Saturday, October 17, 2020

సాయి ఆరాధన - నవగ్రహ దోషనివారణ:

సాయి ఆరాధన -  నవగ్రహ దోషనివారణ:

సాయి భక్తులు సాయిని తప్ప వేరేది పూజించలేము,  గురుభక్తిలో, గురుతత్వంలో ఉన్నాము.   గురువు పాదాలు పట్టుకుని, గురువును ఆశ్రయించాము అని చెప్తారు.   నవగ్రహ దోషాలకి బాబాకి సంబంధించిన పరిహారాలను చెప్పగలరా?.. అని చాలామంది సాయి భక్తులు అడగడం వలన,  నేను కూడా సాయి భక్తుడుని, స్వతహాగా జ్యోతిష్కుడిని అవడం వలన,  చాలామంది భక్తుల కోరిక మేరకు... శ్రీసాయి ఆరాధన  - నవగ్రహ దోష నివారణ గురించి చెప్పడం జరిగింది.   ఇది సాయి భక్తులకు మాత్రమే.   సాయిని నమ్మి, వారిని దర్శించి, వారిసేవలో ఉండి,  వారిని పూజించే భక్తులకు మాత్రమే, ఈ పరిహారాలు గురించి చెప్పడం జరిగింది.  

        సాయిబాబా దేవాలయాల్లో ముఖ్యంగా ధుని ఉంటుంది. ఆ ధునిలో నవధాన్యాలు వేయడం వల్ల దోష నివారణ జరుగుతుంది.   నవధాన్యాలు అంటే కేజీలు -  కేజీలు ధునిలో వేయకూడదు. కేవలం 10 గ్రా: నుండి 25 గ్రా: అంతవరకు మాత్రమే ధునిలో వేయాలి.   ఎవరో జ్యోతిష్కులు చెప్పారు కదా అని కేజీలు, కేజీలు వేసి పవిత్రమైన ధునిని అగౌరపరచకండి.   ధునిలో అగ్ని ఎప్పుడూ ప్రజ్వరిల్లుతూ ఉండాలే తప్ప... భక్తులు ఎక్కువగా వేసి అగ్నిని తగ్గించవద్దు అని మనవి... కొన్నిచోట్ల గురువారం మాత్రమే ధునిని వెలిగిస్తారు.  కనక గురువారం కూడా చేర్చడం జరిగింది.  ధునిని ప్రతిరోజు  వెలిగించే దేవాలయాల్లో, సూచించిన ఆయా రోజులలో ధునిలో నవధాన్యాలు సమర్పించుకోవచ్చు. పరిహారాల కోసమని ఎక్కువ, ఎక్కువగా ధునిలో నవధాన్యాలు వేసి తోటి భక్తులకి,  దేవాలయ యాజమాన్యం వారికి ఇబ్బందులు కలిగించరాదని మనవి....

1).  రవి:-   గోధుమలు (6 గురువారాలు గాని, 6 ఆదివారాలు గాని)

2).  చంద్రుడు:-  వడ్లు (10 సోమవారాలు గాని,  6 గురువారాలు గాని)

3).  కుజుడు:-   కందులు (7 మంగళవారాలు గాని, 7 గురువారాలు గాని)

4).  బుధుడు:-   పచ్చ పెసలు (5 బుధవారాలు గాని, 5 గురువారాలు గాని)

5).  గురువు:-  శనగలు (6 గురువారాలు) 

6). శుక్రుడు:-  బొబ్బర్లు (అలసందలు) (6 శుక్రవారాలు గాని,  6 గురువారాలు గాని) 

7). శని:-  నల్ల నువ్వులు (7 శనివారాలు గాని, 7 గురువారాలు గాని) 

8).  రాహువు:-   మినుములు (8 ఆదివారాలు గాని, 8 గురువారాలు గాని)  

9).  కేతువు:-   ఉలవలు (7 మంగళవారాలు గాని, 7 గురువారాలు గాని) 

         వీటన్నిటితో పాటు  ధునిలో సమిధలు వేయడం వల్లకూడా దోష నివారణ జరుగుతుంది.   అన్నదానం, ధుని ప్రజ్వలింప చేయటం దేవాలయం యాజమాన్యానికి సాహసంతో కూడుకున్న కార్యక్రమాలు.  కనుక దేవాలయంలోని ధునిలో సమిధలు కూడా సమర్పించవచ్చు.... 

1).  రవి:- జిల్లేడు పుల్లలు(ఆదివారం.. గురువారం గాని) 2). చంద్రుడు:- మోదుగ (సోమవారం..గురువారంగాని) 3).  కుజుడు:- చండ్ర (మంగళవారం..గురువారం గాని)

4). బుధుడు:- ఉత్తరేణి (బుధవారం..గురువారం గాని) 5). గురువు:-  రావిచెట్టు పుల్లలు( గురువారం)

6). శుక్రుడు:-  మేడిచెట్టు (శుక్రవారం..గురువారం గాని) 7). శని:-  జమ్మిచెట్టు (శనివారం..గురువారం గాని) 

8). రాహువు:- గరిక (ఎండిపోయినవి) 

9). కేతువు:-  దర్భలు..    

           (భక్తులకు చిన్న మనవి... ధునిలో సమిధలు వేసి దోషనివారణ చేసే ప్రక్రియలో వృక్షాలను విరవడం, నరకటం చేయవద్దు... ఎందుకంటే వృక్షాలను పూజించడం మన సంప్రదాయం.   వీటిలో దేవతా వృక్షాలు కూడా ఉన్నాయి.   రావిచెట్టుని నారాయణ స్వరూపంగా పూజిస్తాం.  రావిచెట్టుతో వేపచెట్టు కలిసి ఉంటే కళ్యాణం కూడా జరిపిస్తారు.   చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారు.   మేడిచెట్టుని (ఔదుంబర వృక్షం) దత్త స్వరూపంగా భావించి,  ఆ చెట్టు క్రింద దత్త పాదుకలు ప్రతిష్ఠించి పూజించుకుంటాము.   కనుక భక్తులు దోషనివారణ కోసం చెప్పారు కదా!! అని ఇష్టమొచ్చినట్టు వృక్షాలను నరకటం కానీ,  పెద్ద పెద్ద కొమ్మలు విరిచేయడం కానీ చేయవద్దు.   సమిధలు ఎప్పుడు ఎండిపోయినవి వేయాలి.   పచ్చివి వేయకూడదు.  అదికూడా దోషమే సుమా!!  కాబట్టి భక్తులు ధునిలో వేసే సమిధలు ఎప్పుడూ కూడా, చిన్న చిన్న పుల్లలు ఎండిపోయినవి, ఎక్కడన్నా దొరికినవి మాత్రమే సమర్పించుకోండి.   సమిధలు సమర్పించడం మాత్రమే భక్తుల విధి.   వాటిని వినియోగించుకోవడం అనేది దేవాలయ యాజమాన్యం వారి సమయానుకూలతన బట్టి ఉంటుంది.   కనక సమిధలు  ఎక్కువ ఎక్కువగా ధునిలో వేయకుండా,  చిన్న చిన్న పుల్లలు మాత్రమే వేయండి.   ఎక్కువ ఉంటే కనుక దేవాలయ యాజమాన్యం వారికి అప్పగించండి. వారు సమయానుకూలతను బట్టి ఉపయోగించుకుంటారు..)

                 సాయికి ప్రతిరోజు 4 హారతులు ఇస్తారు. 4 హారతులలో 4 శాలువాలు కప్పి హారతులు ఇస్తారు.  శాలువాలు కూడా బాబా దేవాలయాల్లో సమర్పించవచ్చు.   శాలువా సమర్పణ ద్వారా కూడా నవగ్రహ దోష నివారణ జరుగుతుంది....

1). రవి:-  కనకాంబరం రంగు లేదా అరుణ వర్ణం (గురువారం.. ఆదివారం గాని)

2). చంద్రుడు:-  తెలుపు రంగు (గురువారం.. సోమవారం గాని) 

3).  కుజుడు:-  ఎరుపు రంగు, కుంకుమ రంగు (గురువారం..మంగళవారం గాని) 

4).  బుధుడు:-  ఆకుపచ్చ, చిలక పచ్చరంగు (గురువారం.. బుధవారం గాని) 

5).  గురువారం:- పసుపు రంగు (గురువారం రోజు)

6). శుక్రుడు:-వెండి రంగు, (సిల్వర్ కలర్) (శుక్రవారం ..గురువారం గాని) 

7).  శని:-  నీలిరంగు,  నలుపు రంగు (శనివారం.. గురువారం గాని) 

8). రాహువు:-  తేనె రంగు (బ్రౌన్ కలర్)

9).  కేతువు:-  అన్ని రంగులు కలిపిన శాలువా..(మల్టికలర్) సమర్పించుకోవచ్చు..   

                   (కొందరి భక్తులకి గురువారం మాత్రమే దేవాలయానికి వెళ్లడానికి వీలు కుదురుతుంది.  కనుక గురువారం కూడా చెప్పడం జరిగింది.   చెప్పిన విధంగా ఆయా వారాలలో స్వామికి సమర్పించి, స్వామికి ఎప్పుడు అలంకరిస్తారో! యాజమాన్యాన్ని సంప్రదించి ఆ రోజు వెళ్లి స్వామి వారిని దర్శించుకోండి.   అంతేకానీ.. ఫలానా రోజు మేము ఇచ్చినదే బాబాకు అలంకరించాలని,  దేవాలయ యాజమాన్యం వారిని ఇబ్బంది పెట్టకండి.   ఇక్కడ బాబాకి మనస్ఫూర్తిగా, భక్తిగా సమర్పించడం ముఖ్యం.   వాటిని అలంకరించడం దేవాలయాల యాజమాన్యంవారి సమయానుకూలత ప్రకారం నడుచుకోండి...)

                  సాయిబాబాకి గురువారాలు ప్రసాదాలు పంచుతూ ఉంటారు.   గురువారం ఉదయం పూట ఎంత మంది భక్తులు వస్తారో!  సాయంత్రం అంతకంటే ఎక్కువ మంది భక్తులు వస్తారు.   యాజమాన్యానికి ప్రసాదాల రూపంలో కూడా ఇవ్వవచ్చు.  

1).  రవి:-   చపాతీలు, పూరీలు (21)... 

2).  చంద్రుడు:- దద్దోజనం... 

3).  కుజుడు:-  క్యారెట్ హల్వా... 

4).  బుధుడు:-  పచ్చ పెసలు ఉడికించినవి..Kg1.250గ్రా.. పెసర హల్వా గాని.. 

5). గురువు:-  శనగలు ఉడికించినవి.kg1.250గ్రా (గుగ్గిళ్ళు).. 

6).  శుక్రుడు:-  అలసందలు (బొబ్బర్లు ఉడికించినవి) kg.1.250గ్రా. 

7).  శని:-  నువ్వుల నూనె దేవాలయానికి సమర్పించండి.   ఒక కేజీకి తక్కువ కాకుండా, ఇచ్చేటప్పుడు పూజారిగారు చేతికి ఇవ్వకండి.  అది అపరాధం అవుతుంది.   తీసుకెళ్లి పక్కన పెట్టండి. అనుకూలత ప్రకారం దీపారాధన ఉపయోగించుకుంటారు. 

8).  రాహువు:-  మినపగారెలు.. 

9).  కేతువు:-  ఉలవలు ఉడికించినవి..kg1.250గ్రా        

                        ( సాయి భక్తులు దోష నివారణకు ప్రసాదాలు పెడుతున్నారు.  వాటి ద్వారా ఆ దోషాలు మాకు వస్తాయని అన్యధా భావించకండి.  ఇక్కడ వాటిని గురువుకు సమర్పించుకుంటున్నారు.  ఎప్పుడైతే గురువుకి సమర్పిస్తామో!! అప్పుడే అది పవిత్రమైన ప్రసాదం అవుతుంది.   ప్రసాదానికి ఎటువంటి దోషాలు ఉండవు.   నిరభ్యంతరంగా స్వీకరించవచ్చు.   మన బాధ యొక్క తీవ్రతను తగ్గించుకోవడానికి,  ఆ గ్రహ అనుగ్రహం కోసం ఆయా ప్రసాదాలు గురువుకి సమర్పిస్తున్నాము,  అన్న భావనతో సమర్పించండి.   స్వీకరించినవారు ఇబ్బందులు పడతారని అన్యధా భావించవద్దు.   ఏ గుడికి వెళ్ళినా ప్రసాదాలు స్వీకరించడం అనేది హైందవ సంస్కృతి... సంప్రదాయంలో భాగం.   కావున భక్తులు ప్రసాదాలను నిరభ్యంతరంగా స్వీకరించవచ్చు. ప్రసాదాలు చేయలేనివారు విశేషకరమైన రోజులలో జరిగే అన్నదానానికి,  యాజమాన్యం వారిని సంప్రదించి బియ్యం, గోధుమలు, కందులు, మినుములు ఇవ్వవచ్చు.  అంతేకాదు నువ్వుల నూనె కూడా పూజారి గారిని,  యాజమాన్యం వారిని సంప్రదించి ఇవ్వండి. చెప్పారు కదా!! అని కేజీలు -  కేజీలు కొని ఇవ్వకండి. వారు తీసుకోము అంటే మీరు బాధపడాలి.   ఈ దోష పరిహారాలు అన్నీ కూడా  దేవాలయాలకి వెళ్లి, వారిని అడిగి చేయవలసిన కార్యక్రమాలుగాని,  మనంతట మనం సరదాగా వెళ్లి ఈరోజు ఇచ్చేస్తాము తీసుకోండి!! అని యాజమాన్యం వారిని ఇబ్బంది పెట్టకండి. ముందుగా పూజారి గారిని, పాలకవర్గం వారిని సంప్రదించి వారి అనుమతితో చేయండి.   అంతేకానీ నేను దోషాలు పోగొట్టుకోవడానికి ఇస్తున్నాను,  అన్న దృక్పదంతో చేయకండి.   అంతేకాదు సమర్పించిన ప్రసాదాలు ఎప్పుడూ కూడా దేవాలయంలోనే వితరణ చేయండి.   అంతేగాని ప్రసాదం మేము సమర్పించాము కదా!! అని ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి పెట్టాలని ఎక్కువగా ఇంటికి తెచ్చుకోకండి.   ప్రసాదం ఎప్పుడూ కూడా దేవాలయంలోనే విచారణ చేయాలి.  స్వామికి సమర్పించిన ప్రసాదం దేవాలయంలోనే స్వీకరించాలి....) 

              అభిషేక ద్రవ్యాలు, పూజా ద్రవ్యాలు కూడా స్వామివారికి సమర్పించవచ్చు...

1). రవి:-   రాగి ప్రతిమలు కానీ, రాగి వస్తువులు గాని పూజకు ఉపయోగించేవి, రాగికి సంబంధించిన ఏదైనా ఇవ్వవచ్చు.   రేగుపళ్ళు నైవేద్యం పెట్టినా కూడా రవి గ్రహ దోషనివారణ జరుగుతుంది.   

2). చంద్రుడు:-  పాలు, పెరుగు ఇవ్వవచ్చు.   బాదంపప్పు, జీడిపప్పు కూడా నైవేద్యంగా ఇవ్వవచ్చు. 3). కుజుడు:-  కుంకుమ సమర్పించాలి.  దానిమ్మ పళ్ళు నైవేద్యంగా,  విశేషకరమైన రోజులలో అన్నదానం ఉంటే కనుక క్యారెట్,  బీట్రూట్ సమర్పించవచ్చు.  (అన్నదానం ఉంటేనే సమర్పించండి.) 

4). బుధుడు:-  పంచదార,  జామకాయలు,  ఆకుపచ్చ అరటి పళ్ళు నైవేద్యంగా సమర్పించుకోవచ్చు.  

5). గురువు:-  గంధం,  పసుపు సమర్పించుకోవచ్చు.  గురువుకి గంధం ఇవ్వటం వలన చాలామంచి ఫలితాలు వస్తాయి.  పసుపు రంగులో ఉన్న అరటి పళ్ళు, మామిడి పళ్ళు నైవేద్యంగా సమర్పించుకోవాలి.   

6). శుక్రుడు:-   సుగంధ ద్రవ్యాలు,  పట్టు వస్త్రాలు సమర్పించుకోవాలి.   (జాజికాయ, జాపత్రి, సెంటు మొదలైనవి...) వీటిని వశేషకరమైన రోజులలో అభిషేకాల కోసం మాత్రమే ఇస్తే మంచిది.   

7). శని:-  ఏదైనా నూనె పదార్థాలు... నూనె కానీ, నెయ్యి గాని సమర్పించుకోవచ్చు.   నైవేద్యంగా నల్లద్రాక్ష, నల్ల నేరేడు పండ్లు సమర్పించుకోవచ్చు.  విశేషకరమైన రోజులలో అన్నదానం ఉంటే కనుక తోటకూర కూడా సమర్పించుకోవచ్చు.   

8). రాహువు:- తేనే సమర్పించాలి.   నైవేద్యంగా ఖర్జూర పళ్ళు పండినవి సమర్పించుకోవచ్చు.  

9).  కేతువు:-  ఎండు ఖర్జూరాలు,  యాలకలు,  కొబ్బరికాయలు సమర్పించుకోవచ్చు.  

              (భక్తులు పూజా ద్రవ్యాలు అభిషేక ద్రవ్యాలు అన్నీ కూడా ప్రత్యేకమైన పర్వదినాలలో సమర్పించుకోవాలి.. (ఉదా:- గురుపౌర్ణమి, సమాధి ఉత్సవాలు, శ్రీరామనవమి, దేవాలయ వార్షికోత్సవాలు ఇలాంటి సందర్భాలలో మాత్రమే వీటిని సమర్పించండి..) ఎప్పుడు పడితే అప్పుడు తీసుకెళ్లి నవగ్రహ దోషనివారణకు పరిహారాలు చేసుకుంటాము, తీసుకోండి అని దేవాలయ యాజమాన్యం వారిని అడగకండి.   విశేషకరమైన రోజులలో అభిషేకాలు, అన్నదానాలు జరుగుతాయి కాబట్టి,  వాటి కోసం వినియోగించే విధంగా దేవాలయ యాజమాన్యాలను సంప్రదించి ఏది అవసరమో! అవి మాత్రమే స్వామివారి కోసం సమర్పించుకోండి.   నేను చెప్పాను కదా!  అని ఎప్పుడు పడితే అప్పుడు సమర్పించకండి..)    

          సాయిబాబాకి ప్రతి రోజూ 4 హారతులు ఇస్తారు. వాటిని దర్శించుకోవడం వల్ల కూడా దోషనివారణ జరుగుతుంది.         

1). కాకడా హారతి:- ఉదయం హారతిని దర్శిస్తే రవి, గురు, కేతు దోషాలు పోతాయి.  (ఎందుకంటే.. ఉదయిస్తున్న సూర్యుడు పూర్ణబింభం.. ఉదయమే లేవాలంటే బద్దకంగా ఉంటుంది.. త్వరగా లేవలేము.. గుడికి వెళ్ళాలి అన్నా కూడా చాలా బాధగా అనిపిస్తుంది.  ఈ భావన కొంతమంది భక్తులలో ఉంటుంది.)

2).  మధ్యాహ్న హారతి:-   మధ్యాహ్న హారతిని దర్శిస్తే కుజుడు,  శని గ్రహదోషాలు పోతాయి.   (మిట్టమధ్యాహ్నం... ఎండ తీవ్రంగా ఉంటుంది... ఆకలిగానూ ఉంటుంది.. ఎక్కడెక్కడో తిరిగివస్తాం.. చిరాకుగా ఉంటుంది... పనులన్నింటినీ పక్కనపెట్టి హడావుడిగా(టెన్షన్ గా) బాబాగారి కోసం వస్తాం..) 

3). ధూప్ హారతి:-  సాయంత్రం హారతిని దర్శిస్తే బుధ, రాహు దోషనివారణ జరుగుతుంది.  (అటు ఎండా కాదు.. ఇటుచల్లగానూ ఉండదు.. మధ్యస్తంగా ఉంటుంది.. రాహువుకి సంబంధించి ఆదివారం రోజు సాయంత్రం గం:4.30 నుంచి 6.00 గం: వరకు ఉంటుంది.  ఎటు చూసినా సరే బుధ, రాహువులు కలయిక కాబట్టి దోషాలు పోతాయి.) 

4. శేజ్ హారతి:-  రాత్రి హారతిని దర్శించుకోవడం వల్ల చంద్ర,  శుక్ర గ్రహ దోషాలు పోతాయి.   (రాత్రి చంద్రుడు మనఃకారకుడు... ప్రశాంతంగా నిద్ర పట్టాలంటే చంద్ర అనుగ్రహం ఉండాలి... సుఖమైన నిద్ర కావాలంటే శుక్ర గ్రహ అనుగ్రహం వుండాలి.)       

                    (ఇవన్నీ కూడా ఏ ప్రమాణాలను అనుసరించి, ఏ దృష్టాంతం బట్టి చెప్పారంటే!  కేవలం బాబా భక్తిననుసరించి చెప్పడం జరిగింది.   చాలామంది సాయి భక్తులతో నిరంతరంగా సన్నిహితంగా ఉండటం వల్ల,  వారి అనుభవాలు తెలుసుకోవడం,  సాయిని సేవించటం వల్ల,  ఈ నవగ్రహాలకి నాకు తోచిన,  నా ఆలోచన శక్తిమేరకు చెప్పడం జరిగింది కానీ,  ఇందులో ఎవరినీ అగౌరపరచడంగాని,  హిందూ సాంప్రదాయాన్ని,  సంస్క్రతిని అగౌరపరచడం కాదు.   సాయి భక్తులను దృష్టిలో పెట్టుకొని నవగ్రహ దోషనివారణకి చెందిన చిన్నచిన్న పరిహారాలు చెప్పడం జరిగింది.  ఏదైనా పరిహారం చేస్తే బాబా అనుగ్రహం వల్ల శీఘ్రమైన ఫలితం కలుగుతుంది.  ఆ ఫలితం రాగానే సాయిపై పూర్తి నమ్మకంతో,  ఇంకాస్త శ్రద్ధగా పూజిస్తారు,  అనే సదుద్దేశంతో చెప్పడం జరిగింది.   అంతేగాని బాబాగారిని అగౌరపరచడం అని కాదు.   నవగ్రహాలకి, బాబాకి సంబంధం ఏమిటి? అని కాదు.   కేవలం బాబా భక్తులకు మాత్రమే ఇబ్బంది లేకుండా చేసుకోవడానికి,  కొన్ని సంవత్సరాల నుండి నా దగ్గర జ్యోతిష్కం చెప్పించుకోవడానికి వచ్చిన చాలా మంది భక్తులకు చెప్పాను.   కొంతమంది భక్తుల కోరిక మేరకు ఈ రోజు చెప్పడం జరిగింది...)      

                  ఏదైనా పరిహారాలు చేసేటప్పుడు దేవాలయానికిగాని, యజమాన్యానికిగాని,  తోటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేయండి.  ధునిలో వేసేటప్పుడు ధాన్యాలు ఎక్కువగా వేయకండి.  ఎక్కువగా వేసి  అగ్నిని తగ్గించకండి.   5 గ్రా: 10 గ్రా: 25 గ్రా: అంతకుమించి వేయకండి.  సమిధలు కూడా ఎండినవి తీసుకెళ్ళి పాలకవర్గానికి అందజేయండి.  అంతేకానీ మొత్తం ధునిలో వేయకండి.   ఏ పరిహారం చేసినా పక్కవాళ్ళ ఇబ్బంది పడకూడదు.   పాలకవర్గం వారి అనుమతితో,  ఆయా సమయాల్లో వార్షికోత్సవాల్లో సమర్పించండి.   మనకు చేతనైనంత వరకు చేసుకోవడమే కానీ,  మనం ఇచ్చినందువల్ల... పుచ్చుకున్నదువల్ల దోషాలు అంటుకుంటాయి, వాళ్లు ఇబ్బంది పడతారు అనేది లేదు.   మనం కేవలం బాబా అనుగ్రహం కోసమే ఈ వస్తువులను సమర్పిస్తున్నాం.  ఆ సమర్పణ వల్ల మనకు ఇంకా బాగుంటుందని ఆశిస్తూ... ఇది చెప్పాలంటే కొంత ఇబ్బందిగా కూడా ఉంది. ఎందుకంటే!  మీరు గనక ఎవరినైనా ఇబ్బంది పెడితే,  వాళ్లు మనల్ని దూషించే అవకాశం ఉంది.  చెప్పింది ఎవరు?  చేసింది ఎవరు? అని ప్రశ్నించే అధికారం ఉంది. అలాంటి వివాదాలు నావరకు రాయకుండా! మీరు సామరస్యంతోటి, శ్రద్ధతో చేయండి.  పూజా ద్రవ్యాల విషయంలో కూడా రకరకాల వివాదాస్పదాలకి తావీయకండి.  ఎవరో టి.ి.లో చెప్పారు కదా! అని చేయకండి.   చేసేది శ్రద్ధగా, మనస్ఫూర్తిగా చేయండి.  ప్రసాదాలు, సుగంధద్రవ్యాల ఏ దేవాలయంలోనైనా సమర్పించవచ్చు.  కాకపోతే బాబా భక్తులం కాబట్టి,  సాయి పాదాల పట్టుకున్నాము,  బాబాను ఆశ్రయించాము, గురు పాదాలే మనకు శరణ్యం కనుక వీటి ద్వారా కూడా మన యొక్క ఇబ్బందులు తొలగించుకోవచ్చు,  అనే సదుద్దేశంతో మాత్రమే చెప్పబడింది.   అంతేగాని బాబాగారిని అవమానించాలనిగాని, వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కాని, ఏదో కొత్తగా చెప్తున్నానని కాదు.   ఈ దానాలు విషయాలలో ఎవరితోనూ గొడవ పడరని... ఎవరిని ఇబ్బంది పెట్టరని... ఎవరికీ కోపం తెప్పించరని... ఎవరితోనూ వాగ్వివాదాలకు తావివ్వకుండా... మీరు ప్రశాంతంగా ఈ గ్రహాలకు సంబంధించి పరిహారాలు చేసుకుంటారని... సాయి భక్తులుగా శ్రద్ధ, సబూరితో ముందుకు కొనసాగుతారని ఆశిస్తున్నాను.   ఇందులో ఏదైనా పొరపాటు ఉంటే క్షమించాలని ఆశిస్తూ....

                              శ్రీ ఆదిపూడి వేంకట శివ సాయిరామ్


No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS