Wednesday, August 26, 2020

శాంత స్వరూపిణి కాళి

శాంత స్వరూపిణి కాళి


కాళీదేవి ప్రేమ స్వరూపిణి. కరుణ, దయ కలిగిన దేవత. 
అయితే చాలా మంది దృష్టిలో 
ఆమె క్రోధ స్వరూపిణిగా ఉంటుంది. 
రాక్షస సంహారం కోసం అవతరించినదేవత కాబట్టి 
ఆ సమయంలో తీవ్రంగానే ఉంటుంది కానీ 
మిగిలిన సమయాల్లో తన పిల్లల పట్ల 
ప్రేమ స్వరూపిణిగా ఉంటుంది. వాస్తవానికి దేవతలు 
నామానికి, రూపానికి, గుణానికి అతీతంగా 
నిర్గుణ పరబ్రహ్మ స్థితిలో ఉంటారు.
కానీ, తమ భక్తుల కోసం 
రకరకాల రూపాలను దాలుస్తూ ఉంటారు. 
అలాంటి ఒక సుగుణ స్వరూపం, 
శక్తి స్వరూపం, ఆనంద స్వరూపమే కాళి. 
దేవతలు సత్త్వ, రజస్‌, తమో గుణాలతో ప్రకాశిస్తూ ఉంటారు. అవతారాన్ని బట్టి రూపంలో మార్పు వస్తుంది. 
ఉదాహరణకు శైవంలో శివస్వరూపాన్ని చూస్తే 
సత్వ గుణ ప్రధానంగా 
ధవళ వర్ణంలో శివుడు ప్రకాశిస్తూ ఉంటాడు. 
రజోగుణం ప్రధానంగా లలితాదేవి భర్తగా 
సకల కామ్యములను సిద్ధింపచేసే కామేశ్వరునిగా
తమోగుణం ప్రధానంగా 
సంహార స్వరూపునిగా రుద్రునిగా ప్రకాశిస్తూ ఉంటాడు. 
ఏ గుణం అధికంగా ఉంటే ఆ రూపాన్ని ధరిస్తాడు. 
కాళీ దేవి విషయంలో కూడా ఈ విధంగానే ఉంటుంది. 
సత్త్వగుణంతో చంద్రస్వరూపిణిగా చంద్రకాళిగా వరాలిస్తుంది.
రజోగుణ ప్రధానంగా ఐశ్వర్య కాళి, భద్రకాళి రూపాలుంటాయి. 
తమోగుణ ప్రధానంగా ఉగ్రకాళి రూపం ఉంటుంది. 
కాళిదేవిని యుద్ధ స్వరూపిణిగా, తీవ్ర స్వరూపిణిగా భావించే 
చిత్రపటాలు గీసింది రాజా రవివర్మ. 
ఆయన గీసిన చిత్రాలలో అమ్మవారి రూపం భీకరంగా ఉంటుంది. 
నాలుక బయటకు చాచి ఉంటుంది. 
చాలా మంది అది క్రోధ స్వరూపంగా భావిస్తారు కానీ 
అది దేవతను గుర్తుపట్టే ఒక చిహ్నం మాత్రమే.
రక్తబీజుడనే రాక్షసుడిని సంహరించడానికి కాళీమాత 
తన నాలుకను చాస్తుంది. 
అంటే రాక్షస సంహారం వేళ మాత్రమే 
ఆమె నాలుకను చాచింది తప్ప అంతకు పూర్వం లేదు. 
తన భక్తులతో మాట్లాడేటప్పుడు 
ఆ నాలుక బయటకు ఉండదు కదా! 
ఆమె తన నాలుక సాయంతో ఆ రాక్షస సంహారం చేసి, 
భక్తులను రక్షించింది కాబట్టి ఆ నాలుకను చూసినప్పుడు 
అమ్మ తమను ఎలా రక్షించిందో అన్న విషయం గుర్తు చేసుకోవాలి.
చాలా మంది ఇంద్రియ నిగ్రహం కోసం- 
నాలుకను చాచి ఉన్న కాళీ రూపాన్ని పూజిస్తారు. 
తెనాలి రామకృష్ణుడికి, కాళిదాసుకు- 
వారి నాలుకలపై బీజాక్షరాలను లిఖించి అనంతమైన వాక్‌ శక్తిని, 
వాక్ చాతుర్యాన్ని అనుగ్రహించినట్లే 
తమకు కూడా అనుగ్రహిస్తుందని 
చాలా మంది ఈ రూపాన్ని పూజించడానికి ఇష్టపడతారు. 
కాళీ దేవి రకరకాల రూపాలలో తన భక్తులను అనుగ్రహిస్తుంది. 
ఆమె శారద స్వరూపిణిగా విద్యను, 
సంతాన కాళిగా సంతానాన్ని, భద్రకాళిగా అధికారాన్ని, 
ఐశ్వర్య కాళిగా ఐశ్వర్యాన్ని, చంద్రకాళిగా మనశ్శాంతిని అనుగ్రహించగలదు. మహాకాళిగా దుష్టసంహారాన్ని చేస్తుంది.
Bodhu. Ravikumar★★★

యోగ మాయ నర్తనకేళి భద్రకాళి

కాళికాదేవి అవతారాలలో ‘భద్రకాళి’ అవతారం, ఒకటి
ఆ రూపం చాలా ప్రసిద్ధమైనవి. 
భద్ర శబ్దానికి మంచి, శుభం అనే అర్థాలున్నాయి. 
సంస్కృతంలో ‘భ’ అంటే మాయ. ద్ర అంటే అధికమైనది. 
అన్నిటి కన్నా అధికమైన మహామాయ కాళి అని దీని అర్థం. 
మన తెలుగురాష్ట్రాల్లో ప్రాచీన కాలం నుంచి కాళీ ఆరాధన ఉంది.
వరంగల్‌లో భద్రకాళి ఆలయం ప్రసిద్ధమైనది. 
మురమళ్ల వంటి ప్రాంతాల్లో కూడా ఈ ఆరాధన ఉంది. 
ఈ మహామాయేనే యోగమాయగా కాళికగా పూజిస్తారు. 
ఒకసారి యోగ మాయ ప్రభావంతో 
శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి జారుకోగా
ఆ సమయంలో లోకమంతా అరాచకం ప్రబలిపోయింది. 
అప్పుడు బ్రహ్మ కాలస్వరూపిణి అయిన 
ఆ యోగమాయను ప్రార్థించగా 
ఆ తల్లి కాళికా అవతారములో వచ్చి 
తన మాయను విష్ణువు మీద నుంచి ఉపసంహరిస్తుంది. 
దీనితో విష్ణువు యోగనిద్ర నుంచి లేచి మధుకైటభులు అనే 
ఇద్దరు రాక్షసులను సంహరించి లోకాన్ని రక్షిస్తాడు. 
సాధారణంగా విశ్వరూపం అంటే శ్రీకృష్ణుడే గుర్తుకు వస్తాడు.
కానీ యోగ వాశిష్టంలో కాళికాదేవికి సంబంధించిన 
విశ్వరూప వర్ణన కనిపిస్తుంది. 
‘ప్రళయకాలంలో అంధకారమైన ఆకాశంలో, 
ఛాయా రూపాన్ని ధరించి. అగ్నిజ్వాలల మధ్య
అతి దీర్ఘమైన రూపాన్ని ధరించి ప్రకాశిస్తోంది. 
ఆమె రూపం అనంతమైన విశ్వమంతటా వ్యాపించి ఉంది. 
అనంతమైన ఆ దేవి శిరస్సును చూడాలంటే ఆకాశంలోకి 
పాదాలను చూడాలంటే పాతాళంలోకి ప్రయాణం చేయాలి. 
ఇక తాండవ సమయంలో ఒక్క క్షణం 
ఒంటికాలి మీద ఆడుతున్నదా అనిపిస్తుంది. 
మరుక్షణంలో వందల కాళ్లతో నర్తిస్తున్నదా అనిపిస్తుంది. 
ఇంకొక క్షణం అసలు పాదాలు లేవు అన్నట్లు 
అనంత వాయువేగంతో నర్తిస్తోంది. 
పోని ఆమె ముఖాన్ని దర్శించుకుందామా అంటే 
కొంత సేపు ఒకే ముఖంతో మరి కొంత సేపు వేల, లక్ష ముఖాలతో.. అసంఖ్యాకమైన చేతులతో కనిపిస్తోంది.
ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసముల తీవ్రతకు 
మేరు పర్వతాలు ఎగిరిపోయేటట్లుగా ఉన్నాయి. 
మలయ, సహ్య, మందర మొదలైన పర్వతాలు 
ఆమె కంఠంలో వ్రేలాడుతున్న మాలలాగ కనిపిస్తున్నాయి. 
రజత వర్ణంలో హిమాలయం, సువర్ణ వర్ణంలోని సుమేరు పర్వతం 
ఆమె చెవులకు ఆభరణములుగా వెలుగొందుతున్నాయి. 
మూడు లోకాలు ఆమెకు ఆభరణాలుగా కనిపిస్తున్నాయి. 
అఖిల బ్రహ్మండాలు ఆమె నడుముకు కట్టిన 
మేఘాల వడ్డాణంలా భాసిల్లుతున్నాయి. 
సమస్త లోకములు, బుతువులు, రాత్రిపగలు- 
ఆమె శరీర అవయవములు అయ్యాయి 
అనే కాళి వర్ణన చదువుతుంటే 
అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది.
Bodhu. Ravikumar

శివ కాళీ రహస్యం!

కొన్ని కాళీదేవి చిత్రాలలో శివుడు 
ఆమె పాదాల చెంత కనిపిస్తాడు. 
సాధారణంగా భార్యల కాళ్ల దగ్గర కూర్చున్న దేవుళ్లు తక్కువ. 
రాధాకృష్ణ సంప్రదాయంలో రాధాదేవి పాదాల దగ్గర 
కృష్ణుడు కూర్చుని పాదసేవ చేసే రూపాలు మనకు దర్శనమిస్తాయి. శాక్తేయ సంప్రదాయంలో కాళీదేవి చిత్రాలలో 
శివుని రూపం ఆమె పాదాల కింద ఉన్నట్టు కనిపిస్తుంది. 
దీని వెనకున్న కథను మన పురాణాలు చెబుతాయి. 
అదేంటంటే ఒకసారి యుద్ధరంగంలో 
రాక్షస సంహారం తర్వాత ఆ జగన్మాత 
క్రోధకాళిగా మారి నాట్యం చేయటం మొదలుపెట్టింది. 
ఆ రూపాన్ని చూసి అందరూ భయభ్రాంతులయ్యారు.
ఆమె భర్త శివుని వద్దకు వెళ్లి అందరూ ఆ క్రోధ స్వరూపాన్ని ఉపసంహరింపజేయాల్సిందిగా ప్రార్థించారు. 
యుద్ధరంగంలోకి వచ్చిన శివుడు అమ్మవారి నాట్యం చూశాడు. 
ఆ దృశ్యమే భీకరంగా ఉంది. 
ఒక వైపు రాక్షసుల శరీరాలు మరోవైపు ఏరులై పారుతున్న రక్తం. 
వాటి మధ్య కాళీదేవి నృత్యం. 
ఆమె నృత్యాన్ని ఆపేదెలాగా అని ఆలోచించిన శివుడు. 
రాక్షసుల మృత దేహాల మధ్య పడుకున్నాడు. 
ఆ తల్లి యుద్ధరంగం అంతటా నాట్యం చేస్తూ 
శివుని దగ్గరకు వచ్చింది. ఆమె పాదం 
శివుని హృదయానికి తగిలింది. 
అప్పుడు ఆమె శివుని గుర్తించి 
తన క్రోధ స్వరూపాన్ని ఉపసంహరించుకుంది. 
ఇంకొక కథ ప్రకారం మహాప్రళయం వేళ 
అమ్మవారు ప్రళయతాండవం చేస్తోంది.
ఆ తాండవానికి లోకాలన్నీ భయభ్రాంతులవుతున్నాయి. 
దేవతల ప్రార్థనల మేరకు శివుడు కాళీదేవి దగ్గరకు వెళ్లి- 
‘‘దేవి! నీవు అత్యంత శక్తిస్వరూపిణినివి. 
నీ ప్రళయ తాండవం వల్ల సమస్తలోకాలు దద్దరిల్లిపోతున్నాయి. 
అందరూ నీ శక్తిని తట్టుకోలేకపోతున్నారు. 
నీ శక్తిని నేను మాత్రమే భరించగలను. 
అందుకు నీ పాదం నా హృదయం మీద మోపు’’ అని కోరాడు. 
అప్పుడు కాళీదేవి తన పాదాన్ని 
శివుని గుండెపై మోపి శివారూఢ అయింది. 
దీనికి సంబంధించిన మరో కథ కూడా మన పురాణాల్లో ఉంది. 
ఒక సందర్భంలో పార్వతీదేవి పరమేశ్వరుడితో- 
‘‘స్వామి నేను ఎన్నో రూపాలు ధరించాను. 
సప్త మాతృకా స్వరూపాలతోను, నవదుర్గ రూపాలతోను, 
దశమహావిద్యల రూపాలతోను ప్రకాశిస్తూ ఉంటాను. 
నేను ధరించిన రూపాలలో ఏది మీకు ఎక్కువ ఇష్టం అని అడిగింది. 
దానికి పరమేశ్వరుడు- ‘నీవు ధరించిన రూపాలన్నింటిలోను 
కాళీ స్వరూపం అంటే చాలా ఇష్టం.’’ అన్నాడు. 
అప్పుడు పార్వతీదేవి-
 ‘‘స్వామి అందరూ నా సుకుమారమైన 
లలితా స్వరూపాన్ని ఆరాధిస్తూ ఉంటారు..
కానీ మీకు కాళీ రూపం ఇష్టమంటే ఆశ్చర్యంగా ఉంది అంది.
అప్పుడు పరమేశ్వరుడు- ‘‘నీవు చెప్పింది నిజమే. 
లలితా స్వరూపం అతి సుందరమైనది. 
కామేశ్వరుడిగా నేను నీ పక్కనే ఉన్నా. 
ఇలా ప్రతి రూపంలోను నీ వెంట ఉన్నా. 
అయితే కాలమునకు అధిదేవతగా కాళిగా ఉన్నప్పుడు 
నిడారంబరంగా, నిజమైన దివ్య సౌందర్యంతో ప్రకాశించావు. 
జ్ఞాన స్వరూపిణిగా వన్నెకెక్కావు. 
అందుకే ఆ స్వరూపంలో నేను నీ పాదాల దగ్గర ఉన్నా..
’’ అని చెప్పాడు.
-Bodhu. Ravikumar

షోడశ కళల కాళి

లలితాదేవి నామావళిలో పద్మనాభ సహోదరి అని ఉంది. 
ఆమె విష్ణుమూర్తి సహోదరిగా ఎప్పుడు అవతరించింది అంటే కాళీగాథలలో ఆ విశేషం కనిపిస్తుంది. 
సృష్టి ప్రారంభవేళ అండాల నుండి సమస్త సృష్టి మొదలు అయింది. 
ఒక అండం నుండి బ్రహ్మ, లక్ష్మీదేవి; 
మరొక అండం నుండి శివుడు, సరస్వతీదేవి; 
ఇంకొక అండం నుండి నారాయణుడు, నారాయణి 
(కాళి) ఉదయించారు. ఒకే అండం నుండి ఉద్భవించినవారు 
ఒకే తల్లి పిల్లలు. అందుకే ఒకే వర్ణంతో ప్రకాశిస్తారు. 
అందుకే నారాయణుడు, అతని సహోదరి అయిన 
నారాయణి నల్లగా ఉంటారు. 
అలాగే కాళీదేవి పద్మనాభ సహోదరిగా 
ఈ భూమి మీద అవతరించింది. 
బృందావనంలో యశోదానందులకు కాళీదేవి ఆడపిల్లగా పుట్టింది, మగపిల్లవాడు కూడా పుట్టాడట. 
వసుదేవుడు తీసుకువచ్చిన మగశిశువు 
యశోదకు పుట్టిన మగశిశువు ఒకేలాగ ఉన్నారుట. 
యశోద ప్రక్కన పడుకున్న మగశిశువులో 
వసుదేవుడు తెచ్చిన పిల్లవాడు కలిసిపోయాడట 
గోలోక కృష్ణుడు ప్రేమస్వరూపుడు. 
నారాయణ కృష్ణుడు రాక్షససంహారి. 
ఇద్దరూ ఒకే శరీరంలో 12 ఏళ్లపాటు ఉన్నారని 
బృందావన సంప్రదాయ పురాణాలు చెబుతున్నాయి.
నందుని కుమార్తెగా పుట్టిన యోగమాయ కాళీదేవిని 
నందా, నందిని అని అంటారు. 
ఆమెనే పద్మనాభ సహోదరిగా చెబుతారు. 
అంతే కాక దేవీభాగవతంలో 
కాళీదేవి అవతరణ విశేషాలను చెపుతూ 
ఆమెను యోగమాయగా, మహామాయగా చెప్పారు.
లలితానామాలలో ఆమెను మహామాయ అని అన్నారు. 
అంతేకాక యుద్ధరంగంలో కాళీదేవి 
చండముండాసురులను సంహరించింది. 
చండముండాసుర నిషూదిని, మహాకాళి అని 
లలితానామాలలో కనిపిస్తాయి. ఇంకా ఎన్నో నామాలలో 
కాలస్వరూపిణిగా లలితాదేవిని వివరించారు. 
ఇలా లలితా సహస్రనామాలలో కాళీదేవికి చెందిన
ఎన్నో విశేషాలు, నామాలు కనిపిస్తున్నాయి. కనుక 
ఎందరో భక్తులు లలితాదేవి, కాళీదేవి యిద్దరూ ఒక్కరే అని 
విశ్వసించి ఆరాధిస్తున్నారు. 
ఇద్దరూ/అంతకన్నా ఎక్కువ దేవతల మంత్రాలను 
ఒకే మంత్రంగా సాధన చేసే విధానాన్ని 
మంత్రశాస్త్రంలో మంత్ర సంపుటీకరణ అంటారు. 
లలితాదేవి, కాళీదేవి మంత్రాలను సంపుటీకరించి 
కొందరు శాక్తేయులు సాధన చేస్తున్నారు. 
షోడశ కళలతో ప్రకాశించే చంద్రస్వరూపిణిగా లలితాదేవిని, 
చంద్రకాళి, చంద్రస్వరూపిణిగా కాళీదేవిని ఆరాధిస్తారు. 
ఇద్దరూ చంద్రస్వరూపమే కాబట్టి 
ఈ మంత్రాలను సంపుటీకరించి 
లలితా (చంద్ర)కాళిగా మనశ్శాంతి కోసం 
(విశేషించి పౌర్ణమి వేళ) అర్చిస్తున్నారు. 
లలితాకాళి మంత్రం సాధన చేసి 
ఎటువంటి కష్టాన్ని అయినా పోగొట్టుకోవచ్చు. 
అందుకే ఎందరో కాళీభక్తులు లలితాకాళిగా ఆమెను ఉపాసించి సత్ఫలితాలను పొందుతున్నారు.
Bodhu. Ravikumar

కృష్ణకాళి

కృష్ణావతారంలో, కృష్ణుని జీవితంలో 
కాళీ దేవి పాత్ర అడుగడుగునా కనిపిస్తుంది. 
బృందావన సంప్రదాయంలో కృష్ణుడు, కాళీ దేవి ఒక్కరే 
అనే భావన కనిపిస్తుంటుంది. 
కృష్ణకాళిగా, కృష్ణ స్వరూప కాళిగా అమ్మవారి ఆరాధన కనిపిస్తుంది. 
కృష్ణ కాళి దేవాలయం కూడా మనకు అక్కడ కనిపిస్తుంది. 
ఇందుకు సంబంధించిన అద్భుతమైన సంఘటనలను తెలియజేసే విశేషాలు మనకు కాళికా పురాణం, 
బృందావన స్థల పురాణ కథలలో కనిపిస్తాయి.
ఆ కథల్లో ఒకదాని ప్రకారం.. యశోద సోదరుడు 
శతగోపుడు. ఆయన భార్య రాధ (బృందావనేశ్వరి,) 
గోలోక నాయిక అయిన రాధాదేవి వేరు. 
కృష్ణుని మేనమామ భార్య పేరు కూడా రాధ. 
అందుకే చాలా మంది రాధ అంటే కృష్ణుని మేనత్త అనుకుంటారు. 
కానీ ఆమె వేరు. ఆ స్వామి ప్రాణాధిక అయిన రాధాదేవి వేరు 
ఆమె చిన్నప్పుడు కృష్ణుని ఎత్తుకొని పెంచింది. 
చిన్నికృష్ణుని సౌందర్యాన్ని ఆరాధించింది.
ఆయన అనుగ్రహం పొందింది. 
అందుకే కృష్ణుడు ఆమె కోసం యువకుడిగా మారి 
విహరిస్తూ ఉండేవాడు.
అది చూసి కొందరు శతగోపునికి ఆ విషయం చెప్పారు. 
ఒకసారి రాధతో కృష్ణుడు ఉన్నప్పుడు 
కొంతమంది శతగోపుని అక్కడికి తీసుకెళ్లారు. 
అక్కడకు వెళ్లి చూస్తే రాధాదేవి 
కాళీ దేవి విగ్రహాన్ని పూజిస్తున్నట్టుగా కనపడింది. 
దీంతో వారంతా ఆశ్చర్యపోయి అక్కడి నుంచి వెళ్లిపోయారు. 
అందరూ వెళ్లిన తర్వాత కాళీదేవి విగ్రహం 
కృష్ణునిగా మారిపోయింది. శతగోపుని రాకను గుర్తించిన కృష్ణుడు 
రాధను రక్షించడం కోసం అలా కాళిగా మారాడు. 
ఈ కథ బృందావన గాథలలో చాలా ప్రసిద్ధమైనది. 
అలాగే నరకాసురుని జీవితంలో కూడా 
కాళీదేవి ప్రధాన పాత్రగా కనిపిస్తున్నది.
నరకుని ఆరాధ్య దైవం కామాఖ్య కాళి. 
ఆమెను ఆరాధించి ఆమె అనుగ్రహం పొంది 
ఎన్నో అద్భుతమైన శక్తులు సాధించాడతడు. 
కానీ అతడు అధర్మబద్ధమైన సాధనలు చేయడం వల్ల 
కాళీ దేవి అతడి వద్ద నుంచి వెళ్లిపోయింది. 
ఎంత ప్రయత్నించినా ఆ తల్లి నరకునికి కనిపించలేదు. 
నరకుని మరణ సమయంలో మాత్రం 
కృష్ణుడిలో కాళి కనిపించింది. 
అధర్మాన్ని నశింపజేయడానికి అలా కృష్ణ కాళిగా వచ్చి 
నరకుని సంహరించిందన్నమాట. 
కృష్ణ కాళిగా అమ్మవారిని భక్తితో, 
ప్రేమ భావనతో పూజిస్తే ఆమె కృష్ణ స్వరూపిణిగా, 
ప్రేమ స్వరూపిణిగా, కృష్ణునిగా అనుగ్రహిస్తుంది. 
బృందావనంలో ప్రవేశించిన ఎందరో సిద్ధులు 
కృష్ణుడే కాళి అని తెలుసుకుని 
కృష్ణ కాళిగా పూజించి అనుగ్రహం పొందారు.
Bodhu. Ravikumar 

కవిత్వం, విద్య, జ్ఞానం.. కాళీ ప్రసాదం

కాళీదేవి విద్యకు, కవిత్వానికి, జ్ఞానానికి అధిదేవత. 
శారదా స్వరూపిణిగా కాళీ మాత 
ఎందరికో కవిత్వాన్ని, పాండిత్యాన్ని అనుగ్రహించింది. 
ఆమెను గురించి తపస్సు చేసిన ఎందరినో 
మహాకవులుగా తీర్చిదిద్దింది. 
చదువురాని కాళిదాసు కాళీదేవి ఆలయానికి వెళ్లి 
తన మూఢభక్తితో అమాయకత్వంతో ఆ తల్లిని మెప్పించాడు. 
అమ్మ అతని నాలుక మీద తన చేతితో 
బీజాక్షరాలను రాసిన మరుక్షణం నుండి అతని వాక్కుకు 
అనంతమైన శక్తి వచ్చింది. 
అమాయక యువకుడు కాస్తా ‘‘మహాకవి కాళిదాసు’’ అయ్యాడు. రఘువంశం, కుమార సంభవం వంటి 
అద్భుతమైన కావ్యాలను సృష్టించాడు.
అమ్మవారి గురించి ఎన్నో స్తోత్ర రచనలు చేశాడు. 
తాను రచించిన ‘కాళీ కర్పూరాంబ స్తోత్రం’లోని మొదటి శ్లోకంలో 
‘‘జపతి జడ చేతా అపి కవిః’ అని పేర్కొన్నాడు కాళిదాసు.
అంటే ఎవరైతే కాళీ మంత్ర జపం చేస్తారో, 
వారు జడులైనా సరే అమ్మవారి అనుగ్రహంతో 
కవి అవుతారు అని అర్థం. మన తెలుగు సాహిత్యంలో 
తెనాలి రామకృష్ణుడి ప్రతిభా కాళీ మాత వరప్రసాదమే. 
ఒకప్పుడు కాళీదేవిని గురించి 
తీవ్రమైన తపస్సు చేసిన రామకృష్ణుడు ఆమె అగ్రహానికి గురై, 
ఆనక ఆ తల్లి అనుగ్రహం పొంది వికటకవి అయ్యాడు. 
కాళీ దేవి ఆరాధనకు పెట్టిందిపేరైన బెంగాలులో 
రామప్రసాద్‌ అనే యువకుడు గురుముఖతా 
కాళీ మంత్రం ఉపదేశం పొంది తీవ్రమైన సాధన చేసి 
అమ్మ అనుగ్రహం పొందాడు. 
ఆయనతో పాట పాడించుకొని వినటానికి 
సాక్షాత్తు కాశీ అన్నపూర్ణా దేవి వచ్చిందని 
ఆయన జీవిత చరిత్రలో కనిపిస్తున్నది. 
బెంగాలులో అమ్మ పాటలు అంటే 
రామప్రసాద్‌ రచించిన పాటలే. 
రామకృష్ణ పరమహంస యావజ్జీవితం ఈ పాటలే పాడుకునేవారు. ఉజ్జయినిలో భర్తృహరికి కూడా 
అమ్మవారి అనుగ్రహం వల్లనే కవితా ధార, 
సిద్ధ శక్తులు లభించాయని స్థలపురాణం. 
ఇలా మరెందరికో ఆ తల్లి విద్యను అనుగ్రహించింది. 
కాళీదేవి ముఖంలో కనిపించే నాలుక వాక్శుద్ధికి, 
వాక్చాతుర్యానికి చిహ్నం. 
అందుకే విద్య కోసం, జ్ఞానం కోసం స్పటిక మాలతో 
ఆమె మంత్రాన్ని జపిస్తూ ఆమెను 
‘‘విద్యాకాళి’’గా ఆరాధిస్తే జడుడు సైతం 
మహాకవి కాగలుగుతాడు.
Bodhu. Ravikumar

ఐశ్వర్య కాళి

కాళీదేవి ఐశ్వర్యానికి అధిదేవత. 
ఐశ్వర్యం అంటే కేవలం సిరిసంపదలు మాత్రమే కాదు. 
ఐశ్వర్యం అంటే అధికారం (రాజ్యాధికారం), వైభవం కూడా. 
‘‘ఐశ్వర్య కాళి’’గా అమ్మవారిని ఆరాధిస్తే 
ఆమె వీటన్నింటినీ అనుగ్రహిస్తుంది. 
అలా అమ్మవారిని అర్చించి, ఆమె కోసం తపస్సు చేసి 
విక్రమార్కుడు, భట్టి, నరకాసురుడు, 
తెనాలి రామకృష్ణ మొదలైనవారు ఐశ్వర్యాన్ని పొందారు. 
ఉజ్జయినీ మహా కాళి శక్తిస్వరూపిణి. 
ఆమె ఐశ్వర్యకాళిగా భట్టి విక్రమార్కులను అనుగ్రహించింది. 
విక్రమార్కుని జీవితకథలో 
అమ్మవారి అనుగ్రహానికి సంబంధించిన ఘట్టం కనిపిస్తున్నది. 
అదేంటంటే విక్రమార్కుని దగ్గరకు ఒక మంత్రగాడు వచ్చి 
ఉజ్జయిని కాళిని పూజించడానికి 
ఆయన సాయం కావాలని కోరతాడు. 
అందుకోసం శ్మశానం నుండి బేతాళుడు ఆవహించి ఉన్న 
శవాన్ని తీసుకురావాలని చెబుతాడు.
మహావీరుడైన విక్రమార్కుడు 
బేతాళుడు ఆవహించిన శవాన్ని తీసుకొని వస్తూ ఉండగా, 
బేతాళుడు అనేక కథలు చెప్పి ప్రశ్నలు అడగడం 
విక్రమార్కుడు జవాబులు చెప్పడం, 
మళ్లీ బేతాళుడు శ్మశానానికి వెళ్లిపోవటం తెలిసిన కథే. 
చివరికి బేతాళుడు చెప్పిన ఒక కథకు విక్రమార్కుడు 
సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోతాడు. 
అతడి బుద్ధిబలానికి మెచ్చిన బేతాళుడు
‘విక్రమార్కా ఆ మాంత్రికుడు నిన్ను బలి యివ్వడం కోసమే 
ఇదంతా చేస్తున్నాడు’ అని చెబుతాడు. 
అప్పుడు విక్రమార్కుడు ఉజ్జయిని మహాకాళిని ప్రార్థించి, 
ఆమె అనుగ్రహంతో, మాంత్రికుని తన ఖడ్గంతో సంహరించగా 
కాళీదేవి ఐశ్వర్యరూపిణిగా ప్రత్యక్షం అయి 
‘‘నాయనా! దుష్టసంహారం చేశావు. ధర్మాన్ని రక్షించావు. 
ఏం కావాలో కోరుకో’’ అని అన్నది. 
1000 సంవత్సరాలు రాజ్యపాలన, అష్టైశ్వర్యాలు కావాలని 
విక్రమార్కుడు వరం అడిగాడు. 
ఆ తరువాత భట్టి కూడా 2000 సంవత్సరాల ఆయుర్దాయం, అష్టైశ్వర్యాలను వరంగా పొందాడు. 
అమ్మవారిని ఎర్రతామరలతో విశేషించి ఎర్రకలువలతో 
(కాళీ సాధనలో కలువ పూలకు ప్రాధాన్యం) పూజిస్తే 
ఆమె ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తుంది. 
తామరగింజల మాలతో కాళీ మంత్ర జపం చేసి 
సిరిసంపదలను పొందవచ్చు.
-Bodhu. Ravikumar

కల్యాణ కాళి సంతాన కాళి

పెళ్లి కానివారు కాళీమాతను ఆరాధిస్తే
శీఘ్రంగా వివాహం అయ్యేటట్టుగా ఆ తల్లి అనుగ్రహిస్తుంది. 
వివాహ సిద్ధి కలిగించే మంత్రదేవతగా, 
కల్యాణ కాళిగా ఆమెను ఆరాధించవచ్చు. 
శివుని వివిధ రూపాలలో, 
శివుని శక్తిగా, భార్యగా కాళీదేవి కనిపిస్తున్నది. 
ఉజ్జయినిలో మహాకాళుని శక్తిగా, వీరభద్రుని శక్తిగా, 
కాశీలో కపాల విమోచన తీర్థంలో 
భైరవుని భార్యగా కాళీదేవి పూజలు అందుకుంటున్నది. 
ఏటా భాద్రపద పౌర్ణమినాడు కపాలవిమోచన తీర్థంలో 
కాళీ భైరవుల కల్యాణ మహోత్సవం జరుగుతుంది. 
వేలాది మంది భక్తులు ఈ కల్యాణాన్ని వీక్షించచి 
అమ్మవారి అనుగ్రహం, వివాహ సిద్ధి పొందుతున్నారు. 
మురమళ్లలో భద్రకాళీ వీరేశ్వరుల కళ్యాణం జరిపిస్తే 
శీఘ్రంగా వివాహం జరుగుతుంది అని నమ్మిక. 
సౌభాగ్య కాళిగా, కాలభైరవుని భార్యగా 
అమ్మను అర్చించే పడతులకు సుమంగళి యోగాన్ని, 
వారి వారి భర్తలకు దీర్ఘాయువును అనుగ్రహిస్తుంది.
పసుపు కుంకుమలతో, ఎర్రటి, పచ్చటి పూలతో పూజిస్తే 
సౌభాగ్య కాళి అనుగ్రహం త్వరగా లభిస్తుంది. 
అలాగే సంతాన కాళిగా ఆ తల్లి సంతానాన్ని అనుగ్రహిస్తుంది. 
దీనికి సంబంధించి ఒక కథ ఉంది. 
ఒకసారి కాళీ దేవి యుద్ధరంగంలో రాక్షస సంహారం చేసి 
క్రోధ స్వరూపిణిగా ఉన్నప్పుడు 
ఆ తల్లిని శాంతింపజేయాల్సిందిగా దేవతలు శివుడిని వేడుకున్నారు. 
అప్పుడు శివుడు బాలుడిగా మారి అక్కడికి వెళ్లి 
రోదించనారంభించాడు. 
పసివాడి ఏడుపు విన్న అమ్మలో ఆగ్రహాన్ని విడిచి 
అయ్యో! బిడ్డ ఆకలితో ఏడుస్తున్నాడు 
అతని ఆకలి తీర్చాలి’ అనుకుని, 
గబగబా బిడ్డ దగ్గరకు వచ్చి, ఎత్తుకుని 
తన స్తనపానాన్ని అనుగ్రహించింది. 
ఆ బాల శివుని పేరు క్షేత్రపాలుడు, 
ఆయన పూజించిన మాతృకాళిని ‘క్షేత్రపాల సమర్చిత’ అని 
లలితామంత్ర సిద్ధులు భాస్కర రాయలు వర్ణించారు.
చేతిలో బిడ్డని ఎత్తుకుని స్తనపానాన్ని అనుగ్రహిస్తున్న 
మాతృ స్వరూపిణిగా, సంతాన కాళిగా మాతృకాళిగా 
అమ్మవారిని అర్చిస్తే ఆమె సంతానం కలిగేటట్లు చేస్తుంది.
-Bodhu. Ravikumar

బాల కాళి మంగళా కాళి

కాళీ దేవి అనంత రూపాలలో 
‘బాల కాళి’ రూపం ప్రసిద్ధమైనంది. 
బాలకృష్ణుని, బాల గణపతిని, 
బాలాదేవిని చిన్నపిల్లలుగా ఎలా ఉపాసిస్తామో, 
అలాగే కాళీదేవిని చిన్నారి కాళిగా పూజిస్తారు. 
తెలుగు యోగి, కాళీ మంత్ర సిద్ధుడు 
త్రైలింగ స్వామి అమ్మవారిని 12 సంవత్సరాల 
చిన్నారి బాలికగా ‘మంగళ కాళి’గా అర్చించారు. 
ఆయన దీర్ఘకాలం తపస్సుకు మెచ్చిన అమ్మవారు 
బాలకాళిగా (మంగళా కాళి)గా పట్టుపరికిణీ ధరించి 
సుకుమారంగా నెమ్మదిగా అడుగులు వేస్తూ 
త్రైలింగ స్వామి కన్నుల ముందు నిలిచింది. 
త్రైలింగ స్వామికి ఎన్నో సిద్ధశక్తులను ప్రసాదించింది.

దీర్ఘాయువును అనుగ్రహించింది. 
కాశీలో త్రైలింగ స్వామి ఆశ్రమం ఉన్నది. 
అక్కడ అమ్మవారు ‘మంగళా కాళి’గా, 
12 సంవత్సరాల బాల స్వరూపంలో 
భక్తులను అనుగ్రహిస్తుంటుంది. 
ఉమాచరణ్‌ అనే భక్తుడు త్రైలింగ స్వామి దగ్గర 
కాళీ మంత్ర ఉపదేశం పొంది, 
తీవ్ర సాధన చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాడు. 
కానీ, ఆయనకు ఆ తల్లి సాక్షాత్కారం మాత్రం కలుగలేదు. 
దీంతో ఆయన త్రైలింగ స్వామి దగ్గరకు వెళ్లి.. 
‘అమ్మవారి కృప నాకు తెలుస్తోందిగానీ, 
సాక్షాత్కారం మాత్రం కలగట్లేదు’ 
తన ఆవేదనను వివరించగా.. 
త్రైలింగ స్వామి ఆ రోజు చీకటి పడి తరువాత 
అతడిని తన కాళీ మందిరంలోకి తీసుకువెళ్లారు. 
అందమైన మంగళా కాళిగా ప్రకాశిస్తున్న 
అమ్మ విగ్రహాన్ని ఉద్దేశించి ‘మంగళా’ అంటూ ఆహ్వానించారు. 
అప్పుడా విగ్రహం ఒక సుందరమైన బాలికగా 
మారి నడిచి వచ్చింది.
ఆనంద ఆశ్చర్యాలతో పరవశించిన 
ఉమాచరణ్‌ స్వామి అనుమతితో 
ఆమె పాదాలను తాకి నమస్కరించాడు. 
ఆ తరువాత ఆ సుందర బాలిక నెమ్మదిగా నడిచి వెళ్లి 
మళ్లీ మంగళా కాళిగా శిలాకృతిని ధరించింది. 
బెంగాల్‌కు చెందిన కాళీ మంత్ర సిద్ధుడైన 
రామప్రసాద్‌ జీవితంలో కూడా 
బాల కాళిగా అమ్మవారు దర్శనం ఇచ్చి, 
ఆయన ఇంట చిన్నపిల్లగా నడయాడేది. 
బాల కాళిగా అమ్మవారిని పూజిస్తే 
చిన్న పిల్లలలో ఉండే బాలారిష్టాలను, 
అనారోగ్యాలను తొలగిస్తుంది. 
విశేషించి మంగళా కాళిగా కొలిస్తే మంగళ స్వరూపిణి అయి 
సకల శుభాలను కలిగేటట్లు అమ్మ అనుగ్రహిస్తుంది.
-Bodhu. Ravikumar

నాగ దోషాలు పోవాలంటే..

కాళీదేవి అనంత స్వరూపాలలో 
‘నాగకాళి’ రూపం కూడా ఒకటి. 
నాగశక్తి స్వరూపిణిగా, నాగులు సైతం పూజించే దేవతగా 
‘నాగకాళి’గా ఆ మాత అనుగ్రహిస్తున్నది. 
కామాఖ్యలో కామాఖ్యకాళిగా అమ్మవారిని పూజిస్తారు. 
అక్కడ నాగమాత అయిన మానసాదేవి కూడా ఉన్నది.
నాగమాత అయిన మానసాదేవి కాళిని అర్చించినట్లుగా 
అక్కడి కథలు చెపుతున్నాయి. 
ఆమెను అనుగ్రహించడానికి అమ్మవారు ప్రత్యక్షమయ్యింది. 
నాగకిరీటాన్ని ధరించి, 
అనంతమైన నాగులు పడగలు పడుతూ ఉండగా, 
ఆమె శరీరం మీద అనేక నాగులు ఆభరణాలుగా 
ప్రకాశిస్తూ ఉండగా నాగ మహా శక్తిస్వరూపిణిగా 
ఆమె దర్శనం యిచ్చిందిట.
ఆ తల్లి అనుగ్రహం వలన మానసాదేవి 
అనేక శక్తులను పొందడంతోపాటు, 
నాగమాత అయ్యే అర్హతను పొందింది. 
పాతాళంలో ఉన్న నాగులు మొదలైనవారు 
పాతాళకాళిగా అమ్మవారిని పూజించి ఆమె అనుగ్రహం పొందారు. నాగదోషాలు ఉన్నటువంటి వారికి చర్మవ్యాధులు, 
ఎముకల వ్యాధులు, కర్ణ వ్యాధులు మొదలైన అనారోగ్యాలు, 
వివాహం కాకపోవటం లేదా వివాహం అయినా 
భార్యాభర్తల సఖ్యత లేకపోవటం 
విశేషించి సంతానం లేకపోవటం 
మొదలైన ఇబ్బందులు ఉంటాయి అని 
నాగతంత్రం చెపుతున్నది.
నాగ దోషాలు ఉన్నవారు నాగకాళిగా అమ్మవారిని కొలిస్తే 
వాటిని తొలగిస్తుంది. వంశపారంపర్యంగా వచ్చే 
నాగదోషమైనా, పాములను చంపడం వలన వచ్చిన 
నాగదోషమైనా, పూర్వ జన్మలో చేసిన 
నాగహాని వలన కలిగిన నాగదోషమైనా.. 
నాగకాళీ మాత ఆరాధనతో పోతాయి. 
ఎటువంటి కాలసర్ప దోషమైనా, రాహుగ్రహ కేతు గ్రహ దోషాలున్నా ‘‘నాగకాళి’’ అమ్మను ఆరాధిస్తే ఆమె తొలగిస్తుంది. 
ఎన్నోచోట్ల, విశేషించి తమిళనాట 
‘నాగకాళి’ అమ్మ దేవాలయాలు కనిపిస్తున్నాయి. 
ఆమెను అర్చించి శీఘ్రంగా దోష నివారణ, సంకల్ప సిద్ధి పొందవచ్చు.

-Bodhu. Ravikumar

ప్రత్యంగిరా కాళి.. అధర్వణ భద్రకాళి

కాళీదేవి ధరించిన రూపాలలో 
‘ప్రత్యంగిరా భద్రకాళి’ రూపం ప్రసిద్ధమైనది. 
సింహముఖంతో ప్రకాశించే కాళీ స్వరూపమే ‘ప్రత్యంగిరా కాళి’. 
సహజంగా కాళీదేవి స్త్రీ శక్తి స్వరూపిణిగా 
మానవ ముఖంతో, నాలుకను బయటకు చాచి ఉంటుంది. 
అలాగే.. ఆ తల్లి స్త్రీ శరీరంతో, 
ఇతర జంతువుల ముఖములతోను 
అనేక రూపాలను ధరించినట్లుగా కాళీపటలంలో, 
కాళీ తంత్ర గ్రంథాలలో కనిపిస్తున్నది. 
పులిముఖంతో వ్యాఘ్రముఖిగా, ఏనుగు ముఖంతో గజముఖిగా, పిల్లిముఖంతో బిడాలముఖిగా, వరాహాముఖంతో వరాహాముఖిగా, గుర్రపుముఖంతో అశ్వముఖిగా సింహముఖంతో సింహముఖిగా 
మొదలైన అనేక రూపాలను ధరించింది. 
విశేషించి సింహముఖం కలిగిన కాళీదేవిని 
ప్రత్యంగిరా కాళిగా వర్ణించారు.
ప్రత్యంగిరా తంత్రంలో ఆమెను అధర్వణ భద్రకాళి అని అన్నారు. ప్రత్యంగిరాదేవిని ఆరాధించడం 
అత్యంత ప్రాచీన కాలం నుండి వస్తున్నది. 
ఆ తల్లి ఆరాధనతో ఎటువంటి బాధలు, 
కష్టాలు అయినా తొలగిపోతాయి. 
శత్రుబాధను నివారించడం మాత్రమే కాక 
ఎంతటి వంశానుగత శాపాలను అయినా సరే పోగొడుతుంది. 
ప్రత్యంగిరా భద్రకాళి ఆరాధన దక్షిణ దేశంలో.. 
ప్రత్యేకించి తమిళనాడులో ప్రసిద్ధి. 
ఈ దేవతకు మంగళవారం రాహుకాలంలో 
విశేష పూజలు, అభిషేకాలు చేసే ఆచారం కనిపిస్తున్నది. 
అమావాస్య వేళ పూజిస్తే మరింత శీఘ్రంగా అనుగ్రహిస్తుందని 
ప్రజల విశ్వాసం.
-Bodhu. Ravikumar

కామాఖ్య కాళి

నీలాచల పర్వతం మీద కామాఖ్యా దేవి అవతరించి ఉన్నది. 
సతీదేవి శరీరంలోని వివిధ భాగాలు పడిన చోట్లు 
మహాశక్తి క్షేత్రాలుగా అలరారుతున్నాయి. 
అలా నీలాచల పర్వతం మీద సతీదేవి యోని పీఠం ఉన్నది. 
లలితాదేవి చేత పునరుజ్జీవితుడైన మన్మథుడు 
అమ్మవారి పట్ల కృతజ్ఞతతో ఆ పీఠంలో అమ్మవారిని ప్రతిష్ఠించాడు. భారతదేశంలో కాళీదేవికి సంబంధించిన క్షేత్రాలలో 
కామాఖ్య అతి ముఖ్యమైనది.
కాళికా పురాణంలో కామాఖ్య కాళి తంత్రంలో 
అమ్మవారి శక్తిని గురించి ఆమె మహిమల గురించి 
ఎన్నో అద్భుతమైన విశేషాలు కనిపిస్తున్నాయి. 
ఆ తల్లిని ఆరాధించి ఎందరో వ్యక్తులు సిద్ధులయ్యారు. 
నీలాచల పర్వతం మీద ఇప్పటికీ 
ఎందరో కాళీ మంత్ర సిద్ధులు సంచరిస్తుంటారు. 
నరకాసురుడు ఈ కామాఖ్యాదేవిని ఆరాధించి 
ఎన్నో సిద్ధశక్తులను సాధించాడు.
అయితే ధర్మబద్ధం కాని వామాచార సాధనలను చేయడం వల్ల 
ఆ తల్లి ఆగ్రహానికి గురయ్యాడు. 
మహర్షి వశిష్ఠుని ప్రార్థనతో అధర్మ పరుడైన నరకుని 
రాజ్యం నుండి కామాఖ్య కాళి మాయమయ్యింది. 
ఆ తర్వాత సుమారు 300 సంవత్సరాల పాటు 
అమ్మవారు కైలాసంలో ఉన్నదని యోగినీ తంత్రంలో ఉంది. 
నరకాసురుని మరణవేళ ఆమెను 
కృష్ణుని ప్రక్కన చూసిన నరకుడు 
తాను ఉపాసించిన దేవతే తన తప్పులకు 
తనను శిక్షిస్తోందని తెలుసుకున్నాడు.
ఆ తరువాత కృష్ణుడు మళ్లీ నీలాచలం మీద కామాఖ్యాదేవినిపునఃప్రతిష్ఠించి ఆ దేవతను పూజించాడు. 
సంవత్సరంలో ఒకసారి ఆమె రజస్వల అవుతుందని చెబుతారు. 
ఆ మూడు రోజులూ గుడిని మూసేసి 
ఆ రోజులలో స్రవించే రక్తాన్ని వస్త్రాలకు అద్ది భక్తులకు ఇస్తారు. 
కామాఖ్య కాళిని దర్శించినా, ఆమెను పూజించినా 
శీఘ్రంగా కాళీదేవి అనుగ్రహం పొందవచ్చు.
Bodhu. Ravikumar

కాలస్వరూపిణి.. దక్షిణ కాళి

అనంతమైన కాలం స్త్రీ రూపాన్ని ధరిస్తే 
కాళీరూపంగా భాసిల్లుతుంది. 
ఏ వ్యక్తి అయినా ఎన్ని శక్తులున్నా కాలం అధీనంలో ఉండాల్సిందే. 
కాలం తీరాక కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. 
అయితే కాల స్వరూపం అయిన కాళిని ఎవరు అర్చిస్తారో, 
ఆ తల్లి అనుగ్రహాన్ని, మంత్ర సిద్ధిని ఎవరు పొందుతారో 
వారు అకాల మృత్యుగండాన్ని తప్పించుకోగలుగుతారు. 
మృత్యుంజయ స్వరూపిణిగా ఆమెను ఆరాధించే రూపం 
‘దక్షిణ కాళి’ రూపం. 
బెంగాల్‌కు చెందిన కృష్ణానంద ఆగమ వాగీశ అనే 
ప్రముఖ పండితుడు వైదిక, తంత్ర శాస్త్రాలలో 
అపార జ్ఞానం కలిగిన వ్యక్తి. 
16వ శతాబ్దానికి చెందిన ఆయన 
తంత్రసార మొదలైన అద్భుత గ్రంథాలను రచించారు.
కాళీదేవి ఆయనకు కలలో దక్షిణ కాళిగా దర్శనమిచ్చి 
ఆ రూపానికి ప్రజల్లో ప్రాచుర్యం కల్పించాలని చెప్పింది. 
ఆ రూపంలో ఉన్న అమ్మవారి ఆరాధనను 
కృష్ణాననంద దశదిశలా వ్యాపింపజేశారు. 
కాళీదేవి అనుగ్రహం వల్ల విక్రమార్కుడు, భట్టి.. 
కాళీ మంత్ర సిద్ధి పొందిన తెలుగు యోగి 
త్రైలింగ స్వామి దీర్ఘకాలంపాటు జీవించారు. 
కాళీమాత ఆజ్ఞతో రామకృష్ణ పరమహంస
త్రైలింగ స్వామిని దర్శించుకున్నారు. 
అలాగే అమ్మవారి అనుగ్రహంతో సుదీర్ఘకాలం జీవించిన 
మరో కాళీ మంత్ర సిద్ధుడు కీనారాం అఘోరీ. 
కాశీలో అమ్మవారి సంకల్పంతో 
హరిశ్చంద్రఘాట్‌కు దగ్గరలో కాళీదేవి ఆలయాన్ని నిర్మించాడు. 
అమ్మవారు ప్రసాదించిన శక్తులతో ఎందరికో సాయం చేశాడు. 
మొగల్‌ పాదుషా షాజహాన్‌ష కీనారాం అఘోరీ భక్తుడు. 
ఇలా ఎందరో కాళీ భక్తులు 
దక్షిణ కాళిగా అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు.
-Bodhu. Ravikumar

ఉజ్జయినీ కాళి - అనంత కల్పవల్లి

అష్టాదశ మహాశక్తి పీఠాలలో ఒకటైన ఉజ్జయినిలో 
మహాకాళిగా అమ్మవారి రూపాన్ని వర్ణించడం జరిగింది. 
అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన 
మహాకాళీశ్వరుని రూపం ఇక్కడ కనిపిస్తుంది. 
ఉజ్జయినిలో ఆ మహాకాళీదేవి 
హరసిద్ధి మాతగా ప్రసిద్ధి చెందింది. 
అక్కడి స్థల పురాణం ప్రకారం అంధకాసురుని వధించడానికి 
హరుడు వచ్చాడు. ఇద్దరికీ యుద్ధం జరిగింది. 
ఆ రాక్షసునికి ఉన్న వరాల బలంతో మరణించకపోవడంతో 
మహంకాళిని పిలిచాడు శివుడు. 
ఆ తల్లి ప్రత్యక్షం అయి అంధకాసురుని 
సంహారానికి కారణం అయ్యింది. 
అలా రాక్షస సంహారం జరగాలన్న 
హరుని కోరిక సిద్ధింపజేయటం వలన 
ఆనాటి నుండి ఉజ్జయినీలోని మహాకాళిని 
‘‘హరసిద్ధి’’ మాతగా కొలవటం ప్రారంభం అయ్యింది. 
ఆ పరిసర ప్రాంతంలో ‘‘గడ్‌ కాళి’’ ఆలయం కూడా కనపడుతుంది. కొంతమంది ఈమెను మహాకాళిగా భావించటం కూడా కనిపిస్తున్నది. ఉజ్జయినీలో ఆ తల్లి రాత్రివేళ సంచరిస్తూ 
ఆ ప్రాంతాన్ని రక్షిస్తూ ఉంటుంది. 
ఉజ్జయినిలోనే కాళిదాసమహాకవికి నాలుక మీద 
వాగ్బిజాన్ని వ్రాసింది మహాకాళి. 
అంతేకాక విక్రమార్కుని ఇంటి ఇలవేల్పు 
ఉజ్జయినీ కాళి. విక్రమార్కుని అనుగ్రహించి 
వెయ్యేళ్ళు రాజ్యాధికారాన్ని, 
అనంతమైన ఐశ్వర్యాన్ని, దీర్ఘాయువుని ప్రసాదించింది. 
భర్తృహరి కవి కూడా ఉజ్జయిని కాళి కోసం తపస్సు చేసి 
ఆమె అనుగ్రహాన్ని పొందినవారని తెలుస్తున్నది. 
ఇప్పటికీ ఉజ్జయినిలో భర్తృహరి తపస్సు చేసిన గుహలు ఉన్నాయి. 
నాథ సంప్రదాయానికి ఆద్యుడైన మత్స్యేంద్రనాథుడు కూడా 
ఉజ్జయిని కాళిని ఆరాధించి ఆమె అనుగ్రహాన్ని; 
కాళీమంత్ర సిద్ధిని పొందటం జరిగింది. 
ఉజ్జయినిలో మత్స్యేంద్రనాధుని సమాధిని కూడా 
స్థానికులు పూజించటం కనిపిస్తుంది. 
ఇవాల్టికీ ప్రతిరోజు వేలమంది యాత్రికులు అక్కడికి వెళ్ళి 
ఆమె దర్శనం చేసుకొని 
ఆమె అనుగ్రహంతో కష్టాలను తొలగించుకుంటున్నారు, 
కోరికలు తీర్చుకుంటున్నారు.
- Bodhu. Ravikumar

కాశీ అంతటా కొలువైన కాళీ మాత

భారతదేశంలో అత్యంత మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం కాశీ 
మహాక్షేత్రం. అటువంటి కాశీలో 
కాళీదేవి వివిధమైన, విశిష్టమైన రూపాలతో 
ఎన్నో దేవాలయాలలో ప్రకాశిస్తున్నది. 
కాశీలో కాళీ దేవాలయాలకు, కాళీ మంత్ర సిద్ధులకు 
ప్రత్యేక ప్రాముఖ్యత కనిపిస్తున్నది. 
కాశీలో ‘శవ శివ కాళీ’ మందిరం చాలా ప్రసిద్ధమైనది. 
సామాన్యంగా శివుడు, కాళీ స్వరూపాన్ని గమనిస్తే 
నిలబడిన కాళీదేవి పాదాల కింద 
శివుడు ఉండే రూపం చాలా ప్రసిద్ధమైనది. 
అయితే ఇక్కడ ప్రత్యేకమైన శివకాళీ స్వరూపం కనిపిస్తుంది. 
శవం మీద పడుకున్న శివుని మీద కూర్చున్న 
కాళీ రూపాన్ని ఈ మందిరంలో భక్తులు దర్శించవచ్చు. 
అలాగే, కాశీలో భైరవుని భార్యగా కాళీదేవి మందిరం కనిపిస్తుంది. 
వీరి కల్యాణమహోత్సవానికి ఏటా వేలాదిగా భక్తులు తరలివస్తారు. 
అలాగే కాళీ మంత్ర సిద్ధుడైన కీనారాం అఘోరీతో పాటు 
కాశీకి బెలూచిస్థాన్‌ నుంచి హింగుళా కాళిగా అమ్మవారు వచ్చిందని 
భక్తుల నమ్మిక. ఆ తల్లి ఆలయం 
హరిశ్చంద్ర ఘాట్‌కు దగ్గరలో ఉన్న కీనారాం 
అఘోరీ ఆశ్రమంలో ఉంది.
ఆ గుడికి ఎదురుగా కీనారాం అఘోరీ ఏర్పరచిన 
‘క్రీం’ తీర్థంలో స్నానం చేసినవారికి 
సర్వబాధలూ తొలగిపోతాయని ప్రతీతి. 
మరో కాళీ మంత్ర సిద్ధుడైన త్రైలింగస్వామి 
తన ఆశ్రమంలో కాళీదేవిని మంగళాకాళిగా స్థాపించాడు. 
కాళీ దేవి ఆదేశంతో రామకృష్ణ పరమహంస 
కాశీకి చేరుకుని త్రైలింగ స్వామిని, 
మంగళాకాళిని దర్శించుకున్నాడు. 
కాశీలోనే మరోచోట ఆనంద భైరవునితో కలిసి ఉన్న 
కామాఖ్య కాళి ఆలయం కనపడుతుంది. 
తారా కాళీ పీఠంలో శక్తిమంతమైన తల్లిగా 
నీలమేఘ వర్ణపు కాళిక దర్శనమిస్తుంది. 
కాశీలోని కాళీగల్లీలో కాళరాత్రి కాళిగా, 
అతి భీషణ మూర్తిగా అమ్మవారు కనిపిస్తుంది. 
ఇంకా కృపా కాళి, దయా కాళి ఇలా ఎన్నో రూపాలలో 
కాశీ అంతటా ఆ తల్లి 
భక్తుల కొంగుబంగారంగా కొలువై ఉంది
-Bodhu. Ravikumar

పాలలోముడు ఆరాధించిన తల్లి.. శ్రీరామ కాళి

వశిష్ఠ మహర్షి రామునికి యోగవాసిష్ఠాన్ని వివరిస్తూ 
అందులో కాళీదేవిని జగన్మాతగా, విశ్వరూపిణిగా వర్ణించాడు. 
అది విన్న రామునికి కాళీదేవి మీద భక్తి కలిగిందని, 
వశిష్ఠ మహర్షి నుండి శ్రీరాముడు 
కాళీమంత్ర ఉపదేశాన్ని పొందాడని 
కాళీతంత్ర గ్రంథాలు చెపుతున్నాయి. 
అయోధ్యలో దేవ కాళి మందిరం ఉంది. 
అక్కడ కాళీమాతను సీతాదేవి అర్చించేది. 
యుద్ధంలో రాముని పరాక్రమం ముందు నిలువలేక, 
తన మిత్రులు పాతాళ ప్రభువులు అయిన 
మహిరావణుని, అహిరావణుని తనకు సహాయం చేయమని 
రావణుడు అడిగాడు వారిద్దరూ పాతాళకాళి ఉపాసకులు. 
ఆ తల్లి అనుగ్రహించిన శక్తులతో రావణునికి సహాయం చేస్తామని 
వాగ్దానం చేశారు ఈ విషయాన్ని తెలుసుకున్న విభీషణుడు హనుమంతుడికి తెలిపాడు.
అప్పుడు ఆంజనేయుడు తన వాలంతో కోటలాగా నిర్మించి, 
అందులో రామలక్ష్మణులకు విశ్రాంతిని ఏర్పాటు చేశాడు. 
అయితే తమ మాయోపాయంతో అహి, మహి రావణులు రామలక్ష్మణులను పాతాళ లోకానికి తీసుకువెళ్లి 
పాతాళకాళి దేవాలయంలో బంధించారు. 
వాళ్లని విడిపించటానికి హనుమంతుడు వెళ్తుంటే 
పాతాళలోక ముఖద్వార పాలకుడు 
మత్స్యనాథుడు అడ్డగించి, ఆంజనేయునితో యుద్ధం చేశాడు. 
ఇంతలో మత్స్యనాథుని తల్లి మత్స్యకాంత వచ్చి 
లంకకు రావటానికి హనుమంతుడు సముద్రం దాటుతుంటే 
రాలిన ఆయన స్వేద బిందువు వల్ల తను గర్భం ధరించాననీ, మత్య్సనాథునికి జన్మ యిచ్చాననీ చెప్పింది. 
హనుమంతుడు తన తండ్రి అని తెలియగానే 
మత్స్యనాథుడు ఆయనకు నమస్కరించి దారి ఇచ్చాడు.
అనంతర కాలంలో అతడు కాళీదేవిని గురించి 
తపస్సు చేసి మహాసిద్ధుడయ్యాడు. 
ఇక హనుమంతుడు పాతాళ కాళిని 
తన ప్రార్థనతో మెప్పించాడు. 
తత్ఫలితంగా కాళీశక్తి హనుమంతునిలోకి ప్రవేశించింది. 
అందుకే మంత్రశాస్త్రంలో హనుమత్కాళీ మంత్రం కనిపిస్తున్నది. 
అలా అమ్మవారి అనుగ్రహంతో రామలక్ష్మణులను 
మాయాశక్తి బంధనం నుంచి ఆంజనేయుడు విడిపించాడు. 
ఆ తరువాత శ్రీరాముడు కాళీమంత్రాన్ని 
ఏడు రోజులు ఉపాసించగా ఆమె చివరి రోజు రాత్రి ప్రత్యక్షమై 
రామునికి విజయాన్ని వరంగా యిచ్చినట్లు చెబుతారు. 
ఆ వరప్రభావంతోనే రాముడు రావణుని చంపి 
అశోకవనంలోని సీతాదేవి శోకాన్ని పోగొట్టాడనీ, 
అందుకని చైత్ర శుద్ధ అష్టమికి 
అశోకాష్టమి అన్న పేరు వచ్చిందని కనిపిస్తున్నది. 
రాముడు ఉపాసించిన కాళీమంత్రాన్ని 
అయోధ్యలోని దేవకాళీ దేవాలయంలో ఉపాసిస్తే 
విశేష ఫలితాలు వస్తాయని కాళీ ఉపాసకుల విశ్వాసం
-Bodhu. Ravikumar

No comments:

Post a Comment

RECENT POST

కాణిపాకం శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు

కాణిపాకం శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు ప్రతీరోజు ఈ స్తోత్రం కనీసం 4 సార్లుపఠిస్తేచాలామంచిది ఇంకా ఎక్కువ సార్లు పఠించే సమయము, శక్తి...

POPULAR POSTS