Sunday, April 1, 2018

శ్రీ కృష్ణ మందిరం..ఉడుపి

శ్రీ కృష్ణ మందిరం..ఉడుపి
భారత దేశంలో శైవ క్షేత్రాలతో  పాటే తప్పకుండా సందర్శించవలసిన పౌరాణిక ప్రాధాన్యం ఉన్న వైష్ణవ క్షేత్రాలు అనేకం  ఉన్నాయి. వాటిలో ప్రముఖంగా చెప్పుకోదగ్గవి ప్రసిద్ధ  స్వయం వ్యక్త విష్ణు క్షేత్రాలు ఎనిమిది.
వీటిలో  ఎనిమిదవదయిన సాలగ్రామం,  నేపాలులో ఉండగా  మిగతా  ఏడు ..
తిరుమల (అంధ్రప్రదేశ్)
శ్రీరంగం,
శ్రీముష్ణం ,
తోతాద్రి (తమిళనాడు) లో ఉండగా 
నైమిశారణ్యం (ఉత్తరప్రదేశ్) 
బదరీ (ఉత్తరాఖండ్) 
పుష్కర్  (రాజస్థాన్) లు
భారతదేశంలో ఉన్నాయి.
ఇవి కాకుండా విష్ణుమూర్తి, కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో అనంతపద్మనాభ స్వామిగా మనకు దర్శనమిస్తాడు. దశావతారాలలో సంపూర్ణావతారాలుగా చెప్పబడినవి అతి ముఖ్యమైనవి శ్రీరామావతారం, శ్రీకృష్ణావతారం. భారతదేశంలో రామమందిరం లేని గ్రామం ఉండదంటే అతిశయోక్తి కాదు.
అయినా ప్రసిద్ధి చెందిన రామాలయాలు రెండే రెండు. వాటిలో ఒకటి తెలంగాణా రాష్ట్రంలోని భద్రాచలం, రెండవది తమిళనాడులోని మధురాంతకం. ఇది కాంచీపురం జిల్లాలో ఉన్నది. మూడవది ఇంకా దేవాలయ స్థాయి పొందనిది ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య.
శ్రీ కృష్ణుని విషయానికి వస్తే నాలుగు ఆలయాలను ప్రధానంగా చెప్పుకోవచ్చు ఇవి ఉత్తర భారతంలో ఉత్తరప్రదేశ్ లోని మధుర,
గుజరాత్ రాష్ట్రంలో ద్వారక,
దక్షణ భారత దేశంలో కేరళలోని గురువాయూరు, కర్ణాటకలోని ఉడుపి.
ద్వైత సిద్ధాంత ప్రతిపాద్యులు, త్రిమతాచార్యులలో ఒకరైన జ్ఞానజ్యోతి శ్రీ శ్రీ శ్రీ మధ్వాచార్యులవారి  జననం, జీవితం ప్రసిద్ధ శ్రీకృష్ణ క్షేత్రం కర్ణాటకలోని ఉడిపితో సంబంధించి ఉన్నది.
ఒకరోజు శ్రీ మధ్వాచార్యులవారు వేకువ జామునే సముద్ర తీరానికి వెళ్లి స్నానం చేసి ప్రాతః సంధ్యాదికాలు ముగించుకుని ఆ తీరంలోనే కూర్చుని ద్వాదశ స్తోత్ర రచనను ప్రారంభించారు. ఒక దీక్షతో ద్వాదశ స్తోత్ర రచన సాగుతోంది. ఆ రోజు ఏదో పర్వదినం కావటంతో  అనేకమంది ప్రజలు కూడా వచ్చి సముద్ర స్నానం చేశారు. ప్రశాంతమైన ప్రాతఃకాలం, భక్తి ప్రపత్తులు ప్రసరించటానికి అనువైన సమయం.
అలాంటి నేపధ్యంలో శ్రీ మధ్వాచార్యులవారు నిరాటంకంగా ద్వాదశ స్తోత్రం లోని ఐదు అధ్యాయాల రచన పూర్తి చెశారు. ఆరో అధ్యాయం ప్రారంభం కాబోతుంది. ఇంతలో.... సముద్రంలో ద్వారక నుంచి సరుకులు తీసుకు వస్తున్న ఒక నౌక తీరం వెంట వెళుతూండగా అకస్మాత్తుగా విపరీతంగా గాలులు ప్రారంభమయ్యాయి.
ఈ గాలులకు సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. నౌక ప్రమాదంలో చిక్కుకున్నది. దానిని రక్షించుకోవటానికి అందులోని నావికుల ప్రయత్నాలు ఫలించటంలేదు. క్రమంగా నౌక లోకి నీరు చేరటం ఆరంభమయింది.
ఇక ఏ క్షణాన్నైనా మునిపోవటానికి సిద్ధంగా ఉన్నది. నావికులందరూ భయాందోళనలకు గురైన సమయంలో చివరి ప్రయత్నంగా నౌకకు సంబంధించిన ముఖ్య వ్యాపారి తీరం వైపు చూస్తూ రక్షించేవారి కోసం ప్రార్ధన చేయటం మొదలుపెట్టాడు. అంత దూరాన్నుంచి కూడా ఒడ్డుపై నిశ్చలంగా కూర్చుని రచన చేసుకుంటున్న తేజస్వి ఆ వ్యాపారికి స్పష్టంగా గోచరించారు. ఆయనను ఉద్దేశించి మరింత ఆర్తితో ప్రార్ధించ సాగాడు.
ద్వాదశ స్తోత్ర రచనలో లీనమై ఉన్నప్పటికీ, అంతటి హోరు గాలిలోనూ, అంత దూరాన్నుంచి వ్యాపారి చేస్తున్న ప్రార్థన మధ్వాచార్యుల చెవిని తాకింది. అప్రయత్నంగా అటుకేసి తల తిప్పారు. జాలి కలిగింది. వెంటనే తన ఉపవస్త్రం ఒక కొసను పట్టుకుని  గాలిలో నావ కేసి విసిరి వెనక్కు తీసుకున్నారు.
అంతే! ఆ క్షణం వరకూ సముద్రంలో మునిగిపోతుందా అన్నట్టున్న నౌక ఒక్కసారిగా స్తబ్ధతకు వచ్చింది. ఎవరో తాళ్ళు పట్టి లాగినట్టుగా తీరానికి చేరి స్థిరంగా నిలిచింది. నావికులందరూ సురక్షితంగా ఒడ్డుకు చేరారు.
అంతకు మునుపు ప్రార్ధన చేసిన వ్యాపారి వడివడిగా మధ్వాచార్యులవారిని సమీపించి సాష్టాంగ నమస్కారం చేశాడు. అనేక విధాలుగా స్తుతించాడు.
అనంతరం లేచి నిలబడి అంజలి ఘటించి “స్వామీ, నా వద్ద అమూల్యమైన వస్తువులు అనేకం ఉన్నాయి. వాటిలో మీరు కోరున్నదేదైనా సరే ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి కాదనకండి. అని అనేక విధాల ప్రాధేయ పడ్డాడు.
మధ్వాచార్యులవారు చిరునవ్వు నవ్వి చివరికి అతని కోరికను మన్నించారు. “అయితే నువ్వు నాకు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్న అమూల్యమైన వస్తువు, నీ నౌకలో ఉన్న రెండు గోపీ చందనపు గడ్డలు ఈయగలవా?” అన్నారు. వ్యాపారి ఆశ్చర్య పోయాడు.
ఎందుకంటే, గోపీ చందనం ద్వారకలో ఎక్కడపడితే అక్కడ దొరికే మట్టి.  పడవలలో సరుకులు ఎక్కించేటప్పుడూ దించేటప్పుడూ బరువు సమతూకం తప్పిపోకుండా గోపీ చందనం గడ్డల సాయంతో నౌకలో సరుకును అటూ ఇటూ సర్దుతూ ఉంటారు.
అలాంటి గోపీ చందనం మట్టి గడ్డలు ఈ మహానుభావుడు కోరటం ఆ వ్యాపారికి సుతరామూ నచ్చలేదు. ఎంత ప్రార్ధించినా మధ్వాచార్యులవారు తాను కోరిన గోపీ చందనానికి మించి మరే బహుమతినీ తీసుకోవటానికి అంగీకరించలేదు. చివరికి ఆ వ్యాపారి, స్వామి కోరిన ఆ గోపీచందనం గడ్డలనే ఇవ్వటానికి సిద్ధపడి, అవే కోరటం లోని పరమార్ధమేమిటో, ఆ మట్టిగడ్డల మహిమా విశేషాలేమిటో కనీసం అవయినా తెలుపమని ప్రార్ధించాడు.
స్వామి మళ్ళీ చిరునవ్వు చిందిస్తూ “నువ్వే చూడు” అంటూ ఆ గడ్డలను అందరూ చూస్తూ ఉండగా నీటితో కరిగించారు.
అద్భుతం...
ఒక గడ్డ నుంచి బలరాముని విగ్రహం,
రెండవ దాని నుంచి శ్రీ కృష్ణుని విగ్రహం
బయట పడ్డాయి. అక్కడ ఉన్న వారందరూ సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయారు.
శ్రీకృష్ణ విగ్రహ దర్శనం తోనే మధ్వాచార్యులు ద్వాదశ స్తోత్రం లోని ఆరవ అధ్యాయంలో దశావతారాన్ని వర్ణించారు. ఇక బలరాముని విగ్రహాన్ని అక్కడే ప్రతిష్టించి శ్రీకృష్ణుని విగ్రహం తీసుకుని ఉడుపికిప్రయాణమయ్యారు.
శ్రీకృష్ణ ప్రాప్తి తరువాత ద్వాదశ స్తోత్రాన్ని పరిసమాప్తి చేశారు. అందుకే ద్వాదశ స్తోత్రం అత్యంత పవిత్రమైనది. అమృతరూపమైనటువంటి శ్రీకృష్ణుని ఆగమనానికి కారణమైంది. అది విషాహార స్తోత్రంగా కూడా ప్రసిద్ధి.
ఇంతకీ శ్రీకృష్ణుని విగ్రహ రహస్యం ఏమిటి. వాస్తవానికి జరిగిందేమిటి? ఈ కథ మరింత ఆసక్తిగా ఉంటుంది. ఆ శ్రీకృష్ణుని విగ్రహం సామాన్యమైనది కాదు. ఒకసారి దేవకీదేవి “కృష్ణా నీ బాల్య లీలలు చూసే భాగ్యం యశోదకు కలిగినట్టుగా నాకు కలుగలేదు. వాటి గురించి వినీ వినీ ఎప్పటికైనా చూడాలని నా  మనస్సు ఉవ్విళ్ళూరుతోంది. చూపించవా కృష్ణా” అని ప్రార్ధించిందట. కృష్ణుడు అనుగ్రహించాడు.
మరుక్షణంలో శైశవ దశలో కృష్ణుడుగా మారిపోయాడు. తప్పటడుగులు వేస్తూ నడిచాడు. దేవకీదేవి ఒడిలో కూర్చున్నాడు. ఆమె స్థన్యాన్ని త్రాగాడు. కేరింతలు కొట్టాడు. కుండ పగులగొట్టి వెన్న తిన్నాడు. వంటినిండా రాసుకున్నాడు. పామును  తాడు లాగా  పట్టుకుని మజ్జిగ చిలికినట్టు నృత్యం చేశాడు. మరీ ముఖ్యంగా తనతో పాటు అన్న బలరాముణ్ణి కూడా చూపించాడు.
ఈ చేష్టలను  చూసే దేవకీదేవి పరవశించి మైమరచిపోగా ఇదంతా గమనిస్తున్న రుక్మిణి  తన పతిదేవుడి శైశవ రూపాన్ని ప్రపంచమంతా చూసి తరించాలని బావించి వెంటనే విశ్వకర్మను పిలిపించి ఆయా రూపాల్లో  శైశవ కృష్ణుని, బలరాముల  విగ్రహాలు చేయించింది.
ముందుగా తానే  సకల వైభవాలతో ఆ విగ్రహాలను  స్వయంగా పూజించింది. కృష్ణావతారం ముగిసింది. మరికొంత కాలానికి ద్వారక సముద్రంలో మునిగిపోయే సమయం ఆసన్నమయింది. దూరదృష్టితో అర్జునుడు ఆ విగ్రహాలను  తీసుకువెళ్ళి ఒక  ప్రదేశంలో స్థాపించి దానికి రుక్మిణీ వనం అని నామకరణం చేశాడు.
కాలక్రమంలో అ వనం యావత్తూ గోపీ చందనం మట్టిలో కలిసి కనుమరుగై పోయింది. నావికులు తమ నౌకల్లో సమతూకాన్ని పాటించటం కోసం  గోపీచందనం గడ్డల్నిమోసుకెళ్ళే అలవాటు ప్రకారం, కాకతాళీయంగా ఈ విగ్రహాలున్న గోపీచందనం గడ్డల్ని కూడా నౌకలోకి చేర్చారు. వాటి విలువ తెలియకుండానే ఆ గడ్డల్ని తీసుకెళ్ళే భాగ్యం ఆ వ్యాపారికి లభించింది.
ఆ విగ్రహం ఆ నౌకలో వస్తోందని మధ్వాచార్యుల దివ్య దృష్టికి ముందే తెలుసు. ద్వాదశ స్తోత్రాన్ని రచిస్తూ ఆ విగ్రహాలను ఆహ్వానించటానికే ఆయన ఆరోజు  ఆ తీరానికి వెళ్ళారు. 
ఆ శ్రీకృష్ణుని ప్రతిమను మధ్వాచార్యులు తమ శిష్యులచేత మాధవ సరోవరంలో ప్రక్షాళన చేయించారు. తరువాత తానే స్వయంగా అభిషేకించారు. ఈ అభిషేకానికి మునుపు నలుగురు శిష్యులు సునాయాసంగా ఎత్తిన ఆ విగ్రహం మధ్వాచార్యులు అభిషేకించిన తరువాత ముప్ఫై  మంది కలిసినా  ఎత్తడం సాధ్యం కాలేదు! ఎందుకంటే, మధ్వాచార్యుల అభిషేకంతో ఆ విగ్రహంలో శ్రీకృష్ణుని దివ్యశక్తి పరిపూర్ణంగా ఏర్పడింది.
మంత్ర విధులతో మధ్వాచార్యులు అత్యంత శాస్త్రోక్తంగా శ్రీకృష్ణ విగ్రహాన్ని విళంబి నామ సంవత్సరం మాఘ శుక్ల తదియ నాడు (క్రీ.శ.1236) ఉడుపిలో ప్రతిష్టింప జేశారు. ఆనాటి నుంచీ ఉడుపి ప్రాంత యాజ్ఞీకులందరూ మధ్వాచార్యులు అవలంబించిన విధానాలనే అనుసరిస్తున్నారు.
శ్రీ కృష్ణ మఠంగా పిలువబడే ఈ దేవాలయానికి అనుబంధంగా తన ఎనిమిది మంది శిష్యులచే నిర్వహింపబడేట్టుగా పెజావరు మఠం..
పుట్టిగే,
పాలిమరు,
ఆడమారు,
సోదే,
కాణియూరు,
శిరూర్,
కృష్ణపురా
అనే  ఎనిమిది మఠాలనూ శ్రీ మధ్వాచార్యులు ఏర్పరచారు. వీటిని అష్ట పీఠాలు అంటారు. ఇవన్నీ ఉడుపి కేంద్రం గానే శ్రీ కృష్ణ మఠానికి చుట్టుప్రక్కలే ఉన్నాయి. 
ఇదీ సూక్షంగా ఉదిపిలోని శ్రీకృష్ణ దేవాలయ చరిత్ర..
లోకా సమస్తా..సుఖినో భవంతు..!!
                          శ్రీ మాత్రే నమః

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS