Friday, December 15, 2017

"శనిత్రయోదశి"


"శనిత్రయోదశి" .
అమావాస్య ముందు
శనిత్రయోదశి మరియు అనురాధ నక్షత్ర యుక్త శని త్రయోదశి కావడంతో విశేష మైనది గా చెప్పవచ్చు.
వృషభ , కన్య ,వృశ్చిక, ధనస్సు, మకర రాశుల వారు వరుసగా "అష్టమ" , "అర్ధాష్టమ" , " ఏలినాటి శని " లతో బాధ పడుతున్న వారు.
ఉదయం "శన్యూష కాలంలో" అనగా తెల్లవారుజామున 5 to 6:30  మధ్యకాలంలో  లేదు " శని హోరలో"  అనగా ఉదయం 6:30 to 7:30  మద్యకాలంలో రుద్రాభిషేకం చేసిన మంచి ఫలితాలు పొందవచ్చు.
సాయంత్రం "ప్రదోష వేళలో " అనగా 5:30 to 6:30 మధ్య కాలంలో  శివాలయం లో " నువ్వల నూనె " తో దీపారాధన చేసిన ఉన్నతమైన ఫలితాలు పొందుతారు.
శని త్రయోదశి
త్రయోదశి శనివారం నాడు వస్తే ఆ రోజును శని త్రయోదశిగా వ్యవహరిస్తారు.
శనివారం శ్రీమహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన రోజు. అలాగే త్రయోదశి పరమేశ్వరునికి ఇష్టమైన దినం. అందుకనే త్రయోదశి శనివారం నాడు వస్తే శివ కేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన దినమని పెద్దలు పేర్కొంటారు. సూర్యభగవానునికీ, ఆయన సతి ఛాయాదేవికి కలిగిన సంతానమే శనిదేవుడు. అందుకే ఆయనను సూర్యపుత్రడు అనీ, ఛాయాసుతుడు అనీ పిలుస్తారు.
ఈ శని గ్రహం ఒకో రాశిలోనూ దాదాపు రెండున్న సంవత్సరాల పాటు సంచరిస్తూ 12 రాశులనీ చుట్టుముట్టడానికి దాదాపు 30 సంవత్సరాలు పడుతుంది. ఇంత నిదానంగా సంచరిస్తాడు కాబట్టి ఈయనకు మందగమనుడు అన్న పేరు కూడా ఉంది. రాశిచక్రంలో ఆయన ఉండే స్థానాన్ని బట్టి ఫలితాలు కూడా వేర్వేరు విధాలుగా ఉంటాయి. అందుకే జాతకరీత్యా శని ప్రభావం అధికంగా ఉన్నప్పుడు, వీలయినంత తక్కువ శ్రమతో ఆ ప్రభావాన్ని కలిగించమంటూ భక్తులు శనీశ్వరుని వేడుకుంటారు.  స్థితి, లయకారులిద్దరికీ ఇష్టమైన రోజుగా శనిత్రయోదశి స్థిరపడింది.
ఈ శని త్రయోదశి ప్రాముఖ్యతని మరింతగా వివరించేలా ఒక గాథ కూడా ప్రచారంలో ఉంది. ఒకానొక సందర్భంలో కైలాసాన్ని చేరుకున్న నారదుడు, శివుని ముందు శని భగవానుని గురించి పొగడటం మొదలుపెట్టాడట. ఎంతటివారైనా ఆ శని ప్రభావం నుంచి తప్పించుకోలేరంటూ చెప్పసాగాడు. ఆ మాటలను విన్న శివునికి ఒళ్లు మండిపోయింది.
‘శని ప్రభావం ఎవరి మీద ఉన్నా లేకున్నా, నా మీద మాత్రం పనిచేయదు’ అంటూ హుంకరించాడు. నారదుడు యథాప్రకారం ఆ మాటలను శనిదేవుని వద్దకు మోసుకువెళ్లాడు.‘నా ప్రభావం నుంచి తప్పించుకోవడం ఎవరి తరమూ కాదు. ఇది సృష్టి ధర్మం,’ అంటూ కోపగించిన శనిభగవానుడు, శివుని ఫలానా సమయంలో పట్టిపీడించి తీరతానంటూ శపథం చేశాడు. శని శపథం గురించి విన్న శివునికి ఏం చేయాలో పాలుపోలేదు. ఆ శని మాట నెరవేరితే, తన ప్రతిష్టకే భంగం కదా అనుకున్నాడు. అందుకే శని చెప్పిన సమయానికి అతని కంటపడకుండా ఉండేందుకు భూలోకంలోని ఒక చెట్టు తొర్రలో దాక్కొన్నాడు. మర్నాడు కైలాసంలో ఉన్న శివుని చెంతకి శనిభగవానుడు చేరుకున్నాడు. వినమ్రంగా తన ఎదుట నిలిచిన శనిని చూసి ‘నన్ను పట్టి పీడిస్తానన్న నీ శపథం ఏమైంది’ అంటూ పరిహసించాడు పరమేశ్వరుడు. దానికి శని ‘ప్రభూ! ఈ ముల్లోకాలకూ లయకారుడవైన నువ్వు పోయి పోయి ఆ చెట్టు తొర్రలో దాక్కొన్నావే! అది నా ప్రభావం కాదా. దీన్ని శని పట్టడం అనరా?’ అన్నాడు చిరునవ్వుతో.
శనిదేవుని మాటలు శివునికి విషయం అర్థమైంది. ‘ఈ రోజు నుంచి శనిత్రయోదశి నాడు ఎవరైతే నిన్ను అర్చిస్తారో వారు నీ అనుగ్రహంతో పాటుగా, నా అభయానికి కూడా పాత్రులవుతారు. ఇక నుంచి నువ్వు శనీశ్వరుడు అన్న పేరుతో కూడా వెలుగొందుతావు’ అంటూ శనిని ఆశీర్వదించాడు పరమశివుడు. అప్పటి నుంచి త్రయోదశినాడు వచ్చే శనివారం రోజున, భక్తులు నువ్వుల నూనెతో శనీశ్వరుని అభిషేకించి, తమని చూసీచూడనట్లుగా సాగిపొమ్మని వేడుకుంటున్నారు.
శని త్రయోదశి తిథి నాడు ఏంచేయాలి
నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రహం
ఛాయా మార్తాండ సంభూతం నమామి శ్రీశనైశ్చరం. ఈ శ్లోకం పఠించడం వలన అంతా మంచే జరుగుతుంది.  ఇతని వాహనం కాకి, నలుపు, నీలివర్ణాలు ఈయనకు ఇష్టమైనవి. జిల్లేడు ఆకులు, తిలలు, తైలాభిషేకం ఇష్టం. వీటితో ఈ రోజు పూజించడం వలన శనిదేవుడికి ప్రీతిపాత్రుమవచ్చు. శని భార్య జ్యేష్ఠాదేవి. సర్వ జీవరాశిని సత్యమార్గంలో నడిపించడానికి శని అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి.
దానధర్మాలతో, సత్యాహింసలను ఆచరిస్తూ పవిత్రంగా మానవ ధర్మాన్ని అనుసరించేవారికి శని ఎల్లప్పుడూ అండగా ఉండి శుభాలు కలిగిస్తాడని, ఆ కారణంగా ఎవరినీ బాధించడని పురాణాలు వివరిస్తున్నాయి. శని బాధలు ఆయా మానవుల పూర్వ కర్మ ఫలాలే. వారి వారి కర్మలను అనుసరించి ఆయా వ్యక్తులను ప్రేరేపించి వారితో ఆ కర్మ ఫలితాలను సిద్ధింపజేస్తాడు. అయితే అనాదిగా శనీశ్వరుడంటే పీడించి కష్టనష్టాలు కలిగించే వాడనే భావం ప్రబలంగా ఉంది. కానీ శని దూషణ కూడదు. శనీశ్వర దూషణ సర్వదేవతా దూషణ. శని కృప సకల దేవతాకృపతో సమానం. కాగా త్రయోదశి తిథి, శనివారం శనికి ప్రీతికరమైనవి. శనీశ్వరునికి మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు తైలాభిషేకం శ్రేష్ఠమైనదంటారు.
అలాగే ప్రతి నెలా వచ్చే త్రయోదశి తిథినాడు తిలదానం కూడా ప్రశస్తమని చెబుతారు. దశరథుడు, నల మహారాజు, పరీక్షిత్తు, ధర్మరాజు మొదలైనవారు కష్టాల్లో శనిని పూజించి భక్తితో తరించారని కథనాలు ఉన్నాయి. లోహమయమైన శని ప్రతిమను తైలంగల పాత్రలో ఉంచి నల్లని వస్త్రాన్ని కప్పి గంధం, నీలి పుష్పాలు, తిలాన్నాలతో పూజించి ప్రతిమను దానం చేయాలి. కోణస్థ, పింగల తదితర శనిదశనామాలను రావిచెట్టు వద్ద జపిస్తే శని బాధ కలగదని విశ్వాసం. శనిత్రయోదశి అయిన నాడు శనీశ్వరుడిని భక్తి శ్రద్ధలతో పూజించి ఆయన అనుగ్రహం పొందుదాం.!
‘‘ నీలాంజన సమాభాసం.. రవిపుత్రం యమాగ్రజమ్‌..
ఛాయా మార్తాండ సంభూతం.. తం నమామి శనైశ్చరమ్‌’’
  ఈ శ్లోకాన్ని పఠిస్తే మంచిది.శుభ..వందనాలు..!! శని త్రయోదశి.! ఏలినాటి శని..అష్టమ శని ..       అర్దాస్టమ శని..శని మహర్దశ.. శని అంతర్దశ జరుగుతున్నవారు..శనికి తైలాభిషేకం.. చేయించుకుని...దశరధ ప్రోక్త శని స్తోత్రం..పఠించండీ...
యోగకరకుడైన..శని గురించి భయపడవలిసిన అవసరం లేదు..ఆయన్ని.. స్మరిస్తూ ఉంటే..మన జోలికి రారు..!!
ఆ కథ....
శని క్రూరదృష్టి ప్రభావాన్ని దేవతల గురువు సైతం అనుభవించాడు...
పూజలు, స్తోత్రాలు ఇన్ని చేస్తున్నాం కదా.. మరి వాటితో శనిని ఆపలేమా.. అని అనుకొనే వారు కూడా ఉంటారు. ఇలాంటి వారికి ఓ సమాధానం ఇస్తుంది సూర్య పురాణం ఎనిమిదో అధ్యాయంలో ఉన్న శని గురుకుల వాసం అనే కథ. జాతకంలో శని ప్రభావాన్ని శనికి గురువైన బృహస్పతి ఆపగలిగాడా లేదా అని అంటే ఇదిగో ఆ కథంతా ఇలా వివరిస్తుంది.
ఎంతటి వారైనా సరే... చివరకు దేవతల గురువైనా సరే.. కాలానికి అతీతంగా ఉండటం సాధ్యం కాదు. జ్యోతిష్య శాస్త్రంలో కాలానుగుణంగా శనిలాంటి గ్రహాల ప్రభావం ఉంటుంది. ఆ శని ప్రవేశాన్ని నిరోధించి హాయిగా ఉండే అవకాశం ఏదైనా లభిస్తే బాగుండునని అనుకొంటుంటారు. అలా నిరోధించటమంటే కాలాన్ని నిరోధించటమే. కాని అది సాధ్యమయ్యేది కాదు.
ఛాయాదేవికి, సూర్య భగవానుడికి జన్మించిన శని మెల్లమెల్లగా పెరిగి పెద్ద వాడయ్యాడు. విద్యాభ్యాసం చేసే వయసొచ్చింది. ఓ రోజున శని సూర్యుడి దగ్గరకు వెళ్ళి తనకు విద్యలన్నింటిలోకీ గొప్పదైన దాన్ని నేర్పే గురువెవరో చెప్పమన్నాడు. అప్పుడు సూర్యుడు బ్రహ్మవిద్యను నేర్పటంలో బృహస్పతిని మించిన వాడు మరొకరు లేరని, ఆయన గొప్పతనానికి ప్రతిఫలంగా వాచస్పతి అనే బిరుదును కూడా పొందారని అన్నాడు.
బృహస్పతి తన దగ్గరకు వచ్చిన శిష్యులందరికీ అన్న వస్త్రాలను ఇచ్చి మరీ చదువు చెబుతుంటారని, కనుక ఆయన దగ్గరకు నిజ రూపంలో వెళితే ప్రవేశం దొరక్కపోవచ్చని, అందుకని ఓ బ్రాహ్మణ బాలకుడిలా మాయా రూపాన్ని ధరించి వెళ్ళమన్నాడు.
తండ్రి సూచన ప్రకారం శని బృహస్పతి దగ్గరకు వెళ్లాడు. తాను కపిల మహర్షి వంశానికి చెందిన వాడినని చెప్పుకొని అక్కడ చోటు సంపాదించాడు. ఎంతో బుద్ధిగా గురువు చెప్పింది చెప్పినట్టు ఇట్టే నేర్చుకోసాగాడు. ఇతర విద్యార్థులందరికన్నా ఎంతో ముందుగా పాఠ్యాంశాలు అప్పచెప్పుతుండేవాడు.
బ్రహ్మ విద్యను అంత తొందరగా నేర్చుకున్న శిష్యుడిని చూసి ముచ్చటపడ్డ గురువు శనికి తంత్ర శాస్త్రాన్ని కూడా నేర్పించాడు. అలా విద్య పూర్తయిన తర్వాత శిష్యుడు గురువుకు గురుదక్షిణ ఇచ్చే సమయం వచ్చింది.
అప్పుడు ఆ గురుశిష్యుల సంభాషణలో శిష్యుడి మాటలు, రూపంలో కపటం కనిపించటంతో గురువుకు అనుమానం వచ్చింది. అప్పుడాయన తనకు వేరే గురుదక్షిణ ఏదీ అక్కర లేదని అతడెవరో, తల్లిదండ్రులెవరో వాస్తవం చెపితే సరిపోతుందన్నాడు.
అప్పుడు శని ఉన్నది ఉన్నట్టు సత్యం చెప్పాడు. ఆ మాటలు వినగానే బృహస్పతికి గుండె ఝల్లుమంది. గురు దక్షిణగా అప్పటికప్పుడు తానొకటి అడుగుతున్నానని అది ఇవ్వమని కోరాడు. ఏం కావాలో చెప్పమన్నాడు శిష్యుడు.
తన జీవితంలో శని క్రూర దృష్టి ఎప్పుడూ తన మీద పడకూడదని, అదే తాను కోరే గురుదక్షిణ అన్నాడు బృహస్పతి. అప్పుడు శని గురువుకు నమస్కరిస్తూ అదంతా జాతకంలో కాలానుగుణంగా జరిగే వ్యవహారమని, బ్రహ్మ రాసిన రాత అనుగుణంగా జరుగుతూ ఉంటుందని, తన ప్రవేశాన్ని జాతకంలో నిరోధించటం సాధ్యపడదని అన్నాడు.
అయితే తన ప్రభావం ఉన్న రోజుల్లో తనను పూజించటం, అర్చించటం వల్ల చెడు పరిణామాల నుంచి తప్పించుకోవచ్చని అన్నాడు
. బృహస్పతి జాతకంలో కూడా ఎప్పుడో ఒకప్పుడు తన ప్రభావం ఉంటుందని, దానివల్ల కష్టాలు కలుగుతాయని, అయితే అప్పుడు అధైర్యపడక తనను స్మరిస్తే తాను ఆ ఆపదలను పోగొడతానని చెప్పి అంతర్ధానమయ్యాడు శని
ఆ తర్వాత బృహస్పతి ఏదో లెక్కలు కట్టి తన జాతకంలో ఏ గ్రహ ప్రభావం ఎప్పుడు ఉంటుందోనని కొంతకాలం పాటు చూసుకున్నాడు. కానీ ఆ తర్వాత మామూలుగానే కాలం గడపసాగాడు. ఇంతలో ఆ గురువు జాతకంలో శని ప్రవేశించాడు.
ఓ రోజున ఆయన పూజా ద్రవ్యాల కోసం అడవికి వెళ్ళాల్సి వచ్చింది. ఒక పెద్ద పూల బుట్టలాంటిది తీసుకుని బయలుదేరి వెళ్ళాడు. అదే సమయానికి వీరబాహువు అనే రాజు కూడా ఆ అడవికి వేటకొచ్చాడు. ఆ రాజు తన వెంట పసివాడైన తన కుమారుడిని కూడా తెచ్చుకున్నాడు.
ఒకచోట ఉయ్యాల కట్టించి ఆ ఉయ్యాలలో రాకుమారుడిని ఉంచి సైనికులను చుట్టూ కాపలా ఉంచి వేట ప్రయత్నంలో ఉన్నాడు వీరబాహువు. కాసేపాగి చూసేసరికి ఉయ్యాలలో బాలుడు కనిపించలేదు. అన్ని చోట్లా వెతికిస్తుంటే పువ్వులు కోసుకుని ఆశ్రమానికి వెళుతున్న బృహస్పతి సైనికుల కంటపడ్డాడు. ఆయన చేతిలో ఉన్న పెద్ద పూల సజ్జ నుంచి రక్తపు బొట్లు పడుతున్నాయి. సైనికులు ఆయనకు నమస్కరించి అదేమిటని అడిగారు.
బృహస్పతి బుట్టలో చూసేసరికి గొంతు తెగిన పసి బాలుడు ఉన్నాడు. అదంతా ఏమిటో తనకర్థం కావటం లేదని గురువు అన్నాడు. భటులు రాజుకు విషయమంతా చెప్పారు. మంత్రి మండలి బృహస్పతి ఉత్తముడని, అలాంటి నీచకార్యం చేశాడంటే తాము నమ్మలేక పోతున్నామన్నారు. అయినా సాక్ష్యం ఉంది కనుక శిక్ష తప్పదు కదా అని అనుకొనేంతలో బృహస్పతికి శని విషయం గుర్తుకొచ్చింది. వెంటనే శనిని స్తుతించాడు.
అప్పుడాయన అక్కడ ప్రత్యక్షమై రాజుకు విషయం వివరించి తన ప్రభావం వల్లనే అలా జరిగిందని గురువును శిక్షించక సత్కరించి పంపించమన్నాడు. తన మాట ప్రకారం నడుచుకొని తనకు పూజలు చేస్తే ఆ రాజుకు, ప్రజలకు మేలు జరుగుతుందన్నాడు. రాజు శనీశ్వరుడి ఆజ్ఞను అనుసరించాడు.
ఈ కథా సందర్భంలో కాలచక్రంలో కష్టసుఖాలనేవి తప్పవని, అయితే కష్టాలొచ్చినప్పుడు ధైర్యంగా నిలబడి దైవ పూజలు, స్తుతులతో దైవబలాన్ని పొంది కష్టాలను అధిగమించాలన్న ఓ సూచన కనిపిస్తుంది...

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS