Wednesday, August 26, 2020

"పంచారామాలు" అనగా ఏమిటి ?

"పంచారామాలు" అనగా ఏమిటి ? 


ఈ క్షేత్రాలు ఎక్కడ ఉన్నాయి మరియు ఈ దేవాలయాల విశిష్టత గురుంచి విపులంగా "హితోక్తి" ప్రేక్షకుల కోసం...

మీరు తెలుసుకొని, నలుగురుతో పంచుకోండి....

"ఓం నమః శివాయ నమః"...

ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధమైన  "శైవక్షేత్రాలను", "పంచారామాలు' అని పిలుస్తారు.  'పంచారామాలు' ఏర్పడుటకు, స్కందపురాణంలో ఇలా వివరించబడి యున్నది..

పూర్వం.. తారకాసురుడు అను రాక్షసుడు, 'శివుని' గురించి ఘోర తపస్సు చేసి 'శివుని' ఆత్మలింగము సంపాదిస్తాడు.  దీనితో వీర గర్వముతో, దేవతలను అనేక రకాలుగా హింసలు గురిచేయగా, ఇందుకు దేవతలు, విష్ణుమూర్తిని ప్రార్ధించగా, 'శివపార్వతుల' వల్ల కలిగిన కుమారుడు "కుమారస్వామి" వల్లనే తారకాసురుని వధించుట సాధ్యపడుతుందని తెలిపి "కుమారస్వామిని" యుద్ధానికి పంపుతారు. యుద్ధమునందు "కుమారస్వామి",  తారకాసురుని కంఠంలో గల 'ఆత్మలింగమును' చేధిస్తేనే మరణము కలుగునని గ్రహించి ఆ 'లింగమును' చేధిస్తాడు.  దీనితో తారకాసురుడు మరణిస్తాడు.

చేధిoచే సమయంల్లో, ఆ.. 'ఆత్మలింగము'  వేరై,  ఐదు ప్రదేశములలో పడుతాయి. తరువాత వాటిని ఆ...యా...ప్రదేశాలలో, దేవతలు లింగ ప్రతిష్ఠ కావిస్తారు.. కనుక ఈ అయిదు 'క్షేత్రాలను',  'పంచారామాలు' అని పిలుస్తారు..

1. దాక్షారామము :

పంచరామాల్లో మొదటిదైన దాక్షారామము తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురంలో ఉంది.  ఇక్కడ స్వామిని "భీమేశ్వరుడు" అని పిలుస్తారు. 
 స్వామి లింగాకారం 60 అడుగులు ఎత్తులో ఉంటుంది. పై అంతస్తు నుండి పూజలు నిర్వహిస్తారు.  ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడి లింగాకారం సగం భాగం తెలుపు మరిఇయు  సగభాగం నలుపుతో ఉంటుంది.

ఇక్కడ దక్షప్రజాపతి యజ్ఞం నిర్వహించాడు. కనుక ఈ ప్రాంతానికి దాక్షారామము అని పేరు వచ్చిందంటారు.  ఈ ఆలయం చాళుక్యరాజయిన, భీముడు నిర్మించాడని పురాణాలలో చెప్పబడి యున్నది.  అనేక పురాణాల్లో ఈ ఆలయం గురించి ప్రస్తావన ఉంది.   పూర్వకాలంలో ఎంతో మంది దేవతలు, రాజులు స్వామి వారిని దర్శించుకొని, తరించారని తన 'భీమేశ్వర పురాణంలో' చెప్పబడి యున్నది.  ఈ ఆలయంలో శిల్పకళ అద్భుతంగా ఉంటుంది.  ఇక్కడ "మహాశివరాత్రి" పర్వదినం కన్నుల పండుగగా నిర్వహిస్తారు.

2. అమరారామము :

పంచారామల్లో రెండవదైన 'అమరారామము',  గుంటూరు జిల్లాలోని అమరావతిలో కృష్ణానదీతీరమునందు వెలసినది.  ఇక్కడ స్వామిని "అమరేశ్వరుడు" అని పిలుస్తారు.  గర్భగుడిలో స్వామి విగ్రహం 9 అడుగుల ఎత్తులో,  తెల్లగా మెరుస్తూ ఉంటుంది.  

ఈ ఆలయం 20 అడుగుల ఎత్తుగల విశాలమైన వేదికపైన నిర్మించబడింది.
అమరేశ్వరుడైన 'ఇంద్రుడు' చేత ప్రతిష్టించి ఈ ఆలయానికి తన నగరమైన అమరావతి పేరునే పెట్టారు అని పురాణాలలో చెప్పబడి యున్నది.

3. క్షీరారామము :

క్షీరారామము, పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లులో కలదు. ఇక్కడ 'శివుని' మూర్తిని "శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి"  అని పిలుస్తారు.  ఇక్కడ స్వామివారిని త్రేతాయుగ కాలంలో  'సీతారాములు' కలిసి ప్రతిష్ఠించారట.  ఈ గ్రామానికి పాలకొల్లు అని పేరు రావడానికి కూడా ఒక కధ ఉంది. 

'శివుడు' తన బాణమును భూమిలోనికి వెయ్యగానే భూమి నుండి పాలధార వచ్చిందట.   క్షీరం అనగా పాలు, దీనిమూలంగా క్షీరపురి అనే పేరు వచ్చింది. 
క్రమంగా 'క్షీరపురి' కాస్తా 'పాలకొల్లుగా' మార్పు చెందింది. స్వామి వారి ఆలయాన్ని 11వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించారు.  ఆలయం 125 అడుగుల ఎత్తులో '9' గోపురాలుతో కట్టబడింది.

4. సోమారామము :

పంచరామాల్లో నాల్గవదైన "సోమారామము".   పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరానికి రెండు కిలోమిటర్లు దూరంలో గల గునిపూడిలో కలదు. ఇక్కడ స్వామి వారిని "సోమేశ్వరుడు" అని పిలుస్తారు.  ఇచ్చట 'శివలింగానికి'  ఒక ప్రత్యేకత ఉంది.  మాములు రోజుల్లో తెలుపు రంగులో ఉండే 'శివలింగం',  అమావాస్య రోజు వచ్చేసరికి గోధుమ రంగులోనికి మారుతుంది. తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యధాస్ధానానికి చేరుతుంది.

ఇక్కడ స్వామిని 'చంద్రుడు' ప్రతిష్టించాడు. చంద్రునిచే ప్రతిష్ఠించ బడినది కావున దీనికి 'సోమారామము' అని పేరు వచ్చింది.

5. కుమారభీమారామము :

పంచారామాల్లో చివరిది, 5వది అయిన 'కుమారభీమారామము',  తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటకు కిలోమిటరు దూరంలో కలదు.  ఇక్కడ స్వామిని "కాల బైరవుడు"  అని పిలుస్తారు.

ఈ ఆలయాన్ని దాక్షారామాన్ని నిర్మించిన, చాళుక్య రాజయిన భీముడు ఈ ఆలయాన్ని కూడా నిర్మించాడు. ఇక్కడి 'శివలింగం' సున్నపురాయితో చేసినదిలాగా ఉంటుంది.  ఈ ఆలయంలో "మహశివరాత్రి" ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.

ఈ అయిదు ఆలయాలను, ఒకే రోజు, అంటే, సంధ్యా సమయంల్లో మొదలుబెట్టి, సాయంకాలం లోపు దర్శించుకొన్న మోక్షము లభిస్తుంది అని పెద్దలు చెబుతారు.

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS