భాద్రపద పౌర్ణమి
▫️
నవగ్రహాలలో రాహు స్థానం కీలకం.
రాహువు బర్బబర దేశాధిపతి
( ప్రస్తుత దుబాయి ప్రాంతం ) ,
మైఠానస గోత్రం , పార్ధివ నామ సంవత్సరం ,
భాద్రపద శుద్ధ పౌర్ణమి రోజున ,
పూర్వా భాద్ర నక్షత్రం నందు
సింహిక , కశ్యపమహర్షిలకు జన్మించాడు.
రాహువు ధర్మపత్ని కరాళి దేవి .
రాహువు క్రూర రూపము కలవాడు .
మంచి పొడగరి , నల్లని మేని ఛాయవర్ణం కలిగి ,
నాలుగు భుజములతో కత్తి, త్రిశూలమును ధరించి
కవచ ధారణ చేసి , సింహవాహనాన్ని
అధిరోహించి ఉంటాడు.
రాహువు క్షీర సాగర మధన సమయంలో
దేవతా రూపం ధరించి
మోహినీ చేతి నుండి అమృతపానం చేసాడు.
దానిని సూర్య, చంద్రులు విష్ణు మూర్తికి చెప్పడంతో
విష్ణువు అతడి తలను మొండెం నుండి
వేరు చేయడంతో పాము శరీరం పొందాడు.
అప్పటికే అమృత సేవనం వల్ల
విష్ణు మూర్తి అతడిని అనుగ్రహించి
గ్రహ మండలంలో స్థానం కల్పించాడు.
అప్పటి నుండి సూర్యచంద్రులకు
శాశ్వత శత్రువై గ్రహణ సమయాన కబళించి
తిరిగి విడుస్తుంటాడని అనేక పురాణాల్లో
వివరింపబడి వుంది.
రాహువు వల్ల మానవాళికి కలిగే దోషాలను
శాంతింప చేయడానికి
రాహువు ప్రతిమకు కావలసిన లోహము : సీసం,
ప్రతిమకు పూజకు గ్రహ ఆసనం : చేట,
సమిధ : దూర్వ,
నైవేద్యం : మినప సున్ని, మినప గారెలు, ఖర్జూరం,
చేయవలసిన పూజ : అధిష్టాన దేవతయైన
సరస్వతి పూజ, దుర్గా పూజ, సుబ్రహ్మణ్య పూజ,
శివారాధన, రాహుకాలంలో దుర్గకు
నిమ్మకాయ దీపం పెట్టడం.
ఇటువంటి పూజ దేవాలయాలలో
దుర్గాదేవి సన్నిధిలో మాత్రమే చేయాలి.
ఇంట్లో అయితే నేతి దీపం పెట్టాలి.
ఆచరించ వలసిన వ్రతం : సరస్వతి వ్రతం,
రాహువుకు ప్రియమైన తిథి : చైత్ర బహుళ ద్వాదశి,
పారాయణ చేయవలసినవి : దుర్గా సప్తశ్లోకి,
రాహు అష్టోత్తరం, లలితా సహస్రనామం,
ఆచరించవలసిన దీక్ష : భవానీ దీక్ష,
ధరించవలసిన మాల : రుద్రాక్ష మాల,
అష్టముఖి రుద్రాక్ష, రత్నము గోమేధికము,
దర్శించవలసిన దేవాలయములు : సరస్వతి, దుర్గ,
సుబ్రహ్మణ్యస్వామి, శివ ఆలయాలు, నవగ్రహాలయాలు.
దానం చెయ్యవలసినవి : మినుములతో చేసిన పదార్ధాలు ,ఎండు ద్రాక్ష, తేనె, ఖర్జూరములు.
చేయవలసిన జపసంఖ్య : పద్దెనిమిది వేలు.
ఈ భాద్రపద పౌర్ణమి రోజున
రాహువుని పూజించటం వల్ల శుభాలు కలుగుతాయి.
రాహు మహర్దశ లేదా
రాహువు అంతర దశ జరుగుతున్నవారు ,
మకర, కుంభ రాశులకు శని అధిపతి కావున
శని ఏ ఫలితాలను ఇస్తాడో రాహువు కూడా
అదే ఫలితాలను ఇస్తాడు . కావున
శని మరియు రాహు గ్రహ సంచారం సరిగా లేని
జాతకులు ఈనాటి భాద్రపద పౌర్ణమి రోజున
రాహు కాల సమయాన పూజలు ఆచరించడం
అత్యంత శ్రేయస్కరం.
రాహు కాలం వారంలో ప్రతి రోజు
ఒకటిన్నర గంటల సమయం ఉంటుంది.
ఆ సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని
విశ్వసిస్తారు కనుక ముఖ్యమైన పనులైతే
ఆసమయంలో చేయరు. కాని దోష నివారణ కొరకు
రాహుకాలంలో పూజలు నిర్వహిస్తారు.
దుర్గాదేవికి రాహుకాలంలో నిమ్మడిప్పలో
నూనె పోసి దీపం వెలిగిస్తారు.
ఆదివారం సాయంత్రం :
4.30 గంటల నుండి 6.00 గంటల వరకు,
సోమవారం ఉదయం :
7.00 గంటల నుండి 9.00 వరకు,
మంగళవారం మధ్యాహ్నం :
3.00 గంటల నుండి 4.30 వరకు,
బుధవారం మధ్యాహ్నం :
12.00 గంటల నుండి 1.30 వరకు ,
గురువారం మధ్యాహ్నం :
1.00 గంటల నుండి 3.00 వరకు,
శుక్రవారం ఉదయం :
10.30 గంటల నుండి 12.00 గంటల వరకు,
శనివారం ఉదయం :
9.00 గంటల నుండి 10.30 గంటల వరకు
ప్రతీ రోజు ఇలా రాహుకాలం ఉంటుంది.
ఇటువంటి రాహు కాల సమయాలలో ..
ఓం కయానాశ్చిత్ర ఆభూవదూతీ
సదా వృధః సఖా
కయాశాశ్చిష్ఠయావృతా
ఋగ్వేదం - 4 - 31 - 1
యజుర్వేదం - 26 - 39
రాహు మంత్రం :
ఓం భూర్భువః స్వహ రాహో
ఇహ గచ్ఛ ఇహ తిష్ట రాహావేనమః
బీజ మంత్రం :
ఓం భ్రాం భ్రీం భ్రౌo సః రాహావేనమః
జపము : 18000 రాత్రి సమయంలో
అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించిన వారికి
దోషాలను తొలగించి , సర్వమంగళాలను ప్రసాదిస్తాడు.
అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య వివర్ధనం !
సింహిక గర్భ సంభూతం తమ్ రాహుమ్ ప్రణమామ్యహం !!
సింహికా గర్భ సంభూతుడా !
దక్షిణాన దక్షిణముఖంగా
నక్షత్ర మండలంలో వుండే
శ్రీ రాహు భగవానుడా !
మాకు సదా మంగళాలు కలిగించుము .
▫️

No comments:
Post a Comment