత్రులు ఎన్ని..
పూర్తిగా చదవడానికి సమయం ఎక్కువ అయినా శివరాత్రి పండుగ విశిష్టత ఏమిటో పూర్తిగా తెలుసుకోండి..

వేదాలు ఇతిహాస పురాణాలలో ముఖ్యమైనవి. ఋగ్వేదం చాలా గొప్పది. ఇందులో ఉన్నటువంటి రుద్రం ఇంకా గొప్పది. పంచాక్షరీలోని శివ అనే రెండక్షరాలు మరీ గొప్పవి. శివ అంటే మంగళమని అర్థం.పరమ మంగళకరమైనది శివస్వరూపం. ఆ పరమ శివుని అనుగ్రహం పొందటానికి మనం జరుపుకునే ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి. పురాణాలలో చెప్పినటువంటి ఈ మహాశివరాత్రిని ప్రతి సంవత్సరం మాఘమాసం కృష్ణపక్షంలో చతుర్థశినాడు జరుపుకుంటాం.

శివరాత్రులు ఎన్ని..

శివరాత్రి వైదిక కాలం నాటి పండుగ. ఏడాదిలో వచ్చే శివరాత్రులు మొత్తం అయిదు. అవి :
నిత్య శివరాత్రి,
పక్షశివరాత్రి,
మాసశివరాత్రి,
మహాశివరాత్రి,
యోగశివరాత్రి.
వీటిలో పరమేశ్వరుడి పర్వదినం మహాశివరాత్రి.

మార్గశిరమాసంలో బహుళ చతుర్థి, అర్ద్ర నక్షత్రం రోజున శివుడు లింగోద్భవం జరిగింది. శివునికి అతి ఇష్టమైన తిథి అది. అందుకే ఈరోజున శివుడ్ని లింగాత్మకంగా ఆరాధించిన వారెవరైనా సరై పురుషోత్తముడు అవుతాడని పురాణాల మాట.

ఈ రోజున శివ ప్రతిష్ట చేసినా లేక శివకళ్యాణం చేసినా ఎంతో శ్రేష్టం. మహాశివరాత్రి రోజు తనను పూజిస్తే తన కుమారుడైన కుమారస్వామి కన్నా ఇష్టులవుతారని శివుడు చెప్పడాన్ని బట్టి ఈ విశిష్టత ఏంటో అర్థం చేసుకోవచ్చు.

త్రయోదశినాడు ఒంటిపొద్దు ఉండి చతుర్థశినాడు ఉపవాసం ఉండాలి.

లింగోద్భవ కాలం ప్రకారం జన్మాష్టమి నుంచి 180 రోజులు లెక్కిస్తే శివ రాత్రి వస్తుంది. రూపరహితుడైన శివుడు, జ్యోతిరూపంలో, లింగాకారంగా అవిర్భవించిన సమయం కనుక శివరాత్రిని లింగోద్భవకాలం అంటారు.

ఈ పరమేశ్వరుడి 64 స్వరూపాలలో లింగోద్భవమూర్తి చాలా ముఖ్యమైనది. అర్థరాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ సమయమని పురాణాలలో చెప్పారు.

ఋగ్వేదం ప్రకారం భక్తజనులు ఆరోజు నిద్ర పోకుండా మేల్కొని ఉపవాసముండి, మహాలింగ దర్శనం చేస్తారు. ఉపవాస దీక్ష స్త్రీలు, పురుషులు కూడా ఆచరించదగినదే. ప్రపంచమంతా శివ శక్తిమయమని తెలుసుకోవాలి. శివలింగానికి ప్రణవానికి సామ్యముందంటారు.

ఆ పంధాలో చూస్తే ఈ శివలింగం ఆరువిధాలు..
ఇలా ఒక్కొక్క విధానంలో ఆరేసి లింగాలు ద్వివిదా ద్వాదశలింగాలుగా చెప్పబడుతున్నప్పటికీ, శివాగమాలరీత్యా మాత్రం ఆచార గర్వాది లింగాలే సరియైనవి కనుక ఈ ఆరులింగాలనే అనుదినం ఆరాధించాలి.

పరమశివుడు శివరాత్రి పర్వదినమున ఎన్నో విధాలుగా ఆలంకరింపబడతాడు. ఆ స్వరూపాలలో విభూతిధారణ ఒకటి. విభూతి అంటే ఐశ్వర్యం. అది అగ్నిలో కాలిన శుద్ధమైన వస్తువు. ఈశ్వరుడు ఒంటి నిండా విభూతి అద్దుకుంటాడు.

రెండవది రుద్రాక్ష. రుద్రాక్ష అంటే శివుని మూడవ కన్ను. అందరు దేవతలలో ఫాలభాగంలో కన్ను గలవాడు ఆయన ఒక్కడే.

మూడవది పంచాక్షరి జపం. పంచాక్షరీ మంత్రోపదేశం లేనివారు శివనామాం జపిస్తే చాలు. నాలుగవది మారేడు దళాలతో శివున్ని పూజించడం. శివునికి మూడు దళాలుంటాయి.
అయిదవది అంతరంగంలో శివ స్వరూపాన్ని ఎల్లవేళలా స్మరిస్తూ ఉండాలి.

శివరాత్రి రోజున సాయంకాల సమయాన్ని ప్రదోషం అంటారు. త్రయోదశి వాటి సంధ్యాకాలం మహా ప్రదోషం. ప్రదోష సమయంలో శివస్మరణ, శివదర్శనం విధిగా చెయ్యాలి.

వేదాలన్నింటకీ తాత్పర్యం ఓంకారం. ఆ ఓంకార స్వరూపమే పరమేశ్వరుడు. ‘శివ’ శబ్దాన్ని దీర్ఘంతీస్తే ‘శివా’ ఆవుతుంది. అది అమ్మవారి పేరు ఈ స్వరూప ధ్యేయమే జగత్తుకు తల్లిదండ్రులు. పార్వతీపరమేశ్వరులు, సూర్యుడు, అగ్ని ఈ మూడింటిలోను శివుడుంటాడు. పరమ శాంతినిచ్చేది శివనామస్మరణమే. శివస్మరణకు అందరూ అర్హులే.
పరమ శివునికి చాలా ప్రీతికరమైనటువంటి తిథి నక్షత్రాలలో ఏకాదశి. ఈ తిథి నెలలో రెండుసార్లు వస్తుంది.

ఒకసారి పార్వతీదేవి పరమశివుని దగ్గర శివరాత్రి గురించి ఆడుగుతుంది. అప్పుడు శివుడు శివరాత్రి ఉత్సవం తనకెంతో యిష్టమనీ, ఇంకేమి చేయకుండా ఆ రోజు ఒక్క ఉపవాసమున్నాసరే తానెంతో సంతోషిస్తానని చెబుతాడు.

ఆయన చెప్పిన దాని ప్రకారం, ఆ రోజు పగలంతా నియమనిష్ఠతో ఉపవాసంతో గడిపి, రాత్రి నాలుగు జాముల్లోనూ శివలింగాన్ని
మొదట పాలతో,
తర్వాత పెరుగుతో,
ఆ తర్వాత నేతితో,
ఆ తర్వాత తేనెతో
అభిషేకిస్తే శివునికి ప్రీతి కలుగుతుంది. మరునాడు బ్రహ్మవిధులకు భోజనం పెట్టి తాను భుజించి శివరాత్రి వ్రత సమాప్తి చేయాలి.

దీనిని మించిన వ్రతం మరొకటి లేదంటాడు పరమశివుడు. మామూలుగానైతే ఏ మాసమైనా కృష్ణపక్ష చతుర్దశిని శివరాత్రిగా భావిస్తారు. కానీ, మాఘ మాసపు చతుర్దశికి ప్రత్యేకమైన మహత్తు ఉంటుంది. అందుకే శివరాత్రిని ఆ రోజున బ్రహ్మాండంగా చేసుకుంటారు.

మహాశివుడంటే అందరికి తెలుసు. కాని, రాత్రి అంటే ప్రత్యేకార్థము చాల మందికి తెలియదు. “రా” అన్నది దానార్థక ధాతు నుండి “రాత్రి” అయిందంటారు. సుఖాన్ని ప్రదానం చేసేదాన్నే రాత్రి అంటారు. ఋగ్వేద – రాత్రి సూక్తం తాలూకు యూప మంత్రంలో రాత్రిని ప్రశంసిస్తూ యిలా చెప్పబడింది –హే రాత్రే! అక్లిష్టమైన తమస్సు మా దగ్గరికి రాకుండుగాక!వగైరా –

‘ఉప మాపేపిశత్తమః కృష్ణం వ్యవక్తమస్థిత్!
ఉష ఋణేవ యాతయ||’

నిజంగానే రాత్రి ఆనందదాయిని అన్నింటికి ఆశ్రయం ఇవ్వగలది. అందుకే రాత్రిని ప్రశంసించటం జరిగింది. మహాశివరాత్రి వ్రతాన్ని రాత్రిపూటే జరుపుకుంటారు. అందువల్ల కృష్ణపక్ష చతుర్దశి రోజు వచ్చిన రాత్రికి ఓ ప్రత్యేకత వుంది. చతుర్దశి రోజు ఎవరైతే శివపూజను చేస్తారో, ఆరాత్రి జాగరణ వహిస్తారో వారికి మళ్ళీ తల్లి పాలు తాగే అవసరం రాదు. అంటే ఆ భక్తుడు జీవన్ముక్తుడు అవుతాడని స్కందపురాణంలో స్పష్టంగా చెప్పబడింది. అంతటి మహిమాన్వితమైనది శివపూజ.

‘శివంతు పూజయత్వా యోజా గర్తిచ చతుర్దిశీం!
మాతుః పయోధర రసం నపిబేత్ స కదాచన!!’

అందుకేనేమో గరుడ, స్కంద, పద్మ అగ్ని మొదలైన పురాణాల్లో దీనిని ప్రశంసించడం జరిగింది. వర్ణనలలో కొంత తేడా వుండొచ్చు. ప్రముఖ విషయం ఒకటే. ఏ వ్యక్తి అయితే ఆ రోజు ఉపవాసంచేసి, బిల్వ పత్రాలతో శివపూజ చేస్తారో, రాత్రి జాగరణ చేస్తారో వారిని శివుడు నరకాన్నుండి రక్షిస్తాడు. ఆనందాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తాడు.

వ్రతం చేసే వ్యక్తి శివమయంలో లీనమైపోతాడు. దానము, తపము, యజ్ఞము, తీర్థయాత్రలు, వ్రతాలు లాంటివెన్ని కలిపినా మహాశివరాత్రికి సరితూగలేవు. మహాశివరాత్రి రోజు ఉపవాసము, జాగరణ శివపూజ ప్రధానమైంది. అసలు వీటికి తాత్విక అర్థాలెన్నో ఉన్నాయి.

అసలు వ్రతం గురించి భిన్న భిన్న గ్రంథాల్లో భిన్నార్థలు గోచరిస్తున్నాయి. వైదిక సాహిత్యంలో దీని అర్థం – వేద బోధితమని, ఇష్ట ప్రాపకర్మ అని వుంది. దార్శనిక గ్రంథాల్లో ‘అభ్యుదయ ‘ మని, ‘ నిః శ్రేయస్సు ‘ కర్మ అని, అమరకోశంలో వ్రతమంటే నియమమని వుంటే పురాణాల్లొ మాత్రం ధర్మానికి పర్యాయవాచిగా ఉపయోగించబడింది. అన్నింటిని కలుపుకుంటే – వేదబోధిత అగ్నిహోత్రాది కర్మ, శాస్త్ర విహిత నియమాది, సాధారణ లేక అసాధారణ ధర్మమే వ్రతమని చెప్పవచ్చు.

సులభంగా చెప్పుకోవాలంటే కర్మ ద్వారా ఇష్ట దేవుడి సామీప్యాన్ని పొందటమే అని అనవచ్చు.
మహాశివరాత్రి వ్రతం రోజు ఉపవాసానికి చాలా ప్రాముఖ్యత నిచ్చారు. అలా అని ‘తిథితత్వం' లో చెప్పబడింది. ఈ గ్రంథంలో భగవాన్ శంకరుడు ఇలా అన్నట్లు వుంది. – ‘ మీరు స్నానం చేసినా, మంచి వస్త్రాలు ధరించినా, ధూపాలు వెలిగించినా, పూజ చేసినా పుష్పాలంకరణ చేసినా వీటన్నిటికంటే కూడా ఎవరైతే ఉపవాసం చేయగలరో వారంటేనే నాకిష్టం' అంటాడు శివుడు.

ఉపవాసం అంటే ఏమిటి.

దగ్గర వసించటం, నివశించటం, ఉండటాన్ని ఉపవాసమంటారు. వ్రతం చేసేవారి ఇష్టదైవం దగ్గర ఉండటమే ఉపవాసం – ఉపవాసమంటే ఇంతేనా అని పెదవి విరిచే వారికోసమే ఈ శ్లోకం.
‘ఉప – సమీపే యో వాసః జీవాత్మ పరమాత్మనోః
ఉపవాసః సవిఘ్నేయ సర్వభోగ వసర్జిత్: ||’ (వరాహోపనిషత్తు)

భవిష్య పురాణంలో కూడా అలాగే చెప్పబడింది.

‘ఉపావృత్తస్య పాపేభ్యోయస్సు వాసో గుణైః సహా!
ఉపవాసః స విఘ్నేయ సర్వభోగ వివర్జిత్: ||’

మహాశివరాత్రి వ్రతంలో జాగరణ అవసరము. వ్రతానికి యోగ్యమైన కాలము రాత్రి. ఎందుకంటే రాత్రిపూట భూత, శక్తులు, శివుడు తిరిగే సమయమన్నమాట.

చతుర్దశి రాత్రి ఆయనను పూజించాలి. భగవాన్ శ్రీకృష్ణుడు గీతలో ఇలా స్పష్టంగా చెప్పాడు. ‘సమస్త ప్రాణుల నిగ్రహ పురుషుడు రాత్రి కాలంలో మేల్కొని తిరుగుతుంటాడు. అతనిలోని ప్రాణులన్నీ జాగృతంగా ఉంటాయి. అంటే భోగ, సంగ్రహంలో మునిగి ఉంటారు. తత్వాన్ని అర్థం చేసుకోగల మునులు దృష్టిలో రాత్రి అది.

‘యానిశా సర్వ భూతానం తస్యాం జాగర్తి సమ్యమీ
యస్యాం జాగృతి భూతాని సానిశాపశ్యతో మునే ‘

విషయాసక్తుడు నిద్రలో వుంటే అందులో నిగ్రహస్తుడు ప్రబుద్ధంగా ఉన్నాడు. అందువల్ల శివరాత్రి రోజు జాగరణ ముఖ్యమన్నమాట. శివునితో ఏకీకరణమవటమే నిజమైన శివపూజ. ఇంద్రియాభిరుచుల్ని నిరోధించి పూజించటమే శివవ్రతము.

శివరాత్రి ఎలా చేసుకోవాలంటే – గరుడ పురాణంలో ఇలా వుంది – త్రయోదశి రోజునే శివ – సన్మానము గ్రహించి, వ్రతులు కొన్ని ప్రతిబంధకాల్ని గమనించాలి. అంటే కొన్ని నియమాల్ని మనసులో నిర్ధారించుకుని పాటించాలి. మీ ప్రకటన ఇలా ఉండాలి – ‘హే మహాదేవా! నేను చతుర్దశి రోజు జాగరణ చేస్తాను. నా భక్తి సామర్ధ్యాన్ని బట్టి దాన, తప, హోమాన్ని చేయగలను. నేను ఆ రోజు నిరాహారిగా ఉంటాను. రెండవరోజు మాత్రమే తింటాను. ఆనంద, మోక్షాలను అనుగ్రహించు శివా!”

వ్రతం చేశాక గురువు దగ్గరికి వెళ్ళాలి. పంచామృతంతో పాటు పంచగవ్యాలును (ఆంటే అయిదు విధములైన గో సంబంధిత వస్తువులు – ఆవు పేడ – ఆవు పంచకం, ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవునెయ్యి) శివలింగాన్ని అభిషేకం చేయించాలి. అభిషేకం చేస్తున్న సమయంలో ‘ఓం నమః శివాయ ‘ అనుకుంటూ జపించాలి. చందన లేపనంతో ప్రారంభించి అన్ని ఉపాచారాలతో పాటూ శివపూజ చేయాలి. అగ్నిలో నువ్వులు, బియ్యము, నెయ్యితో కలిపిన అన్నము వేయాలి. ఈ హోమం తర్వాత పుర్ణాహుతి నిర్వహించాలి.

అందమైన శివకథలు వినవచ్చు. వ్రతలు మరొకసారి రథరాత్రి మూడవ, నాల్గవ ఝాములో ఆహుతులను సమర్పించాలి. సూర్యోదయం అయ్యేంతవరకూ మౌన పాఠం చేయదలచినవారు ‘ఓం నమః శివాయ ‘ అంటూ భగవాన్ శివుని స్మరిస్తూ ఉండాలి.

ఆయనను భక్తులు కోరుకునేది ఏమిటంటే – 'పరమాత్మా! మీ అనుగ్రహంతో నేను నిర్విఘ్న పూజ కొనసాగించి పూర్తి చేసాను. హే లోకేశ్వరా! శివ – భవా! నన్ను క్షమించు. ఈ రోజు నేను అర్జించిన పుణ్యమంతా, మీకు అర్పితం గావించినదంతా మీ కృపతోనే పూర్తి చేశాను. హే కృపానిధీ! మా పట్ల ప్రసన్నులు కండి! మీ నివాసానికి వెళ్ళండి. మీ దర్శనమాత్రము చేతనే మేము పవిత్రులం అయ్యాము.

అటు తర్వాత శివ భక్తులకు భోజనము. వస్త్ర, ఛత్రములు ఇవ్వాలి. నిజానికి లింగోద్భవమైన అర్థరాత్రి సమయం ప్రతిరోజూ వస్తుంది కనుక ప్రతిరోజూ శివరాత్రే. ప్రతిక్షణం శివస్మరణయోగ్యమే.

అయితే కృష్ణపక్ష చతుర్దశి శివునికి ఇష్టమైన రోజు కనుక ప్రతినెలా వచ్చే ఆ రోజును మాసశివరాత్రి అన్నారు. అందులోనూ మాఘ బహుళ చతుర్దశి ఆయనకు మరీ మరీ ప్రీతి కనుక ఆ రోజున మహా శివరాత్రి జరుపు కుంటున్నాం.

ఆ రోజు ఉదయం స్నానాదికాలం తర్వాత వీలైన శివాలయాన్ని దర్శించి, అవకాశం లేకపోతే, ఇంటివద్దే ఉమామహేశ్వరులను శివప్రీతికరమైన పువ్వులతో, బిల్వదళాలతో అర్చించాలనీ, శక్తికొలదీ పాలు, గంగోదకం, పంచామృతాదులతో లింగాభిషేకం చేయాలనీ, ఉపవాస, జాగరణ శివస్మరణలతో రోజంతా గడిపి మరునాడు ఉత్తమ విప్రులకు, శివభక్తులకు భోజనం పెట్టాలని వ్రత విధానన్ని బోధించారు.

శివరాత్రికి లింగోద్భవకాలమని కూడా పేరు. ఆ రోజు అర్థరాత్రి జ్యొతిర్మయమైన ఒక మహాలింగంగా శివుడు ఆవిర్భవించాడు. పరమేశ్వరుడు లోకానికి తన స్వరూప దర్శనం చేయించి జగత్తంతా దేదీప్యమానం చేసిన ఆ సమయంలో మనం నిద్రపోవడంలో అర్థం లేదు. అందుకే శివరాత్రి జాగరణకు అంత ప్రాధాన్యం .

ఆ రోజు అభిషేకాదులతో శివుని పూజించి ఉపవాసముండి రోజంతా శివనామస్మరణంతో గడపడంలోని ఉద్దేశం మన తనువునూ, మనసునూ కూడా శివార్పితం, శివాంకితం చేయడానికే. శివమంటే జ్ఞానమే. జన్మ పరంపర శృంఖాలాలను తెంచి నిత్యానంద ప్రదమైన మోక్షాన్ని అందించే శక్తి ఆ జ్ఞానానికే ఉంది.

శివరాత్రినాడు పధ్నాలుగు లోకాలలోని పుణ్యతీర్థాలు 'బిల్వ' మూలంలో ఉంటాయనీ, శివరాత్రినాడు ఉపవసించి ఒక్క బిల్వమైన శివార్పణ చేసి తరించమని శాస్త్రం చెబుతోంది. కనీసం జన్మకొక్క శివరాత్రి అయినా చేయమని పెద్దలు చెబుతుంటారు. సమస్త ప్రాణికోటిలో సూక్ష్మజ్యోతిరూపంలో ఉండే శివుడు భూమిపై పార్థివలింగంగా ఆర్చింపబడుతుంటాడు.

శివరాత్రినాడు ఫలం, ఒక తోటకూర కట్ట అయినాసరే శివార్పణం అని దానం చేయడం ముక్తిదాయకం. కలిగినవారు వారి వారి శక్తి అనుసారం బంగారం, వెండి కుందులలో ఆవునేతి దీపం వెలిగించి ఓ పండితునికి సమర్పిస్తే అజ్ఞానంధకారం నశిస్తుందని పెద్దలవాక్కు.

శివరాత్రినాడు ఉపవసించి త్రికరణ శుద్ధిగా శివుని ఆరాధిస్తే, ఒక సంవత్సర కాలం నిత్యం శివార్చన చేసిన ఫలం కలుగుతుందని సాక్షాత్తు శంకరుడు బ్రహ్మదేవునికి చెప్పినట్లు పెద్దలవాక్కు.

ప్రదక్షణ విధులు.

శివాలయములో ప్రవేశించిన తర్వాత నందికి ఏ ప్రక్కనుంచి లోపలకు వెళ్తారో ఆ ప్రక్కనుంచి మాత్రమే, వెనక్కి రావాలి. శివలింగం, నందీశ్వ రుల మధ్య నుంచి రాకూడదు. ఇలావచ్చినా పుణ్యం రాదు సరి కదా పూర్వ జన్మలోని పుణ్యం కూడా పోతుంది.

బిల్వ దళం ప్రాముఖ్యత:

బిల్వం లేదా మారేడు దళం అంటే శివుడికి మహా ఇష్టం. బిల్వ దళం మూడు అకుల్ని కలిగి ఉంటుంది.ఇందులో కుడి ఎడమలు విష్ణు, బ్రహ్మలైతే మధ్యలో ఉండేది శివుడు. మారేడుకే శివప్రియ అని మరోపేరు ఉంది.

బిల్వదళం పొరబాటున కాలికి తగిలితే ఆయష్షు క్షీణిస్తుందంటారు. ఇది శివుడి అజ్ఞ.బిల్వం ఇంటి అవ రణంలోని ఈశాన్యంలో ఉంటే ఐశ్వర్యం. తూర్పున ఉంటే సౌఖ్యం. పశ్చిమాన ఉంటే సంతానాభివృద్ధి. దక్షిణాన ఆపదల నివారణ.
వసంతం, గ్రీష్మంలో బిల్వంతో శివున్ని పూజిస్తే అనంతకోటి గోదాన ఫలితం కలుగుతుంది.
ఓం నమః శివాయ..హర హర మహాదేవ శంభో శంకర..

30 రకాల శివలింగాలు..

సాధారణంగా మనకు తెలిసినవి శిలా నిర్మితమైన లింగాలు మాత్రమే..అందులో కూడా నల్ల రాతి శివలింగాలే అధికం.

కానీ మనకు తెలియని శివలింగాలు ఇంకా అనేకం ఉన్నాయి. అందులో 30 రకాల శివలింగాలు మరీ ముఖ్యమైనవి. అపూరూపమైనవి..ఆయా లింగాలు ఇచ్చే ఫలితాలు అనంతం..
అందుకే వాటి గురించి తెలుసుకుందాం....

.రకరకాల పదార్ధాలతో రూపొందించిన శివలింగాలు గురించి పురాణాలు వివిధ సందర్భాలల్లో వర్ణించాయి.... ఏయే శివలింగాలను పూజిస్తే ఏయే ఫలితాలు కలుగుతాయో చూడండి.....

1) గంధపు లింగం.
రెండు భాగాలు కస్తూరి , నాలుగు భాగాలు గంధం , మూడు భాగాలు కుంకుమను కలిపి ఈ లింగాన్ని చేస్తారు .....దీనిని పూజిస్తే శివ సాయిజ్యం లభిస్తుంది.

2) నవనీత లింగం.
వెన్నతో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే కీర్తి సౌభాగ్యాలు కలుగుతాయి.

3) పుష్పలింగం.
.నానావిధ సుగంధ పుష్పాలతో దీనిని నిర్మిస్తారు....దీనిని పూజిస్తే రాజ్యాధిపత్యం కలుగుతుంది.

4) రజోమయ లింగం.
పుప్పొడితో నిర్మించిన ఈ లింగాన్ని పూజించడం వల్ల విద్యాథరత్వం సిద్ధిస్తుంది..... శివ సాయిజ్యాన్ని పొందగలరు

5) ధ్యాన లింగం.
యవలు , గోధుమలు , వరిపిండితో ఈ లింగాన్ని నిర్మిస్తారు....దీనిని పూజించడం వల్ల సంపదల వృద్ధి , సంతానం కలుగుతుంది.

6 ) తిలిపిస్టోత్థ లింగం.
నూగు పిండితో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే ఇష్టసిద్ది కలుగుతుంది.

7) లవణ లింగం..
హరిదళం , త్రికటుకము , ఉప్పు కలిపి చేసిన ఈ లింగాన్ని పూజిస్తే వశీకరణ శక్తి .

8 ) కర్పూరాజ లింగం .
ముక్తి ప్రదమైనది.

9) భస్మమయ లింగం.
భస్మముతో తయారు చేస్తారు ...... సర్వసిద్ధులను కలుగచేస్తుంది

10) శర్కరామయ లింగం..
సుఖప్రదం..

11) సద్భోత్థ లింగం..
ప్రీతికరని కలిగిస్తుంది.

12) పాలరాతి లింగం..
ఆరోగ్యదాయకం.

13) వంకాకురమయ లింగం.
వంశవృద్దిని కలిగిస్తుంది ...... దీనిని వెదురు మొలకలతో తయారు చేస్తారు .

14) కేశాస్థి లింగం .
వెంట్రుకలు , ఎముకలతో తయారు చేస్తారు .....ఇది శత్రునాశనం చేస్తుంది.
....
15) పిష్టమయ లింగం..
ఇది పిండితో తయారు చేయబడుతుంది...ఇది విద్యలను ప్రసాదిస్తుంది.

16) దధిదుగ్థ లింగం .
కీర్తి ప్రతిష్టలను కలిగిస్తుంది.

17) ఫలోత్థ లింగం..
ఫలప్రదమైనది.

18) రాత్రి ఘజాత లింగం.
ముక్తి ప్రదం

19) గోమయ లింగం..
కపిల గోవు పేడతో ఈ లింగాన్ని తయారు చేస్తారు ..... దీనిని పూజిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది..... భూమిపై పడి మట్టి కలిసిన పేడ పనికిరాదు

20) దూర్వాకాండజ లింగం.
గరికతో తయారు చేయబడు ఈ లింగం అపమృత్యుభయాన్ని తొలగిస్తుంది

21) వైడూర్య లింగం..
శత్రునాశనం , దృష్టి దోషహరం

22) ముక్త లింగం .
ముత్యంతో తయారు చేయబడిన ఈ లింగం ఇష్ట సిద్దిని కలిగిస్తుంది

23) సువర్ణ నిర్మిత లింగం.
బంగారంతో చేసిన ఈ లింగం ముక్తిని కలిగిస్తుంది

24) ఇత్తడి - కంచు లింగం..
ముక్తిని ప్రసాదిస్తుంది

25) రజత లింగం..
సంపదలను కలిగిస్తుంది

26) ఇనుము - సీసపు లింగం..
శత్రునాశనం చేస్తుంది

27) అష్టధాతు లింగం.
చర్మరోగాలను నివారిస్తుంది.....సర్వసిద్ధి ప్రదం

28) స్ఫటీక లింగం.
సర్వసిద్ధికరం , అనుకున్న కార్యాలను సఫలీకృతం చేస్తుంది

29) తుష్టోత్థ లింగం..
మారణ క్రియకు పూజిస్తారు

30) సీతాఖండ లింగం.
ఫటిక బెల్లంతో తయారు చేసింది..... ఆరోగ్యసిద్ధి కలుగుతుంది

పరమేశ్వర పూజా పుష్పఫలము ..

శివున్ని దర్భలతో పూజిస్తే - దీర్ఘాయుస్సు!
ఉమ్మెత్తలతో పూజిస్తే - సుతప్రాప్తి!

జిల్లేడు పూలతో పూజిస్తే - శౌర్యము !
కలువ పూలతో పూజిస్తే - విక్రమ వృద్ధి !

బంధూక సుమములతో పూజిస్తే - భూషణ ప్రాప్తి !
జాజి పూలతో అర్చిస్తే - వాహన ప్రాప్తి !

మల్లెపూలతో పూజిస్తే - భోగము ప్రాప్తిస్తాయి !
అవిసె పూలతో పూజిస్తే - పరమేశ్వర ప్రాప్తి !

కొండ గోగుపూలతో ఆరాధిస్తే - వస్త్ర లాభం !
నువ్వుల పువ్వులతో ఉమామహేశ్వరుణ్ణి పూజిస్తే - యౌవన ప్రాప్తి కలుగుతుంది !

తుమ్మి పువ్వులతో అర్చిస్తే - మోక్ష లాభం !
నందివర్థన పూజ - సౌందర్యాన్ని చేకూర్చుతుంది !

లోకహితం కోసం శివుడు ఎత్తిన అవతారాలు..
ఓంకార స్వరూపుడైన శివుడు లోకహితం కోసం ఎన్ని రూపాలు ధరించాడు. ఈ విషయంపై శివపురణం ఓసారి తిరగేస్తే అందులో ఎనిమిది రూపాలు ధరించినట్లు పెర్కొంటోంది.
అవేంటంటే....

* రుద్రుడు !
* భవుడు !
* శర్వుడు !
* ఉగ్రుడు !
* భీముడు !
* పశుపతి !
* ఈశానుడు !
* మహాదేవుడు !

1) రుద్రుడు : దుఃఖ నివారకుడైన అగ్నిని అదిష్టించి ఉంటాడు !!

2) శర్వుడు : జీవుల మనుగడ కోసం భూమిని అధిష్టించి ఉంటాడు !!

3) భవుడు : ఈ జగానికి అత్యంతావశ్యకమైన జలాన్ని ఆశ్రయించి ఉంటాడు !!

4) ఉగ్రుడు : జగత్తు కదలికలకు కారకుడై వాయువును అధిష్టించి ఉంటాడు !!

5) భీముడు : ఆకాశాన్ని ఆశ్రయించి ఉంటాడు !!

6) పశుపతి : సంసార బద్ధులైన జీవులను పాప విముక్తులను చేసేందుకై జీవాత్మను అధిష్టించి ఉంటాడు !!

7) ఈశానుడు : ఈ చరాచర జీవులను శాసించే సూర్యునలో ప్రకాశిస్తుంటాడు !!

8) మహాదేవుడు : తన చల్లని కిరణాలతో జీవులను పాలించు చంద్రునిలో ప్రకాశిస్తుంటాడు !!

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS