Wednesday, May 26, 2021

బుద్ధ జయంతి సందర్భంగా


26-5-2021      బుద్ధ జయంతి సందర్భంగా


యోగ సంస్కృతిలో ఏ ఆధ్యాత్మిక సాధకుడి జీవితంలోనైనా బుద్ధ పౌర్ణమి చాలా ప్రధానమైన రోజు.

గౌతమ బుద్ధుడు ఈ భూమిపై అవతరించిన రోజు, జ్ఞానోదయమైన రోజుగా బుద్ధ పౌర్ణమి గుర్తింపు పొందింది. ఉత్తరాయణంలో వచ్చే ఈ మూడో పౌర్ణమికి గౌతమ బుద్ధుడి జ్ఞాపకార్ధం ఆయన పేరు పెట్టుకున్నాం. సుమారు ఎనిమిదేళ్లు కఠోర సాధన చేసిన గౌతముడు శారీరకంగా చాలా నీరసించి పోయారు. నాలుగేళ్ల పాాటు ఆయన ‘సమాన’ అనే సాధనలో ఉన్నారు. ‘సమాన’ సాధన అంటే ఆహారాన్ని అపేక్షించకుండా కేవలం ఉపవాసం, ఉండటం.

ఈ సాధన ఆయన శరీరాన్ని దాదాపు మరణానికి దగ్గరయేంతగా శుష్కింపజేసింది. ఆయన అలానడుస్తూ, 'నిరంజన’ అనే నది వద్దకు వెళ్లారు. ప్రస్తుతం భారతదేశంలోని చాలా నదుల్లా, అది కూడా అంతరించి పోయింది. అప్పట్లో ఈ నది మోకాలి లోతు నీరుతో, ఒక పెద్దపాయలా, వేగంగా ప్రవాహిస్తోంది. ఆ నదిని దాటడానికి ఆయన ప్రయత్నించారు. కానీ ఆయన శరీరం ఎంత నీరసించి పోయిందంటే నది మధ్యలోకి వెళ్ళాక ఆయన మరొక్క అడుగు కూడా వేయ లేకపోయారు. అంత తేలికగా వదలే మనిషి కాదు కాబట్టి, ఆయన అక్కడున్న ఒక పెద్ద ఎండుకొమ్మని పట్టుకుని అలా నిలబడ్డారు.

‘నాకు పరమోన్నత స్థితి ప్రాప్తమయ్యే వరకూ నేను ఇక్కడి నుంచి కదలను! ఆత్మ సాక్షత్కారమైన జ్ఞానిగా లేచి నిలబడాలి లేదా ఇలానే దేహం వీడాలి’ అనుకుంటూ గంటల తరబడి నిలబడ్డారని చెబుతారు. అసలు ఆయన గంటల కొద్దీ నిలబడ్డారో లేదా నీరసించిన స్థితిలో కొన్ని క్షణాలే ఆయనకు గంటలుగా అనిపించాయో మనకి తెలియదు. కానీ ఆ క్షణంలో ‘తాను దేని కోసమైతే పరితపిస్తున్నారో అది తనలోనే ఉంది!’ అనే విషయం మహాత్ముడు గ్రహించారు.


‘ఈ శ్రమంతా ఎందుకు? కావాల్సింది సంపూర్ణమైన అంగీకారం, అంతే. నేను శోధిస్తున్నది నా లోపలే ఉంది. నేను ప్రపంచమంతా ఎందుకు వెతుకుతున్నాను?’ అనుకున్నారు. ఇలా అనిపించాక ఆయనకు మరో అడుగు వేయటానికి ఇంకాస్త శక్తి వచ్చింది. ఆ నదిని దాటి, ప్రఖ్యాతి గాంచిన బోధివృక్షం కింద కూర్చున్నారు. ఎంతో ‘దృడ నిశ్చయంతో నాకు పరమోన్నత స్థితి ప్రాప్తమయ్యే వరకూ నేను ఇక్కడి నుంచి కదలను! నేను ఆత్మ సాక్షత్కారమైన జ్ఞానిగా లేచి నిలబడాలి లేదా ఇలానే చనిపోవాలి!’ అని నిశ్చయించుకున్నారు. ఆ మరుక్షణమే ఆయన ఆ స్థితికి చేరగలిగారు.

జ్ఞానోదయం పొందాలంటే మనం జీవితంలో కోరుకునేది అదొక్కటే కావాలి. అప్పుడు అది క్షణంలో జరిగిపోతుంది. మన సాధన, ప్రయత్నం అంతా మనకి అటువంటి ప్రాధాన్యత ఏర్పడటం కోసమే. మనుషులందరికీ ఎన్నో ప్రాధాన్యతలుంటాయి. అందువల్ల వారి మనస్సు, భావోద్వేగాలు, శక్తి అంతటా విస్తరించి ఉంటాయి. వాటన్నింటినీ ఒక దగ్గరకు చేర్చి సాధన చేయడానికి ఎంతో సమయం పడుతుంది. కాబట్టి, మొదట చేయాల్సింది మనల్ని మనం ఒక్క చోటుకి సమీకరించుకోవడం. అంటే మనల్ని మనం ఒకే దిశ వైపు మాత్రమే మళ్లించుకోవడం. ఒక మనిషి తనను తాను సంపూర్ణంగా ఒక్క చోటుకి సమీకరించుకున్నప్పుడు మాత్రమే, అతనికి మేము ఏదైనా చేయడం సాధ్యమవుతుంది.

సమాన’ గా గౌతమ బుద్ధుడి సాధనలోని తీవ్రతను చూసి ఎన్నో ఏళ్లు ఉన్న ఐదుగురు తోటి సాధకులు ఆయనను మార్గదర్శకునిగా తీసుకున్నారు. కానీ ఆయన ధ్యాన స్థితిలో నుంచి లేచిన తర్వాత మొదట ‘మనందరం భోజనం చేద్దాం’ అన్నారు. దీంతో వాళ్లు నిర్ఘాంతపోయి.. బుద్ధుడి సాధన దిగజారి పొయిందనుకుని, పూర్తిగా నిరుత్సాహపడ్డారు. వారి భావాలను గ్రహించిన గౌతముడు.. ‘మీకు అసలు విషయం తెలియడం లేదు. ఇది ఉపవాసం గురించి కాదు, ఇది ఙ్ఞానోదయం గురించి.. నాకు పూర్ణ ఙ్ఞానోదయం కలిగింది.. నన్ను గమనించండి. నా లోని ఈ మార్పును చూడండి. నాతో కేవలం అలా ఉండిపోండి, అంతే’ అన్నారు.

అయితే, వారంతా గౌతముడిని వదిలి వెళ్లిపోయినా... వారిపై ఉన్న కారుణ్యం వల్ల బుద్దుడు వారిని వెతుక్కుంటూ వెళ్లి జ్ఞానోదయం వైపు నడిపించారు. ఙ్ఞానులు చాలా మంది ఉండవచ్చు. కానీ, ఈ అద్భుతమైన మనిషి ప్రపంచపు రూపు రేఖలను ఎన్నో విధాలుగా మార్చి, 2,500 ఏళ్లు గడిచినా ఇంకా ఈ నాటికి కూడా ప్రభావితం చేస్తూనే ఉన్నారు🙏

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS