Monday, December 18, 2017

*గాయిత్రి మంత్రము-ప్రత్యేకత



*గాయిత్రి మంత్రము-ప్రత్యేకత*


హిందూమతంలో పూజలలోమంత్రోచ్ఛారణకు ఉన్న ప్రాముఖ్యత ఎంతో గొప్పది. దేవాలయాలలో ఆ దైవాన్ని పూజిస్తూ పూజారులు ఎంతో భక్తి శ్రద్ధలతో మంత్రోచ్ఛారణ చేయడాన్ని మీరు గమనించే ఉంటారు. అసలు ఈ మంత్రాలను ఎందుకు వల్లిస్తారు? ఈ విషయాన్ని ఎప్పుడైనా ఆలోచించారా? అసలు, వేరు వేరు దేవతలకు వేరు వేరు మంత్రాలెందుకుంటాయి? వివిధ మంత్రాలలో ఉండే బేధాలేమిటి? ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, దేవుడి సన్నిధిలో పఠించే మంత్రాలకు ఎంతో ప్రభావం ఉందట.

సంస్కృత భాషలోనే మంత్రాలు ఉంటాయి. మంత్రంలోని ఉపయోగించే ప్రతి అక్షరానికి ప్రత్యేక ధ్వని ఉంటుంది. సంస్కృత మంత్రాలను పఠించడంలో జాగ్రత్త వహించాలి. ప్రతి అక్షరాన్ని జాగ్రత్తగా పలకాలి. మంత్ర పఠన మీలో శక్తిని, బలాన్ని కలిగించడానికి తోడ్పడుతుంది. మంత్రాలలో ఉండే అక్షరాలు కలిగించే ప్రతి ధ్వని మానవుల మానసిక స్థితిపై ప్రభావాన్ని చూపుతాయి. పచ్చటి ఆకుల మీంచి వీచే చల్లని పిల్లగాలి వల్ల మనకు కలిగే ఆహ్లాదం, గలగలమని పారే సెలయేరు ధ్వని మనకు కలిగించే హాయి, ఉరుములు, మెరుపుల వల్ల కలిగే బాధ, భయం ఎలా కలుగుతాయో అలాగే మంత్రోచ్ఛారణ ద్వారా వచ్చే ధ్వని మన హృదయాన్ని ప్రభావితం చేస్తుంది.

మంత్రాలను చదవడం వల్ల మనలోనున్న చైతన్యం అత్యున్నత స్థాయికి చేరుకుంటుంది. జీవితంలోని లక్ష్యాలను చేరుకోవడానికి ఇవి ఉత్ప్రేరకాలుగా ఉపయోగపడతాయి. వ్యాధులను నిరోధించే శక్తి మంత్రాలకు ఉంది. చెడు శక్తులను దూరంగా తరిమేయగల శక్తి మంత్రాలకు ఉంది. సంపదను చేకూర్చే శక్తి అలాగే సూపర్ న్యాచురల్ శక్తులను పెంపొందించే శక్తి మంత్రాలకుంది. ఆనందకరమైన స్థితికి తీసుకువెళ్ళే శక్తి మంత్రాలను చదవడం ద్వారా సిద్ధిస్తుందని గమనించాలి.

అటువంటి శక్తివంతమైన మంత్రాలలో ప్రథమ స్థానం గాయత్రీ మంత్రానికి ఉంది. గాయత్రీ మంత్రంలో అత్యద్భుతమైన స్వస్థతను ప్రసాదించే శక్తి ఉంది. మానవులలో మూడు రకాలుగానున్న చైతన్య వ్యవస్థపై ఈ మంత్రం చూపించే ప్రభావం అనిర్వచనీయం. నిద్రావస్థ, స్వప్నావస్థ, మేలుకుని ఉన్నప్పుడు ఇలా మూడు రకాల చైతన్య వ్యవస్థలపై గాయత్రీ మంత్ర ప్రభావం ఎంతో ఉంది. మరి గాయత్రీ మంత్రంలోనున్న అద్భుతమైన హీలింగ్ పవర్స్ గురించి తెలుసుకోవాలని ఉందా? తెలుసుకుందాం మరి.


ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం

భర్గో దేవస్య ధీమహి దియోయోనః ప్రచోదయాత్

*భావం*

'మాలోనున్న అంతరఃచైతన్యాన్ని మేల్కొలపడానికి ఆధ్యాత్మిక జ్ఞానం అనబడే అత్యంత ప్రకాశవంతమైన దైవికమైన, పూజ్యమైన సూర్యకాంతిలో ధ్యానం చేస్తున్నాము' అని అర్థం.

గాయత్రీ మంత్రం యొక్క ప్రాముఖ్యతను 'గాయత్రీ' అనే పదమే వివరిస్తుంది. సంస్కృత భాషలో 'గయంతం త్రియతే ఇతి' అనే పదం నుంచి గాయత్రీ అనే పదం ఉద్భవించింది. ఈ మంత్రాన్ని చదివిన వారు అనేక రకాల బాధల నుంచి విముక్తులవుతారని ఈ పదానికి అర్థం. గాయత్రీ మంత్రంలోని ప్రతి పదానికి అర్థాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

ఓం - ఓ బ్రహ్మ లేదా ఓ దైవమా

భూహ్ - కీలక ఆధ్యాత్మిక శక్తి స్వరూపిణి

భువః - బాధలను నశింపచేసే

స్వః - ఆనంద స్వరూపులు

తత్ - ఆ

సవితుర్ - సూర్యుడి వంటి ప్రకాశవంతమైన

వరేణ్యం - అత్యున్నత

భర్గో - పాపాలను నశింపచేసే

దేవస్య - దైవికమైన

ధీమహి - ఇమిడించుకొని

ధియో - తెలివి

యో - అయిన

నః - మన

ప్రచోదయాత్ - స్ఫూర్తి

వేదాలలో గాయత్రీ మంత్రం యొక్క మూలం ప్రస్తావించబడి ఉన్నది. అత్యంత శక్తివంతమైన మంత్రంగా గాయత్రీ మంత్రాన్ని పేర్కొంటారు. ఈ మంత్రానికున్న అపూర్వ శక్తుల వల్ల ఈ మంత్రం కొన్నేళ్ళపాటు యోగులు, గురువులచే రహస్యంగానుంచబడింది.
ఈ మంత్రాన్ని ఉచ్ఛరించడం వల్ల కలిగే స్పందనలు ఎన్నో లాభాలను చేకూరుస్తోంది
1. అడ్డంకులను తొలగిస్తుంది
2. ప్రమాదాల నుంచి రక్షిస్తుంది
3. అజ్ఞానాన్ని తొలగిస్తుంది
4. ఆలోచనలకు పవిత్రతనిస్తుంది
5. సంభాషణా నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది
6. మనో నేత్రాన్ని తెరిపిస్తుంది
గాయత్రీ శక్తి అనే శక్తి కేంద్రం తేజం, విజయం, విజ్ఞానం అనే మూడు ముఖ్య శక్తులకు కేంద్రబిందువు. గాయత్రీ మంత్రాన్ని ఉచ్ఛరించినప్పుడు ఈ మూడు రకాల శక్తులు మీలో స్పష్టంగా కనిపిస్తాయి. మీకు దీవెనలు అందించే శక్తిని ప్రసాదిస్తుంది. మీరు ఎవరినైతే దీవిస్తారో వారికి కూడా ఈ శక్తి ప్రాప్తిస్తుంది. మీ తెలివితేటలకు పదును పెట్టి మీ జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది.
గాయత్రీ మంత్రాన్ని పఠించడానికి ఉషోదయం మరియు సంధ్యాసమయం ఉత్తమమైనవి. ఈ సమయాలలో వెలుగు, చీకటి పూర్తిగా ఉండవు. ఈ వేళలలో మనస్సు ఒక రకమైన అపస్మారక స్థితికి చేరుతుంది. మన ఆత్మపై మనం దృష్టి సారించడానికి అనుకూల వేళలివి. మనస్సు త్వరగా గందరగోళస్థితికి చేరుతుంది. ఈ సమయంలో గాయత్రీ మంత్రాన్ని పఠించడం ద్వారా బద్దకాన్ని వదిలించుకుని, నిశ్చలస్థితికి చేరుకోవచ్చు. తద్వారా ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. క్రమం తప్పకుండా గాయత్రీ మంత్రాన్ని పఠిస్తే మీలో సానుకూల పరిస్థితి పెంపొందుతుంది. తద్వారా, ఎల్లవేళలా ఉత్సాహవంతంగా, ఉల్లాసంగా ఉంటారు.

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS