Thursday, July 12, 2018

14.07.2018 ఆషాఢమాసం ఆషాఢ మాస ప్రాముఖ్యత

14.07.2018ఆషాఢమాసం
ఆషాఢ మాస ప్రాముఖ్యత

పూర్వాషాడ నక్షత్రం లో కూడిన పౌర్ణమి ఉన్న నెలను ఆషాడ మాసం గా చెప్పబడింది. ఆషాడ మాసాన్ని శూన్య మాసం అని అంటారు. వర్షఋతువు కూడా ఈ మాసం లోనే ప్రారంభమవుతుంది. ఈ మాసం లో చేసే స్నానం, దానం, జపం , పారాయణలు, విశేష ఫలితాన్నిస్తాయి. ఆషాడం లో చేసే సముద్ర నదీస్నానాలు ఎంతో ముక్తిదాయకాలు . ఆషాఢమాసం లో పాదరక్షలు, గొడుగు, ఉప్పు దానం చేయడం మంచి ఫలితాలనిస్తుంది. ఆషాడ మాసం లోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది. కర్కాటకం లోనికి సూర్యుడు ప్రవేశించడం తోనే దక్షిణాయనం ఆరంభమవుతుంది. అంటే సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి తిరిగి మకర రాశిలో ప్రవేశించే వరకు దక్షిణాయనం అంటారు. ఈ ఆయనం లో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణం గా సంచరిస్తాడు. దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని కూడా చెప్పబడింది.
ఈ మాసం లోనే త్రిమూర్తి స్వరూపుడైన గురువుని ఆరాధించే పర్వదినం గురు పూర్ణిమ కూడా. దీనినే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు.
ఆషాడ శుద్ద విదియ నాడు పూరీ జగన్నాధ, బలభద్ర, సుభద్ర రథయాత్ర కన్నుల పండుగ గా జరుపుతారు.
ఆషాడ శుద్ద పంచమి స్కంధ పంచమి గా చెప్తారు. సుబ్రమణ్య స్వామి ని ఈ రోజు అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తారు. ఆషాడ షష్ఠి ని కుమార షష్ఠి గా జరుపుకొంటారు
ఆషాడ సప్తమి ని భాను సప్తమి గా చెప్పబడింది. ఉత్తరం నుంచి దక్షిణ దిశకు పయనిస్తున్న ప్రభాకరుడు మూడు నెలలు తర్వాత మధ్యకు చేరుకుంటాడు. ఆ రోజున పగలు, రాత్రి, నిమిషం ఘడియ విఘడియల తేడా లేకుండా సరిమనానం గా ఉంటాయి.
ఆషాడ శుద్ద ఏకాదశి ని తొలి ఏకాదశి అని శయన ఏకాదశి అని అంటారు. ఈరోజు నుండి చాతుర్మాస వ్రతం ఆరంభమవుతుంది. దీనినే మతత్రయ ఏకాదశి అని అంటారు.
ఆషాడ మాసంలోనే తెలంగాణా ప్రాంతం లో సంప్రదాయబద్దమైన బోనాల ఉత్సవాలను భక్తి శ్రద్దలతో జరుపుకొంటారు. మహంకాళి అమ్మవారి కోసం తయారు చేసే భోజనాన్ని బోనం గా చెప్తారు( భోజనానికి వికృతి పదమే బోనం) . దీనిని అమ్మవారికి నివేదన చేసే పర్వదినాన్నే బోనాలు అంటారు.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం లో ఈ పండుగ అత్యంత వైభవం గా జరుపుకొంటారు. సమస్త జగత్తుకు కారణమైనటువంటి అమ్మవారిని భక్తి శ్రద్దలతో పూజిస్తారు. అన్నం, బెల్లం, పెరుగు, పసుపు నీళ్ళు, వేపాకులు ఈ బోనం లో ఉంటాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి హానికలిగించే వ్యాదుల నుండి ఉపకరించేవి. ఈ సమయం లో ప్రకృతి లో జరిగే మార్పుల వలన అనారోగ్యాలపాలు కాకుండా ఇవి ఎంతో మేలు చేస్తాయి.
ఆషాడం అనారోగ్య మాసం అని కూడా మనందరికీ తెలుసు. విపరీతమైన ఈదురుగాలుల తో పుల్లచినుకులు పడే సమయం ఈ ఆషాడమాసమే. కాలువలోను, నదులలోను, ప్రవహించే నీరు పరిశుభ్రంగా ఉండదు. చెరువుల లోనికి వచ్చి చేరిన నీరు మలినం గా ఉండి మనుషుల ఆరోగ్యాలకు హాని కలిగిస్తుంది.
మనది వ్యవసాయ ఆధారిత దేశం. పొలం పనులన్నీ ఈ మాసం లోనే మొదలు పెడతారు రైతులు. చైత్ర వైశాఖ మాసాలలో వ్యవసాయపు పనులు ఉండవు. కాబట్టే ఈ సమయం లోనే వివాహాది శుభముహూర్తాలు ఎక్కువగా ఉంటాయి , ఈ రోజుల్లో కొత్తగా పెళ్లి అయిన యువకులు ఆరు నెలల కాలం అత్తా గారి ఇంట్లో ఉండే సంప్రదాయం ఉండేది. కష్టపడి వ్యవసాయపు పనులు చేయవలసిన యువకులు అత్తవారింట్లో కూర్చొని ఉంటే, సకాలం లో జరగాల్సిన పనులు జరగవు. వర్షాలకు తగినట్లుగా విత్తనాలు చల్లుకొనే రోజులు అవి. ఇప్పటి లాగ కాలువల ద్వారా నీరు లభించేది కాదు. సరైన సమయం లో విత్తనాలు చల్లక పొతే సంవత్సరమంతా దారిద్ర్యం తో బాధ పడవలసిందే. అందుకే కొత్త కోడలు పుట్టింట్లోనే ఉండాలి . అల్లుడు అత్తవారింటికి వెళ్ళ కూడదు అనే నియమం విధించారు పెద్దలు. ఇంటి ద్యాస తో పనులు సరిగా చేయరని ఆషాడమాస నియమం పెట్టారు. అంతే కాకుండా, అనారోగ్య మాసం ఆషాడం. కొత్త నీరు త్రాగటం వల్ల చలి జ్వరాలు, విరోచనాలు, తల నొప్పి మొదలైన రోగాలు వచ్చే సమయం, స్త్రీలు గర్భం ధరించడానికి మంచి సమయం కాదు, అనారోగ్య దినాలలోను అశుభ సమయాల లోను, గర్భధారణ జరిగితే ఉత్తమ సంతానం కలగదనే నమ్మకం కూడా ఉంది. ఇన్ని కారణాల వల్ల ఆషాడమాసాన్ని కొన్ని పనులకు నిషిద్దం చేసారు మన పెద్దలు.


No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS