Tuesday, August 25, 2020

పళని దండాయుధ పాణి స్వామి వారి నిజరూప దర్శనం , స్థల పురాణం


*పళని దండాయుధ పాణి స్వామి వారి నిజరూప దర్శనం , స్థల పురాణం*

శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో నాలుగవది పళని. 

ఈ క్షేత్రం తమిళనాడు లోని దిండిగల్ జిల్లాలో, 
మధురై నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. 

శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్రాలలో చాలా ప్రఖ్యాతి గాంచిన మహా మహిమాన్వితమైన దివ్య క్షేత్రం పళని.

ఇప్పుడు ఉన్న మందిరం క్రీస్తు శకం ఏడవ శతాబ్దంలో కేరళ రాజు అయిన చీమన్ పెరుమాళ్ నిర్మించారు. 
ఆ తరువాత పాండ్యుల కాలంలో ఈ మందిరం 
ఇంకా అభివృద్ధి చేయబడింది.

దండాయుధ పాణి.

ఇక్కడ స్వామి వారిని దండాయుధపాణి అనే నామంతో కొలుస్తారు. 
తమిళులు ఈయనను “పళని మురుగా” అని కీర్తిస్తారు. ఈ క్షేత్రం చాలా పురాతనమైనది. 
స్వామి చేతిలో ఒక దండం పట్టుకుని, కౌపీన ధారియై, వ్యుప్త కేశుడై నిలబడి, చిరునవ్వులొలికిస్తూ ఉంటాడు. 

అదే స్వరూపం భగవాన్ శ్రీ రమణ మహర్షిది. 
భగవాన్ రమణులు సుబ్రహ్మణ్య అవతారము అని పెద్దలు చెప్తారు. 
ఇక్కడ స్వామి వారు కేవలం కౌపీనంతో కనబడడంలో అంతరార్ధం “నన్ను చేరుకోవాలంటే అన్నీ వదిలేసి 
నన్ను చేరుకో” - అని మనకి సందేశము ఇస్తున్నారు 
అని అర్థం. 
అంటే ఈ పళని క్షేత్రము జ్ఞానము ఇచ్చే క్షేత్రము. 
అంతే కాదు ప్రఖ్యాత కావిడి ఉత్సవము మొదలయిన క్షేత్రము పళని.

ఇక్కడ పళని మందిరంలోని గర్భ గుడిలోని స్వామి వారి మూర్తి నవపాషాణములతో చేయబడినది. 
ఇటువంటి స్వరూపం ప్రపంచములో మరెక్కడా లేదు. 
ఈ మూర్తిని సిద్ధ భోగార్ అనే మహర్షి చేశాడు. 
తొమ్మిది రకాల విషపూరిత పదార్ధాలతో 
(వీటిని నవపాషాణములు అంటారు) చేశారు. 

పూర్వ కాలంలో ఇక్కడ పళని స్వామి వారి మూర్తిలో ఊరు (తొడ) భాగము వెనుక నుండి 
స్వామి వారి శరీరం నుండి విభూతి తీసి 
కుష్ఠు రోగం ఉన్నవారికి ప్రసాదంగా ఇస్తే, 
వారికి వెంటనే ఆ రోగం పోయేదని పెద్దలు చెప్తారు. 

అలా ఇవ్వగా ఇవ్వగా, స్వామి వారి తొడ భాగం 
బాగా అరిగి పోవడంతో అలా ఇవ్వడం మానేశారు. ఇప్పటికీ స్వామి వారిని వెనుక నుండి చూస్తే ఇది కనబడుతుంది అని పెద్దలు చెప్తారు. 
కాని మనకి సాధారణంగా ఆ అవకాశం కుదరదు. 

ఇక్కడ స్వామి వారిని ఈ క్రింది నామాలతో 
స్తుతి చేస్తూ ఉంటారు.
కులందైవళం,
బాలసుబ్రమణ్యన్, 
షణ్ముగన్,
దేవసేనాపతి,
స్వామినాథన్,
వల్లి మనలన్,
దేవయానై మనలన్,
పళని ఆండవార్,
కురింజి ఆండవార్,
ఆరుముగన్,
జ్ఞాన పండిత,
శరవణన్,
సేవర్ కోడియోన్,
వెట్రి వేల్ మురుగా .........
మొదలైన నామాలు ఎన్నో ఉన్నాయి స్వామికి ఇక్కడ.

ఇంకొక విషయం ఏమిటంటే, 
పళని లో కొండ పైకి ఎక్కడానికి రెండు మార్గాలు ఉంటాయి. 
ఓపిక ఉన్న వారు మెట్ల మార్గంలో వెళ్లడం ఉత్తమం. మెట్లు కాకుండా, రోప్ వే లాంటి చిన్న రైలు సౌకర్యం 
కూడా ఉంది. 
దీనికి టికెట్ యాభై రూపాయలు. 
ఒక సారి వెళ్ళడానికి బావుంటుంది. 
(ఓపిక లేకపోతే ప్రతీ సారి)

పళని క్షేత్ర స్థల పురాణము

పూర్వము విఘ్నాలకు అధిపతిని ఎవరిని చెయ్యాలి అని, పార్వతీ పరమేశ్వరులు ఒకనాడు మన బొజ్జ వినాయకుడిని, చిన్ని సుబ్రహ్మణ్యుడిని పిలిచి 
ఈ భూలోకం చుట్టి ( అన్ని పుణ్య నదులలో స్నానం ఆచరించి ఆ క్షేత్రములను దర్శించి రావడం) 
ముందుగా వచ్చిన వారిని విఘ్నములకు అధిపతిని చేస్తాను అని శంకరుడు చెప్తే, 
అప్పుడు పెద్దవాడు, వినాయకుడు యుక్తితో 
ఆది దంపతులు, తన తల్లి తండ్రులు అయిన 
ఉమా మహేశ్వరుల చుట్టూ మూడు మాట్లు ప్రదక్షిణ చేస్తాడు. 

మన బుజ్జి షణ్ముఖుడు ఆయన యొక్క నెమలి వాహనముపై భూలోకం చుట్టి రావడానికి బయలుదేరతాడు. 
కాని, వినాయకుడు “తల్లి తండ్రుల చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేస్తే సకల నదులలోనూ స్నానం చేసిన పుణ్యం వస్తుంది” అనే సత్యము తెలుసుకుని, 
కైలాసంలోనే ప్రదక్షిణలు చేస్తూ ఉండడం వల్ల, సుబ్రహ్మణ్యుడు ఏ క్షేత్రమునకు వెళ్ళినా, 
అప్పటికే అక్కడ లంబోదరుడు వెనుతిరిగి వస్తూ కనపడతాడు. 
ఈ విధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అయ్యాడు. 
ఈ కథ మనకు అందరకూ తెలిసినదే.

కార్తికేయుడు శివ కుటుంబంలో చిన్న వాడు కదండీ, దానితో కాస్త చిన్న మొహం చేసుకుని కైలాసం వదిలి, భూలోకంలోకి వచ్చి ఒక కొండ శిఖరం మీద నివాసం ఉంటాడు అలకతో. 
ఏ తల్లి తండ్రులకైనా పిల్లవాడు అలిగితే బెంగ ఉంటుంది కదండీ, అందులోనూ చిన్న వాడు, 
శివ పార్వతుల ఇద్దరి అనురాగముల కలపోత, 
గారాల బిడ్డ కార్తికేయుడు అలా వెళ్ళిపోతే చూస్తూ ఉండలేరు కదా, 
శివ పార్వతులు ఇద్దరూ షణ్ముఖుని బుజ్జగించడం కోసం భూలోకంలో సుబ్రహ్మణ్యుడు ఉన్న కొండ శిఖరం వద్దకు వస్తారు.

ఆ కొండ శిఖరం ఉన్న ప్రదేశమును తిరు ఆవినంకుడి 
అని పిలుస్తారు. 
పరమశివుడు ప్రేమతో సుబ్రహ్మణ్యుడిని ఎత్తుకుని,  నువ్వే సకల జ్ఞాన ఫలానివి రా నాన్నా” అని ఊరడిస్తాడు. సకల జ్ఞాన ఫలం (తమిళంలో పలం), 
నీవు (తమిళంలో నీ) – 
ఈ రెండూ కలిపి పళని అయ్యింది. 
అంతటితో ప్రసన్నుడు అయిన సుబ్రహ్మణ్యుడు ఎప్పటికీ శాశ్వతముగా ఆ కొండ మీదే కొలువు ఉంటానని అభయం ఇస్తాడు. 
సుబ్రహ్మణ్య క్షేత్రాలలో జరిగే “కావడి ఉత్సవం” 
మొట్ట మొదట ఈ పళని లోనే ప్రారంభం అయ్యింది.

కావడి ఉత్సవము - ఇడుంబన్ వృత్తాంతం.

ఇడుంబుడు
సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క గొప్ప శిష్యులలో 
అగస్త్య మహా ముని ఒకడు. 
అగస్త్య మహా ముని స్వామి దగ్గర నుండి సకల జ్ఞానము పొందాడు. 
అగస్త్య మహర్షికి ద్రవిడ వ్యాకరణము సుబ్రహ్మణ్య స్వామి వారే నేర్పారు.

పూర్వము దేవ దానవ యుద్ధములో చాలా మంది దానవులు నిహతులై పోయారు. 
కాని అందులో ఇడుంబన్ అనే ఒక రాక్షసుడు మాత్రం అగస్త్య మహర్షి పాదములు పట్టుకున్నాడు. 
అగస్త్యుడు సంతోషించి, వీడిలో మిగిలిపోయిన కొద్ది రాక్షస భావాలు తొలగించాలి అనుకున్నాడు. సాధారణంగా ఎవరైనా పెద్దలు తన వల్ల కాని పని ఉంటే, తన గురువుకి అప్పచెప్తారు. 
వీడు రాక్షసుడు కదా అని సంహరించడం కాదు, 
వీడిలో ఉన్న ఆసురీ గుణములను తీసివేయాలి 
అని తలచి, లోకంలో ఆదిగురువు దక్షిణా మూర్తి, శంకరుడు ఉండేది కైలాసంలో కదా, 
అందుకని ముందు అక్కడికి పంపిద్దాము అనుకుని ఇడుంబుడిని పిలిచి, “ఒరేయ్ నేను కైలాసం నుండి 
రెండు కొండలు తెద్దామని చాలా కాలం నుండి అనుకుంటున్నాను, 
వాటిని శివగిరి, శక్తిగిరి అంటారు. 
నువ్వు వెళ్లి ఆ రెండు కొండలను, 
ఒక కావిడి లో పెట్టుకుని నేను ఉన్న చోటికి తీసుకురా” అని ఆజ్ఞాపించాడు.

సరే ఇడుంబుడు, వంట్లో ఓపికుంది కదా, 
కైలాసం వెళ్లి ఆ రెండు కొండలను 
తన కావిడిలో పెట్టుకుని బయలుదేరతాడు. 
శంకరుడు అనుకుంటాడు, 
ఈ రాక్షసుడి ఆసురీత్వం పోగొట్టడం, 
జ్ఞాన రాశి అయినటువంటి మా సుబ్రహ్మణ్యుడు చేస్తాడులే అనుకుని ఇడుంబుడిని వెళ్ళనిస్తారు. 

ఇక్కడ స్వామి పళని కొండ మీద చిన్న పిల్లవాడిగా ఉన్నాడు, 
ఇడుంబుడు దారిలో వస్తూ ఉండగా సరిగ్గా పళని దగ్గరకి వచ్చే సరికి ఆ కొండలు మోయలేక ఆయాసం వచ్చి, కాసేపు క్రింద పెట్టి సేద తీరాడు.
మళ్ళీ కావిడి ఎత్తుకుందామని క్రిందకి వంగి కావిడి బద్ద భుజం మీద పెట్టుకుని లేచి నిలబడి, 
రెండు వైపులా బరువు సమానంగా ఉండేలా సర్దుదామని చూస్తే ఒక వైపు ఎక్కువ బరువు, 
ఇంకో వైపు తేలిక అవుతోంది కాని, 
సమానంగా ఎంతసేపటికీ కుదరట్లేదు. 
ఇంక విసుగొచ్చి, ఏమిటిరా ఈ కావిడి అనుకుని, 
అలా పైకి చూస్తాడు ఇడుంబుడు. 
పైకి చూడగానే అక్కడ సుబ్రహ్మణ్యుడు చిన్న పిల్లవాడి రూపంలో పకపక నవ్వుతున్నాడు. 
ఇది చూసి వీడికి కోపం వచ్చింది. 
ఇదే రాక్షస ప్రవృత్తి అంటే, ఏదో చిన్న పిల్లవాడు నవ్వుతున్నాడులే అనుకోవచ్చు కదా. 

స్వామికేసి తిరిగి “ఏమిటా నవ్వు, 
నేనేమైనా ఈ కావిడి ఎత్తలేనని అనుకుంటున్నావా? కైలాసం నుంచి తీసుకొచ్చాను. 
ఏమిటా వెర్రి నవ్వు, నిన్ను చంపేస్తాను ఇవ్వాళ అని 
ఆ కొండ మీదకి పరిగెత్తాడు. 
తెలిసి పరిగెత్తాడో, తెలియక పరిగెత్తాడో పళని కొండ మీదకి పాదచారియై వెళ్లాడు. 
పైకి వెళ్ళాక, స్వామి రెండు గుద్దులు గుద్దాడు, 
ఇంక ప్రాణం వదిలేస్తున్నాను అన్నప్పుడు, 
వాడికి తెలిసింది, ఈ పిల్లవాడు సామాన్యుడు కాదురా, మా గురువు గారికి (అగస్త్యుడు) గురువు, 
సాక్షాత్తు ఈశ్వర పుత్రుడు.

అప్పుడు వేడుకుంటాడు “ఈశ్వరా తెలుసుకోలేక పోయాను, మీ చేతి గుద్దులు తిన్నాను, 
నాకు వరం ఇవ్వండి” అన్నాడు. 
ఏమిటో అడుగు అన్నాడు స్వామి. 
ఇడుంబుడు అన్నాడు, “స్వామీ, నేను ఈ పళనిలోనే కదా, కావిడి ఎత్తలేకపోయాను, 
ఈ కావిడి వల్లనే కదా, మిమ్మల్ని చేరడానికి మార్గం అయ్యింది, 
అందుచేత లోకంలో ఎవరైనా సుబ్రహ్మణ్యుడిని 
ఏ ఆరాధనా చెయ్యకపోయినా, 
ఒక్క సారి కావిడి పాలతో కాని, 
విభూతితో కాని, 
పూలతో కాని, 
తేనెతో కాని, 
నేతితో కాని భుజం మీద పెట్టుకుని, 
మేము సుబ్రహ్మణ్యుడి దగ్గరకి వెళ్ళిపోతున్నాం 
అని పాదచారులై నీ గుడికి వస్తే, 
అటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్యారాధన, 
శాస్త్రంలో ఎన్ని విధాలుగా చెయ్యాలని ఉందో, 
అంత ఆరాధనా చేసిన ఫలితం వాళ్లకి ఇచ్చేసెయ్యాలి” అన్నాడు ఇడుంబుడు.

స్వామి అనుగ్రహించి సరేనని ఆ కోరికని కటాక్షించి, 
ఇక పైన నా దగ్గరకు వచ్చే భక్తులు ఎవరైనా ముందు 
నీ దర్శనం చేసి నా వద్దకు రావాలని వరం ఇచ్చాడు. అందుకే అప్పటి నుంచి అన్ని సుబ్రహ్మణ్య క్షేత్రాలలో (ప్రత్యేకం గా తమిళనాడులో) స్వామి వారిని చేరే మార్గంలో ఇడుంబుడి మూర్తి ఉంటుంది, 
అక్కడ ఆయనకు నమస్కరించిన తరువాతే, సుబ్రహ్మణ్యుని దర్శనము చేసుకుంటారు.

అప్పటి నుంచి, తమిళ దేశం వాళ్ళు సుబ్రహ్మణ్య 
కావిళ్ళు ఎత్తి, 
సుబ్రహ్మణ్యుడిని తమ దైవం చేసేసుకున్నారు. 
అంతే కాక, ప్రతీ ఏటా స్కంద షష్ఠి ఉత్సవాలలో 
ఏ దంపతులైతే, భక్తితో, పూనికతో స్వామికి నమస్కరించి ఈ కావడి ఉత్సవంలో పాల్గొంటారో వాళ్లకి తప్పక సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. 
వారి వంశంలో సంతానము కలగక పోవడం అనే దోషం రాబోయే తరాలలో ఉన్నా కూడా ఆ దోష పరిహారం చేసి స్వామి అనుగ్రహిస్తాడు అని పెద్దలు చెప్తారు.
అంతటి శక్తివంతమైన క్షేత్రం, 
తప్పకుండా అందరూ చూడవలసిన క్షేత్రము పళని. 
పళని దండాయుధ పాణి స్వామి వారి దర్శనం చేసి, జీవితంలో ఒక్క సారైనా సుబ్రహ్మణ్య కావిడి ఎత్తి సుబ్రహ్మణ్య అనుగ్రహమును పొందగలమని ఆశిద్దాం.

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS