Tuesday, December 12, 2017

విష్ణువు ధరించిన 21 అవతారాలను "ఏకవింశతి "అవతారముల




ఓం నమో నారాయణాయ...\!/

ఓం నమో వెంకటేశాయ నమః...\!/

లోకపాలనకై విష్ణువు ధరించిన 21 అవతారాలను "ఏకవింశతి "అవతారములు అంటారు.

21 అవతారాలు

మహాభాగవతం ప్రధమ స్కంధంలో ఈ 21 అవతారాల గురించి క్లుప్తంగా చెప్పబడింది. తరువాత వివిధ స్కంధాలలో ఆయా అవతారాల గాథలు వివరంగా తెలుపబడ్డాయి. అవతారాలు లీలావతారాలు, అంశావతారాలు, పూర్ణావతారాలు అని వివిధ వర్ణనలతో ప్రస్తావించ బడుతాయి. ఆయా అవతారంలో భగవంతుడొనర్చిన కార్యం లేదా ప్రదర్శించిన అంశనుబట్టి ఈ విభాగం చెప్పబడుతుంది.

శౌనకాది మహర్షులకు సూత మహర్షి ఇలా చెప్పాడు అన్ని అవతారాలకు ఆది అయిన శ్రీమన్నారాయణుడు పరమ యోగీంద్రులకు దర్శనీయుడు. ఈ అవతారాన్ని విరాడ్రూపమనీ అంటున్నారు. సకల సృష్టికీ, అవతారాలకూ ఈ మూర్తియే మూలం, అవ్యయం, నిత్యం, శాశ్వతం.

బ్రహ్మ అవతారము: 1

దేవదేవుడు కౌమార నామంతో అవతరించి బ్రహ్మణ్యుడై దుష్కరమైన బ్రహ్మచర్యం పాటించాడు.
వరాహ అవతారము: రసాతలంలోకి కృంగిపోయిన భూమిని యజ్ఞవరాహమూర్తియై ఉద్ధరించి సృష్టి కార్యాన్ని సానుకూలం చేశాడు.

నారద అవతారము: 2

దేవ ఋషియైన నారదునిగా అవతరించి సమస్త కర్మలనుండి విముక్తిని ప్రసాదించే పాంచరాత్రమనే వైష్ణవ తంత్రాన్ని తెలియజేశాడు.

నర నారాయణ అవతారము: 3

ధర్ముని పత్నియందు నరనారాయణ రూపంలో అవతరించి అనన్యసాధ్యమైన తపమును ఆచరించాడు. స్వానుష్టానపూర్వకంగా శమదమాల తత్వాన్ని లోకానికి ఉపదేశించాడు.

కపిల అవతారము: 4

నరనారాయణులు బోధించిన తత్వం కాలగర్భంలో కలిసిపోయింది. అపుడు దేవదేవుడు కపిలుడనే సిద్ధునిగా అవతరించి అసురి అనే బ్రాహ్మణునకు తత్వ విర్ణయం కావించగల సాంఖ్యయోగాన్ని ఉపదేశించాడు.

దత్తాత్రేయ అవతారము:5

భగవానుడు అత్రి అనసూయా దంపతులకు పుత్రుడై జన్మించి దత్తాత్రేయునిగా ప్రసిద్ధుడయ్యాడు. అలర్క మహారాజుకు, మరికొందరు బ్రహ్మవాదులకూ ఆత్మవిద్యను బోధించి ఆశాస్త్రాన్ని ఉద్ధరించాడు. జీవాత్మ, పరమాత్మల తత్వాన్ని వివరించే ఆ తత్వవిద్యకు "అన్వీక్షకి" అని పేరు.

యజ్ఞుడుయజ్ఞ అవతారము:6

భగవంతుడు రుచి మహర్షికి ఆకూడి కడుపున యజ్ఞుడనే పేరుతో జన్మించాడు. యమాది దేవతలతో కలిసి స్వాయంభువ మన్వంతరాన్ని రక్షించాడు.

ఋషభ అవతారము: 7

భగవానుడు అగ్నీధ్రుని కొడుకు నాభికి మేరు దేవియందు జన్మించి (ఉరుక్రముడనే పేరుతో ప్రసిద్ధుడై?) విద్వాంసులైనవారికి సర్వాశ్రమ పూజితమైన పరమహంస మార్గాన్ని ఉపదేశించాడు.

పృధు అవతారము: 8

పృథువు అనే చక్రవర్తిగా ధేనురూపం ధరించిన భూమినుండి ఓషధులను పితికి లోకాలను పోషించాడు. ఆహార యోగ్యాలయిన సస్యాదులను, ఓషధులను భూమిమీద మొలిపించాడు. ఋషులకు సంతోషం కలిగించాడు.

మత్స్య అవతారము: 9

చాక్షుష మన్వంతరం సమయంలో ప్రళయకాలంలో మహామీనావతారుడై వైవస్వత మనువును, ఓషధులను, జనులను ఆ నావ ఎక్కించి ఉద్ధరించాడు.

కూర్మ అవతారము: 10

దేవదానవులు క్షీరసాగర మథనం చేస్తుండగా మునిగిపోతున్న మందరగిరిని ఉద్ధరించాడు.

ధన్వంతరీ అవతారము: 11

అమృత కలశాన్ని ధరించి వచ్చినవారికి అందించాడు.

మోహినీ అవతారము:12

జగన్మోహినియై అమృతం దేవతలకు మాత్రం అందేలా చేశాడు.

వరాహావతారం:13

వరాహావతారం హిరణ్యక్షుడిని చంపి, భూమిని ఉద్ధరించి, వేదములను కాపాడిన అవతారము . రాక్షసునితో భయంకరంగా యుద్ధం చేసి, చక్రాయుధంతో వానిని సంహరించి, భూమాతని జలము పై నిలిపిన స్వామి, వేదాలను రాక్షసుల బారినుండి రక్షించిన స్వామి.

నృసింహ అవతారము:14

లోకకంటకుడైన హిరణ్యకశిపుని సంహరించడానికి, భక్తుడైన ప్రహ్లాదుని కాచుటకు శ్రీనారసింహమూర్తియై ఉక్కు స్తంభం నుండి బయలువెడలినాడు.

వామన అవతారము:15

కపట వామనమూర్తియై బలిచక్రవర్తినుండి మూడడుగుల నేలను యాచించి, త్రివిక్రముడై ముల్లోకాలను ఆక్రమించాడు.

పరశురామ అవతారము:16

మదోన్మత్తులై, బ్రాహ్మణ ద్రోహులైన క్షత్రియులపై ఇరవైఒక్క మారులు దండెత్తి వారిని దండించాడు.

వ్యాస అవతారము: 17

కృష్ణ ద్వైపాయనుడై ఒక్కటిగా ఉన్న వేదరాశిని విభజించాడు.

రామ అవతారము:18

పురుషోత్తముడైన శ్రీరాముడై రావణసంహారం కావించాడు.

బలరామ అవతారము, కృష్ణ అవతారము:19&20

బలరామ కృష్ణులుగా ఒకేమారు అవతరించి దుష్ట సంహారం కావించి భగవద్గీతను ప్రసాదించాడు.

బుద్ధ అవతారము:21

కలియుగాది సమయంలో కీకటదేశంలో బుద్ధనామంతో జన్మించి జనులకు జ్ఞానాన్ని ఉపదేశించాడు.

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS