Saturday, October 17, 2020

ఏటి సూతకం అన్న మాటకి అర్థం ఏమిటంటే

 ఏటి సూతకం అన్న మాటకి అర్థం ఏమిటంటే


ఏటి సూతకం అన్న మాటకి అర్థం ఏమిటంటే ఎవరి శరీరం పడిపోతే కర్మ చేయవలసి ఉంటుందో కర్మ చేసినటువంటి వారు ఒక ఏడాది పాటు పాటించే నియమాల తోరణాన్ని ఏటిసూతకం అంటారు. తల్లి, తండ్రి వీళ్ళిద్దరి శరీరాలు పడిపోయినప్పుడు కొడుకు ఒక ఏడాదిపాటు ఏటి సూతకంలో ఉన్నాడు అంటారు. తల్లి కానీ, తండ్రికానీ శరీరాన్ని విడిచిపెట్టేస్తే ఆ ఏడాదిపాటు వాళ్ళ అభ్యున్నతికి సంబంధించిన కర్మలు చేయాలి. జీవుడికి ఒక ఏడాది మనుష్యలోకంలో ఉన్న కాలంతో అవకాశాన్నిస్తారు. ఎందుకంటే ఆనంద భావం కలిగితే శరీరంలో కొడుకు పుడతాడు అని చెప్తుంది శాస్త్రం. ఆనంద ధాతువు కదలాలి అంటే హృదయ స్థానం నుండి కదిలితేనే కొడుకు వస్తాడు అని. శరీరంలో ఇంక ఏ భాగం నుంచి పురుషుడికి ఆనంద ధాతువు కలిగినా ఆడపిల్ల పుడుతుంది అని. ఆ కొడుకుకి ఉన్న అధికారం ఏమిటంటే ‘ఆత్మావై పుత్రనామాసి’ – తండ్రియొక్క ఆత్మయే కొడుకుగా భూమిమీద తిరుగుతుంది. తండ్రికి గొప్ప శాంతినిచ్చేవాడు కొడుకు. పుత్రగాత్ర పరిష్వంగము అని సుఖం. కొడుకును కౌగలించుకుంటే తండ్రి ఎంత ఆనంద పడిపోతాడో! అటువంటి కొడుకును కన్నప్పుడు ఎంతో మురిసిపోతుంది భార్య. అంటే కొడుకులు లేనటువంటి వారిని బెంగ పెట్టుకొమ్మని కాదు. కొడుకులు లేకపోయినా కూతురు ఉండి కూతురుకి కొడుకు పుడితే కొడుకు ఉండడంతో సమానమే. తండ్రికి ఆత్మ బహిర్గతంగా తిరుగుతుండడంతో సమానం. శరీరం విడిచిపెట్టే ముందు కొడుకు ఒళ్ళో తలపెట్టుకుని విడిచిపెడితే కాశీ పట్టణంలో విడిచిపెట్టేసినట్లే. అంటే తండ్రీ కొడుకుల మధ్య అంత గొప్ప అనుబంధాన్నిచ్చింది శాస్త్రం. మరణ వేదన కూడా తగ్గిపోతుంది కొడుకు స్పర్శకి అని. అటువంటి తండ్రి విడిచి పెట్టేస్తే నీకోసం ఆయన సమయం వెచ్చించాడు చిన్నప్పటి నుంచి. మరి ఆ తండ్రికి నువ్వు చేయవలసినది? తండ్రి శరీరం బడలి వృద్ధుడైనప్పుడు కొడుకు తన కళ్ళ ముందు తిరిగితే ఆ తండ్రికి పరమ శాంతి. అందుకే ఒక చూరు క్రింద తండ్రి కొడుకు ఉన్నవాడు ఎవడో వాడు మహద్భాగ్యవంతుడు. రోజూ కొడుకు తిరుగుతూ కనపడుతూ ఉంటే, కొడుకు మాట వినపడుతూ ఉంటే కొడుకుతో కలిసి భోజనం చేస్తూ ఉంటే కొడుకు రాత్రి వచ్చి కాళ్ళు పడితే నా కొడుకు ఇక్కడే ఉన్నాడు, వాడున్నాడు అన్న ధైర్యం తండ్రికి ఆయుర్దాయం పెంచుతుంది. కొడుకు దగ్గర లేడు అన్నది ఆయువును క్షీణింపజేసి అనారోగ్యాన్ని తెస్తుంది. అలా కొడుకు కోసం తండ్రి వెంపర్లాడతాడు కాబట్టి ఆయన శరీరం వెళ్ళిపోయినా ఏడాదిపాటు ఆయన జీవుడి అభ్యున్నతికి పనిచేయాలి. అది కొడుకు యొక్క అధికారం. ఏడాదిపాటు వీడు ఏం చేస్తాడో అవి తండ్రి జీవుడి ఖాతాలో వేస్తారు.

వీడు వెళ్ళి అన్నదానం చేస్తే నాన్నగారి ఖాతాలో వేస్తారు. పురాణం వింటే నాన్నగారి ఖాతాలో వేస్తారు. వస్త్రదానం చేస్తే నాన్నగారి ఖాతాలో వేస్తారు. వీడికి అంత కన్నా పుణ్యం లోకంలో లేదు. ఈశ్వర స్వరూపమైన తండ్రికోసం చేసినది ఏది ఉందో అంతకన్నా పుణ్యం లోకంలో ఇంకొకటి లేదు. అంతేకానీ మా నాన్నగారి కోసం ఏటి సూతకం పట్టాను. నేను ఏ క్షేత్రానికి వెళ్ళడానికి లేదు. ఏ వ్రతమూ చెయ్యట్లేదు అని బెంగ పెట్టుకోకూడదు. అంతకన్నా దుర్మార్గమైన ఆలోచన ఇంకొకటి ఉండదు. తండ్రికోసం విధిగా చేయాలి. అవకాశం ఉంటే గోదానం చేయాలి.

అలా ఏడాదిపాటు శరీరం విడిచిపెట్టేసినటువంటి తండ్రి/తల్లి ఎవరిని ఉద్దేశించి కర్మ చేస్తున్నారో ఒక్కొక్కరు వేరొకరికి కర్మ చేయవలసి రావచ్చు. అలా కర్మ చేయవలసి వస్తే ఎవరు కర్మ చేస్తున్నారో వాళ్ళు ఏడాది పాటు ఏటి సూతకంలో ఉన్నారు అంటారు.

ఏటి సూతకంలో ఉంటే నిత్యపూజ చేసి తీరాలి. ఏటి సూతకంలో ఉన్నాము, రోజూ చేసే పూజ చేయము అన్న మాట అనడానికి అధికారం లేదు. పంచోపచారములు జరిగి తీరాలి. అధవా షోడశోపచారములు కూడా చేయవచ్చు. గంధ పుష్ప ధూప దీప నైవేద్యములు లేని ఇల్లు ఉండడానికి లేదు. చక్కగా దీపం పెట్టవచ్చు. ఈశ్వరుడికి పూజ చేయవచ్చు. నైవేద్యం పెట్టవచ్చు. ప్రసాదం తినవచ్చు.

చేయకూడనివి: నోములు చేయడం, వ్రతాలు చేయడం, భార్యాభర్త కలిసి పీటల మీద కూర్చుని నోములు, వ్రతాలు ఆచరించడం, నిత్యపూజలో ఇద్దరూ కూర్చుని చేసినా దోషం ఏమీ ఉండదు. పీటల మీద కూర్చోవడం అంటే నైమిక్తికానికి సంబంధించిన కల్పంతో ఉంటుంది. అటువంటి పనులు చేయకూడదు. కొండలు ఎక్కకూడదు. కొండల మీద ఉన్న దేవాలయాల దర్శనం చేయడానికి వెళ్ళకూడదు. పండుగలు మొదలైన సంబరాలు చేసుకోకూడదు. చేసుకోకూడదు అంటే బలవంతంగా మనస్సు నిగ్రహించమని కాదు. అయ్యో నా గురించి అంత వెంపర్లాడిన ఆయన వెళ్ళిపోయాడే! కనీసం ఒక్క ఏడాది. ఈ పండుగకు మా అమ్మ అభ్యున్నతికి ఏం చేయాలో అది చేస్తాను అని ఎవరికైనా బ్రాహ్మణుడికి పంచెల చాపు దానం చేస్తాను. నాకు పండుగ అని నా సంతోషం కోసం చేసుకోను. అందుకు పండుగ చేసుకోవద్దు అంటారు. బలవంతంగా నిగ్రహించి పిల్లల్ని పండుగకి ఎక్కడికో పంపి మేము మాత్రం ఇలా కూర్చున్నాం అండీ ఎందుకది? ఎందుకా ఏటి సూతకం? అలా ఉండకూడదు. నువ్వు నేర్పాలి పిల్లలకి. నీ తాత/నాయనమ్మ అంత గొప్పవాళ్ళు. ఆ నాయనమ్మ/తాత వెళ్ళిపోయింది. అందుకని చేసుకోవడం లేదు. అంటే మీరు మానేయండి మేం వెళ్తాం అంటాడా పిల్లవాడు? అందుకే పండుగలు చేసుకోకండి, నోములు, వ్రతాలు, కొండలు ఎక్కకండి, ఎవరికి కర్మ చేస్తున్నారో వాళ్ళకి అభ్యున్నతి కొరకు ఏడాది పాటు ఆ జీవుడు ఏం చేస్తే తృప్తి పొందుతాడో, పుణ్యాన్ని పొందుతాడో ఆ పనులు చేయాలి. వేసవి కాలం వస్తే చలివేంద్రం పెట్టు. రోహిణీ కార్తెలో మజ్జిగ ఒక బిందెలో పట్టుకుని పదిమందికి మజ్జిక ఇయ్యి. దేవాలయంలో ఉత్సవం జరుగుతుంటే నాన్నగారి పేరు మీద అన్నదానం చేయమని కొంత డబ్బు ఇవ్వు. నియమం తప్పకుండా తల్లికి/తండ్రికి కర్మ చేస్తున్న వాళ్ళకి ఏవిధమైన ఆరాధన చేయాలో అది లోపం లేకుండా నిర్వర్తించు. అలా చేయడం ఒక మనిషి మనిషిగా బ్రతకడానికి సంబంధించినది. దానిని ఏటి సూతకం అంటారు. ఏటి సూతకంలో నిత్యపూజ చేయకూడదు అన్న నియమం లేదు. నిత్యపూజ మాత్రం ఇంట్లో నడుస్తూ ఉండాలి.

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS