Monday, March 23, 2020

శక్తి పీఠాలు సప్తమాతృకాలు

దేవుళ్ళ-దేవీ స్వరూపాలు
మన పురాణాల ప్రకారం  దేవుళ్ళు తమలో  ఉన్న  శక్తుల ను  స్త్రీ  రూపాల లో  నిక్షిప్తం  చేసి  ప్రతిష్టించా రు  దేవుళ్ళ కు  ఉన్న ఏడు  స్త్రీ  శక్తి ప్రతిరూపాలే సప్తమాతృకాలు.
వీరే బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. కొన్ని నమ్మకాల ప్రకారం ఎనిమిదో మాతృకగా నారసింహినీ మరికొన్ని సంప్రదాయాలలో తొమ్మిదవ మాతృకగా వినాయకిని ఆరాధించడం జరుగుతోంది. దుష్టశిక్షణ కోసమూ, భక్తులకు కాచేందుకు ఈ సప్తమాతృకలు సిద్ధంగా ఉంటారు.
తొలి మధ్య యుగంలో ప్రచలితమైన ఆరాధనా పద్ధతిగా శాక్తం ఉంది. శక్తి (స్త్రీశక్తి)ని యాంత్రిక, దైవశక్తుల సాధన కోసం, పూజించే ఆరాధన ఇది. జనన మరణ చక్రం నుండి విముక్తి పొందటం ఈ ఆరాధన పద్ధతి అంతిమ లక్ష్యం. శాసనాలు, సాహిత్యం, దేవాలయ కుడ్యాలపై ఆధ్యాత్మిక ప్రాతినిధ్య చిహ్నాలు- లాంటి ఆధారాల వల్ల ఈ ఆరాధనా పద్ధతి తెలుస్తున్నది. ఆ కాలంలో స్త్రీ శక్తి ఆరాధన ఎట్లా ఉండేదో చెబుతున్న వ్యాసం ఇది.
తొలి మధ్యయుగంలో శాక్త ఆరాధనా పద్ధతి భారత దేశంలో బాగా వ్యాప్తి చెందింది.
కాశ్మీరు, బెంగాలు, మిథిల, కామరూప, నైరుతి రాజస్థాన్‌, కథియవార్‌, దక్కను పీఠభూమి, కేరల, ఒరిస్సా, మహారాష్ట్ర, దక్షిణ కెనరాలలో జనులు ఉత్సాహంగా శక్తి ఆరాధనా పద్ధతిని పాటించేవారు. 
సప్తమాతృకలు


గుప్తుల కాలంలో అధికభాగం మాతృక (మాతృదేవత నిర్గమనలు) భావన పరిణామం పొందింది.

చాళుక్యుల కాలంలో దక్కనులో జనాదరణ పొందింది. ఈ కాలంలో, పాలకవర్గ నాయకులు మాతృకల లేక మాతృ రూపంలో పూజించేవారు. ఈ రూపాన్ని శాక్తులు తమ ఆరాధనా పద్ధతిలో చేర్చుకున్నారు.
వాతాపి/బాదామి చాళుక్య పాలకులు తమ ప్రశస్తి లేక శాసనాల్లో నిరంతరం తాము సప్తమాతృకల వల్ల పోషితులమైనట్లు చెప్పుకున్నారు. ఈ సప్తమాతృకలు సప్త ప్రపంచాల తల్లులు. చాళుక్యులు తమ కులదేవతలుగా భావించిన సప్తమాతృకలు దివ్యమాత సంబంధితులు. ఈ మాతృకలు ప్రముఖ దేవతలైన బ్రహ్మ, మహేశ్వరుడు, విష్ణువు, ఇంద్రుడు, కుమారుడు, వరాహుడు, నృశింహుని మానవీకరణ శక్తులు. వారిని బ్రాహ్మి, మహేశ్వరి, వైష్ణవి, ఇంద్రాణి, కౌమారి, వారాహి, నారసింహి లేక చాముండి అని పిలుస్తారు. పురాణాల్లో వీరు కౌశిక లేక చండిక దేవత సంతానంగాను, సాక్షాత్‌ దేవిగానే వీరిని గుర్తించడం జరిగింది. సప్తమాతృకల ఆరాధనా పద్ధతి ప్రజాదరణలో పతాక స్థాయిని చేరుకుంది.
అన్ని శైవ ఆలయాల్లో శిల్పాల్లో వీరిని చెక్కడం, ముఖ్యంగా తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఈ దేవతలకు పరివార దేవతలుగా ప్రముఖ స్థానం లభించింది. చాళుక్యుల కాలంలో మొత్తం తెలుగు నేలపై ఆలయ భవనాల్లోని ఉప ఆలయాల్లో వారిని ప్రతిష్టించారు.
వారు మాతృగణాలతో పరిపాలించబడతారని (మాతృగణ పాలితానాం) వేంగి చాళుక్య శాసనాలు చెబుతాయి. శివునికి సేవ చేసే అర్థ- దేవతలను సామా న్యంగా మాతృగణాలని వ్యవహరిస్తారు. గణం అంటే ఒక తెగ, వర్గం, లేక సైన్యం అని అర్థం. దీన్నిబట్టి ఈ పదం గిరిజన దేవతలను తెలియజేస్తుంది. అట్లా చాళుక్యులు తమ రక్షక దేవతలుగా సప్తమాత్రృకలను గ్రహించారని చెప్ప వచ్చు.
నిజానికి వాతాపి చాళుక్య సంప్రదాయంలో, వేంగి చాళుక్యుల సంప్రదా యంలో మాతృ అని సప్తమాతృకల ఆరాధనా పద్ధతిని ప్రస్తావిం చడం వల్ల ఆకాలంలో శాక్తం మనుగడలో ఉందని అర్థమవుతున్నది. శాక్తంలో స్త్రీ సూత్రం ప్రబల పాత్ర వహిస్తుంది. తొలి మధ్యయుగంలో ఇది స్వతంత్ర ఆరాధనా రూపంగా అభివృద్ధి చెందింది. చాళుక్యభీమవరం లాంటి ఆలయాల్లో శిల్ప ప్రాతినిధ్యం దేవతల జనాదరణను, వారి పూజను స్పష్టంగా నిరూపిస్తుంది.
కౌశికి, వింధ్యవాసిని వంటి దేవతల పేర్లు ఈ కాలపు శాసనాల్లో కనిపిస్తాయి. వీరే గాక 'యోగిని' అనే దేవతల వర్గం కనిపిస్తుంది. యోగినిలు అరవై నాలుగు మంది.
అసంఖ్యాకంగా గుణించుకోగలిగిన శక్తి వారికుంది.తాంత్రిక ఆరాధనా పద్ధతిలో ఈ యోగినులకు చాలా సంబంధం ఉంది.
కులార్ణవ తంత్రం కౌల మార్గ అను యాయుల్లో యోగినుల స్థాయిని, వారి ప్రాముఖ్యం కనిపిస్తుంది. యోగిని పూజలో ముఖ్య ప్రయోజనం నిగూఢ శక్తులను కైవశం చేసుకోవడం. ఇప్పుడు ప్రతి గ్రామంలో ఎల్లమ్మ వంటి దేవతలు, ఇతర గ్రామ దేవతల గుడులు చూస్తున్నాం. గ్రామాల్లో దేవతల పేరున జరిపే అసక్తికర పూజాదికాలను చూస్తు న్నాం. వాస్తవానికి ఇవన్నీ భూదేవతను ఉద్దేశించి నవే. కనుక అవి గ్రామ, పట్టణ ప్రజల జీవితాలతో సాన్నిహిత్యం ఉన్నటువంటివిగా గుర్తించాలి.
శక్తి పీఠాలు
శక్తి పీఠాలు అని పిలిచే చాలా ప్రదేశాల్లో శక్తి పూజ నిర్వహిస్తారు. అవన్నీ కూడా శాక్తతీర్థస్థానాలు. తొలి కాలాల్లో ఈ పీఠాల్లో సాధ్వినులు లేక యోగినులు ధ్యానించి సిద్ధి పొందేవారు. అట్లాంటి పీఠాలను సిద్ధి పీఠాలని పిల్చేవారు.
మాతృదేవత అవయవాల్లో సన్నిహిష్ట, శక్తిపీఠ భావనకు లింగంతో ముఖ్య సంబంధం ఉన్నట్లు కనిపిస్తుంది. కొన్ని తంత్రాలు నాలుగు ముఖ్య పీఠాలను ప్రస్తావిస్తున్నాయి.
అవి శారదా పీఠం (కాశ్మీర్‌), తుల్జాభవాని ఆలయం (మహారాష్ట్ర), కామాఖ్య ఆలయం (అస్సాం), జాలంధర (పంజాబు).
ఈ ప్రదేశాలను దర్శించిన చైనా పర్యాటకుడు అవి శక్తి ఆరాధనా ముఖ్య కేంద్రాలని పేర్కొన్నాడు.
దేశంలోని అష్టాదశ శక్తి పీఠాల్లో తెలుగు దేశంలోని శ్రీశైలం (భ్రమరాంబ), అలంపూర్‌ (జోగుళాంబ), పిఠాపురం (పురుహూతికా) ప్రసిద్ధాలు.
#శ్రీశైలం
నల్లమలై పర్వతాల దట్టమైన అడవుల్లో శ్రీశైల భ్రమరాంబిక శక్తి పీఠం ఉంది.

మల్లిఖార్జునుడుగా పూజలందుకుంటున్న శివుని భార్యగా భ్రమరాంబను జనం కొలుస్తున్నారు. భ్రమరాంబికా దేవి కాళి రూపం. ఆమెను మొదట్లో మాధవి అని పిలిచేవారు. మహాభారత కాలాన్నుండి ఈ ప్రాంతాన్ని పవిత్రమైనదిగా భావిస్తున్నట్లు తెలుస్తున్నది. మహాశివుని వృషభుడు తపస్సు చేసిన ప్రదేశం అది అనీ, తన భార్య భ్రమరాంబతో మల్లిఖార్జునుని రూపంలో శివుడు అతణ్ణి సంతోషపెట్టడం కోసం ప్రత్యక్షమయ్యాడని పురాణాలు చెబుతున్నాయి. అయితే దేవాలయంలోని శిలాశాసనాలు కంటే వెనక్కి తీసుకెళ్లవు. ఈ కాలంలో ప్రతాపరుద్రుడు వరంగల్‌ని పాలిస్తున్నాడు. ఆలయంలోని తొలి కాలపు శాసనాలు అతని పాలనా కాలాన్ని ప్రస్తావిస్తాయి. ఆ తరువాత విజయనగర రాజులు ఆలయాన్ని అభివృద్ధి పరిచారు.
అలంపురం
శ్రీశైలానికి పశ్చిమ ద్వారం అని భావించే అలంపురం ద్వాదశ జ్యోతిర్లింగాల్లోను, అష్టాదశ శక్తి పీఠాల్లోను ఒకటి.

బాలబ్రహ్మేశ్వరుడు, ఆయన సతి యోగిని లేక జోగులాంబ (పార్వతికి మరోపేరు) ఇక్కడ కొలువుదీరి ఉంది. ఈ స్థల పురాణాన్ని స్కందపురాణం ఇట్లా పెర్కొంటున్నది: ఈ ప్రదేశంలో బ్రహ్మ వెయ్యి సంవత్సరాలు ఘోర తపస్సు చేసి, శివుణ్ణి మెప్పిస్తే, ఆయన బ్రహ్మకు సృజన శక్తులు ప్రసాదించాడు. అందుకే ఇక్కడి దేవుణ్ణి బ్రహ్మేశ్వరుడంటారు.
 *జోగులాంబ మూలాల గురించి స్థల పురాణం-*
ఆమెను గ్రామదేవత ఎల్లమ్మగాను, భూదేవిగాను కొలుస్తారని చెబుతుంది. క్రీ.శ.12 శతాబ్దం నాటి గొప్ప తెలుగు కవి పాలకురికి సోమనాథుడు తన పండితారాధ్య చరిత్రలో ఈక్షేత్రం గురించి పేర్కొన్నాడు.
పిఠాపురం
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో మరో శక్తి పీఠం ఉంది. కుక్కుటేశ్వర స్వామి, ఆయన భార్య పురుహూతిక లేక రాజేశ్వరీదేవి అక్కడ కొలువుదీరిన దేవతలు. ఈ ఆలయంలో శివుడు కోడి ఆకారంలో ఉండటం వల్ల ఆయన్ని కుక్కుటేశ్వరస్వామి అంటారు. దుర్గను పురుహూతికాదేవి అని పిలుస్తారు. ఈ దేవత పేరుమీదగానే ఈ ఊరుకు పిఠాపురం పేరు వచ్చిందని జనం నమ్మకం.

ద్రాక్షారామం
ఇక్కడ కొలువుదీరిన మాణిక్యాంబాదేవి తన శక్తి చక్రానికి సుప్రసిద్ధం. ఈ చక్రంపై పార్వతీ దేవి ఆశీనురాలై ఉంది. భారతదేశంలోని అష్టాదశ పీఠాల్లో ఈ ఆలయంకూడా ఒకటిగా భావిస్తారు.

త్రిపురాంతకం
త్రిపురాంతకాన్ని కుమారగిరి అని కూడా అంటారు. ఇది చరిత్ర ప్రసిద్ధ ప్రదేశం. కొలువుదీరిన దేవుడు త్రిపురాంతకదేవుడు. దేవి పేరు త్రిపురసుందరీ దేవి. ఈమెను శక్తి అవతారంగా కొలుస్తారు. ఇక్కడ ఉన్న శిల్పాలు, శాసనాలను బట్టి ఇది శాక్త క్షేత్రంగా భావించవచ్చు.

విజయవాడ కనకదుర్గ, నందవరం చౌడేశ్వరీదేవి, చందలూరు మహాలక్ష్మి, నన్నూరు హుంకార శాంకరీదేవి కూడా జనం చేత శక్తులుగా పూజలందుకుంటున్నారు.
స్త్రీ శక్తి భావనను పురాణాల్లో దేవీరూపంలో ఆధిక్య దేవిగా, పురుష శక్తిపై తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ నిక్షిప్తం చేశారు. కాలక్రమేణా, ఆ శక్తి పూజలో కొత్త లక్షణం చేరుకుంది. అదే తాంత్రిక పూజా విధానం. నిజానికి తాంత్రిక పూజా విధాన బీజాన్ని ప్రాచీన కాలం నుండి చూడవచ్చు. తొలి మధ్య యుగంలో మాతృదేవతను అన్నీ ఒకటి (శర్వాణి)గా, ఒకటే అన్ని (జగదాంబ)గా చిత్రిత మయింది. ఆ క్రమంలో భిన్న దేవతల భిన్న శక్తి రూపాలు సప్తమాతృకలుగా, దశమహావిద్యలుగా, యోగినులుగా; ఆపైన స్థానిక అంశాలు కలుపుకుని శక్తి ఆరాధనా పద్ధతిగా ఏర్పడటం జరిగింది.

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS