Saturday, December 2, 2017

హనుమద్వ్రతం*

🙏⚘

హనుమద్వ్రతం
⚘🙏




భక్త సులభుడైన హనుమంతుని అనుగ్రహం పొందటానికి దివ్యమైన మార్గం ఈ హనుమద్వ్రతం. మార్గశిర శుద్ధ త్రయోదశినాడు హనుమంతుడుని,ఆయన శక్తి స్వరూపమగు సువర్చలాదేవిని పంపానది తీర్థాన్ని కలశంలో ఆవాహనచేసి పూజించి ,హనుమత్ కథలను శ్రవణం చేసి హనుమత్ ప్రసాదం తీసుకుని ఈ వ్రతం పూర్తిచేసుకుంటారు. విశేషంగా స్వామి వారికి ఈరోజు నాగవల్లీ దళాలతో (తమలపాకులు) సింధూరంతో పూజించి అప్పాలతో నైవైద్యం పెట్టడం విశేషం.




పదమూడు ముళ్ల తోరాన్ని ధరిస్తారు. ఈవిధంగా పదమూడు సంవత్సరాలు వరుసగా ఈ వ్రతాన్ని చేస్తే హనుమంతుడి సంపూర్ణ అనుగ్రహం ఆ సాధకులకు కలుగుతుంది అని శాస్త్రవచనం. కాగా కార్తీకం మొదటినుంచి హనుమద్వ్రతం దాకా, అలాగే వైశాఖంలో వచ్చే హనుమజ్జయంతికి నలభైరోజులుకి పూర్తయ్యే విధంగా హనుమద్దీక్షలు స్వీకరిస్తుంటారు. ముఖ్యంగా ఏకాగ్రత, మానసికబలం, శక్తిసామర్ధ్యాలను పెంచే ఈ హనుమత్ ద్దీక్షలను యువకులు ఎక్కువగా స్వీకరిస్తుంటారు.




ఈ హనుమద్వ్రతం వైశాఖ బహుళ దశమి మధ్యాహ్నం స్వామియొక్క ఆవిర్భావం కనుక హనుమజ్జయంతి రోజన అలాగే మార్గశీర్ష మాసంలో శుక్లపక్షంలో వచ్చే త్రయోదశి నాడు హనుమద్వ్రతం చేస్తారు.




ఈరోజే హనుమంతుడు లంకలో సీతాదేవిని కనుగొన్నరోజు. శనిగ్రహ దోష నివారణకు కూడా శ్రీహనుమద్వ్రతాన్ని ఆచరిస్తారు. ఈవ్రతాన్ని కదళీవనం అంటే అరటితోటలో చేయడం వల్ల ఉత్తమ ఫలితాలనిస్తుంది. ఈవ్రతంలో పసుపురంగు పువ్వులను ఉపయోగించడం ఎంతో శ్రేష్ఠం.




హనుమద్వ్రతం ఎందుకు చేస్తారు ?




పరాశర సంహిత దీని గురించి చెప్పింది. పదమూడు క్షేత్రములున్నాయి. వాటిని హనుమత్ పీఠములు అని పిలుస్తారు. వాటిలో పంపాతీరం ఒక పీఠం.ఆయన కాలాతీతుడు. యుగములు మారిపోతాయి. కానీ హనుమ అన్నీ యుగాలలో మనకు కనపడతారు .




త్రేతాయుగంలోనూ, ద్వాపర యుగంలోనూ, హనుమ ఉన్నారు. గరుడ గర్వభంగాన్ని చేసిన వ్యక్తి హనుమే. సత్యభామయొక్క గర్వభంగం చేసిన వారు కూడా హనుమే. సత్యభామకి చాలా అహంకారం ఉండేది నా అంత అందగత్తె లేదు ప్రపంచంలో అని. అందమునందు ఆవిడకున్న అతిశయమును పోగొట్టాలి అని అనుకున్నారు కృష్ణ పరమాత్మ. భర్తే పోగొడితే అంత మర్యాదగా ఉండదు. కొంచెం కఠినంగా మాట్లాడవలసి వస్తుంది.




అందుకని కృష్ణ భగవానుడు చతురుడు గనుక హనుమకి కబురు చేశారు. గరుడుడు వెళ్ళి చెప్పాడు కృష్ణుడు నిన్ను దర్శనానికి రమ్మంటున్నారు అని. కృష్ణుడితో మాకేం పని? మేము రామ దర్శనమైతేనే చేస్తాం అన్నారు. ఆయనకి రామావతారమునండు ఉన్న ప్రీతి అటువంటిది. రాముడే పిలుస్తున్నారు అని మళ్ళీ కబురు చేశారు. ఇందులో అంతర్భాగంగా గరుడ గర్వభంగం కూడా చేశారాయన. గరుడ అనుకున్నాడు నా అంత వేగంగా హనుమ ఎక్కడ వెళతాడు. చాలా వృద్ధుడు ఆయన. నా వీపున కూర్చోండి. స్వామి దర్శనానికి తీసుకు వెళతాను అన్నారు.




నా స్వామా పిలిచినది అని ఒక్క దూకు దూకారు. గరుడుడి కన్నా వేగం ఉన్నవారు ఉండరు కదా! గరుత్మంతుడు ఆశ్చర్యంగా చూసేసరికి వెళ్ళిపోయాడు.




వెనక గరుత్మంతుడు లోపలికి వచ్చాడు. సుదర్శనుడు అడ్డు వచ్చి లోపల ఉన్నది కృష్ణుడు, నా అనుమతి లేకుండా వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు. ఈయనెవరు నాకు అడ్డురావడానికి? అని చటుక్కున చేత్తో పట్టుకొని నోట్లో వేసుకొని మ్రింగేసి లోపలికి వెళ్తే కృష్ణుడు రాముడిలా దర్శనమిచ్చారు ఆయనకి. వెంటనే రాముని పాదములపై పడి కన్నీటితో అభిషేకం చేసి ప్రక్కకి చూశారు మా అమ్మ సీతమ్మ పాదాలు ఏవి? అని. సత్యభామాదేవి నిలబడి ఉంది. స్వామీ! ప్రక్కన అమ్మ కదా ఉండాలి. దాసీ ఉన్నదేమి? అని అడిగారు.




సత్యభామ ఆశ్చర్యపోయింది. కృష్ణ భగవానుడు ఈమె దాసీ కాదు. ఈ అవతారమునందు నా పత్ని. నీ అమ్మ సీతమ్మ రుక్మిణీ అంశతో ఉన్నది అన్నారు. హనుమా! నువ్వు లోపలికి వచ్చేటప్పుడు నిన్ను ఎవరూ అడ్డగించలేదా? అని అడిగాడు కృష్ణుడు. ఎవరో సుదర్శన చక్రమట, నువ్వెలా లోపలికి వెళ్తావు అన్నాడు స్వామీ! అడ్డు వస్తోందని మింగేశాను అని ఒక త్రేనుపు తేన్చి వదిలేశాడు. అప్పుడు సుదర్శన చక్రానికి కూడా గర్వభంగం అయింది. అప్పుడు వచ్చాడు గరుత్మంతుడు




హనుమ ఇటు వచ్చాడా? అని. తెల్లబోయి చూశాడు. గరుత్మంతా ! చూశావా హనుమ వేగం అన్నారు. నన్ను మించిన వేగం లేదు అనుకొనేవాణ్ణి స్వామీ. ఇంతమందికి ఏక కాలంలో పాఠం చెప్పేశాడు. ద్వాపర యుగం వరకు గర్వభంగం చేస్తూ ఉద్ధరించినటువంటి మహోత్కృష్ట మైనటువంటి స్వరూపం హనుమయొక్క స్వరూపం.




హనుమద్వ్రత మహత్యం




ఒకనాడు చంద్రవంశంలో సోమదత్తుడు అని ఒక రాజు జన్మించాడు ఆయనకు రాజ్య బ్రష్టత్వం వచ్చింది ఆ కాలంలో అప్పటికప్పుడు విజయం కలగాలంటే ఏ వ్రతం చేయాలని అనుకుంటుండగా అనుకోకుండా మార్గశిర శుద్ధ త్రయోదశి వచ్చింది వెంటనే రాజు గారు పంపానదీ తీరాన పరమ భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించారు




హనుమద్వ్రతం చేసిన ఉత్తర క్షణంలో హనుమయొక్క అనుగ్రహం కలిగి అపారమైన సైన్యం అక్కడికక్కడ దొరికింది. అరణ్యంలో ఉన్న వీరులందరూ తోడు వచ్చారు. తన రాజ్యాన్ని తాను పొందాడు. ఇలా వ్రతం చేశాడు, సాయంత్రానికి మూర్ధాభిషిక్తుడైపోయాడు. ఆనాటి నుంచి చంద్రవంశ ప్రభువైన సోమదత్తుడు చేసి ఫలితమును పొందిన మహోత్క్రుష్టమైన వ్రతము హనుమద్వ్రతము.




ఈ వ్రతము చేయడం ఎంత ముఖ్యమో వ్రతముయొక్క ప్రసాదమును స్వీకరించడం కూడా అంతే ముఖ్యం ఇవాల్టి రోజున ప్రసాద వితరణ చేయకుండా ఉండకూడదు. ఇవాళ ప్రసాదం కళ్ళకద్దుకొని నోట్లో వేసుకుంటే హనుమద్వ్రతాన్ని పరిపూర్ణముగా చేసినటువంటి ఫలితము వచ్చేస్తుంది.

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS