శంఖం ఇంట్లో వుంటే వాస్తు దోషాలు తొలగిపోతాయి. శంఖాన్ని పూజగదిలో అలంకరించి పూజించడం ద్వారా ఆఇంట కుబేరుడు నివాసం చేస్తాడని విశ్వాసం.
ఇంకా శ్రీ మహాలక్ష్మీ దేవి అనుగ్రహం కూడా లభిస్తుంది.
శంఖoలో తీర్థాన్ని వుంచి, తులసీ దళాన్ని వుంచి పూజించిన తర్వాత.. ఆ నీటిని స్నానం చేసేనీటిలో కలిపి స్నానమాచరించడం ద్వారా, బ్రహ్మ హత్య దోషమే తొలగిపోతుందట.
శంఖాన్ని పూజగదిలో వుంచి పూజించే ఇళ్ళల్లో బ్రహ్మహత్యే కాదు.. సమస్త దోషాలు తొలగిపోతాయి. ఇంటి ప్రధాన ద్వారంలో వాస్తు నిబంధన మేరకు ప్రతిష్టించి పూజించడం ద్వారా మూడు తరాలు సుఖసంతోషాలతో వర్ధిల్లుతారు.
ఆ శంఖువులో నిలిచిన తీర్థాన్ని చల్లుకుంటే పాపాలు తొలగిపోతాయి.
ఇంకా వాస్తు దోషాలు తొలగిపోతాయి.
శంఖాలలో వివిధ రకాలున్నాయి.
దీని ఆకారాన్ని బట్టి దక్షిణావర్త శంఖం,
మధ్యమావర్త శంఖంగా చెప్తారు.
వీటిలోనూ లక్ష్మీశంఖం, గోముఖశంఖం,
కామధేనుశంఖం, దేవశంఖం, సుఘోషశంఖం,
గరుడశంఖం, మణిపుష్పకశంఖం, రాక్షసశంఖం,
శనిశంఖం, రాహుశంఖం, కేతుశంఖం, కూర్మశంఖాలు ఉన్నాయి.
భారత యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు పాంచజన్య శంఖాన్ని, ధర్మరాజు అనంత విజయ శంఖాన్ని, భీముడు పౌండ్ర శంఖాన్ని, అర్జునుడు దేవదత్తాన్ని, నకుల సహదేవులు సుఘోష మణిపుష్పక శంఖాలను, విరాటుడు సాత్విక శంఖాన్ని పూరించినట్లు పురాణాలు చెబుతున్నాయి.
సిరి సంపదలు చేకూరాలంటే పూజా మందిరంలో దక్షిణావర్త శంఖం ఉంచాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
అంటే కుడివైపు నుంచి తెరచుకుని ఉండే శంఖమన్నమాట.
దీన్ని లక్ష్మీదేవి నివాసంగా చెబుతుంటారు.
ఈ శంఖం ఉన్న చోట శ్రీమహాలక్ష్మి కొలువై ఉంటుందని శాస్త్రం చెబుతోంది.
అందుకే పూజగదిలో దీనిని ఉంచి, అనునిత్యం పూజించాలని చెబుతారు.
ఫలితంగా దారిద్య్రం వదిలిపోతుంది.
అదే విధంగా శంఖంలో పోసిన తీర్థాన్ని స్వీకరించడం వల్ల వ్యాధి బాధలు కూడా నశిస్తాయి.
ఫలితాలు..!
శంఖాన్ని ఊదినట్లయితే ప్రాణాయామం చేసినంత వ్యాయామం శరీరానికి కలుగుతుంది.
శంఖాన్ని ఊదితే గుండె ఆరోగ్యం బాగుంటుంది. మెదడు చురుకుతనం వృద్ధి చెందుతుంది. ఊపిరితిత్తుల పనితీరు, శ్వాసక్రియ బాగుంటుంది. శంఖం ఊదడం వల్ల గృహ ఆవరణలోని దుష్టశక్తులు దూరంగా పారిపోతాయి.
దీనిని పూరించేటప్పుడు వెలువడే కంపనాలతో మనిషిలో తమో, రజో గుణాలు నశించి సత్వగుణం పెరుగుతుందంటారు.
అందువలనే శంఖాన్ని పూరించడం వల్ల గాని,
ఆ ధ్వనిని వినడంవలన గాని ఆరునెలల పురాణ శ్రవణం విన్న ఫలం, వేదఘోష విన్న ఫలం దక్కుతాయంటారు.

No comments:
Post a Comment