Friday, March 11, 2022

అద్భుత విషయాలు.............!!

 అద్భుత విషయాలు.............!!



1. చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయుట, 

ఒట్టు పెట్టుట దోషం.


2. నిలబడికాని, అటూఇటూ తిరుగుతూ కాని 

అన్నం తినటం వల్ల క్రమంగా దరిద్రుడౌతాడు. 

రాబోయే జన్మలో బిచ్చగాడు అవుతాడు.


3. నోట్లో వ్రేళ్ళు పెట్టుకొనుట, గోళ్ళుకొరుకుట చేయరాదు.


4. దేవాలయ ప్రాంగణంలో ఉమ్మడం, పొగత్రాగటం 

రెండూ నిషిద్దాలే.


5. ఆదివారం, శుక్రవారం, మంగళవారం తులసి ఆకులు కోయరాదు.


6. చీకటి పడ్డాక పువ్వులు, ఆకులు చెట్లనుండి త్రుంచరాదు.


7. గురువుద్వారా మంత్రోపదేశం పొందనివాడు 

ఎప్పటికీ తరించలేడు. కనుక ఉపదేశం పొందితీరాలి.


8. చెట్లు, దేవతా విగ్రహాలు ఈశాన్యంలో ఉంటే 

వాటిని బరువులుగా భావించి తీసివేసేవారు, తీసివేయమని సలహా ఇచ్చేవారు ఏడు జన్మలు 

ఉబ్బసపు రోగులుగా పుడతారు. 

ఈ పనులు చేయుట దైవద్రోహం కనుక చేయరాదు.


9. గురువులకు, అర్చకులకు, పౌరాణికులకు 

సరిగా పారితోషంఇవ్వక, వారికి ఋణపడేవారు నూరుజన్మలు కుక్కలుగా, చండాలురుగా పుట్టి 

కష్టనష్టాల పాలవుతారు.


10. శివలింగార్చన ఆడవారు కూడా చేయవచ్చు.


11. ఇంట్లో విగ్రహాలుంటే ఏమీ ప్రమాదం లేదు. 

పరులకు అపకారం కోరి పూజ చేసేవారికి మాత్రమే నియమాలు. 

తక్కిన వారికి పూజా విషయాలలో పెద్ద పెద్ద 

నియమాలు లేవు.


12. నిద్రనుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి వామన నామస్మరణ చేయాలి.


13. పాచి ముఖంతో అద్దం చూసుకొనరాదు.


14. హారతి ఇచ్చాక దేవునిపై నీరు చల్లాలి. 

హారతి ఇచ్చే పాత్రపై కాదు.


15. తీర్థం తీసుకున్నాక, ఆ చేతిని కడుక్కోవాలి తప్ప, అరచేతిని తలపై రాసుకొనరాదు.


16. స్నానం చేశాక శరీరం తుడుచుకొని తడి-పొడి తువ్వాలు కట్టుకొని పూజ చేయరాదు. 

పూజా మందిరంలో ప్రవేశించరాదు. 

పూర్తిగా ఆ తుండును తడిపి నీరు పిండి మాత్రమే కట్టుకోవాలి. 

లేదా వేరే శుభ్రమైన వస్త్రాలు పూజకు ధరించాలి.


17. ఉపవాసం ఉన్నపుడు, జాగరణ చేసినపుడు పరులదోషాలు తలుచుకోరాదు.


18. శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు. కొంచెం దూరం ఉంచాలి.


19. తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు, గురువులకు పెట్టరాదు. 

సాధ్యమైనంత జాగ్రత్త వహించాలి. 

పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే ఆ అన్నం తీసివేసి మళ్ళీ వడ్డించి నేయి వేయాలి.


20. అన్నం తింటున్న వారెవరినీ తిట్టరాదు, 

దెప్పి పొడవరాదు.


21. నిజం తెలుసుకోకుండా ఎవరినీ నిందించరాదు, అభాండాలు వేయరాదు. 

అలా చేస్తే అవతలి వారి పాపాలన్నీ అభాండాలు వేసిన వారి తలకు చుట్టుకుంటాయి.


22. ఇస్తానని వాగ్దానం చేసి దానమివ్వనివాడు వందజన్మలు దరిద్రుడై పుడతాడు, 

వాగ్బంగం చాలా దోషం.


23. అన్నం తినేటప్పుడు కంచానికి బాగా దగ్గరగా కూరలు, మజ్జిగ మున్నగునవి ఉన్నపాత్రలు పెట్టరాదు. మనం తినేటప్పుడు ఎంగిలి ఆ పాత్రలలో పడితే 

ఆ పదార్థాన్ని మరొకరికి వడ్డిస్తే, 

వాడికి "యముడు" మల ముత్రాదులు ఆహారంగా ఇస్తాడు.


24. తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే 

మంచి జన్మలు కలుగుతాయి. 

దీనిని కాయిక తపస్సు అంటారు.


25. గురువునకు ఉపదేశ సమయాలలో కాని, పురాణాదులు వినేటప్పుడు కాని పాదాలు ఒత్తితే 

7 జన్మల పాపాలు తొలుగుతాయి.


26. గురువుగారి బట్టలు ఉతికి ఆరవేసిన వారికి 

మూడు జన్మల పాపాలు తొలగుతాయి.


27. మంత్రోపదేశం చేసిన గురుని ఆజ్ఞ పాటించేవారికి 

ఏ పాపమూ అంటదు. పునర్జన్మ ఉండదు. 

(ఇది తప్పక పాటించవలసిన ముఖ్య పవిత్ర నియమము. దీనికి సాటి మరొకటి లేదు). 

పరాశర సంహితలో ఈ విషయాలున్నాయి.


28. అష్టమి, పూర్ణిమ, చతుర్థశి కాలంలో స్వయంపాకం దానం చేస్తే అన్నపానాలకు ఏనాడు లోటుండదు.


29. ఎక్కువ వేడిగా, ఎక్కువ చల్లగా ఉండే పదార్థాలు స్వీకరించరాదు.


30. భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరవేయకుండా వాటితో దైవపూజ చేయరాదు.


31. శవాన్ని స్మశానం దాకా మోసినా, 

శవాన్ని ఇంటి దగ్గర ఉండటానికి అనుమతినిచ్చినా నరకానికి పోకుండా స్వర్గానికి పోతాము.


32. గృహప్రవేశ కాలంలో గాని, ఏడాదిలోపు గాని 

ఆ ఇంట మణిద్వీప పారాయణం చేయడం మంచిది. 

ఇది వాస్తుదోషాలను పరిహరిస్తుంది.


33. భోజనానికి ముందు, అనంతరం కూడా 

కాళ్ళు కడుక్కోవాలి.


34. సకల పురాణేతిహాస కోవిదుడు కాని వాని వద్ద మంత్రోపదేశం పొందరాదు.


35. పుట్టిన రోజునాడు దీపాలు కానీ, కొవ్వొత్తులు కానీ ఆర్పరాదు. నోటితో అగ్నిని ఊదుట ఘోరపాపం. అటువంటివారు గ్రహణపు మొర్రితో మళ్ళీ జన్మమెత్తి దుఃఖాలు పొందుతారు.


36. తలకి నూనె రాసుకొని ఆ చేతులతో పాదాలకు 

ఆ నూనెజిడ్డు పులమరాదు.


37. శుక్ర, శనివారం వంటి వార నియమాలు పెట్టుకున్నవారు హోటలు టిఫిన్లు తినుటగానీ, 

ఆనాటి అల్పహారాదులలో ఉల్లి వాడుట కాని నిషేదము. ఇది ప్రయాణ మధ్యంలో ఉన్న వారికి వర్తించదు.


38. చీటికి, మాటికి యజ్ఞోపవీతం తీసి పక్కనపెట్టడం, తాళి తీసేస్తుండటం రెండూ భయంకర దోషాలే.


39. క్రూరుడు, దుష్టుడు కాని మగనితో తాళికట్టించుకొన్న భార్య, కాపురం చేయక ఏడిపించటం, 

చెప్పిన మాట వినకపోవటం, 

తాళి తీసి భర్త చేతిలో పెట్టడం చేయరాదు. 

ఇలా చేసిన స్త్రీలకి వంద జన్మలలో వైధవ్యం కానీ, 

అసలు పెళ్లి కాకపోవడం జరుగుతుంది.


40. దీపాలు పెట్టేవేళ తలదువ్వుకోరాదు. 

ఇలా చేసిన స్త్రీలకి వందల జన్మలలో వైధవ్యం కాని, అసలు పెళ్లి జరగకపోవడం వంటివి జరుగుతాయి.


41. దిగంబరంగా నిద్రపోరాదు.


42. కలియుగంలో ఆలయంలో జంతువధ నిషేధం.


43. విజయదశమి, శివరాత్రి దినాలలో మాంసాహారం, ఉల్లి పనికిరాదు.


44. ఆచమనం చేసిన నీటిని దైవనివేదనలకు, 

అర్చనలకు వాడరాదు, 

కనుక వేరొక పాత్రలో శుద్ధ జలాన్ని ఈ కార్యాలకు వినియోగించుకోడానికి తెచ్చుకోవాలి.


45. దీపారాధనకు అగ్గిపెట్టె వాడకూడదని ఏ శాస్త్రాలు చెప్పలేదు. కనుక అగ్గిపెట్టెతో దీపం వెలిగించుకోవచ్చు.


46. దీపారాధనకు ఒక కుంది మాత్రమే వాడినపుడు మూడు వత్తులు వేయాలి.


47. కొబ్బరికాయ కొట్టాక వెనుకవైపు పీచు తీయాలనే నియమం కూడా తప్పనిసరి కాదు. 

శుభ్రత కోసం పీచు తీయవచ్చు, తీయకపోతే దోషం లేదు.


48. కొబ్బరికాయను నీళ్ళతో కడిగి కొట్టడం చాలా తప్పు, కొబ్బరికాయను పీచు ఒలిచివేశాక నీళ్ళతో కడగరాదు.


49. మాడిన అన్నం, అడుగంటిన పాయసం, 

కంపు వచ్చే నేయి ఇటువంటివి నైవేద్యానికి పనికిరావు.


50. ఆలయ ప్రాంగణంలో అర్చకునిపై కేకలు వేయరాదు. అర్చకునిలో దోషం ఉంటే బయటకు పిలిచి మందలించాలి లేదా మరింత దుష్టుడైన అర్చకునినైతే మూడు మాసాల జీతమిచ్చి ఆ పదవినుంచి తొలగించి వేయాలి.


సర్వేజనా సుఖినోభావంత్

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS