Friday, March 18, 2022

షోడశోపచార పూజ

 షోడశోపచార పూజ



హిందువులు షోడశోపచార పూజా విధానంలో దేవుణ్ణి  పూజిస్తారు. షోడశ అనగా పదహారు.   ఉపచారాలు అనగా సేవలు.


 పూజా వస్తువులు 

 అవి వరుసగా 

 1.ఆవాహనం = మనస్ఫూర్తిగా ఇంట్లోకి ఆహ్వానించాలి. 

 2.ఆసనం = వచ్చిన వారిని కూర్చోబెట్టాలి.  

 3పాద్యం = పాద పూజ చేయాలి.  

 4.ఆర్ఘ్యం = చేతులు శుభ్రపరచాలి. 

 5.ఆచమనీయం = దాహమునకు మంచి నీళ్ళివ్వడము. 

 6.స్నానం = శుభ్రమైన నీటితో అభిషేకము చేయాలి. 

 7.వస్త్రం = పొడి బట్టలు కట్టాలి. 

 8.యజ్ఞోపవీతం = యజ్ఞోపవీతమును మార్చాలి. 

 9..గంధం = శ్రీ గంధము చెట్టు చెక్కను సానపై సాదగా వచ్చిన సుగంధమును అలంకరించాలి. 

 10.పుష్పం = పువ్వులతో అలంకరించాలి. 

 11.ధూపం = అగరు బత్తీలు వెలిగించి ఉంచాలి. 

 12.దీపం = ఆవు నెయ్యి లేదా మంచి నూనెతో దీపము వెలిగించాలి. 

 13.నైవేద్యం = మడితో వండిన ఆహారమును లేదా ఫలములు, బెల్లము, మొదలగునవి సమర్పించాలి. 

 14.తాంబూలం = తమలపాకులు వక్కలు తాంబూలముగా ఉంచాలి. 

 15.నమస్కారం = మనస్పూర్తిగా నమస్కరించాలి. 

 16.ప్రదక్షిణం = మన కుడి భుజము వైపున దేవుడు ఉండేలా చూచుకొని దేవుని చుట్టూ తిరగటము.


 నైవేద్యం:---


భగవంతుడికి నివేధించేప్పుడు ఎటువంటి పొరపాట్లు చేయరాదు . తెలిసి చెసినా,తెలియక చేసినా తప్పు తప్పే అంటారు. కనుక నివేధించేప్పుడు ప్రతివారు తప్పక చేయవలసినవి.


1. దేవునికి నైవేద్యం గా పెట్టడానికి చేసిన వంటకాలలో నుంచి కొంత విడిగా తీయరాదు .పాత్ర మొత్తాన్ని దేవుని ఎదుట పెట్టాలి .


 2. పదార్ధాలు వేడిగా ఉన్నప్పుడు నివేదిoచరాదు . చల్లారాక పెట్టాలి.


 3. నివేదనలో మంచినీటిని కుడా తప్పనిసరిగా పెట్టాలి.


 4. నివేదించే వంటకాలలో పంచదారకు బదులు బెల్లం వాడాలి.

 ఫలాలు:--  

వివిద ఫలాల నైవేద్యం - ఫలితాలు

 కొబ్బరి కాయ ( పూర్ణ ఫలం ) - భగవంతుడికి కొబ్బరి కాయను నైవేద్యం గా సమర్పిస్తే మొదలు పెట్టిన పనులన్నీ త్వరితగతిన సులభంగా విజయవంతం అవుతాయి. 

 అరటి పండు - భగవంతుడికి అరటిపండు నైవేద్యం గా సమర్పిస్తే సకల కార్యసిద్ధి జరుగుతుంది. అరటిపండు గుజ్జుగా చేసి నైవేద్యం గా సమర్పిస్తే అప్పుల బాధనుండి విముక్తి పొందుతారు. చేజారిన సొమ్ము తిరిగి సకాలంలో చేతికి అందుతుంది. 


 చిన్న అరటిపళ్లు నైవేద్యం గా సమర్పిస్తే మద్యలో నిలిచిపోయిన పనులు సక్రమంగా పూర్తి అవుతాయి. 

 నేరెడు పండు. - శనీశ్వరునికి నేరెడు పండు నైవేద్యం గా పెట్టి ఆ ప్రసాదాన్ని తింటే వెన్నునొప్పి, నడుమునొప్పి, మోకాళ్ల నొప్పి వంటివి తొలిగిపోయి ఆరొగ్య వంతులు అవుతారు. 

 ద్రాక్ష పండు. - భగవంతుడికి నివేదించిన ద్రాక్ష పండ్లు ముందు చిన్నపిల్లలకు, తరవాత పెద్దలకు పంచినట్లైతే ఎల్లవేళలా సుఖసంతోషాలతో వర్దిల్లుతారు. రోగాలు నశిస్తాయి. కార్యజయం లభిస్తుంది. 

 మామిడి పండు. - మామిడి పండుని నైవేద్యం గా పెడితే ప్రభుత్వం నుంచి రావలసిన నగదు ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో అందుతుంది. నమ్మి మోసపోయినప్పుడు నైవేద్యం గా పెట్టిన మామిడి పండుని దేవునికి అభిషేకం చేసిన తేనెలో కలిపి నైవేద్యం గా పెట్టి అందరికి పంచి తరువాత తిన్నట్లయితే మోసం చేసిన వారు స్వయంగా మీ నగదును మీకు తిరిగి ఇచ్చేస్తారు. 

 అంజూర పండు. - భగవంతుడికి నైవేద్యం పెట్టిన అo జూరాపండు ను అందరికి పంచిన తరువాత తిన్నవారికి ఆనారోగ్య భాధలు అన్ని తొలగి ఆరొగ్య వంతులు అవుతారు.

 సపోట పండు. - సపోట పండు నైవేద్యం గా సమర్పిస్తే పెళ్లి నిశ్చయ సంభంద విషయాలలో అవాంతరాలు అన్ని తొలగిపోతాయి. 

 యాపిల్ పండు - భగవంతుడికి యాపిల్ పండు ని నైవేద్యంగా పెడితే దారిద్ర్యం తొలగి ధనవంతులు అవుతారు. కమలా పండు. - భగవంతుడికి కమలా పండు నివేదించి నట్లయితే నిలిచిపోయన పనులు సజావుగా పూర్తి అవుతాయి. 

 పనసపండు - పనసపండు ని దేవుడికి నైవేద్యంగా పెడితే శత్రు నాశనము, రోగావిముక్తి కలిగి సుఖంగా ఉంటారు.

               

మన చేసుకునే పూజా విధానంలోని క్రియలలో అంతరార్థము...!!


1. గంటలు :


దేవాలయాల్లో పూజ సమయంలో గంటలు వాయిస్తారు. దీనివల్ల రెండు విధాల ప్రయోజనం ఉంది. 


ఒకటి-బయటి ప్రపంచంలో శబ్దాలు లోపలికి ప్రవేశించకుండా చేయడం, 

రెండవది-మనస్సును దేవుని మీదికి ఏకాగ్రంగా మళ్లించడంలో తోడ్పడుతుంది.



2.దీప హారతి:


దీపాన్ని వెలిగించి దేవుని విగ్రహం ముందు తిప్పడం. దీనిలోని అంతరార్థం ఏమిటంటే దైవాన్ని జ్యోతి స్వరూపంగా భావించడం. 


దైవమే కాంతి. 

ఆ సమయంలో భక్తుల భావన ఈ విధంగా ఉంటుంది.  స్వామీ! నీవే ఈ విశ్వంలో స్వయం ప్రభవమైన జ్యోతివి. సూర్యుడు, చంద్రుడు అన్నీ వీటిలోని తేజస్సు ,కాంతివి నీవే. 


నీ దివ్య కాంతిచే మాలోని చీకటిని తొలగించి, 

మా బుద్ధిని ప్రభావితం చేయి" అని.



3. ధూపం:


భగవంతుని ముందు పరిమళాలు వెదజల్లే అగరువత్తులను వెలిగిస్తాము. 

వాటి సువాసనలు అన్ని దిక్కులా వ్యాపిస్తాయి. 


వీటి ధూపం క్రిమిసంహారిణిగా కూడా పనిచేస్తుంది. భగవంతుడు సర్వవ్యాపి. 

విశ్వమంతా నిండియున్నాడు అన్న భావన 

అందరిలో కలుగుతుంది.


ఈ విషయం అక్కడ ఉన్న వారందరికీ మాటి మాటికీ 

జ్ఞప్తి చేసినట్లవుతుంది.



4. కర్పూర హారతి:


వ్యక్తిగతమైన అహంకారము కర్పూరమువలె కరిగిపోవాలని ఈ హారతిలోని అంతరార్థం. 


ఈ విధంగా జీవాత్మ పరమాత్మతో ఐక్యం కావాలని 

భక్తులు కోరుకుంటారు.



5. గంధపు సేవ:


ఈ సేవలో చాలా అర్థం ఉంది. 

భగవంతుని విగ్రహానికి పూయడానికి గంధాన్ని మెత్తగా నూరుతారు. 


అంత శ్రమకు లోనయినప్పటికీ గంధం ఓర్పుతో సహించి, మంచి పరిమళాన్ని వెదజల్లి ఆహ్లదం కలిగిస్తుంది. 

ఆ విధంగానే ఎన్ని కష్టాలకు లోనయినప్పటికీ భక్తుడు చలించక కష్టాలను చిరునవ్వుతో స్వీకరించాలి.


 ఎటువంటి పరిస్థితుల్లోనూ శత్రువుకైనా అపకారం తలపెట్టకూడదు. 

ఇదే ఈ గంధసేవలోని అంతరార్థం. 



6. పూజ:


దేవునికి పత్రం, పుష్పం, ఫలం, తోయం అనే వాటిని భక్తులు పూజలో సమర్పిస్తారు. 


కాని భగవంతునికి వీటితో పనిలేదు. 

నిజానికి ఏ విధమైన వస్తువులు భక్తులు సమర్పించాలని భగవంతుడు కోరడు. 

కాని ఆ అర్పణలో ఎంతో పరమార్థం ఉంది.



7 పత్రం(శరీరము):


ఇది త్రిగుణాలతో కూడుకున్నది. 

పూజలో దీనిని భగవంతునికి అర్పిస్తాడు.



8 పుష్పం (హృదయము):


ఇక్కడ పుష్పం అంటే చెట్ల మీద పూచే పూవు 

అని అర్థం కాదు. 


సుగంధ పరిమళాలను వెదజల్లే హృదయ కుసుమం 

అని అర్థం. 


ఇటువంటి హృదయ కుసుమాన్ని దైవపరంగా అర్పించాలి.



9 ఫలం (మనస్సు):


మనస్సు ఫలాలను అంటే మనం చేసే కర్మల ఫలితాలను మనం ఆశించక భగవంతునికి అర్పితం చేయాలి.

దాన్నే త్యాగం అంటారు.



10. తోయం(నీరు):


భగవంతునికి అర్పించవలసిన నీరు అంటే మనలోని హృదయపూర్వకమైన ప్రేమ, ఆనందం మొదలైన 

దివ్య భావాల వల్ల వెలువడే ఆనంద భాష్పాలు 

దైవానికే అర్పితం కావాలి.



11 కొబ్బరికాయలు:


హృదయం అనే కొబ్బరికాయ కోరికలు అనే పీచుతో కప్పబడి ఉంటుంది. 

దానిలో ఉండే నీరు సంస్కారము. 


కోరికలు అనే పీచును హృదయం అనే కొబ్బరికాయ నుంచి వేరుజేసి, తీయనైన కొబ్బరిని భగవంతునికి అర్పితం చేయాలి. 


అదే నిజమైన నివేదన. 

లోపల సంస్కారము అనేవి వున్నంతకాలం, 

హృదయం శరీరాన్ని కదలకుండా అంటిపెట్టుకొని ఉంటుంది. 


హృదయము అనే కొబ్బరికాయను పీచు అనే కోరిక వాసన వదలదు. 

మనంచేసే పనులను విత్తనాలతో పోలుస్తారు.


మంచి విత్తనం వేస్తే మంచి మొక్క ఎట్లా మొలుస్తుందో మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.



12. నమస్కారము:


చేతులు జోడించగానే పదివేళ్లు కలసివుంటాయి. 

ఈ పదివేళ్లు పది ఇంద్రియములకు గుర్తు. ఇందులో కర్మేంద్రియ,జ్ఞానేంద్రియములను హృదయములోని పరమాత్మకు కైంకర్యము చేయుచున్నాను అని చేతులు జోడించుటయే నమస్కారములోని అంతరార్థము.



13. ప్రదక్షిణము:


ముల్లోకములన్నియు భగవంతుని స్వరూపముతో నిండివున్నాయి. 

ఆ భగవంతుని సగుణాకరామైన విగ్రహమునకు గాని, లింగమునకు గాని, ప్రదక్షిణము చేసినట్లయిన ముల్లోకములు చుట్టి సర్వదేవతలకు నమస్కారములు చేసిన ఫలితము వుంటుంది.. 


అందుకే ప్రదక్షిణము పూజాంగములలో ఒకటిగా చేర్చారు

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS